తెలుగు సాహిత్య చరిత్రను తిరగరాస్తూ ఓ కొత్త ఒరవడి తెలంగాణలో మొదలైంది. ఇప్పటి వరకు చారిత్రక, అధ్యాత్మిక, ఆహ్లాదక, పర్యాటక పర్యటనలను మాత్రమే చూస్తున్నాం. కానీ, కొత్తగా సాహిత్య, సాంస్కృతిక పర్యాటకం కూడా మొదలైంది. కొద్ది నెలల క్రితం కరీంనగర్ జిల్లా కవులు, రచయితలు కలిసి సుసంపన్న సాహిత్య చరిత్ర కలిగిన పాలకుర్తిని సందర్శించారు. ఆ ఒరవడిని కొనసాగిస్తూ, పాలమూరు జిల్లా తెలుగు పండిత సమూహం ఆధ్వర్యంలో, తెలంగాణ తెలుగు పాఠ్యపుస్తక మండలి సభ్యుడు, కవి పండితుడు పల్లెర్ల రామమోహన రావు నాయకత్వంలో 23మంది ఉమ్మడి పాలమూరు జిల్లా కవి పండితులు, ఉపాధ్యాయులు కలిసి తెలుగు మహా కవుల కన్న పుణ్యభూమి పాలకుర్తి సాహితీ యాత్ర -2025ను రెండు రోజుల పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించి దిగ్విజయంగా ముగించారు.
పాలమూరు జిల్లాకు చెందిన 23 మంది తెలుగు పండితులు, కవులు, రచయితలు, రచయిత్రులు కలిసి ఒక ప్రత్యేక బస్సును ఏర్పాటు చేసుకుని తెలంగాణలో మహాకవుల పుణ్యభూమి సాహితీ యాత్రను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా గురు, శుక్రవారాలు ఆ బృందం ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు చారిత్రక, అధ్యాత్మిక, సాహిత్య కవులు పుట్టిన సందర్శించింది. అలాగే ఆయా ప్రాంతాల ప్రాముఖ్యాలను, ప్రాధాన్యతలను అధ్యయనం చేసింది. తెలుగు మహాకవుల పుణ్యభూమి యాత్రకు జనగామ వద్ద కవులు కళాకారుల ఐక్యవేదిక అధ్యక్షుడు జి.కృష్ణ,పెట్లోజు సోమేశ్వరాచారి, అయిలా సొమనర్సింహచారి, చిలుమోజు సాయికిరణ్, పాలకుర్తిలో సోమనాథ కళాపీఠం అధ్యక్షుడు డా. రాపోలు సత్యనారాయణ, ఉపాధ్యక్షుడు, అడుగు చీఫ్ ఎడిటర్ డా. మార్గం లక్ష్మీ నారాయణలు, బమ్మెరలో పోతన సాహిత్య కళావేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు మాన్యపు భుజేందర్, దేవసాని ఉపేందర్, రామాచారిలు ఘనంగా స్వాగతం పలికారు. ఆయా చోట్ల ఆయా కవులు, రచయితలు యాత్రకు స్వాగతం పలికి ఆయా ప్రాంతాలను వెంట ఉండి మరీ చూపించారు.

ఈ సందర్భంగా తెలుగు పండితులు పల్లెర్ల రామ మోహన్ రావు మాట్లాడుతూ, యాత్ర ఉమ్మడి వరంగల్ జిల్లాతో ప్రారంభించామని, మహాకవుల పుణ్యభూమి సాహితీ యాత్ర హన్మకొండలోని కాళోజీ, మడికొండలోని వానమామలై వరదాచార్యులు, ధర్మసాగర్ మండలం దేవునూరు లోని బిరుదరాజు రామరాజు, చిన్నగూడూరులోని దాశరథి సోదరుల జన్మస్థలాలను సందర్శించి పుష్పాంజలి ఘటించింది. అలాగే హన్మకొండలోని చారిత్రాత్మక రాజరాజనరేంద్ర గ్రంథాలయం, రాయప్రోలు సుబ్బారావు ప్రిన్సిపాల్ గా పని చేసిన హన్మకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ లను సందర్శించి, వారి చరిత్రను తెలుసుకుని, వారి రచనలను చదివి వినిపించారు. ప్రత్యేకంగా చిన్నగూడూరులో దాశరథి సోదరుల పద్యాలు, పాటలు పాడుతూ ఊరేగింపు నిర్వహించారు. ఆయా చోట్ల ఆయా కవులు నడయాడిన ప్రాంతాలను సందర్శించారు. వారి శిష్యప్రశిష్యులను కలిసి చర్చించి, వారి కవితాగానం చేశారు. తెలంగాణ ఆదికవి పాల్కురికి సోమనాథుడు, బమ్మెర పోతన ల జన్మ స్థలాలకు వెళ్ళారు. పాలకుర్తిలో శ్రీ సోమేశ్వర లక్ష్మీనర్సింహ స్వామి దేవాలయాన్ని సందర్శించారు. సోమనాథుడి స్మారక కేంద్రం, శివైక్యం చెందిన ప్రాంతంలో సమావేశం నిర్వహించారు. సోమనాథుడి రచనలను స్మరించుకుంటూ, పద్యాలను పఠించారు. బమ్మెరలో పోతన దున్నిన పోలాలు, బావి, పోతన తల్లి లక్కమాంబ పేరుమీద ఏర్పడిన లక్క సముద్రం చెరువును, సమాధిని సందర్శించారు. పోతన పూజలు చేసిన శివాలయం, ఆరాధించిన రామాలయాలను సందర్శించారు. అక్కడే కొద్దిసేపు పోతన పద్యాలను చదివారు. అనంతరం గూడూరుకు చేరి, అక్కడే ఉన్న 900 ఏండ్ల కింది శాసనాన్ని సందర్శించారు. ఆతర్వాత పాలకుర్తి సమీపంలోని వాల్మీకి మహర్షి నడయాడిన నేల వాల్మీకి పురం (వల్మీడి) ని సందర్శించారు. అక్కడ శ్రీసీతారాముల గుడిని దర్శించారు. అనంతరం అక్కడి చారిత్రక ప్రాశస్త్యాన్ని తెలుసుకున్నారు.
ఆయా చోట్ల వేర్వేరుగా ఆయా కవి పండితులు మాట్లాడుతూ, మన మహాకవులు పుట్టిన పుణ్యభూమిని సందర్శించడం, వారిని స్మరించుకోవడం, వారి సాహిత్య విశిష్టతలను తెలుసుకున్నవారిగా వాటిని చదివి పరస్పరం తెలుసుకోవడం, ఆయా ప్రాంతాల వారికి వారిని, వారి చరిత్రను, వారి సాహిత్యాన్ని పరిచయడం చేయడం లక్ష్యంగా ఈ యాత్ర చేపట్టినట్లు ఈ యాత్రకు నాయకత్వం వహించిన పల్లెర్ల రామమోహన రావు, సమన్వయం చేసిన డా. శంకరమంచి శ్యామ్ ప్రసాద్ లు తెలిపారు. వాల్మీకీ, పాల్కురికి సోమనాథుడు, బమ్మెర పోతన, వానమామలై వరదా చారి, బిరుదరాజు రామరాజు, కాళోజీ, దాశరథి సోదరులు, ఇనుగుర్తి ఒద్దిరాజు సోదరులు లాంటి కవి పండితులు చేసిన సాహిత్య సేవ మరువలేనిదన్నారు. ఎవరికి వారే మహామహులన్నారు.
కాగా ఈ సందర్భంగా సోమనాథ కళాపీఠం పాలమూరు కవులను ఘనంగా సత్కరించింది. ఈ కార్యక్రమంలో కట్టా గిరిజారమణ శర్మ, కట్టా అనిత, సిద్ధాంతి రాజశేఖర శర్మ, తిరుపతమ్మ, నారజ, ఉమాదేవి, డా. మాడా పుష్పలత, కమలేకర్ శ్యాం ప్రసాద్ రావు, శ్వేత, నరేశ్, అనితా కుమారి, సువర్ణ, కె.సుజాత, తిరుపతయ్య, శ్రీదేవి, శ్రీలత, బలరాం గౌడ్, పుట్టి గిరిధర్, సభాపతి చంద్రమౌళి, పుష్పలత, దేవగిరి రామన్న శివాచార్య, సునిల్ శివాచార్య, ఇమ్మడి దామోదర్, మెరుగు మధు, కేవీజీకే క్రిష్ణమాచార్య, చిక్కమఠం వీర సోమమ్మ, గూడూరు లెనిన్, సాయి సందీప్ తేజ మార్గం, రమేశ్ రాజా తదితరులు పాల్గొన్నారు.

