తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ అసెంబ్లీకి రావడంపై కొనసాగుతున్న చర్చ కేవలం ఒక ఎమ్మెల్యే హాజరుకు సంబంధించింది మాత్రమే కాదు. అది ప్రతిపక్ష పాత్ర. ప్రజాస్వామ్య బాధ్యత. కేసీఆర్ వస్తే, రాకపోతే ఏమి జరుగుతుంది? ప్రభుత్వ, ప్రతిపక్షాల మధ్య చర్చలు ఎలా సాగుతాయి? పాలమూరు–రంగారెడ్డి వంటి కీలక ప్రాజెక్టులపై చర్చ ఎలా ఉండనుంది?
హైదరాబాద్, డిసెంబర్ 26 (అడుగు ప్రత్యేక ప్రతినిధి):
అధికారంలో ఉన్నన్నాళ్ళూ కేసీఆర్, సెక్రటేరియట్ కు వస్తారా? రారా? అన్న వాద వివాదాలు, ఇప్పుడు అసెంబ్లీకి వస్తారా? రారా? అన్న వైపు మళ్ళాయి. కేసీఆర్ మాట్లాడినా, మాట్లాడకపోయినా, అసెంబ్లీకి వచ్చినా, రాకున్నా చర్చల్లో ఉండటం ఆయనకు మాత్రమే చెల్లింది. 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోయిన తర్వాత కేసీఆర్, ఆ పార్టీ ఎల్పీ నేతగా, ప్రతిపక్ష నాయకుడిగా.. అసెంబ్లీకి రెండంటే రెండే సార్లు వచ్చారు. ఒకటి 2024లో ఆయన తన ప్రమాణ స్వీకారానికి వచ్చినా, అసెంబ్లీ లోపలికి రాలేదు. అదీ స్పీకర్ చాంబర్ లో ముగించి వెళ్ళారు. ఆ తర్వాత 2024 బడ్జెట్ సమావేశానికి ఇలా వచ్చి, అలా వెళ్ళారు. రెండేళ్ళల్లో రెండు సార్లే అసెంబ్లీకి వచ్చిన కేసీఆర్, మూడో ఏట జరుగుతున్న ఈ శీతాకాల అసెంబ్లీ సమావేశాలకు వస్తారా? దాదాపు రాకపోవచ్చు. వస్తే గిస్తే, అది సాంకేతికంగా తన ఎమ్మెల్యే పదవికి గండం లేకుండా చూసుకోవడానికేననే వాదన వినిపిస్తున్నది. అయినప్పటికీ, కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి తీరాలని, చర్చల్లో పాల్గొనాలని ప్రభుత్వం పట్టుపడుతున్నది. సీఎం రేవంత్ సహా మంత్రివర్గమంతా కేసీఆర్ ను రా రమ్మంటున్నారు.
కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడానికి ఆయనకు కొన్ని రాజకీయ, వ్యక్తిగత కోణాలు, వ్యూహాలు ఉండొచ్చు. దీర్ఘకాలం అధికారంలో ఉన్న నేత ప్రతిపక్షంలో కూర్చోవడం అంత సులువు కాదు. పరిపాలనా శైలి నుంచి ప్రతిపక్ష పాత్రకు మారాల్సిన మానసిక, రాజకీయ సంసిద్ధతకు కొంత సమయం పడుతుంది. సభలో హాజరు కంటే బయట నుంచి రాజకీయ ఒత్తిడి పెంచడం, తమ పార్టీ పునర్వ్యవస్థీకరణపై దృష్టి పెట్టే వ్యూహాత్మకతను ఆయన ఎంచుకున్నట్లు కనిపిస్తోంది. అయితే ప్రజాస్వామ్యంలో శాసనసభ సభ్యుడిగా సభకు రావడమనే బాధ్యతను కేసీఆర్ విస్మరిస్తున్నారనే విమర్శకు ఆయన గైర్హాజరీ బలం చేకూరుస్తోంది.
ఈసారి ఆయన వస్తారా? వస్తే సాంకేతికంగా సమస్యలు తలెత్తకుండా సంతకం పెట్టి వెళ్ళిపోతారా? చర్చల్లో పాల్గొంటారా? కేసీఆర్ సభకు హాజరైతే అధికార-విపక్షాల మధ్య చర్చలు రసవత్తరంగా సాగే అవకాశం ఉంటుంది. ప్రత్యేకించి, రేవంత్-కేసీఆర్ మధ్య కాదంటే, సీఎం-ప్రతిపక్ష నేతల మధ్య ప్రత్యక్ష మాటల యుద్ధం జరగొచ్చు. వాద ప్రతివాదనల మధ్య అసలు నిజాలు వెలుగుచూసే అవకాశమూ ఉంది.
అలాగే కేటీఆర్, హరీశ్ రావులకే పరిమితమైన ప్రతిపక్ష పాత్ర కేసీఆర్ రాకతో ద్విగుణీక్రుతం అవుతుంది. అనుభవజ్ఞుడైన మాజీ సీఎం, సభలో అధికార పార్టీని అదుపు చేయనూ వచ్చు. ఆర్థిక నిర్వహణ, హామీల అమలు, పరిపాలన వంటి అంశాలపై లోతైన చర్చ జరగవచ్చు. ఇది ప్రభుత్వానికి అసౌకర్యంగా ఉన్నా, ప్రజలకు స్పష్టతనిస్తుంది. అదే సమయంలో, ప్రతిపక్షానికి నాయకత్వ నైతిక బలం, కేసీఆర్ మాటలకు మీడియా ప్రాధాన్యం పెరుగుతుంది. సభలో చర్చలు అర్థవంతంగా, ఆచరణ యోగ్యంగా జరుగుతాయి.
ఒకవేళ కేసీఆర్ సభకు రాకపోతే అసెంబ్లీలో చర్చలు ఏకపక్షమవుతాయి. యథావిధిగా ప్రతిపక్ష విమర్శలు బయటి వేదికలకే పరిమితం అవుతాయి. దీర్ఘకాలంలో ఇది ప్రతిపక్షానికే నష్టం చేసే ప్రమాదం ఉంది. ప్రభుత్వ నిర్ణయాలపై అధికారిక రికార్డులో ప్రతిపక్ష స్వరం బలహీనపడుతుంది. ఇది ప్రభుత్వానికి అనుకూలంగా మారవచ్చు. కేసీఆర్ సభకు రాకపోవడం రాజకీయ వ్యూహమే అయినా, వ్యూహాత్మక తప్పిదమవుతుంది? ప్రజాభిప్రాయ పరంగా ప్రమాదకరమే.
కేసీఆర్ అసెంబ్లీకి రావడం, రాకపోవడం ఆయన వ్యక్తిగతం. కానీ ఆయన మాజీ సీఎం. కేంద్ర, రాష్ట్ర మాజీ మంత్రి, డిప్యూటీ స్పీకర్, ప్రస్తుత ఎమ్మెల్యే. అన్నింటికీ మించి ప్రతిపక్ష నేత. రాజ్యాంగ బద్ధంగా సభో సీఎం తర్వాత స్థానం ప్రపతిపక్ష నేతదే. ఆయన గైర్హాజరీ ప్రభావం వ్యవస్థపై పడుతుంది. కేసీఆర్ సభకు వస్తే, తెలంగాణ రాజకీయాలు చురుగ్గా మారి, మరింత వేడెక్కుతాయి. ఇదంతా కేసీఆర్ కు తెలియంది కాదు. ఎవరో చెప్పాల్సిన అగత్యం ఆయనకు లేదు. కాకపోతే ఆయన ఎవరు చెప్పినా వినరు? ఆచరించరు. తనదైన శైలిలోనే వ్యవహరిస్తారు.

