యుద్ధతంత్రాలు అనేకం. రక్తపు చుక్క నేల రాలకుండా, ఒక్క సైనికుడు నేలకొరగకుండా కూడా యుద్ధాలు గెలవవచ్చు. యుద్ధమంటే నేరుగా పోరాడటమొక్కటే కాదు. శతృవును దిగ్బంధనం చేయడం కూడా యుద్ధంలో భాగమే. అన్ని విధాలుగా కట్టడి చేసి, ఊపిరాడకుండా చేసి, లొంగదీసుకోవడం కూడా యుద్ధనీతే. ఇప్పుడు ఇండియా అదే చేస్తోంది. పాక్ మాత్రం నిద్రలేని రాత్రులు గడుపుతోంది. ప్రపంచ దేశాలు నమ్మలేని దుస్థితిలో కొట్టుమిట్టాడుతోంది. నిజంగానే యుద్ధం జరిగితే పాక్ పక్షాన నిలబడానికి ఒక్కదేశం కూడా వచ్చే పరిస్థితి కనుచూపు మేరలో కానరావడం లేదు.
ఇప్పటికే అనేక రకాలుగా భారత్ పాక్ను ముప్పుతిప్పలు పెడుతోంది. పహల్గాం దాడి జరిగి 15 రోజులు గడిచాయి. పాక్ పై చర్యలేవని కొందరు ప్రశ్నిస్తున్నారు. వ్యూహమేదని మరికొందరు నిలదీస్తున్నారు. యుద్ధాన్ని ఎప్పుడూ ఒకవైపు నుండే చూడొద్దు. యుద్ధం ఫలితాలు, లాభనష్టాలు ఇరువైపులా కొద్ది తేడాతో సమానంగానే ఉంటాయి. కాబట్టి యుద్ధ భీతిని గొలిపి, దాదాపు యుద్ధం లేకుండానే శత్రువును లొంగదీసుకోవాలి. సామ, భేద, దాన, దండోపాయాలు అన్నవి యుద్ధంలో బాగా వాడే విధానాలు. మొదటి మూడు పద్ధతులు విఫలమైన తరవాతే నాలుగోదైన దండోపాయం చేపట్టాలి. రావణుడు యుద్ధానికి సిద్ధమైన తరుణంలోనూ అతడి పట్టపు మహిషి మండోదరి అడ్డుపడి సామ, భేద, దాన, దండోపాయలను వివరిస్తుంది. పాక్ కూడా ఉగ్రవాదాన్ని భారత్ పై ఎగదోసే ప్రయత్నం నుంచి బయటపడి, తన శక్తిని తెలుసుకోవాలి. తన యుక్తిని ప్రదర్శించాలి. అన్నింటికంటే ముందు పాక్ అఖండ భారత్ నుంచి విడివడిన చిన్న ముక్కనని గుర్తించాలి. జ్ఞానోదయం చేసుకోవాలి. అప్పుడే పాక్ ప్రపంచ దేశాల్లో మనగలుగుతుంది. కానీ పాక్ పాలకులు భారత్ లో ఉగ్రవాదాన్ని ఎగదోస్తూ, వేడుక చేసుకుంటూ, తమదేశ ప్రజలను మభ్య పెడుతూ రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారు.
ఇప్పుడు పాక్ పాపం పండింది. పహల్గాం దాడి తరవాత ఇప్పుడు భారత్ ఉచ్చుకు చిక్కి గిలగిలా కొట్టుకుంటోంది. ఇప్పటికే పాక్ యుద్ధ భయంతో సైన్యాన్ని మొహరించింది. ఉగ్రవాద శిబిరాలను ఖాళీ చేయించింది. గగనతలంపై ఆంక్షలు విధిచడంతో పాక్ ముప్పు తిప్పలు పడుతోంది. అసలే ఆర్థిక వ్యవస్థ అంతంత మాత్రంగా సాగుతున్న వేళ నానా ఇక్కట్లు పడుతోంది. మరోవైపు సింధు జలాల ఒప్పందాన్ని భారత్ నిలపడంతో పాక్ నీటి కోసం అల్లాడుతున్నది. మరోవైపు ఐక్యరాజ్య సమితిలో కూడా తాజాగా పాక్కు చుక్కెదురైంది. అంతర్జాతీయంగా కూడా భారత్ బలమైన మద్దతును కూడగట్టింది. పాక్ను దెబ్బతీస్తున్న ఈ చర్యలన్నింటినీ యుద్ధంలో భాగంగానే చూడాలి. ఇలా భారత్ పన్నిన ఈ పన్నాగాలతో అసలు యుద్ధానికి దిగలేని దుస్థితికి పాక్ చేరుకుంది.
నిజానికి 370 ఆర్టికల్ రద్దు తరవాత కశ్మీర్లో మళ్లీ ప్రశాంత పరిస్థితులు నెలకొంటున్నాయి. పాఠశాలలు, కళాశాలలు కళకళలాడుతున్నాయి. విద్యా వాతావరణం మళ్లీ చిగురించింది. నిర్మాణ, పర్యాటక, అభివృద్ధి కార్యకలాపాలు వేగం పుంజుకున్నాయి. ప్రజాస్వామ్యం వికిసిస్తోంది. యువత స్వయం ఉపాధితో మళ్లీ శక్తిమంతమవుతోంది. పర్యాటకులు వెల్లువెత్తుతున్నారు. ప్రజల ఆదాయాలు గణనీయంగా పెరుగు తున్నాయి. ఈ దశలో పహల్గాం ఉగ్రదాడి కశ్మీర్ ని కకావికలం చేసింది. కశ్మీరీలనే కాదు, యావత్ భారతావనిని నివ్వెరపరచింది. అందుకే పాక్ పహల్గాం ఉగ్రదాడిని ఆసేతు హిమాచలం ఖండకండాలుగా ఖండించింది. అన్ని పార్టీలు సైతం రాజకీయాలకతీతంగా భారత ప్రభుత్వానికి మద్దతుగా నిలిచింది. ఈ క్రమంలో తీసుకున్న చర్యల వల్లే ఇప్పుడు పాక్ ఏకాకి అయింది. పాక్ కి ఇప్పుడు చైనా కూడా బహిరంగంగా మద్దతు ఇవ్వలేని దుస్థితి ఏర్పడింది.
పహల్గాం ఉగ్రదాడి ప్రతి భారతీయుని హృదయాన్ని తీవ్రంగా కలచివేసింది. ప్రతి భారతీయుని రక్తం మరిగిపోతోంది. పాక్ను తుదముట్టించాలని ప్రతి పౌరుడు కోరుకుంటున్నాడు. అందుకే పహల్గాం ఘటనపై తక్షణమే ప్రతీకార చర్యలు చేపట్టాలనే డిమాండ్లు దేశవ్యాప్తంగా వెల్లువెత్తుతున్నాయి. అయితే పాక్ ను దెబ్బకొట్టడం ఎలా? దెబ్బకొడితే అబ్బా అనాల్సిందే. పాక్ ను మళ్ళీ కోలుకోకుండా చేయాల్సిందే. అందుకే గత అనుభవాలను, వర్తమాన సమీకరణాలను, భవిష్యత్తు అవసరాలను సమీక్షించుకుని అడుగు వేయాలి.
అగ్ర రాజ్యాలైన అమెరికా, రష్యాలు సైతం మద్దతునిస్తున్నాయి. గల్ఫ్ దేశాలు పాక్ను నమ్మే స్థితిలో లేవు. పాక్ చుట్టుముట్టున్న దేశాలు మనకు అండగా నిలుస్తున్నాయి. ఈ దశలో పహల్గాం దాడులకు ప్రతీకారంగా ఎప్పుడు ఎలా ఎలాంటి చర్య తీసుకోవాలనే విషయమై సైనిక దళాలకు ప్రధానమంత్రి సంపూర్ణ స్వేచ్ఛనిచ్చినట్టు ప్రకటించారు. ఇక ఇప్పుడు ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం వెనకా యుద్ధ తంత్రం ఇమిడి ఉందని భావించాలి. అందుకే పాకిస్తాన్ ప్రతి చర్యా మేకపోతు గాంభీర్యంలా, కవ్వింపుగా ఉంటున్నాయి. భయంతో చస్తున్న పాక్ నేతలు ఆ భయాన్ని కప్పిపుచ్చుకుంటూ, అనవసర ప్రేలాపనలు పేలుతున్నారు. ఇదంతా అక్కడి ప్రజలకు కూడా బాగా తెలుసు. అందుకే అక్కడి పాలకులపై తీవ్ర ప్రజా వ్యతిరేకత వస్తోంది. సైనికాధికారులు, సైనికుల్లోనూ వ్యతిరేకత పెల్లుబికుతోంది. అందుకే అనేక మంది రాజీనామాలు చేస్తున్నారు. పాక్ పై భారత్ దాడికంటే ముందే పాక్ లో అంతర్యుద్ధం వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఇక భారత ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయానికి కట్టుబడి ఉండటమే కాదు. మనమంతా అండగా నిలవాలి. మరిన్ని త్యాగాలకు సిద్ధంగా ఉండాలి.

