ఎన్నికల రాజకీయాల్లో హామీలు ఇవ్వడం సహజం. కానీ ఆ హామీల అమలు విషయంలో నిర్లక్ష్యం ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రమాదకరం. హామీలివ్వడం, గాలికి వదిలేయడం.. తెలంగాణలో గత కొన్నేళ్లుగా ఇదే ధోరణి పునరావృతమవుతోంది. అధికారంలోకి రావడానికి వాగ్దానాల వర్షం కురిపించడం, ఆ తర్వాత వాటిని మరిచిపోవడం రాజకీయ పార్టీలకు అలవాటైపోయింది. సామాన్యుడి ప్రధాన ప్రయాణ సాధనం, రాష్ట్ర ప్రయాణ ప్రగతి రథ చక్రం, ఎర్రబస్సు ఇందుకతీతమేమీ కాదు. పైగా ఈ పరంపర కొనసాగింపే, ప్రస్తుత ఆర్టీసీ సంక్షోభం!
డా. మార్గం-అడుగు, ఎడిటోరియల్
ఎన్నికల రాజకీయాల్లో హామీలు ఇవ్వడం సహజం. కానీ ఆ హామీల అమలు విషయంలో నిర్లక్ష్యం ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రమాదకరం. హామీలివ్వడం, గాలికి వదిలేయడం.. తెలంగాణలో గత కొన్నేళ్లుగా ఇదే ధోరణి పునరావృతమవుతోంది. అధికారంలోకి రావడానికి వాగ్దానాల వర్షం కురిపించడం, ఆ తర్వాత వాటిని మరిచిపోవడం రాజకీయ పార్టీలకు అలవాటైపోయింది. సామాన్యుడి ప్రధాన ప్రయాణ సాధనం, రాష్ట్ర ప్రయాణ ప్రగతి రథ చక్రం, ఎర్రబస్సు ఇందుకతీతమేమీ కాదు. పైగా ఈ పరంపర కొనసాగింపే, ప్రస్తుత ఆర్టీసీ సంక్షోభం.
రాష్ట్ర రవాణా వ్యవస్థలో కీలక పాత్ర పోషించే ఆర్టీసీ ప్రతి రోజు 55 నుండి 60 లక్షల మంది ప్రయాణికులకు సేవలందిస్తోంది. 6 వేలకు పైగా బస్సులు రాష్ట్రవ్యాప్తంగా నడుస్తున్నాయి. అయితే కార్మికుల సమస్యలను పట్టించుకోకపోవడం వల్ల ఈ భారీ వ్యవస్థ ఒక్కసారిగా నిలిచిపోవడం ఆందోళనకరం. కార్మిక సంఘాల జేఏసీ ప్రస్తావించిన 30కి పైగా డిమాండ్లను పరిశీలిస్తే, ప్రభుత్వంలో విలీనం, వేతన సవరణ, బకాయిల చెల్లింపు వంటి ప్రధాన సమస్యలు ఎన్నో ఏళ్ళుగా, గత ఏడాదిగా పరిష్కారం కోసం ఎదురుచూస్తున్నాయి.
మరి ఈ సమస్యలపై ఇంతకాలంగా ప్రభుత్వం ఎందుకు స్పందించలేదు? సమ్మె ముంచుకొచ్చిన తరుణంలో మాత్రమే అధికారుల కమిటీ ఏర్పాటు చేసి నాలుగు వారాల గడువు కోరడం సమస్యను పరిష్కరించాలన్నదాని కంటే కాలయాపనకే ప్రాధాన్యతనిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఈ నిర్లక్ష్య ధోరణే కార్మికులను సమ్మెబాట పట్టించింది. ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా బస్సులు డిపోలకే పరిమితమై, సాధారణ ప్రయాణీకుల జన జీవనం అస్తవ్యస్తమైంది.
ప్రస్తుతం ఎండలు తీవ్రంగా ఉన్న వేళ, ప్రత్యామ్నాయ రవాణా సదుపాయాలు అందుబాటులో లేకపోవడం ప్రజలను మరింత ఇబ్బందులకు గురిచేస్తోంది. విద్యార్థులు, రోజువారీ కూలీలు, చిన్న ఉద్యోగులు..ఇవే ప్రజా రవాణాపై ఆధారపడే వర్గాలు. వీరి దైనందిన జీవనం నేరుగా దెబ్బతింటోంది. ఇది కేవలం కార్మికుల సమస్య మాత్రమే కాదు, సామాజిక-ఆర్థిక వ్యవస్థపై పడే ప్రభావాన్ని సూచించే అంశం.
ఇక ఆర్థిక పరిమితుల విషయానికి వస్తే, రాష్ట్రం ఇప్పటికే భారీ అప్పుల్లో కూరుకుపోయిందనే విషయాన్ని పదేపదే సీఎం స్వయంగా చెబుతున్నారు. అప్పులు లక్షల కోట్ల రూపాయలకు చేరుకుని, వార్షిక ఆదాయంలో గణనీయమైన భాగం వడ్డీ చెల్లింపులకే వెళ్తోంది. ఈ పరిస్థితుల్లో కొత్త పథకాలు అమలు చేయడం, ఉన్న సంస్థలను ఆదుకోవడం ప్రభుత్వానికి సవాలుగా మారింది. అయినప్పటికీ, ఇది సమస్యలను నిర్లక్ష్యం చేయడానికి కారణం కావడం సమంజసం కాదు.
“మహాలక్ష్మి” పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయడం ఒక పెద్ద సామాజిక సంక్షేమ చర్యగా ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఈ పథకం కారణంగా ఆర్టీసీపై పడుతున్న ఆర్థిక భారం తగ్గించడానికి తగిన నిధులు సమయానికి విడుదల కావడం లేదు. ఒకవైపు ఉచిత సేవలు, మరోవైపు ఆదాయం తగ్గుదల ఈ రెండింటి మధ్య ఆర్టీసీ చిక్కుకుపోయింది.
ఎన్నికల సమయంలో రెండు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చేసిన ప్రకటన యువతలో ఆశలు రేకెత్తించింది. కానీ రెండున్నరేళ్లు గడిచినా ఆ హామీ అమలు ఆశించిన స్థాయిలో లేకపోవడం నిరుద్యోగుల్లో నిరాశను పెంచుతోంది.
ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఏం చేయాలి? మొదటిగా, ఆర్టీసీ కార్మికులతో తక్షణ చర్చలు జరిపి, కనీసం ముఖ్యమైన డిమాండ్లపై సమయపాలిత కార్యాచరణ ప్రణాళిక ప్రకటించాలి. రెండవది, ఉచిత పథకాల వల్ల ఏర్పడే ఆర్థిక లోటును భర్తీ చేయడానికి పారదర్శక నిధుల వ్యవస్థను ఏర్పాటు చేయాలి. మూడవది, హామీల అమలుపై నిర్దిష్ట గడువులు పెట్టి, ప్రజలకు బాధ్యతాయుతమైన నివేదికలు ఇవ్వాలి.
అధికారంలోకి రావడం మాత్రమే కాదు, ఆ అధికారాన్ని బాధ్యతగా వినియోగించడం కూడా అంతే ముఖ్యం. మాటలు, ఆవేశపూరిత ప్రసంగాలు తాత్కాలికంగా ప్రజలను ఆకట్టుకోవచ్చు. కానీ, దీర్ఘకాలంలో పాలనలో నిజాయితీ, కార్యాచరణే ప్రజల విశ్వాసాన్ని నిలబెడతాయి. లేనిపక్షంలో, గతంలో జరిగినట్లుగానే ప్రజలు తమ తీర్పును స్పష్టంగా తెలియజేయడానికి వెనుకాడరు.
ఆర్టీసీ సంక్షోభం ఒక హెచ్చరిక. ఇది కేవలం ఒక సంస్థ సమస్య కాదు, పాలనా వైఫల్యాల ప్రతిబింబం. ఇప్పటికైనా ప్రభుత్వం సానుకూలంగా ముందడుగు వేసి, కార్మికుల సమస్యలను పరిష్కరించి, ప్రజా రవాణా వ్యవస్థను గాడిలో పెట్టాల్సిన అవసరం అత్యవసరం.

