వ్యవసాయం లాభసాటిగా మారాలంటే రైతు పండించిన పంట ప్రజల భోజనపట్టికలోకి చేరాలి. అందుకు ఉత్పత్తి పెంపుతో పాటు మార్కెటింగ్, నిల్వ, రవాణా, ప్రాసెసింగ్ రంగాల్లో ప్రభుత్వాలు సమగ్ర విధానాలు రూపొందించాలి. లేకపోతే ఒకసారి టమోటా రైతు, మరోసారి మిర్చి రైతు, ఇప్పుడు ఆక్వా రైతు ఆయా సీజన్లలోనే గాక, ఏడాది పొడవునా సంక్షోభాల చక్రం తిరుగుతూనే ఉంటుంది. రైతు కష్టానికి గౌరవం రావాలంటే దేశంలో “ఉత్పత్తి నుంచి వినియోగందారుని వరకు” బలమైన వ్యవస్థను నిర్మించడం తప్ప మరో మార్గం లేదు.
డా. మార్గం-అడుగు, ఎడిటోరియల్
దేశ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయం, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి వ్యవసాయ అనుబంధ రంగాలు కీలకమైనవి. రైతు పండించిన పంటను వినియోగదారుడికి సమర్థవంతంగా చేరవేసే మార్కెటింగ్ వ్యవస్థ ఇంకా బలపడలేదు. ఫలితంగా ఒక వైపు రైతు గిట్టుబాటు ధర కోసం కుంగుబాటుకు గురవుతూ, ఆవేదన చెందుతుంటే, మరోవైపు వినియోగదారుడు అధిక ధరలు చెల్లించి జేబుకు చిల్లులు పెట్టుకునే పరిస్థితి దాపురించింది. మదనపల్లి టమోటా, నిజామాబాద్ పసుపు, గుంటూరు మిర్చి, తెలంగాణ మక్కజొన్న, ఆంధ్రప్రదేశ్ రొయ్యలు… ఏ ఉత్పత్తిని పరిశీలించినా సమస్య మూలం మార్కెటింగ్ లోపాలే అన్నది స్పష్టమవుతోంది. ప్రస్తుతం ఆక్వా రంగం ఎదుర్కొంటున్న సంక్షోభం కూడా ఇదే వాస్తవాన్ని మరోసారి బయటపెడుతోంది.
ఆక్వా ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అతిపెద్ద రాష్ట్రంగా నిలిచింది. దేశ మొత్తం రొయ్యల ఎగుమతుల్లో 35–40 శాతం వరకు రాష్ట్రం వాటా కలిగి ఉంది. ప్రతి ఏడాది రూ.25 వేల కోట్ల విలువైన ఆక్వా ఉత్పత్తులు విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి. 4.7 లక్షల ఎకరాల్లో రొయ్యల సాగు జరుగుతుండగా, ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలాది మంది జీవనాధారం ఈ రంగంపైనే ఆధారపడి ఉంది. అయితే గత కొన్నేళ్లుగా ఆక్వా రైతులు తీవ్ర సంక్షోభంలో చిక్కుకుపోయారు. అమెరికా విధించిన దిగుమతి సుంకాలు, అంతర్జాతీయ ధరల పతనం, ఫీడ్ ధరల పెరుగుదల, వ్యాధులు, ఇంధన వ్యయాల పెంపు వంటివన్నీ కలిసి రైతును ఆర్థికంగా కుదేలు చేస్తున్నాయి.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాలనలో భారత రొయ్యలపై విధించిన అధిక సుంకాల ప్రభావం ఇప్పటికీ కొనసాగుతోంది. భారతీయ రొయ్యలపై 60 శాతం వరకు పన్నుల భారం పెరగడంతో ఎగుమతులు దెబ్బతిన్నాయి. ఫలితంగా దేశీయ మార్కెట్లో రొయ్యల ధరలు 20 నుంచి 30 శాతం వరకు పడిపోయాయి. ఎగుమతులపై అధికంగా ఆధారపడిన వ్యవస్థలో విదేశీ మార్కెట్ కుదేలైతే రైతు ఆదాయం కూడా ఒక్కసారిగా కుప్పకూలే పరిస్థితి ఏర్పడింది. కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో అమెరికాతో సమర్థవంతమైన చర్చలు జరిపి పరిష్కారం కనుగొనాల్సిన అవసరం ఉన్నప్పటికీ, ఇప్పటివరకు స్పష్టమైన ఫలితాలు కనిపించడం లేదు.
రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతులకు తాత్కాలిక హామీలు ఇవ్వడం తప్ప, దీర్ఘకాలిక మార్కెటింగ్ వ్యూహాన్ని రూపొందించడంలో విఫలమవుతోందనే విమర్శలు ఉన్నాయి. ఫీడ్ కంపెనీలు ఏకపక్షంగా ధరలు పెంచిన సందర్భాల్లో రైతుల ఆందోళనలతో ప్రభుత్వం జోక్యం చేసుకున్నా, సమస్యకు శాశ్వత పరిష్కారం చూపలేకపోయింది. ఫిబ్రవరిలో కిలో ఫీడ్పై రూ.4 పెంచిన కంపెనీలు, తిరిగి రూ.10 వరకు పెంచేందుకు ప్రయత్నించాయి. ఆంధ్రప్రదేశ్ ఆక్వా డెవలప్మెంట్ అథారిటీ చట్టం ప్రకారం రైతులతో సంప్రదింపులు జరపకుండా ధరలు పెంచకూడదనే నిబంధనలు ఉన్నప్పటికీ, వాటి అమలులో లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ఇక్కడ అసలు సమస్య ఉత్పత్తిలో కాదు, మార్కెటింగ్ వ్యవస్థలో ఉంది. దేశంలో ఏ ప్రాంతంలో ఏ పంట అధికంగా పండినా, అది మరో ప్రాంత వినియోగదారునికి చేరేలా సమర్థవంతమైన సరఫరా వ్యవస్థ ఇంకా రూపుదిద్దుకోలేదు. రైతు వద్ద తక్కువ ధరకు అమ్ముడవుతున్న పంట, నగర మార్కెట్లలో అధిక ధరకు విక్రయమవుతోంది. మధ్యవర్తులే అధిక లాభాలు పొందుతున్నారు. సరైన కోల్డ్ స్టోరేజ్ సదుపాయాలు, రిఫ్రిజిరేటెడ్ రవాణా, ప్రాసెసింగ్ యూనిట్లు, ఈ-మార్కెట్ వేదికలు లేకపోవడం వల్ల రైతు తన ఉత్పత్తిని దేశవ్యాప్తంగా విక్రయించే అవకాశాలు కోల్పోతున్నాడు.
ప్రస్తుతం అత్యవసరంగా అవసరమైనది దేశీయ మార్కెట్ను బలపరచడమే. 140 కోట్లకు పైగా జనాభా ఉన్న దేశంలో చేపలు, రొయ్యలు ఇంకా సాధారణ ప్రజల ఆహారంలో విస్తృత స్థాయిలో భాగం కాలేకపోవడం విచారకరం. ప్రజలలో ప్రోటీన్ ఆహారంపై అవగాహన పెంచుతూ, చేపలు, రొయ్యలను పోషకాహార కార్యక్రమాల్లో చేర్చాల్సిన అవసరం ఉంది. సైన్యం, హాస్టళ్లు, హాస్పిటల్స్, అంగన్వాడీలు, మధ్యాహ్న భోజన పథకాలలో ఆక్వా ఉత్పత్తులకు ప్రాధాన్యం ఇవ్వవచ్చు. హైదరాబాద్, బెంగళూరు, పుణే, ఢిల్లీ వంటి ప్రధాన నగరాలకు నేరుగా రైతుల నుంచి రొయ్యలు సరఫరా చేసే శాశ్వత నెట్వర్క్ ఏర్పాటు చేయాలి.
అలాగే వాల్యూ యాడెడ్ ఉత్పత్తుల తయారీపై దృష్టి పెట్టాలి. మన మక్కజొన్నను ‘కార్న్ ఫ్లేక్స్’ గా విదేశీ కంపెనీలు విక్రయించి లాభాలు ఆర్జిస్తున్నట్లే, రొయ్యలను కూడా ఫ్రోజన్ ఫుడ్స్, రెడీ టు కుక్ ఉత్పత్తులు, ప్రాన్ పికిల్స్, డ్రైడ్ ప్రాన్ రూపంలో మార్కెట్ చేయవచ్చు. దీని ద్వారా రైతుకు గిట్టుబాటు ధర లభించడమే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి.
వ్యవసాయం లాభసాటిగా మారాలంటే రైతు పండించిన పంట ప్రజల భోజనపట్టికలోకి చేరాలి. అందుకు ఉత్పత్తి పెంపుతో పాటు మార్కెటింగ్, నిల్వ, రవాణా, ప్రాసెసింగ్ రంగాల్లో ప్రభుత్వాలు సమగ్ర విధానాలు రూపొందించాలి. లేకపోతే ఒకసారి టమోటా రైతు, మరోసారి మిర్చి రైతు, ఇప్పుడు ఆక్వా రైతు ఆయా సీజన్లలోనే గాక, ఏడాది పొడవునా ఇలా సంక్షోభాల చక్రం తిరుగుతూనే ఉంటుంది. రైతు కష్టానికి గౌరవం రావాలంటే దేశంలో “ఉత్పత్తి నుంచి వినియోగదారుని వరకు” బలమైన వ్యవస్థను నిర్మించడం తప్ప మరో మార్గం లేదు.

