ఏకపక్ష నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయుల మే నెల వేతనాల నుంచి ఆరోగ్య పథకం పేరుతో మూల వేతనంలో ఒకటిన్నర శాతం కోత విధించడాన్ని డీటీఎఫ్ జనగామ జిల్లా శాఖ తీవ్రంగా ఖండించింది. ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సంబంధించిన ఆరోగ్య పథకం విధివిధానాలను ఇంకా అధికారికంగా ప్రకటించకుండానే, ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపకుండానే, సంబంధిత ఉద్యోగుల అంగీకారం తీసుకోకుండానే ప్రభుత్వం ఏకపక్షంగా కోతలు విధించడం సరైన విధానం కాదని డీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఎండి షరీఫ్, ప్రధాన కార్యదర్శి ఎం. శ్రీనివాస చారి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆరోగ్య పథకంలో చేరాలా వద్దా అనే విషయాన్ని ఉద్యోగులు, ఉపాధ్యాయుల వ్యక్తిగత నిర్ణయానికి వదిలివేయాలని వారు డిమాండ్ చేశారు. ముఖ్యంగా భార్యాభర్తలు ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్న సందర్భాల్లో, వారి అంగీకారం మేరకు ఒకరి వేతనం నుంచే మినహాయింపు జరగాల్సి ఉండగా, ఇద్దరి వేతనాల నుంచీ కోత విధించడం అన్యాయమని పేర్కొన్నారు. ఇప్పటికే కోత విధించిన మొత్తాన్ని వెంటనే సంబంధిత ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఉద్యోగుల హక్కులను పరిరక్షించేందుకు అవసరమైతే ఉద్యమ కార్యాచరణ చేపడతామని డీటీఎఫ్ నాయకులు హెచ్చరించారు.

