జనాభా ఆధారంగా పార్లమెంట్, రాష్ట్రాల అసెంబ్లీల స్థానాలను పునర్విభజించడం అనే ప్రక్రియ, ప్రజాప్రాతినిధ్యపు వ్యవస్థకు అవసరమైన సంస్కరణ కాగా, రాజకీయ ప్రయోజనాల పరంగానూ ఎంతో లాభదాయకం. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా లోక్సభ స్థానాలను 543 నుండి 816కి పెంచే ప్రతిపాదన ఉంది. ఇదే విధంగా దేశంలోని అన్ని రాష్ట్రాల అసెంబ్లీల స్థానాలు 4,123 నుండి 6,185కు పెరగవచ్చని అంచనా. అంటే 50 శాతం సీట్ల పెంపు జరగనున్నదన్న మాట.
ఆంధ్రప్రదేశ్లో ఉన్న 25 లోక్సభ స్థానాలు 37 లేదా 38కి పెరగవచ్చు. అసెంబ్లీ స్థానాలు 175 నుండి 262–263 వరకు పెరుగుతాయి. తెలంగాణలో లోక్సభ స్థానాలు 17 నుండి 25 లేదా 26కు, అసెంబ్లీ స్థానాలు 119 నుండి 178–179 వరకు పెరిగే సూచనలున్నాయి. ఈ మార్పులు 2029 సాధారణ ఎన్నికల నాటికి అమలులోకి వచ్చే అవకాశముందని చర్చ జరుగుతోంది.
ఈ పరిణామాలు రాజకీయ పార్టీలకు నిజంగా పండగే. మరిన్ని ఎంపీలు, ఎమ్మెల్యేల స్థానాలు పెరుగుతుండటంతో, ఆ మేరకు అన్ని పార్టీల నాయకులకు ఆ అవకాశాలు దక్కుతాయి. పార్టీల విస్తరణకు మార్గం సుగమమవుతుంది. ఎన్నికల రాజకీయాల్లో ఓట్లు, సీట్ల లెక్కలే కీలకం. గనక అన్ని రాజకీయ పార్టీలు ఈ ప్రక్రియ పట్ల సానుకూల దృక్పథంతోనే ఉన్నాయి.
అయితే, ఈ సీట్ల పెంపు ప్రజలకు ఎంతవరకు మేలు చేస్తుంది? నియోజకవర్గాల భౌగోళిక పరిమాణం తగ్గడం వల్ల ప్రజలకు ప్రతినిధులు మరింత చేరువవుతారు. స్థానిక సమస్యలను నేతలు మరింతగా పట్టించుకునే అవకాశముంది. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలు చేస్తే, లోక్సభలో 816 స్థానాల్లో 273 స్థానాలు మహిళలకు కేటాయించబడతాయి. ఇది భారత రాజకీయ వ్యవస్థలో ఒక ముఖ్యమైన మైలురాయిగా మిగిలిపోతుంది.
నియోజకవర్గాల పెంపు ప్రభుత్వంపై పెను ఆర్థిక భారంగా పరిణమించనుంది. ఎంపీలు, ఎమ్మెల్యేల జీతభత్యాలు, సిబ్బంది ఖర్చులు, పెన్షన్లు వంటి పెరిగే అన్ని వ్యయాలను ప్రజలే పన్నుల ద్వారా భరించాల్సి ఉంటుంది. పరిపాలన నాణ్యత పెరుగుతుందనే హామీ లేకపోగా, ఖర్చులు పెరగడం ప్రజలలో అసంతృప్తికి గురయ్యే ప్రమాదం ఉంది.
ఇక రాజకీయాల్లో, నేతల్లో పదవులపై ఆసక్తి అధికం. ఒకసారి ప్రజాప్రాతినిధ్యంలోకి వచ్చిన నాయకులు పదేపదే అవే స్థానాలకు పోటీ చేయడం పరిపాటిగా మారింది. ఈ నేపథ్యంలో “రెండు టర్మ్ లు మాత్రమే అనే పరిమితి” వంటి సంస్కరణలు అవసరమనే అభిప్రాయం బలపడుతోంది. అదే విధంగా పదవీ విరమణ తర్వాత భారీ పెన్షన్లు పొందే విధానాన్ని కూడా పునస్సమీక్షించాలి. ఈ అంశాలు చట్టసభల్లో చర్చకు రావాల్సినవే అయినప్పటికీ, వాటిని అమలు చేసే బాధ్యత ఉన్నవారే రాజకీయ నాయకులు కావడంతో ఆచరణలోకి రావడం కష్టసాధ్యంగా మారుతోంది.
డిలిమిటేషన్ విషయంలో దక్షిణాది రాష్ట్రాల ఆందోళన అత్యంత ప్రాధాన్యాన్ని సంతరించుకున్నది. జనాభా నియంత్రణలో ముందున్న దక్షిణాది రాష్ట్రాలు, జనాభా ప్రాతిపదికన సీట్ల కేటాయింపు జరిగితే అన్యాయం జరుగుతుందనే భావన వ్యక్తం చేస్తున్నాయి. దీనిని సమతౌల్యం చేయడానికి అన్ని రాష్ట్రాల్లో సమానంగా ప్రస్తుతం ఉన్న సీట్లకు 50 శాతం సీట్లు పెంచే విధానాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇది కొంతవరకు సమస్యను తగ్గించగలిగినా, పూర్తి పరిష్కారం కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికీ ఉత్తరాది రాష్ట్రాల్లో పార్లమెంట్, అసెంబ్లీల స్థానాల సంఖ్య దక్షిణాది కంటే ఎక్కువగానే ఉన్నాయి. అదే నిష్పత్తిలో మళ్ళీ దేశంలో ఉత్తరాది రాష్ట్రాల ఆధిక్యం కొనసాగనున్నది.
సీట్ల పెంపు అవసరమైనే మార్పే అయినప్పటికీ, ప్రజాస్వామ్యంలో నాణ్యమైన మార్పులు రావాలంటే కేవలం స్థానాల సంఖ్య పెరగడం సాధ్యం కాదు. రాజకీయ పార్టీలు, నాయకులకు పారదర్శకత, బాధ్యతాయుత పాలన, ప్రజా సమస్యలపై నిజమైన చిత్తశుద్ధి అవసరం. మహిళా రిజర్వేషన్ వంటి మార్పులు సమాజంలో మహిళల ప్రాధాన్యాన్ని, ప్రాతినిధ్యాన్ని గణనీయంగా పెంచగలవు. అయితే అదే సమయంలో ఖర్చుల నియంత్రణ, పదవుల పరిమితి వంటి సంస్కరణలు కూడా సమానంగా అవసరం.
డిలిమిటేషన్ వల్ల రాజకీయ పార్టీలకు అవకాశాలు విస్తరించడం అనివార్యం. కానీ ప్రజలకు నిజమైన లాభం అందాలంటే, ఈ మార్పులు వ్యవస్థలో గుణాత్మక సంస్కరణలతో కలిసివచ్చినప్పుడే సార్థకత. లేదంటే సీట్లు పెరిగినా ప్రజాస్వామ్యం బలపడిందని చెప్పడం కష్టమే.

