కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ చరిత్రలో అత్యంత ఖరీదైన ప్రజా పెట్టుబడుల్లో ఒకటి. దాన్ని పూర్తిగా విస్మరించడం కూడా మరింత నష్టం. జరిగిన లోపాలను విస్మరించడం అంతకంటే పెద్ద తప్పు. అందువల్ల ఒకవైపు అవినీతి, నిర్మాణ లోపాలపై నిర్దాక్షిణ్య విచారణ. దోషులకు శిక్షలు వేయడం. మరోవైపు నిపుణుల సూచనల మేరకు ప్రాజెక్టును సాధ్యమైనంత మేర ప్రజల ప్రయోజనాలకు వినియోగించడం సమాంతరంగా జరగాలి.
డా. మార్గం-అడుగు, ఎడిటోరియల్
కాళేశ్వరం ఎత్తిపోతల పథకం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత చర్చనీయాంశంగా మారింది. మాజీ సీఎం కేసీఆర్ హయాంలో రాష్ట్ర అభివృద్ధికి ప్రతీకగా ప్రచారం పొందిన ఈ ప్రాజెక్టు, నేడు రాజకీయ ఆరోపణలు, సాంకేతిక వివాదాలు, అవినీతి అనుమానాలకు ప్రధాన సాధనంగా మారింది. కాళేశ్వరం కూలేశ్వరమైందని అధికార కాంగ్రెస్, కుంగిన బ్యారేజీలను బాగు చేసి పునరుద్ధరించాలని ప్రతిపక్ష బీఆర్ఎస్ పరస్పరం నిరంతరం నిందారోపణలకు దిగుతున్నాయి. ఈ రాజకీయ పోరులో అసలు సమస్యలు కొట్టుకుపోతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు అంచనాలేంటి? అయిన ఖర్చెంత? ప్రణాళిక, డిజైన్లు ఎవరివి? లోపాలేంటి? అప్పు ఎక్కడ? ఎంత తెచ్చారు? అనుమతులున్నాయా? నిపుణులేం చెప్పారు? అవినీతి జరిగిందా? ఏ మేరకు? బాధ్యులెవరు? కాళేశ్వరం బ్యారేజీలు కూలిపోవడానికి కారణాలేంటి? దోషులెవరు? శిక్షలేంటి? విచారణలో తేల్చాల్సి ఉంది. మరోవైపు ఆ ప్రాజెక్టను పునరుద్ధరించడమెలా?
కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభ అంచనాలు రూ.38 వేల కోట్లు. తర్వాత సవరణలు, విస్తరణలు, అదనపు పనులు, భూసేకరణ, పంప్హౌస్లు, విద్యుత్ మౌలిక వసతులతో కలిపి వ్యయం రూ.లక్ష కోట్లకు పైగా చేరింది. ఈ సంఖ్యలపై భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ, ప్రాజెక్టుపై అసాధారణ స్థాయిలో ప్రజాధనం ఖర్చు చేసిన విషయం మాత్రం నిర్వివాదం. అంత భారీ పెట్టుబడితో నిర్మించిన ప్రాజెక్టు నిష్ఫలంగా నిలవడం ఆందోళనకరం.
2023 అక్టోబరులో మేడిగడ్డ బ్యారేజీలో పిల్లర్లు కుంగిపోవడంతో కాళేశ్వరం ప్రాజెక్టుపై అనేక అనుమానాలు, ప్రశ్నలు తలెత్తాయి. అన్నారం, సుందిళ్ల బ్యారేజీల స్థిరత్వంపైనా సందేహాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో జాతీయ డ్యామ్ భద్రతా సంస్థ (ఎన్డీఎస్ఏ)తో పాటు పలువురు నిపుణుల కమిటీలు సాంకేతిక పరిశీలనలు నిర్వహించాయి. వాటి నివేదికల ఆధారంగా మరమ్మతులు, భద్రతా చర్యలు, భవిష్యత్ నిర్వహణపై ప్రభుత్వం స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాల్సిన అవసరం ఉంది. నివేదికలను పూర్తిగా ప్రజల ముందుంచడం ద్వారా మాత్రమే అనుమానాలకు తెరపడుతుంది.
ఇక అవినీతి జరిగిందా? ఏ మేరకు? నిర్మాణ ప్రమాణాల్లో లోపాలు జరిగాయా? వ్యయభారం ఎందుకు పెరిగింది? ఇవన్నీంటిపైనా విచారణ జరగాల్సిందే. ప్రజాధనం దుర్వినియోగమైందని తేలితే బాధ్యులు ఎంత పెద్దవారైనా చట్టం ముందు జవాబుదారీ కావాల్సిందే. శిక్ష అనుభవించాల్సిందే. అయితే విచారణ పేరుతో ప్రాజెక్టును నిరవధికంగా నిరుపయోగంగా మార్చడం ప్రజా ప్రయోజనాలకు విరుద్ధం. అవినీతి విచారణ ఒకవైపు కొనసాగుతుండగా, మరోవైపు ప్రాజెక్టు నుంచి రాష్ట్రానికి ఎంత ప్రయోజనం పొందవచ్చో ప్రభుత్వం నిపుణుల సలహాలతో నిర్ణయించాలి.
గత రెండున్నరేళ్లుగా “తప్పు ఎవరిది?” అన్న రాజకీయ చర్చే తప్ప దోషులను నిర్ధారించింది లేదు. కాంగ్రెస్ గత ప్రభుత్వాన్ని నిందిస్తోంది. బీఆర్ఎస్ ప్రస్తుత ప్రభుత్వ వైఫల్యాలను ప్రస్తావిస్తోంది. కానీ రైతుకు నీరు అందిందా? చెరువులు నిండాయా? సాగునీటి విస్తీర్ణం పెరిగిందా? సమాధానాలే లేని ప్రశ్నలివి.
ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి, నిపుణుల కమిటీ సూచనల మేరకు బ్యారేజీల భవిష్యత్తుపై నిర్ణయాలు తీసుకుంటామని ప్రకటించారు. అదే సమయంలో మాజీ సీఎం కేసీఆర్పై తీవ్ర విమర్శలు కూడా చేశారు. అయితే ప్రజలు ఇంకా ఇప్పుడు ఆరోపణలు వినాలనుకోవడం లేదు. నిజానిజాలు తెలుసుకోవాలనుకుంటున్నారు. పరిష్కారం కోరుకుంటున్నారు. ప్రభుత్వం నిజంగా నిపుణుల సూచనలకే కట్టుబడి ఉంటే, ఆ నివేదికలను పూర్తిగా ప్రజలకు అందుబాటులో ఉంచి, మరమ్మతుల ఖర్చు, కాలపట్టిక, సాంకేతిక సాధ్యత వంటి అంశాలపై శ్వేతపత్రం విడుదల చేయాలి.
ఇలాంటి సమయంలో తుమ్మిడిహట్టి వద్ద కొత్త ప్రాజెక్టు నిర్మాణానికి పునుకోవడం ఆచరణ సాధ్యమేనా? ఆలోచించాలి. మహారాష్ట్రలో ముంపు సమస్యలు, అంతర్రాష్ట్ర అనుమతుల వివాదాల కారణంగా ఆ ప్రతిపాదన గతంలోనే నిలిచిపోయింది. ఈ దశలో మరో భారీ ప్రాజెక్టు పేరుతో ప్రజాధనాన్ని వెచ్చించే కంటే, ఇప్పటికే నిర్మించిన వ్యవస్థను సురక్షితంగా ఉపయోగించుకునే మార్గాలపై దృష్టి పెట్టడం సమంజసం.
తెలంగాణ ఇప్పటికే భారీ అప్పుల భారం ఎదుర్కొంటోంది. రాష్ట్ర అప్పులు రూ.8 లక్షల కోట్లు దాటాయని ప్రభుత్వ ఆర్థిక లెక్కలు సూచిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వేల కోట్ల రూపాయల కొత్త ప్రాజెక్టుల కంటే, ఉన్న ఆస్తులను సంరక్షించడం, వాటి ద్వారా ప్రయోజనం పొందడం ఆర్థికంగా కూడా వివేకవంతమైన నిర్ణయం.
ఎల్నినో ప్రభావంతో వర్షపాతం అస్థిరంగా మారుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో గోదావరిలోకి వచ్చే ప్రతి టీఎంసీ నీటిని సమర్థంగా వినియోగించడం అత్యవసరం. చెరువులు, రిజర్వాయర్లు నింపి సాగునీరు, తాగునీటి అవసరాలు తీర్చడం ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత. ఈ సమయంలో రాజకీయ వివాదాల కంటే నీటి నిర్వహణకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం మరింత పెరిగింది.
కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ చరిత్రలో అత్యంత ఖరీదైన ప్రజా పెట్టుబడుల్లో ఒకటి. దాన్ని పూర్తిగా విస్మరించడం కూడా మరింత నష్టం. జరిగిన లోపాలను విస్మరించడం అంతకంటే పెద్ద తప్పు. అందువల్ల ఒకవైపు అవినీతి, నిర్మాణ లోపాలపై నిర్దాక్షిణ్య విచారణ. దోషులకు శిక్షలు వేయడం. మరోవైపు నిపుణుల సూచనల మేరకు ప్రాజెక్టును సాధ్యమైనంత మేర ప్రజల ప్రయోజనాలకు వినియోగించడం సమాంతరంగా జరగాలి.
ప్రజలకు ఇప్పుడు కావాల్సింది రాజకీయ ఆరోపణలు కాదు, ఫలితాలు. కాళేశ్వరం చుట్టూ అంతులేని చర్చలకు ముగింపు పలికి, పారదర్శకత, జవాబుదారీతనం, శాస్త్రీయ నిర్ణయాలతో ముందుకు సాగితేనే లక్షలాది రైతులు, కోట్లాది రూపాయల ప్రజాధనం, తెలంగాణ భవిష్యత్తు రక్షించబడతాయి. అదే కాళేశ్వరం కథకు నిజమైన ముగింపు అవుతుంది.

