ఎల్నినో ప్రభావాన్ని ఆపడం మన చేతుల్లో లేదు. కానీ, దాని వల్ల కలిగే నష్టాన్ని శాస్త్రీయ ప్రణాళికలు, సమర్థమైన జల నిర్వహణ, నదుల అనుసంధానం, నీటి సంరక్షణ, వాతావరణ అనుకూల వ్యవసాయం ద్వారా గణనీయంగా తగ్గించవచ్చు. రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో రాజకీయాలకు అతీతంగా ఈ అంశంపై విస్తృత చర్చ జరగాలి. జల భద్రతను జాతీయ ప్రాధాన్యతగా గుర్తించి, సమగ్ర విధానంతో వాతావరణ సంక్షోభాన్ని సమర్థంగా ఎదుర్కోవడం వల్ల మాత్రమే దేశ ఆహార భద్రత, రైతు సంక్షేమం, ఆర్థిక స్థిరత్వాన్ని దీర్ఘకాలం కాపాడుకోవడం సాధ్యమవుతుంది.
డా. మార్గం-అడుగు, ఎడిటోరియల్
ఎల్నినో ప్రభావంతో దేశంలో వర్షపాతం అస్థిరంగా మారుతోంది. కొన్ని రాష్ట్రాలు వరదలతో అతలాకుతలమవుతుంటే, మరికొన్ని ప్రాంతాలు తీవ్రమైన కరువుతో అల్లాడుతున్నాయి. ఈ పరిస్థితి మంచినీరు, సాగునీరు, విద్యుత్ ఉత్పత్తి, ఆహార భద్రతపై తీవ్ర ప్రభావం చూపుతోంది. వాతావరణ మార్పులు వర్తమాన వాస్తవం. అందుకే తాత్కాలిక ఉపశమన చర్యలకే పరిమితం కాకుండా, దేశానికి దీర్ఘకాలిక జల విధానాన్ని రూపొందించాల్సిన సమయమిది. ఈ నేపథ్యంలో నదుల అనుసంధానం మరోసారి జాతీయ చర్చగానే గాక, ఒక సమగ్ర విధానాన్ని రూపొందించి అమలు చేయాల్సిన అవసరం ఉంది.
భారతదేశంలో సగటున ఏడాదికి సుమారు 4 వేల బిలియన్ క్యూబిక్ మీటర్ల నీటి లభ్యత ఉన్నప్పటికీ, అందులో వినియోగించగలిగేది 1,123 బిలియన్ క్యూబిక్ మీటర్లు మాత్రమే. మిగిలిన నీటిలో గణనీయమైన భాగం వరదల రూపంలో సముద్రంలో కలిసిపోతుంది. మరోవైపు దేశంలోని అనేక జిల్లాలు ప్రతి ఏడాది మంచినీరు, సాగునీటి కొరతను ఎదుర్కొంటున్నాయి. ఈ వైరుధ్యానికి సమగ్ర జలవనరుల నిర్వహణ లేకపోవడమే కారణం.
దేశంలో 60 శాతం వ్యవసాయం ఇప్పటికీ వర్షాధారంగానే కొనసాగుతోంది. వ్యవసాయం స్థూల దేశీయోత్పత్తిలో 18 శాతం వాటాను కలిగి ఉండటంతో పాటు, దేశ జనాభాలో 45 శాతం మందికి ఉపాధిని కల్పిస్తోంది. వర్షాలు ఆలస్యమైతే లేదా తక్కువగా కురిస్తే పప్పుధాన్యాలు, నూనెగింజలు, చిరుధాన్యాలు, పత్తి వంటి పంటల దిగుబడులు తగ్గుతాయి. ఫలితంగా రైతుల ఆదాయం పడిపోవడమే కాకుండా, ఆహారధరలు పెరిగి ద్రవ్యోల్బణం కూడా అధికమవుతుంది.
వాతావరణ మార్పుల ప్రభావం ఇప్పటికే స్పష్టంగా కనిపిస్తోంది. ఒకవైపు రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా, మరోవైపు కొద్ది గంటల్లోనే నెల రోజుల వర్షపాతం కురిసే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. భారత వాతావరణ శాఖ కూడా తీవ్ర వర్షాలు, దీర్ఘకాలిక పొడి పరిస్థితులు, వేడి గాలుల తీవ్రత పెరుగుతున్నట్లు హెచ్చరిస్తోంది. ఈ పరిస్థితుల్లో సంప్రదాయ సాగు ప్రణాళికలు చాలవు. శాస్త్రీయ వ్యవసాయం, ముందస్తు వాతావరణ సమాచారం, నీటి సమర్థ వినియోగం అనివార్యమయ్యాయి.
ఇలాంటి పరిస్థితుల్లో నదుల అనుసంధానంపై ప్రభుత్వం మరింత దృష్టి సారించాలి. దేశంలో వరదలు వచ్చే నదీ పరివాహక ప్రాంతాల నుంచి నీటి కొరత ఉన్న ప్రాంతాలకు నీటిని మళ్లించగలిగితే కరువు తీవ్రతను గణనీయంగా తగ్గించవచ్చు. జాతీయ జలాభివృద్ధి సంస్థ రూపొందించిన జాతీయ నదుల అనుసంధాన ప్రణాళికలో 30 ప్రధాన అనుసంధాన ప్రాజెక్టులు ప్రతిపాదించారు. ఇవి దశలవారీగా అమలైతే సాగునీటి విస్తీర్ణం పెరగడంతో పాటు వరదలు, కరువు రెండింటి ప్రభావం కూడా తగ్గే అవకాశం ఉంది. అయితే పర్యావరణ సమతౌల్యం, స్థానిక ప్రజల పునరావాసం, రాష్ట్రాల మధ్య సమన్వయం వంటి అంశాలను సమాన ప్రాధాన్యంతో పరిష్కరించాల్సి ఉంటుంది.
నీటి సంరక్షణను కేవలం ప్రభుత్వ బాధ్యతగా కాకుండా ప్రజా ఉద్యమంగా మలచాలి. ప్రతి గ్రామంలో చెరువులు, కుంటలు, కాలువలను పునరుద్ధరించాలి. వర్షపు నీటి సంరక్షణను తప్పనిసరి చేయాలి. భూగర్భ జలాల అధిక వినియోగాన్ని నియంత్రిస్తూ, సూక్ష్మ సాగు పద్ధతులైన డ్రిప్, స్ప్రింక్లర్ సాగును మరింత విస్తరించాలి. ప్రస్తుతం దేశంలో సూక్ష్మ సాగు విస్తీర్ణం పెరుగుతున్నప్పటికీ, ఇంకా కోట్ల ఎకరాల్లో ఈ సాంకేతికత అందుబాటులోకి రావాల్సి ఉంది.
వ్యవసాయ రంగంలో కూడా నిర్మాణాత్మక మార్పులు అవసరం. తక్కువ నీటితో సాగయ్యే పంటలను ప్రోత్సహించాలి. నేలలో సేంద్రియ పదార్థాల శాతాన్ని పెంచేందుకు ఆవుపేడ, కంపోస్ట్, జీవబొగ్గు వంటి సహజ వనరుల వినియోగాన్ని విస్తరించాలి. దీంతో నేల తేమ నిల్వ సామర్థ్యం పెరిగి, వర్షాభావ పరిస్థితుల్లో కూడా పంటలకు కొంత రక్షణ లభిస్తుంది. అదే సమయంలో పంటల బీమా వ్యవస్థను మరింత సమర్థంగా అమలు చేసి, నష్టపోయిన రైతులకు త్వరితగతిన పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలి.
దేశ ఆహార భద్రతను బలోపేతం చేయాలంటే ఉత్పత్తి పెరగడం మాత్రమే సరిపోదు. పంటల నిల్వ, ప్రాసెసింగ్, మార్కెటింగ్ వ్యవస్థలను కూడా ఆధునికీకరించాలి. గ్రామ, మండల స్థాయిలో ఆధునిక గిడ్డంగులు, కోల్డ్ స్టోరేజీలు ఏర్పాటు చేస్తే పంట అనంతర నష్టాలు గణనీయంగా తగ్గుతాయి. రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, యువ పారిశ్రామికవేత్తల భాగస్వామ్యంతో ఈ రంగాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది.
ఎల్నినో ప్రభావాన్ని ఆపడం మన చేతుల్లో లేదు. కానీ, దాని వల్ల కలిగే నష్టాన్ని శాస్త్రీయ ప్రణాళికలు, సమర్థమైన జల నిర్వహణ, నదుల అనుసంధానం, నీటి సంరక్షణ, వాతావరణ అనుకూల వ్యవసాయం ద్వారా గణనీయంగా తగ్గించవచ్చు. రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో రాజకీయాలకు అతీతంగా ఈ అంశంపై విస్తృత చర్చ జరగాలి. జల భద్రతను జాతీయ ప్రాధాన్యతగా గుర్తించి, సమగ్ర విధానంతో వాతావరణ సంక్షోభాన్ని సమర్థంగా ఎదుర్కోవడం వల్ల మాత్రమే దేశ ఆహార భద్రత, రైతు సంక్షేమం, ఆర్థిక స్థిరత్వాన్ని దీర్ఘకాలం కాపాడుకోవడం సాధ్యమవుతుంది.

