భారత ప్రజాస్వామ్యం ప్రపంచంలోనే అతిపెద్దది. కానీ, ఎన్నికల వ్యవస్థలోని లోపాలు మన రాజ్యాంగ ప్రామాణికతపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. పార్లమెంట్, అసెంబ్లీ సీట్ల పెంపు వంటి చర్యలు సమస్యలకు అసలైన పరిష్కారాలు కావు. నిజమైన మార్పు ఎన్నికల సంస్కరణల ద్వారానే సాధ్యం. లేకపోతే రాజ్యాంగం అదే రూపంలోనే కొనసాగుతూనే, ప్రజాస్వామ్యం తన ఆత్మను కోల్పోయే ప్రమాదం ఉంది.
దేశంలో ఎన్నికల ప్రక్రియ “మళ్ళీ మళ్ళీ వస్తున్న ఒకే నాయకత్వం”తో ఇబ్బందీ పడుతోంది. అదే వ్యక్తులు పదేపదే ఎన్నికవుతూ వస్తున్నారు. ఈ ధోరణి కొత్త నాయకత్వ ఆగమనానికి పెద్ద అడ్డంకిగా మారింది. గణాంకాల ప్రకారం, గత కొన్ని దశాబ్దాల్లో లోక్సభలో తిరిగి ఎన్నికయ్యే సభ్యుల శాతం 50%కు పైగా ఉండటం గమనార్హం. దీన్ని నియంత్రించేందుకు గరిష్టంగా రెండు పదవీకాలాలకే పరిమితిని విధించడం అవసరం. అలాంటి నిబంధనలు ప్రవేశపెడితే రాజకీయాల్లో కొత్త ఆలోచనలకు మార్గం సుగమం అవుతుంది.
ఎన్నికల్లో డబ్బు ప్రవాహం, కండ, మంద బలం ప్రభావం తీవ్రంగా పెరిగింది. ఒక పార్లమెంట్ ఎన్నికలో ఒక అభ్యర్థి చేసే ఖర్చు సగటు వంద కోట్లు దాటుతున్నది. అధికారికంగా ఖర్చు పరిమితి ఉన్నప్పటికీ, అనధికారిక వ్యయాలు ఎన్నికల సంఘం నియంత్రణలో లేవు. 2019 సాధారణ ఎన్నికల్లో మొత్తం ఖర్చు రూ. 60వేల కోట్లకు పైగా జరిగినట్లు అంచనాలు సూచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల ఖర్చులను ప్రభుత్వమే భరించే విధానం లేదా పారదర్శక ఫండింగ్ విధానాలను అమలు చేయడం అత్యవసరం.
సామాజిక న్యాయం మరో ప్రధనాంశం. దళితులు, గిరిజనులు, మహిళలు కలిపి దేశ జనాభాలో 70% వరకు ఉన్నప్పటికీ, చట్టసభల్లో వారి ప్రాతినిధ్యం తగిన స్థాయిలో లేదు. ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ వర్గాలకు రిజర్వేషన్లు ఉన్నప్పటికీ, మహిళలకు మాత్రం పరిమిత అవకాశాలే ఉన్నాయి. కనీసం 33% మహిళా రిజర్వేషన్ అమలు చేయడమే కాకుండా, వెనుకబడిన వర్గాలకు మరింత ప్రాతినిధ్యం కల్పించే దిశగా చర్చ, చర్యలు జరగాలి.
ఒకే అభ్యర్థి రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేయడం అనే వ్యవహారం ప్రజాధనం వృథా చేయడమే కాకుండా, ఉపఎన్నికలకు దారితీస్తుంది. ఒకసారి ఎన్నికైన తర్వాత ఒక సీటును వదిలేయాల్సి రావడం వల్ల, ఆ చోట మరోసారి ఎన్నికలు నిర్వహించాల్సి వస్తుంది. అందువల్ల ఒకే వ్యక్తి ఒకే నియోజకవర్గానికి పరిమితం కావాలని చట్టపరమైన మార్పులు చేయాలి.
“ఒకే దేశం – ఒకే ఎన్నిక” విధానం ఆవశ్యం. దేశంలో తరచూ ఎన్నికలు జరుగడం వల్ల ఖర్చు పెరగడంతో పాటు పాలనపై ప్రభావం పడుతోంది. కేంద్రం, రాష్ట్రాల ఎన్నికలను ఒకేసారి నిర్వహించడం వల్ల ఖజానాపై భారం తగ్గుతుంది. అయితే దీనిపై భిన్నాభిప్రాయాలు, రాజకీయ విభేదాలు ఉన్నాయి. అయినప్పటికీ, దీన్ని అమలు చేసే స్పష్టమైన ప్రణాళిక అవసరం.
ఓటరు జాబితా లోపాలు, దొంగ ఓట్లు పెద్ద సమస్యగా మారాయి. దేశవ్యాప్తంగా ఓటర్ లిస్టుల్లో లోపాలు, ప్రజాస్వామ్య నిష్పాక్షికతకు తీవ్ర భంగం కలిగిస్తున్నాయి. ఓటరు జాబితాను నిరంతరం నవీకరించడం, సాంకేతికత ఆధారంగా గుర్తింపు వ్యవస్థలను బలోపేతం చేయడం అత్యవసరం. ప్రతి ఓటరు తన నివాస ప్రదేశంలోనే ఓటు వేయగల విధంగా చట్టపరమైన స్పష్టత అవసరం.
ప్రజాప్రతినిధుల జీతభత్యాలు, పెన్షన్లు కూడా సమస్యే. ప్రస్తుతం ఒక ప్రజాప్రతినిధి ఒక్కసారే ఎన్నికైనా జీవితకాలం పెన్షన్ పొందే అవకాశం ఉంది. కొందరు అసెంబ్లీ, పార్లమెంట్ రెండు స్థాయిల్లో ఎన్నికైతే, రెండు పెన్షన్లు కూడా పొందుతున్నారు. ఈ విధానాన్ని వెంటనే పన: సమీక్షించాలి. పనితీరు ఆధారంగా సౌకర్యాలు ఉండే విధంగా మార్పులు చేయాలి.
ప్రజల భాగస్వామ్యం. ఎన్నికలు కేవలం రాజకీయ పార్టీల మధ్య పోటీగా, అదేదో నేతల వ్యవహారంగా మారిపోయాయి. సామాన్య ప్రజలకు, ఆర్థికంగా వెనుకబడిన వారికి, రాజకీయాల్లో ప్రవేశించే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. అవసరమైతే ప్రత్యేక నిబంధనలు లేదా ప్రోత్సాహకాలు ప్రవేశపెట్టి వారిని ప్రోత్సహించాలి.
ఎన్నికల సంస్కరణలు కేవలం ఒక రాజకీయ పార్టీ లేదా నాయకుడి బాధ్యత కాదు. ఇది దేశవ్యాప్తంగా చర్చించాల్సిన అంశం. రాజ్యాంగ సవరణల నుంచి పరిపాలనా మార్పుల వరకు సమగ్ర చర్యలు అవసరం. ప్రజాస్వామ్యం బలపడాలంటే ఎన్నికల వ్యవస్థ పారదర్శకంగా, సమానత్వంతో ఉండాలి.
సీట్ల పెంపు వంటి పైపై మెరుగులతో కాకుండా, అసలు సమస్యలను పరిష్కరించే ఎన్నికల సంస్కరణల ద్వారానే భారత ప్రజాస్వామ్యం బలోపేతం అవుతుంది. కొత్త నాయకత్వానికి మార్గం కల్పించడం, ధనబలం ప్రభావాన్ని తగ్గించడం, సామాజిక న్యాయాన్ని సాధించడం వంటి లక్ష్యాలతో సాగితేనే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది.

