Thursday, August 6, 2026
29 C
Hyderabad

‘నీట్‌’గా నిర్వహించలేమా?!|EDITORIAL

లక్ష్యం ఎంత గొప్పదైనా, దాన్ని అమలు చేసే వ్యవస్థ సమర్థంగా, విశ్వసనీయంగా లేకపోతే నమ్మకం దెబ్బతింటుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం, ఎన్‌టీఏ ‘నీట్’ లోపాలను సరిదిద్దాలి. లేకపోతే ప్రతి ఏటా పరీక్షల కంటే వివాదాలే ఎక్కువగా వార్తల్లో నిలిచే పరిస్థితి కొనసాగుతుంది. యూజీసీ తరహాలో ‘నీట్’ని నీట్ గా నిర్వహించలేమా?

డా. మార్గం-అడుగు, ఎడిటోరియల్

భారతదేశంలో వైద్య విద్యలో ప్రవేశాల కోసం ఒకే జాతీయ ప్రమాణాన్ని తీసుకురావాలనే లక్ష్యంతో నీట్ పరీక్షను 2013లో ప్రారంభించినప్పటికీ, రాష్ట్రాల వ్యతిరేకతల మధ్య 2017 నుంచి పూర్తి స్థాయిలో ప్రవేశపెట్టారు. దేశవ్యాప్తంగా సమాన అవకాశాలు కల్పించడం, మెడికల్ సీట్ల కేటాయింపులో పారదర్శకత పెంచడం, కోచింగ్ మాఫియా ప్రభావాన్ని తగ్గించడం వంటి లక్ష్యాలు దీనికి మూలం. అయితే ఆశించిన ఫలితాల కంటే వివాదాలు, పేపర్ లీకులు, పరీక్షల రద్దులు, రీ-ఎగ్జామ్స్, సాంకేతిక లోపాలు ఎక్కువగా నీట్ ని నీట్ గా చుట్టుముట్టాయి. ఫలితంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు అనిశ్చితిలో కొట్టుమిట్టాడుతోంది.

ప్రస్తుతం దేశంలో వైద్య విద్యకు పోటీ తీవ్ర స్థాయిలో ఉంది. ప్రతి ఏడాది 20 లక్షల మందికి పైగా విద్యార్థులు నీట్-యూజీ పరీక్షకు హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో పరీక్ష నిర్వహణలో చిన్న పొరపాటు కూడా లక్షలాది కుటుంబాలపై ప్రభావం చూపుతుంది. కానీ ఇటీవలి సంవత్సరాల్లో నీట్ నిర్వహణ విషయంలో వరుసగా వివాదాలు చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. పేపర్ లీకేజీల ఆరోపణలు, పరీక్షా కేంద్రాల నిర్వహణలో లోపాలు, ఫలితాలపై వివాదాలు, కోర్టు కేసులు సాధారణమైపోయాయి.

ఇటీవల రీ-ఎగ్జామ్ నిర్వహణ నిర్ణయం మరోసారి నీట్ వ్యవస్థపై ప్రశ్నలు లేవనెత్తింది. ఇప్పటికే పరీక్ష రాసిన విద్యార్థులు మళ్లీ సన్నద్ధం కావాల్సి రావడం మానసికంగా వారిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. నెలల తరబడి శ్రమించి పరీక్ష పూర్తి చేసిన తర్వాత మళ్లీ అదే ప్రక్రియను ఎదుర్కోవాల్సి రావడం వారి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తోంది. విద్యార్థులకే కాకుండా తల్లిదండ్రులపై కూడా ఆర్థిక, మానసిక భారం పెరుగుతోంది.

గతంలో రాష్ట్రాల వారీగా నిర్వహించిన ఎంసెట్ వంటి ప్రవేశ పరీక్షల్లో కూడా కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ, ఈ స్థాయిలో జాతీయ వివాదాలు అరుదుగా కనిపించేవి. రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక యంత్రాంగం సమన్వయంతో పరీక్షలను నిర్వహించేవి. మెడికల్ అడ్మిషన్లు కూడా నిర్దిష్ట కాలపట్టిక ప్రకారం పూర్తయ్యేవి. కానీ కేంద్ర స్థాయిలో నిర్వహిస్తున్న నీట్‌లో ప్రతి సంవత్సరం ఏదో ఒక వివాదం తలెత్తడం వ్యవస్థాపరమైన లోపాలకు సంకేతంగా కనిపిస్తోంది.

పరీక్ష నిర్వహణ బాధ్యతలు చేపట్టిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ-ఎన్‌టీఏ పనితీరుపై ఇప్పటికే అనేక విమర్శలు వచ్చాయి. పరీక్షల భద్రత కోసం ప్రత్యేక ఏర్పాట్లు, ప్రశ్నపత్రాల తయారీదారులను రహస్య ప్రాంతాల్లో ఉంచడం, సీఆర్‌పీఎఫ్ భద్రత, ఉన్నతస్థాయి పర్యవేక్షణ వంటి చర్యలు తీసుకోవడం పరిస్థితి ఎంత క్లిష్టంగా మారిందో తెలియజేస్తోంది. ఒక ప్రవేశ పరీక్ష నిర్వహణకు హెలికాప్టర్లు, భారీ భద్రతా బలగాలు అవసరమయ్యే పరిస్థితి ఏర్పడితే అది విజయానికి కాకుండా వ్యవస్థ వైఫల్యానికే సూచనగా పరిగణించాల్సి ఉంటుంది.

అదే సమయంలో సాంకేతిక సమస్యలు కూడా విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. అడ్మిట్ కార్డుల డౌన్‌లోడ్ సమయంలో వెబ్‌సైట్ నిలిచిపోవడం, టైమ్‌అవుట్ సమస్యలు, ఫీజు రిఫండ్ ప్రక్రియలో గందరగోళం వంటి అంశాలు పరీక్షా సంస్థ సామర్థ్యంపై సందేహాలు కలిగిస్తున్నాయి. లక్షలాది మంది విద్యార్థులు ఒకేసారి పోర్టల్‌ను వినియోగిస్తారని ముందుగానే తెలిసినప్పటికీ, తగిన సాంకేతిక మౌలిక సదుపాయాలు కల్పించడంలో లోపాలు కనిపించాయి.

ఇక సైబర్ నేరాలు పరిస్థితిని మరింత క్లిష్టతరం చేస్తున్నాయి. రిఫండ్ మొత్తాలను అక్రమంగా ఇతర ఖాతాలకు మళ్లించడం, టెలిగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా ప్రశ్నపత్రాలు అమ్ముతామంటూ మోసాలు జరగడం విద్యార్థుల ఆందోళనను పెంచుతోంది. పరీక్షా వ్యవస్థలో భద్రతా ప్రమాణాలు ఎంత బలహీనంగా ఉన్నాయో ఈ ఘటనలు సూచిస్తున్నాయి.

ఇలాంటి పరిస్థితుల్లో అత్యంత ఆందోళనకరమైన విషయం ఏమిటంటే, వైఫల్యాలకు బాధ్యులైన వ్యవస్థలపై చర్యలు పరిమితంగానే ఉండగా, దాని భారం మాత్రం విద్యార్థులే మోయాల్సి వస్తోంది. పరీక్ష రద్దు అయితే మళ్లీ చదవాల్సింది విద్యార్థులే! అడ్మిషన్లు ఆలస్యం అయితే భవిష్యత్తు అనిశ్చితిలో పడేది కూడా వారిదే. కానీ, నిర్వాహక వ్యవస్థలో జవాబుదారీతనం కనిపించడం లేదు.

దేశంలో అత్యంత ప్రతిష్ఠాత్మక పరీక్షలలో ఒకటైన యూపీఎస్సీ నిర్వహణను పరిశీలిస్తే క్రమశిక్షణ, భద్రత, పారదర్శకతకు ప్రాధాన్యం కనిపిస్తుంది. అదే స్థాయి ప్రమాణాలను నీట్ నిర్వహణలో కూడా అమలు చేయాల్సిన అవసరం ఉంది. ప్రశ్నపత్రాల భద్రత, డిజిటల్ మౌలిక సదుపాయాలు, సైబర్ భద్రత, పరీక్షా కేంద్రాల పర్యవేక్షణ, ఫిర్యాదు పరిష్కార వ్యవస్థలను మరింత బలోపేతం చేయాలి.

నీట్ లక్ష్యం సరైనదే కావచ్చు. దేశవ్యాప్తంగా ఒకే ప్రమాణంతో వైద్య విద్యలో ప్రవేశాలు కల్పించాలనే ఉద్దేశాన్ని ఎవరూ వ్యతిరేకించరు. కానీ లక్ష్యం ఎంత గొప్పదైనా, దాన్ని అమలు చేసే వ్యవస్థ విశ్వసనీయంగా లేకపోతే ప్రజల నమ్మకం దెబ్బతింటుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం, ఎన్‌టీఏ సమగ్ర సమీక్ష చేపట్టి లోపాలను సరిదిద్దాలి. లేకపోతే ప్రతి సంవత్సరం పరీక్షల కంటే వివాదాలే ఎక్కువగా వార్తల్లో నిలిచే పరిస్థితి కొనసాగుతుంది. విద్యార్థుల భవిష్యత్తుతో ప్రయోగాలు చేసే వ్యవస్థకు సంస్కరణలు అత్యవసరం. నీట్‌ను కాపాడాలంటే ముందు విద్యార్థుల నమ్మకాన్ని కాపాడాలి.

Latest News

మౌర్య పూర్వయుగం|ADUGU SPECIAL|HISTORY|COMPITITIVE EXAMS

క్రీ.పూ.650 నుండి క్రీ.పూ.250 మధ్య ఉన్న కాలాన్ని మౌర్యుల పూర్వయుగం లేదా బుద్ధుని యుగం లేదా షోడశ మహాజనపాదాల యుగం అని అంటారు. ఈ కాలంలో గౌతమ బుద్ధుడు ముఖ్య పురుషుడు కాబట్టి...

సంయమనం కోల్పోతే రాజకీయ సంక్షోభమే!?|EDITORIAL

వ్యక్తిగత విమర్శలు తాత్కాలిక రాజకీయ ప్రచారానికి ఉపయోగపడవచ్చు. కానీ, దీర్ఘకాలంలో నాయకుడి విశ్వసనీయతను దెబ్బతీస్తాయి. రాజకీయ వారసత్వం కేవలం కుటుంబ నేపథ్యంతోనే రాదు, హుందాతనంతో కూడిన నాయకత్వంతోనే నిలుస్తుంది. మాటలతో సంపాదించేది ప్రచారం...

ఆగస్టు 06, గురువారం 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి అష్టమి మధ్యాహ్నం 03.39 వరకు ఉపరి నవమి నక్షత్రం భరణి సాయంత్రం 06.11 వరకు ఉపరి కృత్తిక యోగం గండ మధ్యాహ్నం 02.03 వరకు ఉపరి వృద్ధి కరణం కౌలవ మధ్యాహ్నం 03.39వరకు ఉపరి తైతుల రాహుకాలం...

తింటే గీ అవ్వ శేతి గారెలే తినాలె!?|ADUGU TRENDS

ఎన్కటికి... యింటే భారతమే యినాలె... తింటే గారెలే తినాలన్నరు. కనీ, ఇగిప్పుడైతే, తింటే గింటే గీ అవ్వ శేతి గారెలే తినాల్నని తిన్నోల్లంటాండ్రు. మరి, గా గారెల ముచ్చటేందో సూద్దాం పదండ్రి. ములుగు జిల్ల...

బీజేపీ-ఆత్మపరిశీలనకు సరైన సమయం! EDITORIAL

ప్రజాస్వామ్యంలో ప్రతి ఎన్నిక ఒక సందేశం! ప్రతి ఉప ఎన్నిక ఒక హెచ్చరిక!! ప్రతి ప్రజా ఉద్యమం పాలకుల పాలనకు అద్దం. ఇప్పటిదాకా అప్రతిహతంగా అధికారం చెలాయిస్తున్న బీజేపీ అనూహ్యంగా ఈ మూడింటినీ...

ఆగస్టు 05 బుధవారం 2026|RASHI PHALALU

స్వస్తి శ్రీ పరాభవ సంవత్సరము, దక్షిణాయణం, గ్రీష్మ ఋతువు , ఆషాఢ మాసము-కృష్ణపక్షం తిథి కృష్ణ-సప్తమి ఈ రోజు (05) రాత్రి 8:42 వరకు, తదుపరి కృష్ణ-అష్టమి నక్షత్రము అశ్విని ఈ రోజు (05) రాత్రి 9:18 వరకు,...

ఇగ పోను అన్ లాక్ శేసుడు అల్కన!!?|ADUGU TRENDS

ఇగో గిప్పుడు గా పోన్ల వాడుడు అందరికీ అల్కగైపోయింది. సంటి పోరగాండ్ల కానుంచి, పండు ముసలోల్ల దాకా పోను వాడుతనే ఉన్నరు. ఇగ గీ వాడుట్ల అప్పుడప్పుడు గా పోన్ల లాకుల నెంబర్ల...

ఆగస్టు 04, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ షష్ఠి రాత్రి 07.06 వరకు ఉపరి సప్తమి నక్షత్రం రేవతి రాత్రి 08.09 వరకు ఉపరి అశ్విని యోగం ధృతి రాత్రి 06.53 వరకు ఉపరి శూల కరణం గరజి ఉదయం 07.45...

గీ అవుడియ అదిరింది!?|ADUGU TRENDS

ఒక అవుడియ జీవితాన్నే మారుస్తదంటే గిదేనేమో మరి! ఏదైనా ఆలోశన శేత్తే, ఏదో ఒకటి జర్గుతది. లేకపోతే ఊదు కాలది పిల్లి గూడ లేవది? గది సరే గనీ గా పిల్లగాడు శేసిందేంటో...

అధికారం రాగానే హామీలు హుష్ కాకీ!?

ప్రజలు ఇప్పుడు రాజకీయ పార్టీల ప్రకటనలను కాకుండా వాటి పనితీరును కొలుస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు కాలపరిమితి నిర్ణయించి, వాటి అమలుపై ప్రతి ఆరు నెలలకు ఒకసారి శ్వేతపత్రం విడుదల చేయడం...

ఆగస్టు 03, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ పంచమి రాత్రి 08.18 వరకు ఉపరి షష్ఠి నక్షత్రం ఉత్తరాభాద్ర రాత్రి 08.37 వరకు ఉపరి రేవతి యోగం సుకర్మ రాత్రి 08.54 వరకు ఉపరి ధృతి కరణం కౌలవ ఉదయం 08.40...

అవుమల్లా! కడుపుల బిడ్డ స్పందిత్తదా!?|ADUGU TRENDS

తల్లి గర్భంల ఉండంగనే బిడ్డలకి బయటియి యినబడ్తయా? గవాటికి గా పిల్లలు గూడ స్పందిత్తరా? యెన్కటికి కడుపుల ఉండంగనే అర్జునుడి కొడుకు అభిమన్యుడు పద్మవ్యూహంలకెట్ల పోవాల్నో తెలుసుకున్నడట. గిది నిజమో కాదో కనీ,...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News