బీసీ సంఘాల నాయకులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు…
ఈ అభినందనలు నాకు కాదు ఈ అభినందనలు అందించాల్సింది రాహుల్ గాంధీ కి చెప్పమని బీసీ నాయకులకు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. భారత్ జోడో యాత్ర సందర్భంగా అధికారంలోకి వచ్చిన రాష్ట్రాల్లో కులగణన నిర్వహిస్తామని రాహుల్ గాంధీ స్పష్టంగా చెప్పారని, ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో కులసర్వే నిర్వహించామన్నారు. 50 శాతానికి మించి రిజర్వేషన్లు పెంచుకోవాలంటే ముందుగా జనాభా లెక్క తేలాలన్నారు. అలాగే ఆ లెక్కలకు చట్టబద్ధత కల్పించాలి.. అప్పుడే రిజర్వేషన్లు పెంచుకునేందుకు వీలుంటుందన్నారు. అందుకోసమే రాష్ట్రంలో బీసీ కులసర్వే నిర్వహించుకున్నామని చెప్పారు. అదే సందర్భంలో అసెంబ్లీలో ఫిబ్రవరి 4 కు ప్రత్యేక స్థానం ఉంది.. అందుకే ఫిబ్రవరి 4 ను సోషల్ జస్టిస్ డేగా ప్రకటించుకున్నామన్నారు. అలాగే పక్కా ప్రణాళికతో మంత్రివర్గ ఉపసంఘం, అ తరువాత డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేసి ఒక టైం ఫ్రేమ్ లో కులసర్వే పూర్తి చేశామన్నారు. మొదటి విడతలో కులసర్వేలో పాల్గొనని వారికోసం రెండో విడతలో అవకాశం కల్పించి, పూర్తి పారదర్శకంగా కులసర్వేను పూర్తి చేశామన్నారు. ఏ పరీక్షలోనైనా మనం చేసిన పాలసీ డాక్యుమెంట్ నిలబడేలా జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లెక్కలు తేల్చాలన్నా మన రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకోవాలనేదే మా ఆలోచన అని సీఎం రేవంత్ అన్నారు. ఈ కులసర్వే చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇందులో మేం భాగస్వాములవడం మాకు గర్వకారణమన్నారు. దీనిని బీసీ సోదరులు అర్థం చేసుకోవాలి.. దీన్ని తప్పుపడితే నష్టపోయేది బీసీ సోదరులేనన్నారు. కేవలం డాక్యుమెంట్ చేసి వదిలేయకుండా బిల్లు చేశామన్నారు.
రాజకీయ పరమైన రిజర్వేషన్లు, విద్యా ఉద్యోగ రిజర్వేషన్ల కోసం వేర్వేరుగా రెండు బిల్లులు శాసనసభలో ఆమోదించుకున్నామని,జనగణనలో కులగణన ఎప్పుడూ జరగలేదు… జనగణనలో కులగణనను చేర్చితే సరైన లెక్క తేలుతుందన్నారు. మండల్ కమిషన్ కూడా బీసీల లెక్క 52 శాతం అని తేల్చింది. కానీ మేం కులసర్వే ద్వారా బీసీల లెక్క 56.36 శాతంగా తేల్చామన్నారు. ఈ లెక్కతేల్చడం కోసమే స్థానిక ఎన్నికలు వాయిదా వేశామన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ బీసీలకు అండగా ఉందన్నారు. పీసీసీ అధ్యక్షులుగా పనిచేసినవారిలో ఎక్కువ మంది బీసీలేనన్నారు. ఈ కులగణన అందరికీ భగవద్గీత, బైబిల్, ఖురాన్ లాంటిది అన్నారు. ఈ కులగణన అన్నింటికీ పునాది లాంటిది.. ముందు అమలు చేసుకుని తరువాత అవసరాన్నిబట్టి సవరణలు చేసుకోవచ్చన్నారు. కులం ముసుగులో రాజకీయంగా ఎదగాలని అనుకునే వారి ట్రాప్ లో పడకండి అని సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. మీ హక్కుల సాధన కోసం మీరే నాయకత్వం వహించండి నేను మీకు మద్దతుగా నిలబడతా అని హామీ ఇచ్చారు.

