పార్లమెంట్ బడ్జెట్ తొలిదశ సమావేశాలు ముగిశాయి. రాష్ట్రపతి ప్రసంగం, బడ్జెట్ ప్రవేశపెట్టడం, ధన్యవాద తీర్మానం వరకు సరే, కానీ చర్చ సహేతుకంగా జరుగుతోందా? దేశం ఎదుర్కొంటున్న సవాళ్లపై లోతైన చర్చలు, పాలకపక్షాన్ని నిలదీసే ప్రశ్నలు, ప్రతిపక్షాన్ని ఎదుర్కొనే అధికార పక్షం, ప్రత్యామ్నాయ విధానాలపై సమగ్ర చర్చకు తావులేని ఈ సమావేశాలు మరోసారి ‘మొక్కుబడి’గానే మిగిలిపోయాయి.
ఈసారి సమావేశాలలో ఆసక్తికర అంశం స్పీకర్ ఓం బిర్లా తీరుపై అవిశ్వాస తీర్మానం. పార్లమెంట్ చరిత్రలో స్పీకర్పై అవిశ్వాసం అరుదైన పరిణామం. భారత ప్రధాన ప్రతిపక్షం తమకు సరైన అవకాశాలు ఇవ్వడం లేదని ఆరోపిస్తోంది. సభా నిర్వహణలో నిష్పాక్షికత స్పీకర్ పదవికి అలంకారం. ఆ పదవిపైనే అనుమానాలు వ్యక్తమవడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం. స్పీకర్ నిర్ణయాలు కేవలం సాంకేతిక ప్రక్రియలకే పరిమితం కాకూడదు. అవి ప్రజాస్వామిక చర్చలకు మార్గం సుగమం చేయాలి.
రాష్ట్రపతి ప్రసంగంపై చర్చ అంటే, అది ప్రభుత్వ పనితీరుపై సమగ్ర సమీక్షే. అదే సందర్భంలో దేశ ఆర్థిక, సామాజిక, విదేశాంగ విధానాలపై విపక్షాలు తమ అభిప్రాయాలు వెలిబుచ్చి, ప్రభుత్వాన్ని ప్రశ్నించవచ్చు. నిలదీయవచ్చు. కానీ ప్రశ్నలకే తావులేని చర్చలతో అసమగ్రంగా పార్లమెంట్ ముగిసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజ్యసభలో సమాధానం ఇచ్చినప్పటికీ, లోక్సభలో విస్తృత చర్చకు అవకాశం కల్పించలేదని ప్రతిపక్షం అంటోంది. ప్రజలకు బాధ్యత వహించాల్సిన ప్రభుత్వానికి పార్లమెంటే ప్రధాన వేదిక. అక్కడ ప్రశ్నలు ఎదుర్కొని సమాధానాలు ఇవ్వడం ప్రజాస్వామ్య రీతి, నీతి, రివాజు, పద్ధతి.
ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రసంగాలకు అతి తక్కువ అవకాశాలే లభిస్తున్నాయన్నది ప్రధాన ఆరోపణ. వాయిదా తీర్మానాలు, అత్యవసర చర్చల డిమాండ్లు తరచుగా తిరస్కరించబడుతున్నాయనేది ప్రతిపక్ష వాదన. అధికార, ప్రతిపక్షాల వానదలేమైనప్పటికీ, చర్చను నిర్మాణాత్మకంగా జరిగేవిదంగా ప్రవర్థించాల్సిన బాధ్యత ఇరు పక్షాలది. నియమావళి ప్రకారం లభ్యమయ్యే అవకాశాలను సమర్థంగా వినియోగించడం అవసరం.
ఈ సమావేశాల్లో విదేశాంగ, వాణిజ్య విధానాలు అతి ముఖ్యమైనవి. అమెరికాతో వాణిజ్య ఒప్పందం, యూరోపియన్ యూనియన్తో చర్చలు కేవలం దౌత్యపరమైన నిర్ణయాలు మాత్రమే కాదు. దేశ ఆర్థిక వ్యవస్థపై దీర్ఘకాల ప్రభావం చూపే విధానాలు. దిగుమతులపై సుంకాలను తగ్గించడం, మార్కెట్ ను విస్తరించడం వంటి నిర్ణయాలు చిన్న, సన్నకారు రైతులు, వ్యాపారులు, ఉత్పత్తి రంగాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయో ప్రజలకు స్పష్టంగా తెలియాలి. ఆ భరోసా బాధ్యత ప్రభుత్వానిది. ఆ విధంగా చెప్పించడం ప్రతిపక్షానిది.
రష్యాతో చమురు కొనుగోళ్లు తగ్గించడం, అంతర్జాతీయ ఒత్తిడులు, అమెరికా వైఖరి వంటి అంశాలు కూడా చర్చకు రావాల్సినవే. విదేశాంగం అనేది కార్యనిర్వాహక శాఖ ప్రత్యేకాధికారం అయినప్పటికీ, ప్రజలపై ప్రభావం చూపే కీలక నిర్ణయాల్లో పార్లమెంట్ను విశ్వాసంలోకి తీసుకోవడం ప్రజాస్వామ్య బాధ్యత. ముఖ్యంగా వ్యవసాయం, చిన్న పరిశ్రమలు, ఎగుమతులు వంటి రంగాలపై ప్రభావం ఉంటే, ప్రజా ప్రతినిధుల వేదికపై సమగ్ర చర్చ తప్పనిసరి.
బడ్జెట్ కేటాయింపుల్లో పెద్దగా కొత్తదనం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సంక్షేమ పథకాలు, మౌలిక సదుపాయాలు, ఉపాధి అవకాశాల పెంపు వంటివి మాటల్లో మాత్రమే కాక, ఫలితాల్లో కూడా ప్రతిఫలించాలి. బడ్జెట్ చర్చలు కేవలం ఆర్థిక గణాంకాల పరిమితిలో కాకుండా, సామాజిక ప్రభావాల కోణంలో కూడా సాగాలి. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, వ్యవసాయ సంక్షోభం, మధ్యతరగతి భారం వంటి అంశాలు లోతుగా పరిశీలించబడాలి.
పార్లమెంట్ విలువ కేవలం చట్టాలు ఆమోదించడంలోనే కాదు. ప్రభుత్వాన్ని ప్రశ్నించడంలో ఉంది. ప్రతిపక్షం లేకుండా ప్రజాస్వామ్యం అసంపూర్ణం. అదే విధంగా బాధ్యతాయుత ప్రతిపక్షం లేకుండా చర్చ నాణ్యత పడిపోతుంది. ఇరుపక్షాలు కూడా తమ పాత్రను పునఃపరిశీలించాల్సిన సమయం ఇది. ప్రజల అనుమానాలు నివృత్తి చేయడం, విధానాలపై పారదర్శకత చూపించడం, విభిన్న అభిప్రాయాలను వినడం ఆవశ్యం. అర్థవంతమైన చర్చలు అనివార్యం. ఇవి ప్రజాస్వామ్యంపై ప్రజల విశ్వాసాన్ని మరింత బలోపేతం చేస్తాయి.

