సామాన్య పౌరులు ప్రారంభించిన చిన్న ఉద్యమాలకు దేశవ్యాప్త ఆదరణ లభించడం రాజకీయ పార్టీలకు ఒక గట్టి హెచ్చరిక. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం సంప్రదాయ నాయకత్వంపై మాత్రమే ఆధారపడటం లేదు. కొత్త వేదికలు, కొత్త నాయకత్వం, కొత్త పద్ధతులను అనుసరిస్తున్నారు. ఈ మార్పును రాజకీయ పార్టీలు అర్థం చేసుకోకపోతే వాటి సామాజిక ప్రాధాన్యం క్రమంగా తగ్గిపోతుంది.
నీట్ ఉద్యమం ముగిసిందని సమస్య సమసిపోయిందని భావించడం పొరపాటు. అసలు ప్రశ్నలు ఇంకా మిగిలే ఉన్నాయి. ప్రజల ఆవేదనను విని, పరిష్కరించగలిగే వ్యవస్థను నిర్మించగలమా? లేదంటే రేపటి ఉద్యమాలు మరింత తీవ్రంగా, విస్తృతమవుతాయి.
డా. మార్గం-అడుగు, ఎడిటోరియల్
ఎన్నికలు గెలవడం ఒక పార్టీకి ప్రభుత్వ అధికారాన్ని ఇస్తుంది. అయితే ఆ అధికారానికి చట్టబద్ధతను, నైతికతను అందించేది జవాబుదారీతనమే. ప్రజలు లేవనెత్తిన సమస్యలకు సమయానికి స్పందించడం, నిర్ణయాల్లో పారదర్శకత పాటించడం, తప్పు జరిగితే బాధ్యత వహించడం ఇవే ప్రజాస్వామ్యానికి జీవం పోసే విలువలు. ఈ విలువలు బలహీనపడినప్పుడల్లా ప్రజల్లో అసంతృప్తి పెల్లుబికుతుంది. చివరికి అదే ప్రజా ఉద్యమాలకు దారితీస్తుంది. ఇటీవలి నీట్ ప్రశ్నాపత్రం లీకేజీపై దేశవ్యాప్తంగా వ్యక్తమైన నిరసనలు, ఆగ్రహాలు కూడా ఇదే కోవకు చెందినది. పాలనలో పెరుగుతున్న జవాబుదారీతన లోపానికి వచ్చిన హెచ్చరిక.
దేశంలో వైద్య విద్యలో ప్రవేశానికి నీట్ అత్యంత కీలకమైన పరీక్ష. ఇలాంటి పరీక్షలో ప్రశ్నాపత్రం లీకేజీ ఆరోపణలు, గ్రేస్ మార్కుల వివాదం, పరీక్ష నిర్వహణపై అనుమానాలు తలెత్తడం లక్షలాది కుటుంబాల్లో ఆందోళన కలిగించింది. అయితే ప్రజల్లో ఆగ్రహానికి కారణం ఒక్క ఈ ఘటన మాత్రమే కాదు. ప్రభుత్వాల స్పందనలో జాప్యం, వ్యవస్థలపై తగ్గుతున్న విశ్వాసం, తప్పు జరిగినప్పుడు బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోకపోవడం కూడా దీనికి ప్రధాన కారణాలు.
దేశంలో అనేక సమస్యలున్నాయి. జీఎస్టీ అమలై ఎనిమిదేళ్లు దాటినా చిన్న వ్యాపారులు ఇప్పటికీ పన్ను విధానంలో సరళీకరణ కోరుతున్నారు. ఆహార ద్రవ్యోల్బణం తరచూ సాధారణ కుటుంబాల బడ్జెట్ను దెబ్బతీస్తోంది. నిరుద్యోగం యువతలో ఆందోళన పెంచుతోంది. పోటీ పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీలు వరుసగా వెలుగుచూస్తున్నాయి. పెట్రో, డీజిల్, నిత్యావసర, మందుల ధరలు, అవినీతి పెరుగుదల, ప్రభుత్వ సేవల ఆలస్యం వంటి సమస్యలు ప్రజలను నిరంతరం ఇబ్బంది పెడుతున్నాయి. ఈ సమస్యలన్నింటిలో ఒకే సామ్యముంది. అది సకాలంలో ప్రభుత్వ స్పందన లేకపోవడం. ప్రజలు కోరేది అసాధ్యమైన హామీలు కాదు. వేగవంతమైన నిర్ణయాలు, స్పష్టమైన చర్యలు మాత్రమే.
ఇప్పటి యువత స్వభావం గత తరాలతో పోలిస్తే పూర్తిగా మారిపోయింది. డిజిటల్ యుగంలో పెరుగుతోన్న ఈ తరం సమాచారం కోసం ఎదురు చూడదు. ఏ అన్యాయం జరిగినా క్షణాల్లో దేశవ్యాప్తంగా చర్చకు తీసుకెళ్లే సామర్థ్యం సామాజిక మాధ్యమాలకు ఉంది. ఒకప్పుడు పెద్ద రాజకీయ పార్టీలకే పరిమితమైన ప్రజా ఉద్యమాలు, ఇప్పుడు చిన్న పౌర వేదికల నుంచే ప్రారంభమవుతున్నాయి. లక్షలాది మంది యువత ఒకే అంశంపై ఏకమైతే, ఆ ఉద్యమాన్ని సంప్రదాయ రాజకీయ ప్రమాణాలతో అంచనా వేయడం సాధ్యం కాదు. ఇదే నీట్ ఉద్యమం చెప్పిన అతిపెద్ద సందేశం.
దేశంలో రాజకీయ పార్టీల వైఫల్యాన్ని కూడా విస్మరించలేం. ప్రజల సమస్యలను ముందుగా గుర్తించి ప్రభుత్వంపై ఒత్తిడి తేవాల్సిన ప్రతిపక్షాలు చాలా సందర్భాల్లో కేవలం రాజకీయ విమర్శలకే పరిమితమవుతున్నాయి. మరోవైపు అధికార పక్షం ప్రజల ప్రశ్నలకు తక్షణ సమాధానం ఇవ్వకుండా, విమర్శలను రాజకీయ కోణంలోనే చూస్తోంది. ఫలితంగా ప్రజలకు తమ సమస్యలను వినిపించేందుకు వీధులే ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నాయి.
పార్లమెంట్ దేశ ప్రజల అత్యున్నత చర్చా వేదిక. కానీ ఇటీవలి సమావేశాలను పరిశీలిస్తే ప్రజల జీవితాలను ప్రభావితం చేసే అంశాల కంటే రాజకీయ ప్రయోజనాలు, పరస్పర ఆరోపణలు, సభా స్తంభనలకే ఎక్కువ సమయం వెచ్చిస్తున్నారు. ప్రజలు ఇచ్చిన విలువైన సమయం, ప్రజల పన్నులతో నడిచే పార్లమెంట్ ప్రజల సమస్యలకు పరిష్కార వేదికగా నిలవాలి. అధికార పక్షం సమాధానాలు ఇవ్వాలి. ప్రతిపక్షం ప్రత్యామ్నాయాలు సూచించాలి. కానీ ఈ రెండు బాధ్యతలు సక్రమంగా నెరవేరనప్పుడు ప్రజల్లో వ్యవస్థలపైనే కాక, పార్టీలపైనా అనుమానాలు, అసహనం పెరగడం సహజం.
రాజకీయ వ్యవస్థ, కార్యనిర్వాహక యంత్రాంగం, చట్టసభలు, దర్యాప్తు సంస్థలు అన్నీ ప్రజల విశ్వాసాన్ని కాపాడే విధంగా పనిచేయాలి. తప్పు జరిగితే దానిని కప్పిపుచ్చే ప్రయత్నం కాకుండా, వెంటనే నిర్ధారించి చర్యలు తీసుకోవాలి. ఆలస్యంగా తీసుకునే నిర్ణయాలు ప్రజల్లో అసహనాన్నే కలిగిస్తాయి.
సామాన్య పౌరులు ప్రారంభించిన చిన్న ఉద్యమాలకు దేశవ్యాప్త ఆదరణ లభించడం రాజకీయ పార్టీలకు ఒక గట్టి హెచ్చరిక. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం సంప్రదాయ నాయకత్వంపై మాత్రమే ఆధారపడటం లేదు. కొత్త వేదికలు, కొత్త నాయకత్వం, కొత్త పద్ధతులను అనుసరిస్తున్నారు. ఈ మార్పును రాజకీయ పార్టీలు అర్థం చేసుకోకపోతే వాటి సామాజిక ప్రాధాన్యం క్రమంగా తగ్గిపోతుంది.
ప్రభుత్వాలు కూడా ఒక వాస్తవాన్ని గుర్తించాలి. సామాజిక మాధ్యమాలు విస్తరించిన ఈ కాలంలో ఏ సమస్యనైనా ఎక్కువకాలం దాచిపెట్టడం, ప్రజల్ని మభ్య పెట్టడం ఎంతమాత్రం సాధ్యం కాదు. సమాచారం క్షణాల్లో వ్యాపిస్తుంది. అందుకే పాలనలో పారదర్శకత, వేగం, బాధ్యత మరింత పెరగాలి. ప్రజల సొమ్ముతో నడిచే ప్రభుత్వాలు విలాసవంతమైన పాలనకు కాదు, జవాబుదారీతనానికి ప్రతీకలుగా నిలవాలి. ప్రజలను భయపెట్టి ప్రభుత్వాలని నడపలేరు.
నీట్ ఉద్యమం ముగిసిందని సమస్య సమసిపోయిందని భావించడం పొరపాటు. అసలు ప్రశ్నలు ఇంకా మిగిలే ఉన్నాయి. ప్రజల ఆవేదనను విని, పరిష్కరించగలిగే వ్యవస్థను నిర్మించగలమా? లేదంటే రేపటి ఉద్యమాలు మరింత తీవ్రంగా, విస్తృతమవుతాయి.

