అమరావతి నగరం సాకారం కాబోతున్నది. ఏడాది కాలంగా సీఎం చంద్రాబు అమరావతి పునర్నిర్మాణానికి అహర్నిశలు కష్టపడడంతో ఆంధ్రప్రదేశ్ కీలక మైలురాయిని చేరుకుంది. ప్రధాని మోడీ పునర్నిర్మాణ పనుల్లో పాల్గొనడంతో వేగం పెరిగింది. నిజానికి జగన్ తన ఐదేళ్ల పదవీకాలంలో అమరావతిని నిర్మించివుంటే ఆయన్ని చరిత్ర గుర్తించేది. కానీ, ఇప్పుడు అమరావతి చరిత్రలో జగన్ తనకు చోటు లేకుండా చేసుకున్నారు. అంతేగాకుండా మూడు రాజధానులు అంటూ ఐదేళ్లూ కాలం వెళ్లదీసారు. ఈ లోగా కాలంతోపాటు ప్రజలు కూడా ఒక నిర్ణయం తీసేసుకున్నారు.
నిజానికి చంద్రబాబు విజన్కు జగన్ ఆలోచనకు ఎంతో తేడా ఉంది. చంద్రబాబును కాదని ఒక్క ఛాన్స్ అని అభ్యర్థించిన జగన్కు ప్రజలు పట్టం కట్టారు. తద్వారా ఆంధ్రప్రదేశ్ ఓ పదేళ్లు వెనక్కి పోవడమే గాకుండా అప్పులకుప్పగా మారింది. అప్పులు చేసిన జగన్ ఆంధ్రప్రదేశ్ను అంధకారంలోకి నెట్టారు. యువకుడైన జగన్కు నిజంగానే మంచి ఆలోచనలు ఉండివుంటే ఎపి భవిష్యత్ మరోలా ఉండేది. విజన్ ఉండాలి. పట్టుదల ఉండాలి. ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిపోయేలా పనులు చేయగలగాలి. బటన్ నొక్కి అప్పులు చేసిన జగన్ విజన్ లేని నేతగానే నిలిచిపోయాడని చెప్పాలి. అయితే, ప్రజలు వ్యక్తిగత ప్రయోజనాలతో పాటు సమిష్టి ప్రయోజనాలు కూడా ఆశిస్తారు. విద్య, వైద్యం, నీరు, రోడ్లు వంటి సౌకర్యాలపై ప్రభుత్వాల ప్రయత్నాలు ఎప్పుడూ కొనసాగుతుండాలి. ఇవేవీ లేకపోగా, ప్రజలపై అప్పుల భారం పడింది. ప్రతీకార కేసులు ప్రజల్ని కూడా విసిగించాయి. ప్రజలు మరోసారి మార్పును కోరుకున్నారు. అందుకే మళ్లీ అమరావతిని రాజధానిగా పునర్నిర్మిస్తామని తెలుగుదేశం కూటమి హావిూ ఇచ్చింది. అధికారంలోకి రావడంతో అది సాకారం కాబోతున్నది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గత పదేళ్లుగా రాజధాని లేకుండా పోయింది. అమరావతిని దెబ్బతీసే ప్రయత్నంలో జగన్ రాజధాని లేకుండా చేశారన్న అపవాదుని మూటగట్టుకున్నారు. మూడు రాజధానుల సంగతి పక్కన పెడితే అసలు రాజధానే లేకుండా పోయింది. తల లేని మొండెంలా రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ గత ఐదేళ్లుగా కొనసాగింది. అభివృద్ధి వికేంద్రీకణ వేరు, రాజధాని వేరు అన్న స్పృహలో లేకుండా జగన్ పాలన సాగించారు. రాజధాని కోసం భూములు ఇచ్చిన పలువురు రైతులు, మహిళలు కోర్టుల చుట్టూ తిరగడంతోనే సరిపోయింది. కేసులతో వారిని కోర్టులకే పరిమితం చేస్తే ఇక ఉద్యమంలో కనిపించరన్న ఎత్తుగడతో గత పాలన సాగింది. రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా? అన్న చందంగా కేసులకు కొదవ లేకుండా పోయింది. జగన్ తన ఐదేళ్ల పాలనాకాలంలో కనీసం రైతులతో మాట్లాడకుండా, వారి అభిప్రాయాలు కూడా తెలుసుకోకుండా తీసుకున్న నిర్ణయం కారణంగా ఏపీ తీవ్రంగా నష్టపోయింది.
విభజనకు గురైన 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనివార్యంగా ఇప్పుడు కొత్త రాజధానికి శ్రీకారం చుడుతోంది. ఓ ఐదేళ్ల తరవాత అమరావతితో ఏపీ రూపురేఖలు మారనున్నయి. ఓ అద్భుత నగరం ఆవిష్కృతం అవుతుందనడంలో సందేహం అవసరం లేదు. ఉమ్మడి ఏపీలో హైదరాబాద్ తెలుగు వారికి ఒక విద్యా, వ్యాపార, నివాస, ఉపాధి, ఆదాయ వనరుగా మారిపోయింది. హైదరాబాద్ లాంటి నగరం ఒక్కటి కూడా ఏపీలో లేకుండా పోయింది. విశాఖపట్నం, విజయవాడ నగరాలు హైదరాబాద్ స్థాయి నగరాలు కావు కనుకనే చంద్రబాబు కొత్త రాజధానికి శ్రీకారం చుడుతున్నారు. విశాలమైన సముద్ర తీరంతో పాటు, పలు విమానాశ్రయాలు, ఓడరేవులు ఉన్న ఏపీ ఇక అమరావతితో మరింతగా అలరారడం ఖాయంగా కనిపిస్తున్నది. హైదరాబాద్ లాంటి విస్తృత అవకాశాలు గల ఒక నగరం ఆంధ్రకు లేని లోటును అమరావతి తీర్చనుందనడంలో సందేహం లేదు. అంతేకాదు అంతర్జాతీయనగరంగా హైదరాబాద్కు దీటుగా, పోటీగా విస్తరిస్తే అంతకంటే సంతోషం కూడా మరోటి ఉండదు. నిజానికి చంద్రబాబు రెండోసారి సీఎం అయి ఉంటే ఈపాటికి అమరావతి సాక్షాత్కరించేది. అమరావతి అంటే ప్రపంచస్థాయి వ్యాపార, వాణిజ్య భవనాలు, పబ్లిక్ పార్క్ లు, వినోద కేంద్రాలు, ఐకానిక్ నిర్మాణాలు, సువిశాలమైన రహదారులు, నైట్ లైఫ్ వినోద కార్యకలాపాలు అందించే సఫారీ టూర్ల వెసులుబాట్లు, టూరిస్ట్ ఆకర్షణలు. ఇవేగాక అంతర్గత రవాణా సదుపాయాలు వంటివన్నీ అందుబాటులోకి వస్తాయి. అనేక సదుపాయాల సముదాయంగా అమరావతి పేరిట ఒక మహానగరం నిర్మించాలన్న చంద్రబాబు నాయుడు సంకల్పం అభినందనీయం.
ప్రపంచంలో అనేక నగరాలను తిరిగి, అధ్యయనం చేసిన అనుభం చంద్రబాబుది. ఆయన తన రాజకీయ జీవితం కన్నా తన పేరు చిరస్థాయిగా నిలవాలని ఆకాంక్షించే వ్యక్తి. చంద్రబాబు దార్శనికుడు కావడం వల్ల ప్రపంచ స్థాయి నగరంగా ’అమరావతి’కి బలమైన పునాదులు వేస్తున్నారు. తన దార్శనికతతోనే అమరావతిని ఓ అద్భుత వాణిజ్య నగరంగా తీర్చిదిద్దే పనిలో ప్రధానిని ఆహ్వానించి పునాది వేయించడం, పునరావిష్కృతం చేయడం చరిత్రలో నిలిచే మహోజ్వల ఘట్టం. ఇది పూర్తిగా సాకారం కావడానికి కనీసం ఓ దశాబ్ద కాలం పట్టవచ్చు. అప్పటి వరకు చంద్రబాబును ప్రలజు ఆదరిస్తే ఏపీని అగ్రభాగాన నిలబెట్టే ప్రయత్నం చేస్తారు. చంద్రబాబు దార్శనికతకు సజీవ సాక్ష్యంగా చరిత్రలో అమరావతి నగరం నిలిచిపోతుంది. కృష్ణా పరివాహక ప్రాంతం కావడం నీటికొరత లేకుండా అమరావతి అలరారుతందనడంలో సందేహం లేదు. అమరావతి భారతదేశంలో అద్భుత నగరంగా నిలిచిపోతే తెలుగువాళ్ళందరికీ గర్వకారణమే.

