తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ప్రస్తుతం తీవ్రమైన ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. సంక్షేమ పథకాల విస్తరణ, పెరుగుతున్న అప్పులు, ఆదాయ వనరుల పరిమితి, దుబారా ఖర్చులు, ఖర్చుల ప్రాధాన్యతా లోపాలు, ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడం, పకడ్బందీ ప్రణాళిక లేకపోవడం వంటివన్నీ కలిసి ప్రభుత్వాల ఆర్థిక స్థితిని అధ్వాన్నంగా, అప్పుల మయం చేస్తున్నాయి. అధికారంలో ఉన్న నాయకత్వం, విధాన ప్రాధాన్యతలు, వ్యవస్థలో జవాబుదారీతనం లోపం ఈ పరిస్థితిని మరింత దారుణంగా దిగజార్చుతున్నాయి.
తెలంగాణలో ప్రభుత్వానికి ఉద్యోగులు, పెన్షనర్లకు కలిపి రూ.8వేల కోట్లకు పైగా బకాయిలు ఉన్నాయి. ఇటీవల ప్రభుత్వం రూ.వెయ్యి కోట్లు విడుదల చేసినప్పటికీ, నెలనెలా ఇదే స్థాయిలో చెల్లింపులు కొనసాగిస్తామని ప్రకటించడం సమస్య తీవ్రతను తగ్గించదు. పైగా అసలు సమస్య తీవ్రతను హెచ్చరిస్తున్నది. జీతాలను ప్రతినెలా 1వ తేదీననే చెల్లిస్తున్నామని చెప్పుకునే దుర్వస్థ ప్రస్తుత ప్రభుత్వాలది. పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు రావాల్సిన నిధులు ఆలస్యం కావడం పరిపాలనా ప్రాధాన్యతల వైఫల్యం కాక మరేమిటి? ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికి మించి, సమగ్ర ఆర్థిక వ్యూహాన్ని అవలంబించాల్సిన అవసరం కనిపిస్తోంది.
ఇక భట్టి విక్రమార్క ఆధ్వర్యంలోని ఆర్థిక శాఖపై కూడా విమర్శలు ఉన్నాయి. ఖర్చుల ప్రాధాన్యతలను సమతుల్యంగా అమలు చేయడంలో లోపాల ఆరోపణలు కనిపిస్తున్నాయి. సంక్షేమ పథకాలకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించడం రాజకీయంగా అవసరమైనదైనా, అదే సమయంలో ఆదాయ వనరుల పెంపు, వ్యయ నియంత్రణపై తగిన దృష్టి లేకపోతే ఆర్థిక వ్యవస్థ అస్థిరతకు దారి తీస్తుంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి కూడా తెలంగాణకు పెద్దగా తేడాగా లేదు. రాష్ట్రం భారీగా అప్పులపై ఆధారపడుతూ తన ఖర్చులను నిర్వహిస్తోంది. కేంద్రం నుంచి గ్రాంట్లు, ప్రత్యేక సహాయం పొందడం తాత్కాలిక ఉపశమనమే కాని దీర్ఘకాలిక పరిష్కారం కాదు. చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రానికి కేంద్ర సహకారం లభిస్తున్నప్పటికీ, అది ఆర్థిక క్రమశిక్షణకు ప్రత్యామ్నాయం కాదు. ఖర్చుల నియంత్రణ, పెట్టుబడుల ఆకర్షణ, పరిశ్రమల వృద్ధి వంటి అంశాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.
భారత దేశం, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల అప్పులు ఆందోళనకరంగా ఉన్నాయి. మార్చి 2024 నాటికి, భారతదేశ మొత్తం బకాయి రుణం రూ.168.72 లక్షల కోట్లుగా ఉంది. సెప్టెంబరు 2024లో, భారతదేశ విదేశీ అప్పు రూ.57.49 లక్షల కోట్లుగా నమోదైంది. 2026-27 చివరి నాటికి తెలంగాణ ప్రభుత్వ రుణ బకాయిలు రూ.6 లక్షల కోట్లకు చేరాయి. ఆర్థిక లోటును పూడ్చేందుకు చేసిన అప్పులతో పాటు, తెలంగాణ 37.2%తో దేశంలోనే అత్యధిక అప్పులున్న రాష్ట్రాల్లో రెండో స్థానంలో ఉంది. 2026-27 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ఆంధ్రప్రదేశ్ మొత్తం ప్రభుత్వ రుణం రూ.7.11 లక్షల కోట్లకు చేరుకుంటుంది. ఏపీలో 43.7% తో దేశంలోనే అత్యధిక అప్పులున్న రాష్ట్రంగా మొదటి స్థానంలో ఉంది. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, తమిళనాడు వంటి రాష్ట్రాలు అత్యధిక రుణాలను కలిగి ఉండగా, దక్షిణాది రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణ తలసరి అప్పులు ఎక్కువగా ఉన్నాయి.
రైతుబంధు, ఉచిత విద్యుత్, నగదు బదిలీలు వంటి పథకాలు సామాజిక భద్రతకు అవసరమే అయినప్పటికీ, అవి ఆర్థిక సామర్థ్యానికి అనుగుణంగా లేవు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన కొన్ని పథకాలు కూడా ఇదే సమస్యను సృష్టించాయి. ప్రస్తుతం అదే విధానాలను కొనసాగించడం వల్ల సమస్య మరింత పెరిగింది.
అవినీతి, జవాబుదారీతనం లోపం కూడా పరిస్థితిని సంక్లిష్టం చేస్తున్నాయి. క్షేత్ర స్థాయిలో చిన్న పనులకు కూడా లంచాలు అవసరమవుతున్నాయి. పరిపాలనా యంత్రాంగంలో సమర్థవంతమైన పర్యవేక్షణ లేకపోవడం, అధికారుల బాధ్యతారాహిత్యం వల్ల ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోంది. జిల్లాల విభజన ద్వారా పరిపాలన సులభమవుతుందని భావించినప్పటికీ, వాస్తవంలో ఫలితాలు అంతగా కనిపించడం లేదు.
ఈ పరిస్థితిలో పరిష్కార మార్గాలు స్పష్టంగా ఉండాలి. ప్రభుత్వాలు ఖర్చుల ప్రాధాన్యతలను పున:పరిశీలించాలి. ఆదాయ వనరులను పెంచేందుకు పారిశ్రామిక, పర్యాటక పెట్టుబడులను ఆకర్షించాలి. సంక్షేమ పథకాల వ్యయాన్ని నియంత్రించాలి. బకాయిల చెల్లింపులను సమయానికి పూర్తి చేయడం ద్వారా ప్రభుత్వంపై నమ్మకాన్ని పెంపొందించాలి. అవినీతిపై కఠిన చర్యలు తీసుకుని పరిపాలనలో పారదర్శకతను తీసుకురావాలి.
ఆర్థిక క్రమశిక్షణ లేకపోతే సంక్షేమం కూడా నిలదొక్కుకోలేదన్న వాస్తవాన్ని గుర్తించాలి. ప్రజల మద్దతుతో ఏర్పడిన ప్రభుత్వాలు, అదే ప్రజల ఆర్థిక భవిష్యత్తును సురక్షితం చేయాల్సిన బాధ్యతను మర్చిపోవద్దు. అప్పులపై ఆధారపడిన అభివృద్ధి తాత్కాలికం మాత్రమే. సుస్థిర ఆర్థిక విధానాలే రాష్ట్రాలను దీర్ఘకాలికంగా బలపరుస్తాయి.

