ఆనాడు బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఎక్కడ?
స్వాతంత్ర్యం వచ్చాక కూడా ఒక దేశంగా కొనసాగిన హైదరాబాద్ విమోచనమై భారతదేశంలో విలీనమైనప్పుటికి, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఇంకా ఆవిర్భవించనేలేదు. అయినా ఇప్పుడు బీజేపీ నాయకులు తెలంగాణ “విలీన దినోత్సవమా? విమోచన దినోత్సవమా?” అని రచ్చ చేస్తున్నారంటే చరిత్రను తారుమారు చేయడమే. వాస్తవాలను వక్రీకరించడమే.
స్వాతంత్ర్యం తర్వాత పరిస్థితి
1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. దేశమంతటా స్వేచ్ఛా, స్వాతంత్ర్యాలు కలిగి, సర్వత్రా ఆనందం వెల్లివిరిసింది. కానీ, అప్పటికే సొంత కరెన్సీ, పరిపాలన, సైన్యం సహా దేశంగా ఉన్న హైదరాబాద్ మాత్రం స్వతంత్రంగానే ఉండిపోయింది. నిజాం రాజు మీర్ ఉస్మాన్ అలీఖాన్ తన రాజ్యాన్ని భారతదేశంలో విలీనం చేయడానికి ఒప్పుకోలేదు. ఆనాడు నిజాం రాజ్యంలో రజాకార్లు ప్రజలపై అత్యాచారాలు, హింస యథేచ్ఛగా కొనసాగించారు. తెలంగాణలో ప్రజలు ఊర్లకు ఊర్లు వదిలేసి సమీప ఆంధ్రా ప్రాంతాలకు వెళ్లి తలదాచుకున్నారు. అలవికాని పరిస్థితుల్లో అలా వీలుకాని ప్రజలు పరిస్థితిని తట్టుకోలేక సాయుధులై స్వతంత్ర పోరాటాలు చేశారు.
నిజాం పాలనలో రజాకార్లు ప్రజలపై హింసాత్మక దాడులు చేయడం మొదలుపెట్టారు. ఒకవైపు కమ్యూనిస్టులు, మరోవైపు అప్పటి సాయుధ పోరాటానికి నాయకత్వం వహించిన చాకలి ఐలమ్మ, భీంరెడ్డి నర్సింహారెడ్డి, మల్లు స్వరాజ్యం వంటి నాయకులు, కొందరు బయట అజ్నాతంలో, నల్లా నర్సింహులు లాంటి మరికొందరు జైళ్ళల్లో ఉండిపోయారు. ఈ హింసను అరికట్టడంలో హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ నుంచి స్వామి రామానంద తీర్థ, ఆంధ్ర మహాసభ నుంచి మాడపాటి హన్మంతరావు, రావి నారాయణ రెడ్డి, పుచ్చలపల్లి సుందరయ్య, సురవరం ప్రతాపరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, బూర్గుల రామకృష్ణారావు, దాశరథి కృష్ణమాచార్య, సూసర్ల శ్రీరామ నర్సింహ, పులిజాల వెంకట రంగారావు, కాళోజీ నారాయణరావు, బత్తిని మొగిలయ్య గౌడ్, కొండా వెంకట రంగారెడ్డి, వట్టికోట ఆల్వార్ స్వామి, కొండా లక్ష్మణ్ బాపూజీ, తదితర అనేకమంది వీర తెలంగాణ యోధులు సాయుధ రైతాంగ పోరాటం చేశారు. ఈ సుదీర్ఘ ధిక్కార పోరాటాన్ని గమనించిన ఇండియన్ యూనియన్ ప్రభుత్వం జవహర్ లాల్ నెహ్రూ నాయకత్వంలో ఒక రాజకీయ పరమైన నిర్ణయం తీసుకున్నది.
ఆపరేషన్ పోలో – తెలంగాణ విలీనం
ఈ సంఘటనల నేపథ్యంలో, భారత ప్రభుత్వం సైనిక చర్యకు దిగింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆదేశాలతో మేజర్ జనరల్ జయంత్ నాథ్ చౌదరి నేతృత్వంలో “ఆపరేషన్ పోలో” ప్రారంభమైంది. సైన్యం రజాకార్లను అదుపులోకి తెచ్చింది. చివరకు నిజాం రాజు లొంగిపోగా, 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానం ఇండియన్ యూనియన్ లో విలీన ప్రకటన వెలువడింది. సెప్టెంబర్ 18న విలీన ప్రక్రియ పూర్తైంది.
ఆనాడు బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఎక్కడ?
ఆ సమయంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ఉన్నా, వారు పోరాటాల్లో పాల్గొనలేదు. బీజేపీకి అప్పుడు ఉనికే లేదు. ఆర్ఎస్ఎస్ స్థాపకులు కేశవ్ బలీరాం హెడ్గేవార్, గోల్వాల్కర్, సావర్కర్ వంటి వారు “భారత యువత స్వాతంత్ర్య పోరాటాల్లో పాల్గొనకండి, మీ జీవితాలను నాశనం చేసుకోకండి” అని పిలుపునిచ్చిన చరిత్ర మన కళ్ల ముందే ఉన్నది. అంతే కాదు, 1948లో ఆర్ఎస్ఎస్ మీద కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. తర్వాత 1951లో జనసంఘ్ ఏర్పడింది. అది తర్వాత 1980లో బీజేపీగా మారింది.
నేటి రాజకీయాల్లో బీజేపీ పాత్ర
ఇప్పుడు బీజేపీ చరిత్రలో తమకు లేని పాత్రను, స్థానాన్ని కల్పితంగా చూపించుకోవాలనుకుంటోంది. మతతత్వాన్ని రెచ్చగొట్టి రాజకీయ లబ్దిని పొందాలనుకుంటోంది. కానీ చరిత్రను ఎవరూ మార్చలేరు. సెప్టెంబర్ 17న తెలంగాణ భారతదేశంలో విలీనమైన దినం. అది విలీన దినోత్సవమే. కానీ, విమోచన దినోత్సవం కాదని చరిత్ర స్పష్టంగా చెబుతోంది.

-గోపాల బాలరాజు
సీనియర్ జర్నలిస్ట్ – 7337082570

