ఎర్రబస్సుల్ల ఎన్కటేం రాసుండేదో గుర్తుందా!? ఒకపాలి గుర్తు శేసుకోండ్రి. ‘పొగ తాగరాదు!’, ‘టికెట్టుకు సరిపడా చిల్లర ఇచ్చి కండక్టర్ కు సహకరించండి.’ ఇంక..? ‘టికెట్ లేని ప్రయాణం నేరం. రూ.500 వరకు జరిమానా, జైలు శిక్ష!’ ఇంకా…? గుర్తు శేసుకోండ్రి. ‘మహిళల్ని గౌరవించడం మన సంప్రదాయం.. వారికి కేటాయించిన సీట్లల్లో వాళ్లనే కూర్చోనిద్దాం.!’ అద్గది.. నిజమే కదా? కనీ, కాలం మారినా, బస్సులు పెద్దగ మారలేదు. కనీ, స్లోగన్లు మారినయి. ఇగిప్పుడు గయన్నీ కనిపిత్త లేవు. ఒకేల ఉన్నా, గవాటికి కాలం శెల్లింది. గవాటి తానంల కొత్త నినాదాలొచ్చినయి. గందులోదొకటే… గీ ‘పురుషులను గౌరవిద్దాం. వాళ్ళకి కేటాయించిన సీట్లల్లో వారినే కూర్చోనిద్దాం-టీజీఎస్ఆర్టీసీ.’
ఇగిప్పుడు గా సర్కారోల్లు, ఎర్రబస్సుల్ల ఆడోల్లకు ఉచిత పయాణమంటిరి. గిదీంతోటి బస్సుల్ల టొంబై శాతం గా ఆడోల్లే ఎక్కబట్టిరి. ఐదు, పది శాతం లేని మొగోల్లు నిలబడబట్టిరి. గిదంత పని కాదని ఎవలో గా నినాదాన్ని మార్సి రాసిండ్రు. ఇగిప్పుడు గది నెట్టింట్ల తెగ వైరలైతాంది.
మా నాయిన శెప్తాంటడు. వెన్కటికి వాళ్ళకు సిద్ధం వాసుదేవ్ సారు తెలుగు శెప్తుండేదట. గా సారు ఇప్పటికీ సంపూర్ణ ఆరోగ్యంగనే ఉండు. గా సారు ఓ పాలి క్లాసుల… ‘మహిళల్ని గౌరవించడం మన సంప్రదాయం.. వారికి కేటాయించిన సీట్లల్ల వాళ్లనే కూసోనిద్దాం.!’ అన్నది ఏదో ఓ రోజు పోతదిరా… గదాని తానంల ‘పురుషులను గౌరవిద్దాం. వాళ్ళకి కేటాయించిన సీట్లల్లో వారినే కూర్చోనిద్దాం’ అనేది వత్తదిరా! రాసి పెట్టుకోండ్రి. ఆర్టీసీ బస్సుల్ల రాసి పెడ్తరు సూడుండ్రి.’ అన్నడట. గా ముచ్చటే గిప్పుడు నిజమైందన్నట్లు!?

