తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామానికి వేదిక సిద్ధమవుతోంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కొత్త పార్టీ ప్రకటించబోతున్నట్లు వస్తున్న సమాచారం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ ప్రకటన కేవలం కొత్త పార్టీ ఆవిర్భావం మాత్రమే కాకుండా, ఇప్పటికే క్షీణ స్థితిలో ఉన్న బీఆర్ఎస్పై ఎలాంటి ప్రభావం చూపుతుందన్నది ముఖ్యమైన ప్రశ్నగా నిలిచింది.
కవిత పార్టీ ఏర్పాటు నిర్ణయం రాజకీయంగా చూపే ప్రభావాన్ని అంచనా వేయాలంటే, ప్రస్తుత బీఆర్ఎస్ పరిస్థితిని పరిశీలించాలి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ 39 స్థానాలకు పరిమితమై అధికారాన్ని కోల్పోయింది. ఇది గతంలో వరుసగా రెండు సార్లు అధికారంలో ఉన్న పార్టీకి గట్టి ఎదురుదెబ్బ. ఓటమికి ప్రధాన కారణాలుగా ప్రజలతో దూరం పెరగడం, ప్రభుత్వంపై పెరిగిన అసంతృప్తి, అలాగే ప్రత్యర్థి పార్టీల సమర్థ వ్యూహాలు కూడా పని చేశాయి. ఆతర్వాత పార్లమెంట్, ఎమ్మెల్సీ, ఉప ఎన్నికల్లో పరాజయాల పరంపర ఆ పార్టీ గ్రాఫ్ పడిపోతున్న వైనానికి నిదర్శనాలు.
ఈ నేపథ్యంలో కవిత కొత్త పార్టీ ప్రకటిస్తే, బీఆర్ఎస్పై ఏ విధమైన ప్రభావం ఉండనుంది? ఒకవైపు, బీఆర్ఎస్ పార్టీకి చెందిన సంప్రదాయ ఓటు బ్యాంక్లో విభజన ఏర్పడడుతుంది. బీఆర్ఎస్ లో అంతగా అవకాశాలు, గుర్తింపు రానీ బీసీలు, దళితులు, ఆదివాసీలు వంటి వర్గాలపై దృష్టి పెట్టడం వల్ల, అదే వర్గాలపై ఆధారపడిన బీఆర్ఎస్ ఓట్లలో కనీసం 5% నుండి 10% వరకు చీలిక వచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరోవైపు, కొత్త పార్టీకి అవసరమైన స్థాయి వ్యవస్థ, కేడర్, ఆర్థిక వనరులు సమకూర్చుకోవడం అంత సులభం కాదు. కానీ, కవిత వాటన్నింటి సమకూర్పు తర్వాతే ఈ నిర్ణయం తీసుకుని ఉంటారని భావిస్తున్నారు పరిశీలకులు.
ఇక టీఆర్ఎస్ పేరును తిరిగి తీసుకురావాలన్న ఆలోచన కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. “తెలంగాణ” అనే పదానికి ఉన్న భావోద్వేగ అనుబంధం బీఆర్ఎస్ పార్టీకి ఒకప్పుడు పెద్ద బలంగా నిలిచింది. అదే కారణంగా టీఆర్ఎస్ గా ఉన్న పార్టీని బీఆర్ఎస్గా మారడం వ్యూహాత్మకంగా తప్పిదమైందని ఆపార్టీలోనే మెజార్టీ శ్రేణులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో పాత పేరును పునరుద్ధరించడం ద్వారా కనీసం 3% నుండి 5% వరకు సానుభూతి ఓట్లు తిరిగి పొందవచ్చని అంచనా వేయవచ్చు.
అయితే, బీఆర్ఎస్ ఓటమికి కేవలం పేరు మార్పు మాత్రమే కారణం కాదని గుర్తించాలి. అధికారంలో ఉన్న సమయంలో తీసుకున్న నిర్ణయాలు, నాయకత్వ శైలి, అంతర్గత ప్రజాస్వామ్యం లేకపోవడం వంటి అంశాలు కూడా కీలక పాత్ర పోషించాయి. పార్టీ, ప్రభుత్వ నిర్ణయాలు కొద్ది మందికే పరిమితం కావడం, భిన్నాభిప్రాయాలను ప్రోత్సహించకపోవడం వల్ల స్థానిక నాయకత్వం బలహీనపడింది. దీని ప్రభావం ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది.
కవిత పార్టీ ప్రకటించడం ద్వారా మరో ఆసక్తికర అంశం వెలుగులోకి వస్తోంది. అది కుటుంబ రాజకీయాల పరిమితులు. ఒకే కుటుంబానికి చెందిన నేతలు వేర్వేరు రాజకీయ మార్గాల్లో నడిస్తే, అది ఓటర్లలో గందరగోళాన్ని సృష్టించే అవకాశం ఉంది. అదే సమయంలో, కొత్త పార్టీకి ప్రత్యేక గుర్తింపు తీసుకురావడం కూడా ఒక సవాలే. ప్రస్తుత రాజకీయ వాతావరణంలో ఓటర్లు స్పష్టమైన విధానాలు, నమ్మకమైన నాయకత్వాన్ని కోరుకుంటున్నారన్నది మరచిపోవద్దు.
ఇక ప్రస్తుత ప్రభుత్వ పనితీరుపై కూడా ప్రజల్లో మిశ్రమ స్పందన కనిపిస్తోంది. కొత్త ప్రభుత్వం బాధ్యతలు చేపట్టి కొద్ది కాలమే అయినప్పటికీ, ప్రజలు వేగవంతమైన అభివృద్ధిని ఆశిస్తున్నారు. గత ప్రభుత్వంపై అసంతృప్తి కారణంగా వచ్చిన మార్పు, ఇప్పుడు కొత్త ప్రభుత్వంపై కూడా ఒత్తిడిని పెంచుతోంది. ఈ పరిస్థితుల్లో ప్రతిపక్షంగా బీఆర్ఎస్ తనను తాను పునర్నిర్మించుకోవడం అత్యవసరం. మరి ఆ దిశగా అధినాయకత్వం ఆలోచిస్తుందా? అందరికీ అవకాశాలిస్తుందా? లేక ఇచ్చినట్లు నటిస్తోందా?
కవిత కొత్త పార్టీ ఏర్పాటు రాజకీయ సమీకరణాలను తాత్కాలికంగా ప్రభావితం చేసే అవకాశం ఉన్నప్పటికీ, దీర్ఘకాలంలో అది ఎంతవరకు నిలదొక్కుకుంటుందన్నది అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. బీఆర్ఎస్కు ఇది ఒక హెచ్చరికగా భావించాలి. పార్టీ పునర్వ్యవస్థీకరణ, నాయకత్వ మార్పులు, ప్రజలతో మమేకం వంటి అంశాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.
రాజకీయాల్లో శాశ్వత మిత్రులే కాదు, శాశ్వత శత్రువులు కూడా ఉండరు. చివరకు ప్రజాభిప్రాయం కూడా శాశ్వతంగా ఒకేలా ఉండదు. ఎప్పటికప్పుడు ప్రజాభిప్రాయాన్ని అర్థం చేసుకుని ముందుకు సాగినవారే విజయాన్ని అందుకుంటారు. లేదంటే, ఎంత బలమైన పార్టీ అయినా క్షీణించడానికి ఎక్కువ సమయం పట్టదు!

