హైదరాబాద్ ప్రపంచస్థాయి నగరంగా మరింతగా ఎదగాలంటే కేవలం ఆకాశహర్మ్యాలు, ఐటీ కంపెనీలు, భారీ పెట్టుబడులు మాత్రమే సరిపోవు. పరిశుభ్రమైన వీధులు, నాణ్యమైన ఆహారం, విశ్వసనీయమైన హోటల్ వ్యవస్థ కూడా అంతే అవసరం. ఒక నగరాన్ని అంచనా వేయడంలో అక్కడి ఆహార భద్రత, పరిశుభ్రత కూడా ముఖ్యమైన ప్రమాణాలే.! కఠిన చట్టాలు, నిరంతర తనిఖీలు, పారదర్శక వ్యవస్థ, ప్రజల అప్రమత్తత..ఈ నాలుగు కలిసి పనిచేసినప్పుడే సురక్షితమైన ఆహారం ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి వస్తుంది.
డా. మార్గం-అడుగు, ఎడిటోరియల్
హైదరాబాద్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన మహానగరం. ఐటీ, ఔషధ, సేవారంగాలతో పాటు పర్యాటక రంగంలోనూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ప్రతిరోజూ వేలాది మంది దేశ, విదేశాల పర్యాటకులు, వ్యాపారవేత్తలు, విద్యార్థులు ఈ నగరాన్ని సందర్శిస్తుంటారు. ఇలాంటి మహానగరంలో ఆహార భద్రత అయోమయంగా ఉండటం అత్యంత ఆందోళనకరం. ఇటీవల ఫుడ్ సేఫ్టీ అధికారులు నిర్వహించిన వరుస తనిఖీల్లో వెలుగుచూసిన దృశ్యాలు ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. కుళ్లిపోయిన మాంసం, గడువు ముగిసిన ఆహార పదార్థాలు, అపరిశుభ్రమైన వంటశాలలు, బొద్దింకలు, ఎలుకల సంచారం, పరిశుభ్రతకు పూర్తిగా భిన్నమైన, విరుద్ధమైన పరిస్థితులు బయటపడటం నగర ప్రతిష్ఠకే మచ్చ తెస్తున్నాయి.
గత కొంతకాలంగా తెలంగాణలో ఫుడ్ సేఫ్టీ శాఖ చేపట్టిన తనిఖీల్లో వందలాది హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలు, ఫుడ్ అవుట్లెట్లలో నిబంధనల ఉల్లంఘనలు నమోదయ్యాయి. అనేక సంస్థలకు నోటీసులు జారీ చేయగా, పలు చోట్ల కేసులు నమోదు చేశారు. కొన్ని ప్రముఖ హోటళ్లలో కూడా పరిశుభ్రత ప్రమాణాలు పాటించకపోవడం అధికారులను సైతం విస్మయానికి గురిచేసింది. పేరున్న హోటళ్లలోనే పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే, చిన్న స్థాయి హోటళ్ల పరిస్థితి ఎలా ఉంటుందో అనే సందేహం సహజంగానే కలుగుతోంది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 60 కోట్ల మంది కేవలం కలుషిత ఆహారం వల్ల అనారోగ్యానికి గురవుతున్నారు. 4.2 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. పిల్లలే ఇందులో ఎక్కువగా సమిధలవుతున్నారు. ఆహార భద్రత అనేది కేవలం పరిశుభ్రత సమస్య మాత్రమే కాదు. అది ప్రజారోగ్యానికి, ఆర్థిక వ్యవస్థకు, పర్యాటక రంగానికి నేరుగా సంబంధమున్న కీలకాంశం. అందుకే ఆహార నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదు.
భారతదేశంలో ఆహార భద్రత ప్రమాణాలను అమలు చేయడానికి భారత ఆహార భద్రత మరియు ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) స్పష్టమైన నిబంధనలు రూపొందించింది. ఆహార నిల్వ, తయారీ, వంటశాల పరిశుభ్రత, ఉద్యోగుల ఆరోగ్య పరీక్షలు, గడువు ముగిసిన పదార్థాల వినియోగం వంటి అంశాలపై కఠిన మార్గదర్శకాలు ఉన్నాయి. అయినప్పటికీ లాభాపేక్షతో కొందరు యజమానులు నిబంధనలను ఉల్లంఘించడం ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెడుతోంది.
ప్రజలు హోటల్కు వెళ్లినప్పుడు రుచికరమైన భోజనం మాత్రమే కాక, సురక్షితమైన ఆహారం కూడా ఆశిస్తారు. అయితే కుళ్లిన మాంసం, పాడైన నూనెలు, గడువు ముగిసిన మసాలాలు, అపరిశుభ్రమైన వంటగదుల్లో తయారైన ఆహారం వడ్డించడం క్షమించరాని నేరం. ఇది కేవలం వినియోగదారుల హక్కుల ఉల్లంఘనే కాదు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడటమే.
అధికారులు తనిఖీలు నిర్వహించడం అభినందనీయం. కానీ దాడుల తర్వాత కొద్ది రోజుల హడావుడి, నామమాత్రపు జరిమానాలతో సరిపెట్టడం వల్ల సమస్యకు శాశ్వత పరిష్కారం లభించదు. ఒకసారి తప్పు చేసిన సంస్థ మళ్లీ అదే తప్పు చేస్తే లైసెన్స్ తాత్కాలికంగా నిలిపివేయడం, పునరావృతమైతే శాశ్వతంగా రద్దు చేయడం, జైలు శిక్షలు, భారీ జరిమానాలు వంటి కఠిన చర్యలు అమలు చేయాలి. జరిమానాలు వ్యాపార వ్యయంగా మారిపోకుండా శిక్షలు భయపెట్టేలా ఉండాలి.
హోటల్ యజమానుల బాధ్యత ఎంత ముఖ్యమో, వినియోగదారుల బాధ్యత కూడా అంతే ముఖ్యం. అపరిశుభ్రంగా కనిపించే హోటళ్లను ప్రజలు దూరం పెట్టాలి. బిల్లులు తీసుకోవడం, నాణ్యతలేని ఆహారం కనిపిస్తే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయడం, పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇచ్చే హోటళ్లను ప్రోత్సహించడం వంటి చర్యలు తీసుకోవాలి. ప్రజల అప్రమత్తత కూడా వ్యవస్థను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
హైదరాబాద్ ప్రపంచస్థాయి నగరంగా మరింతగా ఎదగాలంటే కేవలం ఆకాశహర్మ్యాలు, ఐటీ కంపెనీలు, భారీ పెట్టుబడులు మాత్రమే సరిపోవు. పరిశుభ్రమైన వీధులు, నాణ్యమైన ఆహారం, విశ్వసనీయమైన హోటల్ వ్యవస్థ కూడా అంతే అవసరం. విదేశీ పర్యాటకుడు లేదా పెట్టుబడిదారు ఒక నగరాన్ని అంచనా వేయడంలో అక్కడి ఆహార భద్రత, పరిశుభ్రత కూడా ముఖ్యమైన ప్రమాణాలే.
ప్రభుత్వం ఫుడ్ సేఫ్టీ తనిఖీలను నిరంతర ప్రక్రియగా మార్చాలి. ప్రతి హోటల్కు నిర్దిష్ట వ్యవధిలో ఫుడ్ సేఫ్టీ ఆడిట్ నిర్వహించి, ఫలితాలను ప్రజలకు అందుబాటులో ఉంచాలి. నిబంధనలు పాటించే హోటళ్లను ప్రోత్సహిస్తూ, ఉల్లంఘనలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. రాజకీయ, ఆర్థిక ఒత్తిళ్లకు తావులేకుండా చట్టాన్ని సమానంగా అమలు చేయాలి.
ప్రజారోగ్యం కంటే గొప్పది ఏదీ లేదు. ఒక హోటల్ నిర్లక్ష్యం వల్ల వందలాది కుటుంబాలు అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉంది. అందువల్ల ఆహార భద్రత విషయంలో ప్రభుత్వం, అధికారులు, హోటల్ యజమానులు, ప్రజలు కలిసి బాధ్యతాయుతంగా వ్యవహరించినప్పుడే హైదరాబాద్ తన ప్రతిష్ఠను మరింత బలోపేతం చేసుకోగలదు. కఠిన చట్టాలు, నిరంతర తనిఖీలు, పారదర్శక వ్యవస్థ, ప్రజల అప్రమత్తత..ఈ నాలుగు కలిసి పనిచేసినప్పుడే సురక్షితమైన ఆహారం ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి వస్తుంది.

