కరోనా ప్రపంచానికి ఒక పెద్ద పాఠం నేర్పింది. వైరస్లను చిన్నచూపు చూడరాదు. ప్రారంభ దశలోనే కట్టడి చర్యలు తీసుకోకపోతే పరిస్థితి అదుపు తప్పుతుంది. ఎబోలా ప్రస్తుతం ఆఫ్రికా ప్రాంతానికే పరిమితమైనప్పటికీ ప్రపంచీకరణ యుగంలో ఏ వ్యాధి అయినా సరిహద్దులు దాటి విస్తరించడానికి ఎక్కువ సమయం పట్టదు. అందుకే అప్రమత్తత, పారదర్శక సమాచారం, అంతర్జాతీయ సహకారం ఇప్పుడు అత్యవసరం. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు. కానీ నిర్లక్ష్యం మాత్రం ప్రమాదకరం.!
డా. మార్గం-అడుగు, ఎడిటోరియల్
ప్రపంచం కరోనా మహమ్మారి చేదు అనుభవాల నుంచి పూర్తిగా కోలుకోకముందే మరో వైరస్ మళ్లీ అంతర్జాతీయ ఆందోళనకు కారణమవుతోంది. ఆఫ్రికా ఖండంలోని కొన్ని దేశాల్లో వ్యాపిస్తున్న బుండిబుగ్యో ఎబోలా వైరస్ ప్రపంచ ఆరోగ్య వ్యవస్థలను మరోసారి అప్రమత్తం చేసింది. కరోనా లాగా వేగంగా కాకపోయినా, మెల్లగా వ్యాపిస్తూ అనేక దేశాలకు కొత్త తలనొప్పిగా మారుతోంది. ముఖ్యంగా డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఉగాండా, దక్షిణ సూడాన్ ప్రాంతాల్లో ఈ వైరస్ ప్రభావం పెరుగుతుండటంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ దీనిని ‘అంతర్జాతీయ స్థాయిలో ఆందోళనకర ప్రజారోగ్య అత్యవసర పరిస్థితి’గా ప్రకటించింది.
ఎబోలా వైరస్కు నాలుగు ప్రధాన రకాలు మనుషులకు సోకుతాయి. వాటిలో “జైర్” వేరియంట్ అత్యంత ప్రమాదకరమైనదిగా పరిగణిస్తే, ప్రస్తుతం వ్యాపిస్తున్న “బుండిబుగ్యో” వేరియంట్ కొంత నెమ్మదిగా వ్యాప్తి చెందుతున్నప్పటికీ నిర్లక్ష్యం చేయలేనిది. ఈ వైరస్ను మొదట ఉగాండాలోని బుండిబుగ్యో ప్రాంతంలో గుర్తించారు. గతంలో పరిమిత స్థాయిలో మాత్రమే వ్యాప్తి చెందినందున ప్రపంచ దేశాలు దీనిపై పెద్దగా దృష్టి పెట్టలేదు. అయితే ఇప్పుడు పరిస్థితి భిన్నంగా మారింది. ప్రస్తుతం నమోదవుతున్న కేసులు, మరణాలు, సరిహద్దు ప్రాంతాల పరిస్థితులు అంతర్జాతీయ సమాజాన్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి.
ఇప్పటివరకు కాంగోలోనే 867 మందికి పైగా ఈ వైరస్ సోకగా, కనీసం 204 మంది మరణించినట్లు ఆరోగ్య సంస్థలు వెల్లడించాయి. అంటే మరణాల శాతం 23 నుంచి 30 శాతం వరకు ఉందని అంచనా. ఇది 2014 పశ్చిమ ఆఫ్రికా ఎబోలా వ్యాప్తితో పోలిస్తే తక్కువే అయినప్పటికీ ప్రమాదం మాత్రం తగ్గలేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అప్పట్లో జైర్ వేరియంట్ కారణంగా 11,300 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. చరిత్రలోనే అతిపెద్ద ఎబోలా విపత్తుగా అది నిలిచింది.
ప్రస్తుతం ఆందోళన కలిగిస్తున్న ప్రధాన అంశం ఏమిటంటే బుండిబుగ్యో వేరియంట్కు ఇప్పటివరకు నిర్దిష్ట వ్యాక్సిన్ లేకపోవడం. చికిత్స కూడా పూర్తిస్థాయిలో అందుబాటులో లేదు. వ్యాధిని తొలిదశలో గుర్తించడం, బాధితులను వేరుచేయడం, సంపర్కాలను గుర్తించడం మాత్రమే ప్రధాన ఆయుధాలుగా మిగిలాయి. కానీ ఇదే విషయంలో ఆఫ్రికా దేశాలు అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా యుద్ధ ప్రభావిత ప్రాంతాలు, పేదరికం, వైద్య సదుపాయాల కొరత, ప్రయోగశాలల లేమి పరిస్థితిని మరింత క్లిష్టంగా మార్చుతున్నాయి.
కాంగోలోని ఇటూరి ప్రావిన్స్ లో నమోదైన తొలి కేసు ఈ ప్రమాదాన్ని స్పష్టంగా చూపించింది. జ్వరంతో బాధపడుతున్న ఒక ఆరోగ్య కార్యకర్త కొన్ని రోజుల చికిత్స అనంతరం మరణించాడు. అనంతరం అతని మృతదేహాన్ని గ్రామానికి తరలించి సంప్రదాయ పద్ధతిలో అంత్యక్రియలు నిర్వహించారు. మృతదేహాన్ని తాకిన అనేక మందిలో తరువాత ఎబోలా లక్షణాలు బయటపడ్డాయి. ఎబోలా వైరస్ మృతదేహాల ద్వారా కూడా వ్యాపిస్తుందనే విషయం మళ్లీ స్పష్టమైంది.
ఈ వైరస్కు మరో ప్రమాదకర లక్షణం దీని “ఇన్క్యుబేషన్ పీరియడ్”. వైరస్ సోకిన వ్యక్తిలో 2 నుంచి 21 రోజుల వరకు లక్షణాలు కనిపించకపోవచ్చు. ఈ మధ్యకాలంలో బాధితుడు ఇతరులతో కలిసిమెలిసి ఉండటం వల్ల వైరస్ మరింత వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. ఇదే కరోనా సమయంలో ప్రపంచం ఎదుర్కొన్న పెద్ద సమస్య. ఎబోలాలో కూడా అదే ప్రమాదం కనిపిస్తోంది.
ప్రస్తుతం వైరస్ వ్యాప్తి చెందుతున్న ప్రాంతాలు ప్రధానంగా మైనింగ్ కేంద్రాలు కావడం మరింత ఆందోళనకరం. ఈ ప్రాంతాల్లో జనసాంద్రత ఎక్కువగా ఉండటంతో ప్రజల రాకపోకలు అధికంగా ఉంటాయి. 2018లో ఇదే ప్రాంతాల్లో వ్యాపించిన ఎబోలా నియంత్రణకు దాదాపు రెండేళ్లు పట్టింది. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితులు పునరావృతమయ్యే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ప్రపంచ దేశాలు ఇప్పటికే అప్రమత్తమయ్యాయి. భారత ప్రభుత్వం కూడా ఎబోలా ప్రభావిత దేశాలకు అత్యవసరం తప్ప ప్రయాణించవద్దని సూచించింది. కాంగో, ఉగాండా, దక్షిణ సూడాన్ నుంచి వచ్చే ప్రయాణికులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసింది. విమానాశ్రయాల్లో ఆరోగ్య పరీక్షలు, స్క్రీనింగ్ చర్యలు చేపట్టింది. ఇప్పటివరకు భారత్లో ఒక్క కేసు కూడా నమోదుకాలేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసినప్పటికీ ముందస్తు జాగ్రత్తల విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేదని హెచ్చరిస్తోంది.
ఇదే నేపథ్యంలో న్యూఢిల్లీలో జరగాల్సిన నాల్గవ ఇండియా–ఆఫ్రికా ఫోరం సమ్మిట్ను కూడా వాయిదా వేయడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. ఒక వైరస్ వ్యాప్తి కేవలం ఆరోగ్య సమస్యగానే కాకుండా దౌత్య, ఆర్థిక, అంతర్జాతీయ సంబంధాలపైనా ఎంత ప్రభావం చూపుతుందో ఇది సూచిస్తోంది.
కరోనా ప్రపంచానికి ఒక పెద్ద పాఠం నేర్పింది. వైరస్లను చిన్నచూపు చూడరాదు. ప్రారంభ దశలోనే కట్టడి చర్యలు తీసుకోకపోతే పరిస్థితి అదుపు తప్పుతుంది. ఎబోలా ప్రస్తుతం ఆఫ్రికా ప్రాంతానికే పరిమితమైనప్పటికీ ప్రపంచీకరణ యుగంలో ఏ వ్యాధి అయినా సరిహద్దులు దాటి విస్తరించడానికి ఎక్కువ సమయం పట్టదు. అందుకే అప్రమత్తత, పారదర్శక సమాచారం, అంతర్జాతీయ సహకారం ఇప్పుడు అత్యవసరం.
ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు. కానీ నిర్లక్ష్యం మాత్రం ప్రమాదకరం. అధికారిక ఆరోగ్య సంస్థల సూచనలను పాటించడం, అపోహలను నమ్మకపోవడం, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారానే ఇలాంటి ముప్పులను ఎదుర్కోవచ్చు.

