ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య యుద్ధం చమురు సంక్షోభానికి దారి తీస్తున్నది. ఈ యుద్ధం ఇతర గల్ఫ్ దేశాలకు వ్యాపిస్తే మాత్రం ప్రపంచ ఇంధనానికి జీవనాడి హర్మూజ్ జలసంధి మూతపడే ప్రమాదం కనిపిస్తున్నది. కేవలం కొన్ని కిలోమీటర్ల వెడల్పున్న ఈ ప్రదేశం నుంచి ప్రపంచం వాడే చమురులో ఐదో వంతు రవాణా అవుతుంది. అరేబియా మహా సముద్రంలో ఒమన్కు చెందిన ముసాండం ద్వీపకల్పం-ఇరాన్ మధ్య ఉన్న అత్యంత ఇరుకైన జలసంధి ఇది. దీనిలో ఓ చోట అత్యంత ఇరుకుగా కేవలం 33 కిలోవిూటర్లు మాత్రమే ఉంటుంది. ఇరు దేశాలు ఇందులో అత్యధిక భాగం తమదే అని వాదిస్తున్నాయి. దీనిలో రెండు షిప్పింగ్ లేన్లు ఉన్నాయి. ఇందులో చాలా పెద్ద క్రూడ్ క్యారియర్లు సులువుగా ప్రయాణించగలుగుతాయి. ఒమన్ తీరం నుంచి నౌకలు పర్షియన్ గల్ఫ్ లోకి ప్రవేశిస్తాయి. చమురును నింపుకొని ఇరాన్ సవిూపం నుంచి హర్మూజ్ను దాటి బయటకు వస్తాయి.
పశ్చిమాసియాలో ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య సంక్షోభం కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ముడి చమురు ధరలు పెరుగు తున్నాయి. ఈ ప్రభావం భారత్ తో పాటు వివిధ గ్యాస్ కంపెనీలపై ఆర్థికంగా ఒత్తిడి పడుతుంది. ఐఐసీఐ సెక్యూరిటీస్ నివేదిక ప్రకారం ముడి చమురు ధర ప్రస్తుతం బ్యారెల్కు 73 డాలర్ల నుంచి 74 డాలర్ల వరకు ఉన్నది. అదే సమయంలో అప్స్ట్రీమ్ కంపెనీల ఆదాయం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నది. ఇది గ్యాస్ కంపెనీలపై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపే అవకాశాలున్నాయి. ఎల్ఎన్జీ ముడి చమురుకు సంబంధించింది. ముడి చమురు ధర పెరిగితే, ఎల్ఎన్జీ ధర సైతం పెరుగుతుంది. చమురు ధరల్లో ఈ పెరుగుదల ఇప్పటికీ 2025 ఆర్థిక సంవత్సరంలో జరిగిన పెరుగుదల కంటే తక్కువగా ఉంది. ప్రస్తుత పెరుగుదల గత నాలుగు సంవత్సరాల సగటు కంటే చాలా తక్కువ. ప్రస్తుతం, బ్రెంట్ ముడి చమురు ధర బ్యారెల్కు దాదాపు 75 డాలర్లుగా ఉన్నది. ఇది 2026 ఆర్థిక సంవత్సరానికి విశ్లేషకుల అంచనా 68 డాలర్ల కంటే కంటే దాదాపు 6-7 డాలర్లు ఎక్కువ. అయినప్పటికీ, ముడి చమురు ధరలు 2022-25 సగటు కంటే 9డాలర్లు తక్కువగా, 2025 ఆర్థిక సంవత్సరం సగటు కంటే 4డాలర్లు తక్కువగా ఉన్నది. డిమాండ్ లేకపోవడం మార్కెట్ పై ఆధిపత్యం చేస్తుంది.
అయితే, ఇంధన కంపెనీ స్టాక్స్ హెచ్చు తగ్గులను చూస్తున్నాయి. ఇది ప్రపంచ అనిశ్చితిల మధ్య మార్కెట్ ఆందోళనలను ప్రతిబింబిస్తున్నది. హార్ముజ్ జలసంధి ప్రపంచంలోని కీలకమైన సముద్ర మార్గాల్లో ఒకటి. ఇది పర్షియన్ గల్ఫ్, ఒమన్ గల్ఫ్ ను కలుపుతుంది. ప్రపంచంలోని చమురు రవాణాలో ఎక్కువ భాగం ఈ మార్గం గుండా వెళుతుంది. భారతదేశం చమురు దిగుమతుల్లో మూడింట రెండు వంతుల కంటే ఎక్కువ, ఎల్ఎన్జీ దిగుమతుల్లో సగానికిపైగా హార్ముజ్ జలసంధి గుండా వెళతాయి. ఈ మార్గంలో ఏదైనా ఆటంకాలు ఎదురైతే.. భారత్ ఇతర వనరులు, మార్గాల కోసం వెతకాల్సిన అవసరం ఏర్పడుతుంది. భారత్ అవసరాలకు వాడే చమురులో 40 శాతం ఈ మార్గం నుంచే రవాణా అవుతోంది. ఇరాక్, సౌదీ, యూఏఈ, కువైట్, ఖతార్ నుంచి మనం దిగుమతి చేసుకొంటున్నాం. మన దేశం వినియోగించే ఇంధనంలో 90 శాతం వివిధ మార్కెట్ల నుంచి దిగుమతి చేసుకొంటున్నాం. హర్మూజ్ జలసంధి మూసుకుపోతే ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కోవడంతోపాటు రవాణా, బీమా ఖర్చులు గణనీయంగా పెరుగుతాయి. దీంతో దేశీయంగా పెట్రోల్, డీజిల్, ఎల్ఎన్జీ ధరలకు రెక్కలు రావడం ఖాయం. దీంతో భారత ప్రభుత్వ రంగంలోని చమురు సంస్థల ఆర్థిక పరిస్థితి మళ్లీ దారుణంగా మారుతుంది. ఇప్పటికే వివిధ దేశాలతో మనకు ఉన్న చమురు ఒప్పందాలకు తోడు.. మనకు ఉన్న వ్యూహాత్మక నిల్వలు 74 రోజులకు సరిపోతాయి. ఇరాన్ ఎన్నడూ హర్ముజ్ జలసంధిని మూయలేదు. వాస్తవానికి టెహ్రాన్ ఉత్పత్తి చేసే చమురులో 80శాతం చైనా కొనుగోలు చేస్తుంది. హర్మూజ్ను మూస్తే, చైనా ఆర్థిక వ్యవస్థ మరింత దిగజారుతుంది.
గతంలో ఇరాన్-ఇరాక్ యుద్ధం సమయంలో కూడా ఈ జలసంధి తెరిచే ఉంది. 1973లో ఈజిప్ట్-ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో పశ్చిమ దేశాలపై నాడు సౌదీ అరేబియా, దాని మద్దతుదారులు చమురు వ్యాపారం నిలిపేశారు. కాకపోతే ఇప్పుడు అలాంటి నిర్ణయాలు పెద్దగా ప్రభావం చూపకపోవచ్చు. కొంతకాలం కిందటి వరకు అమెరికా అత్యధికంగా ఇంధనం దిగుమతి చేసుకొనేది. ఇప్పుడు అది కూడా భారీ ఎత్తున చమురును ఎగుమతి చేస్తోంది. ఈ మార్గం నుంచి నిత్యం 2 కోట్ల పీపాల చమురు వివిధ దేశాలకు వెళుతుంది. ఇది మొత్తం ప్రపంచం వినియోగించే దానిలో ఐదో వంతుకు సమానం. సౌదీ, ఇరాన్, యూఏఈ, కువైట్, ఇరాక్ల నుంచి ఎగుమతి అవుతోంది.
ఇక లిక్విడ్ నేచురల్ గ్యాస్ రవాణాకు కూడా అత్యంత కీలకం. మూడింట ఒక వంతు ఎల్ఎన్జీ కూడా ఇక్కడి నుంచే వివిధ దేశాలకు చేరుతుంది. దీనిలో అత్యధికం ఖతార్ ఎగుమతి చేస్తుంది. ఈ జలసంధిలో ఏర్పడే ఏ అంతరాయమైనా ప్రపంచ వాణిజ్యాన్ని గజగజ వణికిస్తోంది. దీన్ని గుర్తించిన అమెరికా బహ్రెయిన్లో తన ఫిఫ్త్ ప్లీట్ స్థావరాన్ని ఏర్పాటు చేసుకొంది. ఇక ఈ మార్గం నుంచి వచ్చే చమురు, ఎల్ఎన్జీ అత్యధికంగా భారత్, చైనా, దక్షిణ కొరియా, జపాన్ దేశాలకు ఎగుమతి అవుతోంది. 1980-88 వరకు జరిగిన ఇరాన్-ఇరాక్ యుద్ధం ప్రభావం జలసంధిపై పడింది. నాడు ఇరు దేశాలు పరస్పర ఎగుమతులను దెబ్బతీసేందుకు ట్యాంకర్లపై దాడులు చేసుకొన్నాయి. అందుకే దీన్ని ‘ట్యాంకర్ వార్’ అని కూడా అంటారు. ఆ సమయంలో వివిధ దేశాల పతాకాలపై ప్రయాణించిన దాదాపు 450కు పైగా నౌకలపై ఇరు దేశాలు దాడులు చేశాయి. తాజా యుద్ధం వల్ల ఈ జలసంధి మూసేస్తే పరిస్థితి దారుణంగా ఉండనుంది. ప్రధానంగా భారత్పై తీవ్ర ప్రభావం పడనుంది.

