ఇంతటి విపత్తు నుంచి భారత్ పాఠాలు నేర్చుకోవాలి. హిమాలయాల్లో విచ్చలవిడిగా రహదారులు, హైడ్రోపవర్ ప్రాజెక్టులు, పర్యాటక నిర్మాణాలు చేపడుతూ పర్వతాల సహజ సమతౌల్యాన్ని దెబ్బతీస్తే ప్రమాదాల సంఖ్యేకాదు, వాటి తీవ్రతా పెరుగుతుంది. వాతావరణ మార్పుతో హిమానీనదాల కరుగుదల, పర్వత వాలుల అస్థిరత, హిమానీ సరస్సుల విస్తరణ వంటి ప్రమాదాలు పెరుగుతున్నాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
ప్రకృతి వైపరీత్యాలను పూర్తిగా ఆపడం మనకు సాధ్యం కాకపోవచ్చు. కానీ వాటి నష్టాన్ని తగ్గించడం మాత్రం మన చేతుల్లోనే ఉంది. ఉపగ్రహ నిఘా, నదీ సెన్సర్లు, రియల్టైమ్ హెచ్చరికలు, సరిహద్దు దేశాల మధ్య సమాచార భాగస్వామ్యం, ప్రమాద ప్రాంతాల్లో నిర్మాణాలపై కఠిన నియంత్రణ, స్థానిక ప్రజలకు ముందస్తు శిక్షణ ఇవన్నీ ఇక ఐచ్ఛికాలు కావు. భోటే కోషి విలయం ఒక విషాద గాథ మాత్రమే కాదు. హిమాలయాలను ఎలా అభివృద్ధి చేయాలి?, ప్రకృతితో ఎంతమేరకు జోక్యం చేసుకోవాలి? అనే ప్రశ్నలకు ఇచ్చిన ఘోరమైన హెచ్చరిక. ప్రకృతిని జయించాలనే అహంకారానికి బదులు, మానవులు ప్రకృతితో సహజీవనం చేయడం నేర్చుకోవాలి.
డా. మార్గం-అడుగు, ఎడిటోరియల్
నేపాల్లోని భోటే కోషి, త్రిశూలి నదీ పరివాహక ప్రాంతాలను ఆగస్టు 26న ముంచెత్తిన ఆకస్మిక వరద హిమాలయాల సున్నితత్వాన్ని మరోసారి ప్రపంచం ముందుంచింది. కొద్ది నిమిషాల్లోనే గ్రామాలు, మార్కెట్లు, రహదారులు, వంతెనలు, వాహనాలు, విద్యుత్ మౌలిక సదుపాయాలు వరద ప్రవాహంలో కలిసిపోయాయి. ఇది సాధారణ వర్షాకాల వరద కాదు. మంచు, రాళ్ల చరియలు, నదీ ప్రవాహం, భౌగోళిక అస్థిరత కలిసి సృష్టించిన ఒక సంక్లిష్ట విపత్తు. ప్రకృతి ప్రకోపం.
మృతులు, గల్లంతైన వారి సంఖ్యపై అధికారిక లెక్కలు గంట గంటకూ పెరుతున్నాయి. ఆగస్టు 27న అందుబాటులో ఉన్న తాజా అంతర్జాతీయ నివేదికల ప్రకారం నేపాల్, టిబెట్ లల్లో కలిపి 359 మందికిపైగా మరణించగా, వెయ్యి మందికి పైగా గల్లంతయ్యారు. నేపాల్లోనే వందలాది మంది గల్లంతైనట్లు అధికారులు చెబుతున్నారు. గల్లంతైన వారిలో విదేశీ పర్యాటకులు, యాత్రికులు, స్థానికులు, భద్రతా సిబ్బంది ఉన్నారు. భారత్కు చెందిన పలువురు కైలాస మానస సరోవర్ యాత్రికులు కూడా ఆచూకీ లేకుండా పోయారు.
ఈ విపత్తు వెనుక కారణంపై తొలుత భూకంపం, భారీ వర్షం వంటి అనుమానాలు వ్యక్తమయ్యాయి. బుధవారం ఉదయం 8.37 గంటలకు 4.4 తీవ్రతతో ప్రకంపనలు నమోదయ్యాయి. అయితే తర్వాతి విశ్లేషణలు అసలు కారణాన్ని మరింత స్పష్టంచేశాయి. మంచు, రాళ్ల భారీ చరియలు నదీ ప్రవాహాన్ని అడ్డుకోవడం, తాత్కాలిక సరస్సు ఏర్పడటం, ఆ అడ్డంకి ఒక్కసారిగా తెగిపోవడం వల్ల విపరీతమైన నీటి ప్రవాహం కిందికి దూసుకొచ్చినట్లు ప్రాథమిక సాంకేతిక అధ్యయనాలు సూచిస్తున్నాయి. యుఎస్జీఎస్ సహా శాస్త్రీయ సంస్థల పరిశీలనల్లో హిమాలయాల్లోని అస్థిరత కీలక అంశంగా కనిపిస్తోంది.
వరద వేగం ఎంత భయంకరంగా ఉందో గణాంకాలే చెబుతున్నాయి. ఐసీఐఎంఓడీ పరిశీలన ప్రకారం గల్చీ వద్ద త్రిశూలి నది నీటిమట్టం కేవలం 30 నిమిషాల్లో 9 మీటర్లు పెరిగింది. మాలేఖు వద్ద అదే సమయంలో నీటిమట్టం 7 మీటర్లు ఎగసింది. ఇలాంటి వేగంతో వచ్చే వరదకు సంప్రదాయ హెచ్చరిక వ్యవస్థలు పనిచేయడానికి సమయం ఉండే అవకాశమే లేదు.
విపత్తు తర్వాతి దృశ్యాలు మరింత విషాదకరం. ఒకప్పుడు ఇళ్లు, దుకాణాలు, మార్కెట్లతో సందడిగా ఉన్న ప్రాంతాలు ఇప్పుడు బురద, రాళ్లు, శిథిలాల కుప్పలుగా మారాయి. రహదారులు, వంతెనలు తెగిపోవడంతో సహాయక బృందాల రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. నేపాల్ విద్యుత్ రంగానికీ భారీ దెబ్బ తగిలింది. 430 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యానికి సంబంధించిన హైడ్రోపవర్, సోలార్, ప్రసార, పంపిణీ సదుపాయాలు దెబ్బతిన్నట్లు నివేదికలు చెబుతున్నాయి.
ఇక్కడ మరో కీలక ప్రశ్న సమాచార మార్పిడి. టిబెట్ నుంచి నేపాల్లోకి ప్రవహించే నదుల విషయంలో సరిహద్దు దాటి వచ్చే ప్రమాదాలపై ముందస్తు హెచ్చరిక వ్యవస్థ ఎంత బలంగా ఉందన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది. అయితే దీనిని కేవలం చైనా వైఫల్యంగా చూడటం కంటే, ఇలాంటి విపత్తులను ఎదుర్కొనే సంస్థాగత, శాస్త్రీయ, అంతర్జాతీయ సమాచార వ్యవస్థల లోపాన్ని పరిశీలించాలి. ఇదే నేపథ్యంలో నేపాల్, చైనా మధ్య వాతావరణ సమాచారాన్ని తక్షణం పంచుకునే ఒప్పందం కుదిరింది.
ఇంతటి విపత్తు నుంచి భారత్ కూడా పాఠాలు నేర్చుకోవాలి. హిమాలయ ప్రాంతాల్లో విచ్చలవిడిగా రహదారులు, హైడ్రోపవర్ ప్రాజెక్టులు, పర్యాటక నిర్మాణాలు చేపడుతూ పర్వతాల సహజ సమతౌల్యాన్ని దెబ్బతీస్తే ప్రమాదాల సంఖ్యేకాదు, వాటి తీవ్రతా పెరుగుతుంది. వాతావరణ మార్పుతో హిమానీనదాల కరుగుదల, పర్వత వాలుల అస్థిరత, హిమానీ సరస్సుల విస్తరణ వంటి ప్రమాదాలు పెరుగుతున్నాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
ప్రకృతి వైపరీత్యాలను పూర్తిగా ఆపడం మనకు సాధ్యం కాకపోవచ్చు. కానీ వాటి నష్టాన్ని తగ్గించడం మాత్రం మన చేతుల్లోనే ఉంది. ఉపగ్రహ నిఘా, నదీ సెన్సర్లు, రియల్టైమ్ హెచ్చరికలు, సరిహద్దు దేశాల మధ్య సమాచార భాగస్వామ్యం, ప్రమాద ప్రాంతాల్లో నిర్మాణాలపై కఠిన నియంత్రణ, స్థానిక ప్రజలకు ముందస్తు శిక్షణ ఇవన్నీ ఇక ఐచ్ఛికాలు కావు. భోటే కోషి విలయం ఒక విషాద గాథ మాత్రమే కాదు. హిమాలయాలను ఎలా అభివృద్ధి చేయాలి?, ప్రకృతితో ఎంతమేరకు జోక్యం చేసుకోవాలి? అనే ప్రశ్నలకు ఇచ్చిన ఘోరమైన హెచ్చరిక. ప్రకృతిని జయించాలనే అహంకారానికి బదులు, మానవులు ప్రకృతితో సహజీవనం చేయడం నేర్చుకోవాలి.

