దేశ భద్రతను సవాలు చేస్తున్న ఉగ్రవాద శక్తులను సమూలంగా తుడిచి పెట్టకపోతే, అవి మరింత పెచ్చరిల్లే ప్రమాదం ఉంది. ఢిల్లీలోని ఎర్రకోట పేలుడు ఘటన, ఫరీదాబాద్లో ఉగ్రసామగ్రి స్వాధీనం వంటి సంఘటనలు దేశమంతటా ఆందోళన కలిగిస్తున్నాయి. పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు మన దేశపు యువతను, చదువుకున్న వర్గాలను సైతం తమ వలలో వేసుకుని, మన వేళ్ళతో మన కళ్ళనే పొడిచిన విధంగా ఉగ్రదాడులకు తెగబడటం అత్యంత భయంకరంగా ఉంది. దేశంలోనే అంతర్గతంగా ఉగ్రశిక్షణనిస్తున్న, ఉగ్రవాదులుగా తయారవుతున్న వాళ్ళపై దృష్టి పెట్టి, గుట్టుమట్లు విప్పి పెట్టి, మట్టు పెట్టాల్సిందే! దేశ సార్వభౌమత్వాన్ని రక్షించడం మన అందరి సమిష్టి బాధ్యత. తక్షణ కర్తవ్యం.
మార్గం-అడుగు, డా.మార్గం లక్ష్మీనారాయణ ఎడిటోరియల్
దేశ భద్రతను సవాలు చేస్తున్న ఉగ్రవాద శక్తులను సమూలంగా తుడిచి పెట్టకపోతే, అవి మరింత పెచ్చరిల్లే ప్రమాదం ఉంది. ఢిల్లీలోని ఎర్రకోట పేలుడు ఘటన, ఫరీదాబాద్లో ఉగ్రసామగ్రి స్వాధీనం వంటి సంఘటనలు దేశమంతటా ఆందోళన కలిగిస్తున్నాయి. పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు మన దేశపు యువతను, చదువుకున్న వర్గాలను సైతం తమ వలలో వేసుకుని, మన వేళ్ళతో మన కళ్ళనే పొడిచిన విధంగా ఉగ్రదాడులకు తెగబడటం అత్యంత భయంకరంగా ఉంది.
ఇంతకాలం పాకిస్తాన్ ఉగ్రవాదులు సరిహద్దులు దాటి మన దేశంలోకి ప్రవేశించి దాడులు చేస్తూ ఉండేవారు. తాజాగా మనవాళ్ళకే ఉగ్రవాద శిక్షణనిచ్చి, మనపైకే ఎగదోసి, మానవబాంబులై మన వాళ్ళనే హంతమొందిస్తున్నట్లుగా తాజా ఢిల్లీ పేలుళ్ళ ఘటన తేల్చేసింది. ఇది కేవలం మన భద్రతను మాత్రమేగాక, మన సామాజిక, మానసిక జీవనాన్ని ప్రభావితం చేస్తోంది. దేశంలోనే అంతర్గతంగా ఉగ్రశిక్షణనిస్తున్న, ఉగ్రవాదులుగా తయారవుతున్న వాళ్ళపై ప్రత్యేక దృష్టి పెట్టి, గుట్టుమట్లు విప్పి పెట్టి, వాళ్ళని మట్టు పెట్టాల్సిందే.
పాక్లో ఉన్న మసూద్ అజర్ అనే ఉగ్రవాది జైషే మహమ్మద్ అనే సంస్థను స్థాపించి భారత్పై ఉగ్రదాడులు చేయించాడు. 2001లో పార్లమెంట్ పై దాడి, 2019లో పుల్వామా ఘటనకు కూడా అతడే కారణం. ఇప్పుడతని సోదరి సదియా కూడా మహిళా విభాగాన్ని నెలకొల్పి, మహిళలను ఉగ్రవాద కార్యకలాపాలకు ప్రేరేపిస్తున్నట్లు సమాచారం. ఢిల్లీలో పట్టుబడిన మహిళా వైద్యురాలు ఈ కుట్రలో భాగమని హోంశాఖ వర్గాలు వెల్లడించాయి. ఒకవైపు వైద్య సేవల ద్వారా ప్రాణాలు కాపాడాల్సిన డాక్టర్లు, ఇలాంటి ప్రాణాలు తీసే, విధ్వంసక రక్తపాత కార్యక్రమాల్లో పాల్గొనడం దేశానికి హానికరం.
ఈ నేపథ్యంలో ఆపరేషన్ కగార్లాంటి భారీ శోధనను అంతర్గతంగా చేపట్టాలి. ఇల్లిల్లూ జల్లెడపట్టి గాలించి, ప్రతి అనుమానాస్పద వ్యక్తిని విచారించాలి. ఉగ్రవాద మూలాల తుడిచివేతకు గూఢచార వ్యవస్థను మరింత బలోపేతం చేయాలి. సరిహద్దుల్లోని చొరబాట్లను అడ్డుకోవడమే కాకుండా దేశంలోపల పాకిస్తాన్ మద్దతుతో పనిచేస్తున్న నెట్వర్క్ లను పూర్తిగా ధ్వంసం చేయాలి.
ఫరీదాబాద్ లో 2,900 కిలోల పేలుడు పదార్థం, రైఫిళ్లు, పిస్టళ్లు స్వాధీనం కావడం దేశానికి పొంచి ఉన్న ఉగ్ర ముప్పు గుట్టు విప్పింది. ఈ ఘటనల వెనుక జైషే మహమ్మద్, అన్సర్ ఘజ్వవత్ ఉల్ హింద్ సంస్థల ప్రమేయం ఉన్నట్లు తేలింది. ఈ సంస్థలు పాక్లో ఉన్నప్పటికీ, భారత్లో వాటి కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. ఇస్లామిక్ టెర్రరిజం పేరుతో మతాన్ని వక్రీకరించి విధ్వంసకారక మార్గంలో నడిపిస్తున్నారు. ఇలాంటి వారిని ఏ కలుగుల్లో ఉన్నా పట్టి, ప్రత్యేక కోర్టుల ద్వారా తక్షణ శిక్షలు అమలు చేయాలి.
పహల్గాం హత్యాకాండ తర్వాత భారత సైన్యం పాక్పై దాడి చేసి ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసినా, పాక్ ప్రవర్తనలో మార్పు రాలేదు. సరికదా, వారు మరింత రెచ్చిపోయి దేశ వ్యతిరేక చర్యలను కొనసాగిస్తున్నారు. తాజాగా ఢిల్లీ ఎర్రకోట ఘటనే దీనికి నిదర్శనం. సాయంత్రం చోటుచేసుకున్న పేలుడు ఘటనకు కొద్ది గంటల ముందే ఫరీదాబాద్లో ఉగ్రవాద సామగ్రి పట్టుబడడం యాదృచ్ఛికం కాదు. ఇది పాక్ పన్నాగమేనని స్పష్టమవుతోంది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇప్పటికే అత్యవసర సమీక్షలు నిర్వహించి ఉగ్రవాదులపై కఠిన చర్యలకు హెచ్చరించారు. భూటాన్ పర్యటనలో ఉన్న మోదీ “ఈ ఘటన వెనుక ఎవరున్నా వదిలిపెట్టం” అని ప్రకటించడం, ప్రజల్లో విశ్వాసాన్ని పెంచింది. కానీ ప్రజలు కోరుకుంటున్నది కేవలం హెచ్చరికలకే పరిమితం కాకుండా శాశ్వత పరిష్కారం.
ఉగ్రవాదంపై యుద్ధం తాత్కాలికం కాదు. ఇది నిరంతర కర్తవ్యం. దేశంలోని ప్రతి పౌరుడు అప్రమత్తంగా ఉండాలి. ప్రభుత్వ యంత్రాంగం నుంచి సాధారణ ప్రజల దాకా అందరూ ఉగ్రవాద వ్యతిరేక శక్తులుగా మారాలి. పాక్పై మరలా కఠిన వైఖరిని అవలంబించకపోతే ఇటువంటి దాడులు మళ్లీ మళ్లీ జరుగుతాయి. భారత్తో పెట్టుకోవడానికి ఉగ్రవాదులకు ఉచ్చపడాలి.
దేశ భద్రత, ప్రజల ప్రాణాలు రాజకీయాల కంటే ముఖ్యమైనవి. ఈ దేశ గడ్డపై ఉగ్రవాదం మూలం మిగలకుండా అంతమొందించాల్సిందే. ఇస్లామిక్ తీవ్రవాదంపై ప్రత్యేక దృష్టి సారించి, దేశ సార్వభౌమత్వాన్ని రక్షించడం మన అందరి సమిష్టి బాధ్యత. తక్షణ కర్తవ్యం.

