సమీక్షించిన ఎమ్మెల్యే యశస్విని
వల్మీడి జాతర ఏర్పాట్లు పకడ్బందీగా జరగాలని, భక్తులు సంతృప్తిగా శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకునేలా చర్యలు తీసుకోవాలని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఆదేశించారు. జనగామ జిల్లా పాలకుర్తి మండలం, వల్మీడి లో ప్రతి ఏటా శ్రీరామనవమి సందర్భంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే శ్రీ సీతారామచంద్ర స్వామి వారి జాతర బ్రహ్మోత్సవాలపై అన్ని శాఖల అధికారులతో దేవస్థాన ప్రాంగణంలో ఆర్డీఓ డి.ఎస్ వెంకన్న, డిపిఓ నాగపురి స్వరూప తో కలిసి సమీక్ష నిర్వహించారు.
2025 ఏప్రిల్ 2 నుండి 12వ తేదీ వరకు నిర్వహించనున్న వల్మీడి జాతర లో 6వ తేదీన నిర్వహించనున్న శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణోత్సవం ఒక్కరోజే 50 వేల మంది భక్తులు సందర్శించుకునే ఈ జాతరకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పక్కగా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. వల్మీడి జాతర పనుల పురోగతి గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎటువంటి ఆటంకం కలగకుండా జాతర ఏర్పాట్లు చేయలన్నారు. జాతర 10 రోజుల పాటు జరుగుతుందని, ఈ జాతరకు జనగామ జిల్లా భారీ ఎత్తున భక్తులు తరలి వస్తారని ఆమె తెలిపారు.
అదనపు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేసి, ఎలాంటి అంతరాయాలు లేని నిరంతర విద్యుత్, మిషన్ భగీరథ కు తోడుగా అదనపు ట్యాంకర్లు, బోరు బావులకు జనరేటర్లు అమర్చి ఆటంకాలు లేని విధంగా నీటి సరఫరా జరిగే విధంగా చూడాలని ఎమ్మెల్యే ఆదేశించారు. వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో అంబులెన్స్ సహా ఫైర్ ఇంజన్ వంటి సదుపాయాలను అందుబాటులో ఉంచాలి. రోడ్ల మరమ్మతులు, రోడ్లకు ఇరువైపులా పెరిగిన చెట్ల కొమ్మల నరికివేత, లైటింగ్ అండ్ డెకరేషన్, పారిశుధ్యం, ప్రచారం, సీసీ కెమెరాలు ఏర్పాటు, పనిచేయడానికి వచ్చే సిబ్బందికి భోజనం వసతులు, వీఐపీలకు ప్రత్యేక ఏర్పాట్లు, శాంతి భద్రతల పరిరక్షణకు అవసరమైన సిబ్బంది ఏర్పాటు వంటి అనేక అంశాలపై ఎమ్మెల్యే యశస్విని రెడ్డి సంబంధిత అధికారులకు తగు సూచనలు చేశారు.
ఈ కార్యక్రమంలో డీపీఓ నాగపూరి స్వరూప, ఆర్డీఓ డి ఎస్ వెంకన్న, సీఐ మహేందర్ రెడ్డి, ఎమ్మార్వో శ్రీనివాస్, ఈఓ మోహన్ బాబు, ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

