పాలకుర్తి సోమన్నకు ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు
పెద్ద వంగర మండలం, పోచారంలో ఇందిరమ్మ ఇండ్లకు, రాయపర్తి మండలం కొండూరులో బీటీ రోడ్ పనులకు శంకుస్థాపన
రాయపర్తి మండలం కేశవపురంలో పల్లె దవాఖాన ప్రారంభం
పాలకుర్తి శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహ స్వామి వారికి పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పూజారుల పూర్ణకుంభ స్వాగతం పలికి, స్వామి వారి శేష వస్త్రాలతో సత్కరించి ఆశీర్వదించారు.

పాలకుర్తి నియోజకవర్గ పరిధిలో పెద్దవంగర, రాయపర్తి, తొర్రూరు మండలాల్లో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి తో కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. పెద్దవంగర మండలం పోచారం గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమిపూజ చేసి, అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ…. ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు అందించడమే మా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆధునిక వసతులతో కూడిన గృహ నిర్మాణానికి ఈ ఇండ్లు బలమైన పునాది కానుందని తెలిపారు.

ఇక రాయపర్తి మండలం కొండూరులో కొండూరు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నుండి మైలారం వరకు కోటి రూపాయల అంచనా వ్యయంతో నిర్మించనున్న బీటీ రహదారి పనులకు ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…. రహదారులు మెరుగుపడితే గ్రామస్తుల జీవన ప్రమాణాలు కూడా మెరుగవుతాయన్నారు. కాంట్రాక్టర్లు నాణ్యత ప్రమాణాలను పాటించాలని సూచించారు.

ఆ తరువాత రాయపర్తి మండలం, కేశవపురం గ్రామంలో రూ. 20 లక్షల వ్యయంతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాన్ని (పల్లె దవాఖాన) ప్రారంభించి, గ్రామ ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని, వైద్యులు ఎప్పుడూ అందుబాటులో ఉండాలని సూచించారు. అభివృద్ధి లక్ష్యంగా ప్రజల సంక్షేమానికి కృషి చేస్తామని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి పేర్కొన్నారు.ఆయా కార్యక్రమాల్లో అధికారులు, బ్లాక్ అధ్యక్షులు, మండల అధ్యక్షులు, మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

