భారత రాజకీయాల్లో ఒక వ్యక్తి నాయకత్వాన్ని కేవలం పదవులు, పాత్రలు, వంశపారంపర్యం మాత్రమే నిర్ణయించవు. ప్రజలతో కలిసిపోయే సామర్థ్యం, స్ఫూర్తినిచ్చే ప్రసంగశైలి, రాజకీయ వ్యూహాలు, సంక్షోభ నిర్వహణ, వ్యక్తిత్వ ఆకర్షణ, ప్రజాకర్షణ వంటి పలు అంశాలు నాయకుడి విలువను నిర్ధారిస్తాయి. ఈ నేపథ్యంలో, భారత జాతీయ కాంగ్రెస్లో అగ్రనాయకత్వంలో, అన్నా చెల్లెళ్ళుగా, రాహుల్, ప్రియాంకలు ఇద్దరూ ప్రత్యేక స్థానం కలిగి ఉన్నప్పటికీ, “ఎవరు మెరుగు?” అనే ప్రశ్న రాజకీయ చర్చల్లో తరచూ వినిపిస్తుంటుంది.
రాహుల్ పార్టీ అధ్యక్షుడిగా, లోక్సభ సభ్యుడిగా, పలు ఆందోళనలకు నాయకత్వం వహించిన నేతగా, అనేక ఎన్నికల ప్రచారాల్లో ప్రధాన పాత్ర వహించాడు. అతనిది సాత్విక నాయకత్వ శైలి. విలువలతో కూడిన రాజకీయం. సామాజిక న్యాయం, ప్రజాస్వామ్యం, నిరుద్యోగం, రైతుల సమస్యలు, మహిళా భద్రత వంటి అంశాలపై ఆయన నిరంతరం మాట్లాడుతూనే ఉన్నాడు. ‘భారత జోడో యాత్ర’ వంటి ఉద్యమాలు ఆయనను ప్రజలకు దగ్గర చేశాయి. ఇవన్నీ ఆయన వ్యక్తిత్వాన్ని, నిశ్చితత్వాన్ని, క్రమశిక్షణను, ప్రజలతో మమేకమయ్యే ధోరణిని ప్రతిఫలించాయి. అయితే, పార్టీపై పూర్తిస్థాయి పట్టు, ఎన్నికల్లో విజయాలను సాధించడంలో విఫలం అవుతున్నారనే విమర్శలున్నాయి. అతని ప్రసంగాల్లో, రాజకీయ ప్రతిదాడుల్లో దూకుడు లోపిస్తుందని ఆయన ప్రత్యర్థులే కాదు ఆయన మిత్రులు కూడా విమర్శిస్తారు.
ఇక ప్రియాంక రాజకీయాల్లో ఎక్కువ కాలం క్రియాశీలకంగా లేకపోయినా, ఆమె తెరమీద కనిపించిన అతి తక్కువ సమయాల్లోనూ ఎంతో ఆకర్షణ పొందింది. దూకుడున్న ఆమె ప్రసంగశైలి, నేరుగా ప్రజలతో మాట్లాడే ధోరణి, చురుకుదనం, ధైర్యంతో ఆమె ప్రజల్నే కాకుండా, రాజకీయ నేతలను ఆకట్టుకున్నారు. ఆమెను తరచూ ఆమె నానమ్మ ఇందిరా గాంధీతో పోల్చడం కూడా ఆమె జనాభిమానానికి ఉదాహరణ. మహిళా ఓటర్లు, యువతలో ఆమె ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. కానీ, ఆమె నాయకత్వ ప్రభావాన్ని పూర్తిగా అంచనా వేసేందుకు తగినంత ఎన్నికల నిర్వహణ అనుభవం ఇంకా వెలుగులోకి రాలేదు. ఉత్తర ప్రదేశ్ వంటి రాష్ట్రాల స్థాయి ఎన్నికల్లో ఆమె ప్రచారం చేసినా, ఆశించిన విజయాలు లేకపోవడం ఆమె లోపాలుగా విమర్శకులు చర్చిస్తూ ఉంటారు.
గత రెండు మూడు రోజులుగా లోక్సభలో జరిగిన చర్చలు రాహుల్, ప్రియాంకల నాయకత్వ సామర్థ్యాలపై మరోసారి చర్చకు దారి తీశాయి. రాహుల్ తన అపరిపక్వతను మరోమారు బయట పెట్టుకున్నారనే విమర్శలు వస్తున్నాయి. అదే సమయంలో ప్రియాంక మాత్రం పరిణతి చెందిన రాజకీయ నేతగా రాణించారనే పొగడ్తలు వచ్చాయి. వందేమాతరంపై చర్చలో ప్రియాంక దాదాపు మోదీని అడ్డుకున్నారు. నెహ్రూ ద్రోహం గురించి మోదీ మాట్లాడిన సందర్భంలో ఆమె గట్టిగానే ఎదుర్కొన్నారు. ఇవాళ జరుగుతున్న అభివృద్దికి అంతా నెహ్రూ వేసిన పునాదేనని ఘాటుగా చెప్పగలిగారు. వందేమాతరం ప్రస్థావన ద్వారా నెహ్రూను ఎండగట్టాలన్న తీరును కూడా తప్పు పట్టారు. ఒకవేళ నెహ్రూ గురించే అయితే, ఓ రోజంతా చర్చిద్దామని, తిరిగి మళ్లీ నెహ్రూ జోలికి వెళ్లవద్దని హెచ్చరించారు. ప్రియాంక మాట్లాడిన తీరు పరిణతి చెందిన రాజకీయ నేతగా కనిపించింది. సమస్యలను లోతుగా ఎత్తిచూపి మాట్లాడే సత్తా ఉన్న నేతగా అనిపించారు. రాహుల్తో పోలిస్తే ఆమె చాలా మెరుగైన నాయకత్వ లక్షణాలను కనబర్చారు. రాజకీయంగా మోదీని లేదా బీజేపీని ఎదుర్కొనే విషయంలో ఆమె సందర్భోచితంగా మాట్లాడగలుగుతున్నారు.
అదే రాహుల్, ఓట్ చోరీని ఆధారాలతో నిరూపించలేకపోయారు. బీహార్లో వ్యూహాత్మకంగా ఓట్ చోరీని చేపట్టి, బొక్కబోర్లా పడ్డారు. అయినా ఆయన అదే నినాదంతో ముందుకుపోతున్నారు. అయితే సహేతుకంగా నిరూపించి ప్రభుత్వాన్ని నిలదీయాలి. లేదా అందుకు తగిన విధంగా ప్రజా మద్దుతునైనా కూడగట్టాగలగాలి. ఆ రెండు ఆయన చేయలేకపోతున్నారు. తాజాగా పార్లమెంటులో మంగళవారం సర్ ప్రక్రియపై రాహుల్ మాటలు పేలవంగా ఉన్నాయి. ప్రజలను ఆకట్టుకునేలా ప్రసంగం లేదు. ప్రభుత్వ తప్పులను ఎత్తిచూపే విధంగానూ లేదు.
ప్రియాంక మాట్లాడిన తీరు విభిన్నం. ఆమె ప్రశ్నలు, విమర్శలు సందర్భానుసారంగా ఉండటం మాత్రమే కాదు, సమస్యలను లోతుగా అర్థం చేసుకున్న నాయకురాలిగా ఆమెను నిలబెట్టాయి. రాహుల్తో పోలిస్తే ఆమె స్పష్టతతో కూడిన వాక్చాతుర్యం, రాజకీయ గంభీరత చాలా మెరుగ్గా కనిపించాయి. కాంగ్రెస్ పార్టీ పునరుజ్జీవనానికి ప్రజలు ఆశించే నూతన నాయకత్వ లక్షణాలు ప్రియాంకలో కనిపిస్తున్నాయి. ప్రియాంకలో ఆమె ఆకర్షణీయమైన వ్యక్తిత్వం, సందర్భోచిత రాజకీయ దూకుడు, రాహుల్ లో ఆయన లోతైన ఆలోచనా విధానం, ప్రజాస్వామ్య విలువలపట్ల నిబద్ధత, నిరంతర కార్యాచరణలు మెరుగైన అంశాలు. అయితే, నాయకత్వ పరంగా ఎవరి శైలి వారిది. ఎవరి ప్రత్యేకతలు వారివే.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్, ప్రియాంకను ముందుకు తేవడం, ఆమెకు చర్చలు, ప్రజా వేదికల్లో అవకాశాలు ఇవ్వడం పార్టీకి కొత్త దిశ చూపించే అవకాశం ఉంది. కాంగ్రెస్కు ప్రజల్లో కొత్త నమ్మకం కల్పించగల నాయకత్వం ప్రియాంక రూపంలో ఉన్నట్టు ఈ రెండు రోజుల చర్చలు స్పష్టం చేస్తున్నాయి.

