అమెరికా-ఇరాన్ మధ్య శాంతి చర్చలు నిజమేనా? అసలా చర్చలు దౌత్య నాటకమా? నిజమైన పరిష్కార ప్రయత్నమా? మధ్యప్రాచ్యంలోని తాజా ఉద్రిక్తతలను పరిశీలిస్తే ఈ ప్రశ్న తలెత్తక మానది. అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య సాగుతున్న వ్యూహాత్మక పోరు ప్రపంచ రాజకీయాలు, ఆర్థిక వ్యవస్థపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతోంది.
అణు ప్రయోగం చుట్టూ తిరుగుతున్న వివాదమే ఈ సంక్షోభానికి కేంద్ర బిందువు. ఇరాన్ యురేనియం శుద్ధి, భవిష్యత్తులో అణ్వాయుధాల తయారికి దారితీస్తుందని అమెరికా భావిస్తోంది. ఈ నేపథ్యంలో అగ్రరాజ్యం కఠిన ఆంక్షలు విధిస్తూ, ఇరాన్పై ఒత్తిడి పెంచుతోంది. మరోవైపు, ఇరాన్ తన సార్వభౌమ హక్కులను వదులుకోలేదని స్పష్టం చేస్తోంది. ఈ భిన్న వైఖరుల వల్ల శాంతి చర్చలు సాగడం కష్టంగా మారింది.
గల్ఫ్ లో ఉద్రిక్తతల కారణంగా ప్రపంచ చమురు సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. అంతర్జాతీయ అంచనాల ప్రకారం, రోజుకు 10–15 మిలియన్ బ్యారెల్స్ వరకు సరఫరా ప్రభావితమవుతున్నట్లు భావిస్తున్నారు. ఇది గ్లోబల్ ఉత్పత్తిలో 20%–30% వరకు ప్రభావం చూపగలదు. ఇందులో హార్మూజ్ జలసంధి కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచ చమురు రవాణాలో 20% ఈ జలసంధి గుండా జరుగుతుంది. ఇక్కడ ఏ చిన్న అంతరాయం జరిగినా అంతర్జాతీయ ఇంధన మార్కెట్లు కుదేలవుతాయి.
ఒకవైపు శాంతి చర్చలు కొనసాగుతుండగానే, మరోవైపు సైనిక సమీకరణలు పెరగడం అనుమానాలకు తావిస్తోంది. అమెరికా నౌకాదళం గల్ఫ్ ప్రాంతంలో తన బలగాన్ని పెంచడం, ఇజ్రాయిల్ తరచూ భద్రతా హెచ్చరికలు జారీ చేయడం పరిస్థితిని మరింత సంక్లిష్టం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏమిటీ “డబుల్ గేమ్”? అనే విమర్శలు వినిపించడం సహజం.
అయితే, అంతర్జాతీయ దౌత్యంలో ఇది కొత్త విషయం కాదు. చర్చలతో పాటు ఒత్తిడి తంత్రాలను ఉపయోగించడం అనేది చాలా దేశాలు అనుసరించే వ్యూహమే. మరైతే, ఆ ఒత్తిడి నిజంగా శాంతికి దారి తీస్తుందా? లేక మరింత ఘర్షణలకు కారణమవుతుందా?
ఆంక్షలు ఎత్తివేయకుండా ఎలాంటి ఒప్పందానికీ సిద్ధంగా లేదని ఇరాన్ వైఖరి స్పష్టం చేస్తోంది. యురేనియం శుద్ధిని పూర్తిగా నిలిపివేయాలన్న అమెరికా డిమాండ్పై ఇరాన్ గట్టి అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఇదే అంశం చర్చల్లో ప్రధాన అడ్డంకిగా మారింది. కొన్ని నివేదికల ప్రకారం, 15–20 సంవత్సరాలపాటు శుద్ధి నిలిపివేయాలని అమెరికా కోరుతుండగా, ఇరాన్ దాన్ని తిరస్కరిస్తోంది.
ఇదిలా ఉండగా, ఈ ఉద్రిక్తతల ప్రభావం కేవలం మధ్యప్రాచ్యానికే పరిమితం కావడం లేదు. ఇండియా, చైనా వంటి దిగుమతి ఆధారిత దేశాలు ఇంధన ధరల పెరుగుదలతో తీవ్రమైన ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. చమురు ధరలు బ్యారెల్కు 80–100 డాలర్ల మధ్య ఊగిసలాడే పరిస్థితి ఏర్పడితే, అభివృద్ధి చెందుతున్న దేశాలపై దాని ప్రభావం మరింత తీవ్రమవుతుంది.
ఇక శాంతి చర్చల విశ్వసనీయతపై కూడా అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఒకవైపు చర్చలు జరుపుతూనే, మరోవైపు ఆంక్షలు, సైనిక చర్యలు కొనసాగితే పరస్పర నమ్మకం ఎలా ఏర్పడుతుంది? ఇరాన్ నేతలు ఇదే ప్రశ్నను లేవనెత్తుతున్నారు. చర్చలు ఫలప్రదం కావాలంటే ముందుగా నమ్మకం అవసరం. ఆ నమ్మకాన్ని దెబ్బతీసే చర్యలు కొనసాగితే శాంతి ప్రయత్నాలు విజయవంతం కావడం కష్టం.
చరిత్ర కూడా ఇదే విషయాన్ని చెబుతోంది. గతంలో ఇరాక్ యుద్ధ సమయంలో రసాయన ఆయుధాల ఆరోపణలతో యుద్ధం ప్రారంభించి, తరువాత అవి లేవని తేల్చిన విషయం తెలిసిందే. అలాంటి అనుభవాలు ప్రస్తుత పరిస్థితులపై అనుమానాలను పెంచుతున్నాయి.
ప్రస్తుత పరిస్థితి మరింత సున్నితంగా మారింది. ఒక చిన్న తప్పిదం పెద్ద ఘర్షణకు దారితీయవచ్చు. శాంతి చర్చలు నిజంగా ఫలించాలని ఉంటే, రెండు పక్షాలూ తమ గరిష్ట డిమాండ్ల నుంచి కొంత వెనక్కి తగ్గాల్సిందే. లేకపోతే ఈ దౌత్య నాటకం కొనసాగుతూనే ఉంటుంది. ప్రపంచం మాత్రం తమ ప్రమేయం లేకుండానే, అస్థిరత భారానని మోయాల్సి వస్తుంది.
ప్రపంచం ప్రశాంతంగా ఉండాలంటే, శక్తి ప్రదర్శన కంటే నమ్మకం, పరస్పర గౌరవం, సమన్వయం ముఖ్యం. లేదంటే “శాంతి చర్చలు” కేవలం రాజకీయ నినాదంగానే మిగిలిపోతాయి.

