మావోయిస్టులు అంతమైతే హింస లేకుండా పోతుందా? నక్సలైట్లను నిర్మూలిస్తే శాంతి సమకూరి, అభివృద్ధి జరిగి తీరుతుందా? అసలు నక్సలిజమే దేశంలోని అంతర్గత అన్ని సమస్యలకు కారణమా? అదే నిజమైతే ఆరు దశాబ్దాలుగా ఆ ఉద్యమం మనగలగడానికి కారణాలేంటి? అసలు ప్రభుత్వాలు సమస్యలను గుర్తించి, పరిష్కరిస్తున్నాయా? అదే జరిగితే ప్రభుత్వాలే చెబుతున్నట్లు దేశంలో ‘లెఫ్ట్ టెర్రరిజం’ వేళ్ళూనుకుని, ఎందుకు కొనసాగుతున్నట్లు? సమస్యలున్నంత కాలం వాటి పరిష్కారానికి నిరసనలు, ధర్నాలు, రాస్తారోకోలు, నిరాహార దీక్షలు వంటి శాంతియుత పద్ధతులేగాక, ఆందోళనలు, ఉద్యమాలు, పోరాటాలు కూడా ఉంటాయి. నిర్బంధాలను బట్టి వాటి తీవ్రతలుంటాయి. అసలు సమస్యలను పరిష్కరించకుండా, నక్సలిజాన్ని రూపుమాపితే, రేపు మరో రూపంలోనో, మరో తీరులోనో మళ్ళీ ఇలాంటి పోరాటాలే జరగవన్న గ్యారెంటీ ఏమీ లేదు కదా?
ప్రస్తుతానికి నక్సల్స్ నిర్మూలన శాశ్వత పరిష్కారంగా కనిపించవచ్చు. ఈ ఏరివేత వెనుక అదానీ, అంబానీ వంటి ఘనుల కన్ను, అడవుల్లోని విలువైన గనుల మీద ఉన్నది నిజమైతే గనుక, ఇలాంటి, ఇంతకుమించిన ఉద్యమాలు మళ్ళీ పుట్టకమానవు. ఇలాంటివేవీ లేవన్న నమ్మకాన్ని ప్రభుత్వాలు గిరిజనులకు కలిగించాలి. ఇవన్నీ జరిగితేనే శాశ్వత శాంతి స్థాపన సాధ్యం. లేకపోతే నక్సలిజం అనే గాయం ఏదో ఓ రూపంలో మళ్లీ మళ్లీ రెచ్చుతూనే ఉంటుంది.
మార్గం-అడుగు, డా. మార్గం లక్ష్మీనారాయణ ఎడిటోరియల్
మావోయిస్టులు అంతమైతే హింస లేకుండా పోతుందా? నక్సలైట్లను నిర్మూలిస్తే శాంతి సమకూరి, అభివృద్ధి జరిగి తీరుతుందా? అసలు నక్సలిజమే దేశంలోని అంతర్గత అన్ని సమస్యలకు కారణమా? అదే నిజమైతే ఆరు దశాబ్దాలుగా ఆ ఉద్యమం మనగలగడానికి కారణాలేంటి? అసలు ప్రభుత్వాలు సమస్యలను గుర్తించి, పరిష్కరిస్తున్నాయా? అదే జరిగితే ప్రభుత్వాలే చెబుతున్నట్లు దేశంలో ‘లెఫ్ట్ టెర్రరిజం’ వేళ్ళూనుకుని, ఎందుకు కొనసాగుతున్నట్లు? సమస్యలున్నంత కాలం వాటి పరిష్కారానికి నిరసనలు, ధర్నాలు, రాస్తారోకోలు, నిరాహార దీక్షలు వంటి శాంతియుత పద్ధతులేగాక, ఆందోళనలు, ఉద్యమాలు, పోరాటాలు కూడా ఉంటాయి. నిర్బంధాలను బట్టి వాటి తీవ్రతలుంటాయి. అసలు సమస్యలను పరిష్కరించకుండా, నక్సలిజాన్ని రూపుమాపితే, రేపు మరో రూపంలోనో, మరో తీరులోనో మళ్ళీ ఇలాంటి పోరాటాలే జరగవన్న గ్యారెంటీ ఏమీ లేదు కదా?
భారతదేశంలో నక్సలైట్ సమస్య పశ్చిమ బెంగాల్ లో పుట్టి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఝార్ఖండ్ వంటి రాష్ట్రాల్లో ఆరు దశాబ్దాలుగా కొనసాగుతున్నది. అంతర్గత భద్రతకు సవాల్ గా నిలిచింది. ప్రభుత్వాలు మారినా, విధానాలు మారినా, నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో శాంతి, భద్రత, అభివృద్ధి లక్ష్యాలను సాధించడం ఇప్పటికీ పూర్తిగా సాధ్యపడలేదు. ‘కగార్’ వంటి ఆపరేషన్లతో మావోయిస్టులను అంతం చేయడం ప్రభుత్వాలకి పెద్ద పనేం కాదు. కానీ, కేవలం మావోయిస్టులను, మావోయిజాన్ని నిర్మూలిస్తే సరిపోతుందా? గిరిజనుల అసలు సమస్యలు, వారి జీవన ప్రమాణాలు, వారి అభివృద్ధిలో సమూల మార్పు రాకపోతే, మావోజానికి మరో రూపం, మరో తరం మళ్లీ పుడితే? నక్సల్స్ ఆయుధాలు పట్టడం తప్పే. అయితే, ఇప్పుడు పరిష్కారం కాని ఓ జాతి, పీడితుల సమస్యల కోసం కొట్లాడుతున్న వాళ్ళని, మన ప్రభుత్వాలు తుదకంటా కొట్టేస్తున్నాయి. కానీ ఆ సమస్యలను కాదు కదా? అప్పుడు మళ్ళీ ఇదే ‘క(0)గార్’ ఆపరేషన్లతో సరిపెడతారా? అంటే హింస-ప్రతిహింసలకు అంతం లేదా? ఇక ఉండదా!?
నక్సలిజం పుట్టుకకు ప్రధాన కారణాలు ఆర్థిక అసమానతలు. అటవీ ప్రాంతాల్లో అత్యంత వెనుకబాటుతనం. భూమి సమస్యలు. పరిపాలనా నిర్లక్ష్యం. గిరిజనుల అణచివేత. హక్కుల కాలరాత. పోలీసు, అటవీ అధికారుల నిర్బంధాలు, అన్యాయాలు వంటివెన్నో ఉన్నాయని అనేక అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. సమస్యలు ఉన్నంత కాలం, ఒక సమస్యను బలంగా అణచివేసినా, మరో రూపంలో అది తిరిగి తలెత్తుతుంది. నక్సలిజాన్ని, నక్సల్స్ ను అంతమొందించిన తర్వాత ఆ ప్రదేశాల్లో అభివృద్ధి జరిగి తీరాలి. గిరిజనుల జీవనోపాధులు పెరిగి, జీవన ప్రమాణాలు మెరుగవ్వాలి. వారి ప్రాథమిక హక్కులు, అవకాశాలు, భవిష్యత్తుపై భద్రత కల్పించాలి.
గిరిజనుల అభివృద్ధి అంటే రోడ్లు, విద్యుత్, పాఠశాలలు కట్టడం మాత్రమే కాదు. గిరిజనుల సంస్కృతిని కాపాడుతూ, వారి జీవన విధానాన్ని గౌరవిస్తూ, వారి విధానాలలో వారికి నిర్ణాయక భాగస్వామ్యం కల్పించాలి. రోడ్లు వేసినా, పాఠశాలలు కట్టినా, అవి వారికి అందుబాటులోకే రావడంలేదు. టీచర్లు రాకపోవడం, ఆరోగ్య సిబ్బంది వెళ్లకపోవడం, అటవీ హక్కుల చట్టం అమలు కాకపోవడం, గిరిజనులకు నిజమైన భూమి హక్కులు రాకపోవడం పెద్ద సమస్యలుగా పరిణమించాయి. ఈ నేపథ్యంలో నక్సల్స్ ను నిర్మూలించే ఆపరేషన్లు విజయవంతమైనా, గిరిజనుల మౌలిక సమస్యలు పరిష్కరించకపోతే శాశ్వత శాంతి సాధ్యం కాదు.
శాంతి స్థాపనకు ముందుగా గిరిజన హక్కుల అమలు. అటవీ హక్కుల చట్టం ప్రకారం అటవీ భూములపై గిరిజనుల హక్కులను గుర్తించి, పట్టాలివ్వాలి. గిరిజనులు సాగు చేస్తున్న భూమికి వారు యజమానులు కాకపోతే, వారు చేసే సాగు, జీవనోపాధి స్థిరంగా ఉండదు. వారికి అవసరమైన, వారి భాషలోనే నాణ్యమైన విద్యనందించాలి. లోతట్టు అటవీ ప్రాంతాల్లో మల్టీగ్రేడ్ టీచింగ్ ప్రణాళిక, రెసిడెన్షియల్ స్కూళ్లు, ఆశ్రమ పాఠశాలలు ఉత్తమ పరిష్కారాలు. గిరిజనులు మలేరియా, క్షయ, రక్తహీనత, పోషకాహార లోపం వంటి అనేక వ్యాధుల బారినపడుతున్నారు. వారి కోసం ప్రత్యేక మొబైల్ వైద్య బృందాలు, హెల్త్ యూనిట్లు అవసరం. ఇక ఉపాధి సృష్టి. గిరిజనుల సహజ వనరుల ఆధారిత జీవనాన్ని బలపరచడానికి అటవీ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర, కో-ఆపరేటివ్ మార్కెటింగ్, విలువ ఆధారిత ఉత్పత్తులు తయారీ కేంద్రాలు ఏర్పాటు చేయాలి. గిరిజన ప్రాంతాల్లో గిరిజనేతర చొరబాట్లను, దోపిడీని అరికట్టాలి. విద్య, ఉపాధి, ఉద్యోగ, రాజకీయ అవకాశాల్లో జరుగుతున్న అన్యాయాన్ని సవరించాలి.
150 కోట్ల జనాభా గల సువిశాల దేశంలో వేళ్ళ మీద లెక్కపెట్టగలిగే నక్సల్స్ ను అంతం చేయడం సైన్యం, ఇంటలిజెన్స్, పోలీసు వ్యవస్థలు బలంగా ఉన్న ప్రభుత్వాలకు పెద్ద లెక్కకాదు. అంతకంటే ప్రజల నమ్మకం గెలుచుకోవడమే నిజమైన విజయం. అభివృద్ధిని చూడని గ్రామాలకు, అడవుల్లో ఒంటరిగా జీవించే గిరిజనులకు, నక్సల్స్ చూపే, దారులే ‘పరిష్కారం’గా కనిపిస్తాయి. ప్రభుత్వాలు పోలీసు కఠిన ఆపరేషన్లు ఎన్ని చేసినా, సమాజంలో అభివృద్ధికి సమాన ప్రాధాన్యం ఇవ్వకపోతే, అది అందని సమాజంలో అసహనం పెల్లుబికుతుంది. ఎక్కడో పుట్టిన పుండుపై నిర్లక్ష్యం వహిస్తే, అది మొత్తం సమాజ శరీరాన్నే అంతం చేస్తుంది.
ప్రస్తుతానికి నక్సల్స్ నిర్మూలన శాశ్వత పరిష్కారంగా కనిపించవచ్చు. ఈ ఏరివేత వెనుక అదానీ, అంబానీ వంటి ఘనుల కన్ను, అడవుల్లోని విలువైన గనుల మీద ఉన్నది నిజమైతే గనుక, ఇలాంటి, ఇంతకుమించిన ఉద్యమాలు మళ్ళీ పుట్టకమానవు. ఇలాంటివేవీ లేవన్న నమ్మకాన్ని ప్రభుత్వాలు గిరిజనులకు కలిగించాలి. ఇవన్నీ జరిగితేనే శాశ్వత శాంతి స్థాపన సాధ్యం. లేకపోతే నక్సలిజం అనే గాయం ఏదో ఓ రూపంలో మళ్లీ మళ్లీ రెచ్చుతూనే ఉంటుంది.

