‘బొద్దింక’లే కదాని చులకనగా చూడొద్దు. వాటిని చంపినా మళ్ళీ అవి పుట్టుకు వస్తూనే ఉంటాయి. వ్యక్తులను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా ఉద్యమాలను అణచివేయవచ్చు. కానీ, సమస్యలను పరిష్కరించకపోతే కొత్త రూపాల్లో అసంతృప్తి మళ్లీ పెల్లుబికుతుంది. అసలు శత్రువు ఉద్యమం కాదు. ఉద్యమ కారణాలపై నిర్లక్ష్యం.
డా. మార్గం-అడుగు, ఎడిటోరియల్
ప్రతి ఆందోళన వెనుకా రాజకీయాలే ఉంటాయని భావించడం పాలకుల తప్పిదం. రాజకీయ పార్టీలు ఏవైనా ఉద్యమంలోనూ తమ అవకాశాలు, మైలేజీ వెతక్కోవడం సహజమే. కానీ ఉద్యమం పుట్టుకకు కారణమైన సామాజిక, ఆర్థిక, పరిపాలనా సమస్యలను విస్మరించడం మాత్రం మూర్ఖత్వమే అవుతుంది. భారత రాజకీయాల్లో కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా అధికారంలో ఉన్నప్పుడు ప్రజా అసంతృప్తిని తరచూ రాజకీయ కుట్రగా చిత్రీకరించిన సందర్భాలు ఉన్నాయి. సమస్యను అణచివేయడం సులభమే కావచ్చు. కానీ, అసంతృప్తిని అణచివేయడం అంత సులువు కాదు. కదా, అసాధ్యం కూడా.
ఇటీవల సోషల్ మీడియాలో చర్చకు వచ్చిన “కాక్రోచ్ జనతా పార్టీ” ఉద్యమం కూడా అలాంటి అసంతృప్తికి ప్రతీకగా కనిపిస్తోంది. నీట్ పరీక్ష పేపర్ లీక్ ఘటన తర్వాత దేశవ్యాప్తంగా విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. 2024లో నిర్వహించిన నీట్-యూజీ పరీక్షకు 24 లక్షలకుపైగా విద్యార్థులు హాజరయ్యారు. పరీక్ష నిర్వహణపై నమ్మకం దెబ్బతినడంతో సుప్రీంకోర్టు వరకు ఈ వివాదం చేరింది. అయితే ప్రజల్లో ఏర్పడిన అనుమానాలు, విద్యార్థుల మానసిక ఒత్తిడిని తగ్గించడంలో కేంద్ర ప్రభుత్వం ఆశించిన స్థాయిలో స్పందించలేదనే చెప్పాలి. పరీక్షల విశ్వసనీయత కేవలం విద్యార్థుల భవిష్యత్తుకే కాదు, ప్రభుత్వ వ్యవస్థపై ప్రజల నమ్మకానికీ సంబంధించిన అంశం.
ఈ ఉద్యమాన్ని కేవలం ఒక పరీక్షకు పరిమితం చేసి చూడడం సరైంది కాదు. ఇది ఉద్యోగ అవకాశాల కొరత, పెరుగుతున్న జీవన వ్యయం, విద్యా–వైద్య రంగాల వ్యాపారం, ప్రభుత్వ సంస్థలపై తగ్గుతున్న విశ్వాసం వంటి అనేక సమస్యల సమాహారం. జాతీయ గణాంకాల ప్రకారం యువ నిరుద్యోగిత ఇప్పటికీ ఆందోళనకర స్థాయిలోనే ఉంది. పట్టభద్రుల్లో ఉద్యోగాల కోసం పోటీ పెరుగుతుండగా, ప్రభుత్వ నియామకాలు మందగిస్తున్నాయి. మరోవైపు ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్య నిధి వంటి సంస్థలు భారత ఆర్థిక వృద్ధిని ప్రశంసిస్తున్నప్పటికీ, ఆ వృద్ధి ఫలాలు ప్రతి కుటుంబానికి సమానంగా చేరడం లేదనే అభిప్రాయం కూడా ఉంది.
విద్య, వైద్యం సాధారణ సామాన్య కుటుంబాలకు భారంగా మారుతున్నాయి. ప్రైవేట్ విద్యాసంస్థల్లో లక్షల రూపాయల ఫీజులు, ప్రైవేట్ హాస్పిటల్స్ లో చికిత్సలకు భారీ ఖర్చులు మధ్యతరగతి, పేద వర్గాలపై తీవ్ర ఒత్తిడిని పెంచుతున్నాయి. ప్రభుత్వ రంగ సేవల నాణ్యత మెరుగుపడకపోవడం వల్లే ప్రజలు తప్పనిసరై ప్రైవేట్ రంగాన్ని ఆశ్రయించాల్సి వస్తోంది. ఈ పరిస్థితి సామాజిక అసమానతలను మరింత పెంచుతోంది.
ప్రతిపక్షం బలహీనపడినప్పుడు ప్రజల అసంతృప్తి కొత్త వేదికలను వెతుక్కుంటుంది. గత దశాబ్దంలో సోషల్ మీడియా అలాంటి వేదికగా మారింది. అరబ్ స్ప్రింగ్ నుంచి శ్రీలంక ఆర్థిక సంక్షోభ నిరసనల వరకు, బంగ్లాదేశ్ విద్యార్థి ఉద్యమాల నుంచి కెన్యాలో జెన్-జీ నిరసనల వరకు యువత డిజిటల్ వేదికలను సమర్థంగా వినియోగించింది. భారతదేశంలో కూడా ఇదే ధోరణి కనిపిస్తోంది. సంప్రదాయ మీడియా కంటే సోషల్ మీడియా వేగంగా స్పందించే వేదికగా యువత భావిస్తోంది.
అయితే, సోషల్ మీడియా రెండువైపులా పదునున్న కత్తిలాంటిది. అది ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురాగలదు. అదే సమయంలో అంతకంతకూ అసత్య ప్రచారాన్ని విస్తరించగలదు. అందువల్ల ప్రభుత్వం సమస్యలను అణచివేయడం కంటే, నిజమైన సమాచారాన్ని వేగంగా ప్రజలకు అందించడం, పారదర్శకంగా వ్యవహరించడం అవసరం. విశ్వాసం కోల్పోయిన వ్యవస్థను జవాబుదారీ తనంతోనే తిరిగి నిర్మించవచ్చు.
భారతదేశం ప్రపంచంలోనే అత్యంత యువ జనాభా కలిగిన దేశాల్లో ఒకటి. 65 శాతం జనాభా 35 ఏళ్లలోపు ఉంది. ఈ యువశక్తిని సద్వినియోగం చేసుకోవాలంటే నాణ్యమైన విద్య, నైపుణ్యాభివృద్ధి, పరిశ్రమల విస్తరణ, ఉద్యోగ సృష్టి ప్రభుత్వాల ప్రాధాన్యంగా మారాలి. లేకపోతే చదువుకున్న యువత విదేశాలకు వలస వెళ్లడం కొనసాగుతుంది. ఇది దీర్ఘకాలంలో దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా సవాల్ గా మారుతుంది.
పార్టీలు ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలకే కాకుండా, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలతో నిరంతర చర్చలు, భాగస్వామ్యాన్ని కొనసాగించాలి. పార్లమెంట్, శాసన సభల్లో సమగ్ర చర్చలు, ప్రజలతో ప్రత్యక్ష మమేకం వంటి ప్రజాస్వామ్య ప్రక్రియలు బలపడితే అసంతృప్తి తీవ్ర ఉద్యమాలుగా మారే అవకాశం తగ్గుతుంది. ప్రజల ఆవేదనను వినడం బలహీనతగా కాకుండా, బలంగా అలవరచుకుకోవాలి.
‘బొద్దింక’లే కదాని చులకనగా చూడొద్దు. వాటిని చంపినా మళ్ళీ అవి పుట్టుకు వస్తూనే ఉంటాయి. వ్యక్తులను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా ఉద్యమాలను అణచివేయవచ్చు. కానీ, సమస్యలను పరిష్కరించకపోతే కొత్త రూపాల్లో అసంతృప్తి మళ్లీ పెల్లుబికుతుంది. అసలు శత్రువు ఉద్యమం కాదు. ఉద్యమ కారణాలపై నిర్లక్ష్యం.
ప్రభుత్వాలు విమర్శలను దేశద్రోహంగా కాకుండా ప్రజల హెచ్చరికగా స్వీకరించాలి. యువత ప్రశ్నించడం శాంతియుత సంకేతం. వారి ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం, విధానాల్లో లోపాలను సరిదిద్దడం, అవకాశాలను విస్తరించడం, పారదర్శకత పెంచడం సుస్థిరమైన పాలనకు పునాది. సమస్యలను ముందుగానే గుర్తించి పరిష్కరిస్తే ‘కాక్రోచ్’లాంటి ఉద్యమాలకు ఆస్కారమే ఉండదు. లేదంటే అసంతృప్తి కొత్త పేర్లతో, కొత్త రూపాల్లో మళ్లీ మళ్లీ బయటపడుతూనే ఉంటుంది. ప్రజల విశ్వాసమే ప్రజాస్వామ్యానికి శ్రీరామరక్ష.

