BC Reservations|బీసీ రిజర్వేషన్లపై ఊహించని తీర్పు|Judgement
న్యూ ఢిల్లీ, అక్టోబర్ 16 (అడుగు న్యూస్):
తెలంగాణ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల పెంపు అంశంపై రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు విధించిన స్టేను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ (SLP)ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. దీంతో బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే కొనసాగనుంది. ఈ కేసుపై జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం విచారణ జరిపింది.
సుప్రీంకోర్టు విచారణ సందర్భంగా పలు ముఖ్యమైన వ్యాఖ్యలు చేసింది. ఎస్టీ ప్రాంతాల్లో మాత్రమే రిజర్వేషన్ల పెంపుకు మినహాయింపులు ఉన్నాయని గుర్తుచేసింది. రాష్ట్ర ప్రభుత్వ తరపున సీనియర్ అడ్వకేట్ అభిషేక్ సింగ్వి వాదనలు వినిపిస్తూ, రిజర్వేషన్లు నిర్ణయించుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికే ఉందని స్పష్టం చేశారు. తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లుకు అసెంబ్లీలో అన్ని రాజకీయ పార్టీలు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపాయని తెలిపారు. బిల్లుకు రాష్ట్రపతి, గవర్నర్ ఆమోదం లేకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని ఆయన వాదించారు.
అభిషేక్ సింగ్వి మరింత వివరంగా మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం శాస్త్రీయంగా, సాంకేతికంగా కుల సర్వే నిర్వహించిందని, డెడికేటెడ్ కమిషన్ ద్వారా ఎంపిరికల్ డేటా సేకరించి, ఆ డేటా ఆధారంగా రిజర్వేషన్లు నిర్ణయించిందని తెలిపారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా సమగ్ర సర్వే నిర్వహించాము. 94,000 మంది అధికారుల ద్వారా ఇంటింటికీ తిరిగి సామాజిక, ఆర్థిక, కుల సర్వే చేశాము. ఈ డేటా ఆధారంగానే బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచాము. ఇందిరా సహాని కేసులో సుప్రీంకోర్టు స్వయంగా రిజర్వేషన్లకు డేటా ఆధారమే ముఖ్యమని స్పష్టం చేసింది అని వాదించారు. అలాగే గవర్నర్ బిల్లును పెండింగ్లో ఉంచడం వల్ల జీవో నంబర్ 9ను సవాల్ చేసే పరిస్థితి ఏర్పడిందని తెలిపారు.
అయితే సుప్రీంకోర్టు ఈ వాదనలను పరిశీలించిన తర్వాత హైకోర్టు తీర్పును మార్చడానికి ఆధారం లేదని తేల్చింది. షెడ్యూల్డ్ ఏరియాలో మాత్రమే 50 శాతానికి మించి రిజర్వేషన్లు పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. తెలంగాణలో అలాంటి షెడ్యూల్ ఏరియాలు లేవు. కృష్ణమూర్తి కేసులో కూడా ఇదే సూత్రాన్ని అనుసరించాం. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా ఇలాంటి రిజర్వేషన్ పెంపును సుప్రీంకోర్టు తిరస్కరించింది అని ధర్మాసనం స్పష్టం చేసింది.
మాధవరెడ్డి తరఫున వాదనలు వినిపించిన ప్రతిపక్ష న్యాయవాదులు కూడా ఇదే అంశాన్ని రుజువు చేస్తూ, ట్రిపుల్ టెస్ట్ కండిషన్ ఉన్నప్పటికీ రిజర్వేషన్లు 50 శాతం దాటకూడదని చెప్పారు. సాధారణ ప్రాంతాల్లో రిజర్వేషన్ పరిమితి కఠినంగా పాటించాల్సిన అవసరముందని వాదించారు.
దీంతో సుప్రీంకోర్టు హైకోర్టు స్టే కొనసాగిస్తూ, రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్ను డిస్మిస్ చేసింది. ఈ తీర్పుతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన 42 శాతం బీసీ రిజర్వేషన్ల అమలు తాత్కాలికంగా నిలిచిపోనుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు కొత్త చట్టపరమైన వ్యూహం ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ తీర్పు రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద చర్చకు దారి తీసింది.

