ఆ మాటల మర్మమేంటి?!
జడ్చర్ల ఎమ్మెల్యే టార్గెట్ ఎవరు?!
అన్యాయమైతున్న ఆ రైతులు ఎవరు?
ఎమ్మెల్యే హెచ్చరిస్తున్నదెవరిని?
ప్రభుత్వంలో ఉన్న కొంత మంది ఆ పెద్దలు ఎవరు?
ఈ గజిబిజి గందరగోళం కంటే సీఎం జోక్యం చేసుకుంటే పోలా?
హైదరాబాద్ లో జనవరి 31వ తేదీ రాత్రి ఏడుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కలిసి డిన్నర్ సమావేశం నిర్వహించి సెన్సేషన్ చేసిన జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి, వారం తిరగక ముందే మరో సంచలనానికి తెర లేపారు. ప్రభుత్వంలో ఉన్న కొంతమంది పెద్దలు రైతులకు అన్యాయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో తాను నిశ్శబ్దంగా ఉండలేనని, రైతుల కోసం తెగించి మాట్లాడతానని స్పష్టం చేశారు. “నేను బయటికి వచ్చి ఈ విషయం చెబుతున్నా. ఇప్పుడు ఆ పెద్దవాళ్లు నన్ను చంపేస్తారా, లేక రైతులకు న్యాయం చేస్తారా అనేది చూడాలి” అంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. రైతుల సమస్యలపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని, లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని కూడా హెచ్చరించారు. ఆయన వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనమై, చర్చనీయాంశంగా మారాయి.
జనవరి 31న ఏడుగురు ఎమ్మెల్యేలతో హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ హోటల్ లో ఎమ్మెల్యే అనిరుధ్ కీలక సమావేశం నిర్వహించారు. భూపతి రెడ్డి (నిజామాబాద్ రూరల్), యెన్నం శ్రీనివాస్ రెడ్డి (మహబూబ్ నగర్), మురళీ నాయక్ (మహబూబాబాద్) కూచుకుళ్ల రాజేష్ రెడ్డి (నాగర్ కర్నూలు), సంజీవరెడ్డి (నారాయణఖేడ్), అనిరుధ్ రెడ్డి (జడ్చర్ల), దొంతి మాధవరెడ్డి (నర్సంపేట), బీర్ల అయిలయ్య (ఆలేరు) లు తెలిసో, తెలియకో హాజరయ్యారు. ఎందుకు భేటీ అయ్యారన్న అంశం పై ఎవరూ పెదవి విప్పలేదు. అనిరుధ్ రెడ్డి మాత్రం మా సమస్యలను మేము చర్చించుకున్నాం. వేరే ఉద్దేశాలు లేవని, మామూలు మీట్ గా తేల్చి చెప్పారు. ఇది కాస్త సంచలనం అయింది. సీఎం రేవంత్ రెడ్డి గతంలోలా ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని, మంత్రులు ఎమ్మెల్యేలను వారి విజ్ఞాపనలను లెక్కచేయడం లేదన్న వార్తలు గుప్పుమన్నాయి.
ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులకు నిధులు లేక తలెత్తుకోలేని పరిస్థితుల్లో ఉన్నామని అవేదన చెందుతున్నట్లుగా “అడుగు” ఎమ్మెల్యేల మనోగతం గా వారి అభిప్రాయాలను సైతం బయట పెట్టింది. వెంటనే నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి రంగంలోకి దిగారు. మరోవైపు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ భేటీ అయిన ఎమ్మెల్యేలతో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి జోక్యంతో ఇంటలిజెన్స్ ఆరా! దాకా పరిస్థితులు వెళ్లాయి. మల్లు రవి మీడియా తో మాట్లాడుతూ ఎమ్మెల్యేల వ్యక్తిగత విషయాలు తప్ప అందులో రాజకీయ అంశాలేవి లేవని తేల్చేశారు. తమ భేటీ కి ఏ ప్రాధాన్యం లేదని ఎంపీ మల్లు రవి చెప్పడాన్ని అనిరుద్ రెడ్డి విమర్శించారు. రెండు రోజుల్లోనే సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే లందరితో కలిపి మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సమస్యలేవైనా సరే తన దృష్టికి తేవాలని సీఎం ఎమ్మెల్యేలకు చెప్పారు. మంత్రులు సమన్వయం చేసుకుంటూ ఎమ్మెల్యేలకు తగిన ప్రాధాన్యం ఇచ్చే విధంగా ఆదేశించారు. అంతేకాదు ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డిని జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ఇది గడిచిన రెండు మూడు రోజుల్లోనే జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి మరోసారి మాటల తూటాలు పేల్చారు.
ప్రభుత్వంలో ఉన్న కొంతమంది పెద్దలు రైతులకు అన్యాయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఎమ్మెల్యే, ఎవరా పెద్దలు అనే విషయాన్ని మాత్రమ చెప్పడం లేదు. బహుశా అది బ్రహ్మ రహస్యం కావచ్చు. అన్యాయమైపోతున్న ఆ రైతులు ఎవరు? అన్న విషయంలోనూ క్లారిటీ లేదు. ఆ రైతులు రాష్ట్ర రైతులా? తన నియోజకవర్గ రైతులా? వాళ్ళు నష్ట పోతున్న అంశాలు కూడా వెల్లడి చేయడం లేదు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ప్రత్యేకంగా ఆయన చెబుతున్నట్లుగా నష్టపోతున్న రైతులు ఎవరన్న గుట్టు ఆయనే విప్పాలి. “నేను బయటికి వచ్చి ఈ విషయం చెబుతున్నా. ఇప్పుడు ఆ పెద్దవాళ్లు నన్ను చంపేస్తారా, లేక రైతులకు న్యాయం చేస్తారా అనేది చూడాలి” అంటూ ఆయన మరింత సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు రైతుల న్యాయానికి ఎమ్మెల్యే ప్రాణానికి ఉన్న లెంక ఏంటో తేలాలి? అయితే ఆ పెద్దవాళ్ళు ఒక ఎమ్మెల్యేని సైతం చంపగలిగిన వారా? వాళ్ళు ప్రభుత్వంలోనే ఉన్నారా?! ఒక ఎమ్మెల్యే ఈ స్థాయి మాటలని ఊరకనే కొట్టిపారేయలేం. అలాగని అలా వదిలేయలేం. ఒక ప్రజాప్రతినిధి స్థానంలో ఉన్న వ్యక్తి మాటలను ఏ విధంగా తీసుకోవాలి? జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి వ్యాఖ్యలు వ్యక్తిగతం అయితే ఆయన సమస్యను కూడా వ్యక్తిగతంగా పరిష్కరించుకోవాలి. ప్రభుత్వ పరమైతే వెంటనే తగు విధంగా సీఎం దృష్టికి, అధికారులు, పోలీసుల దృష్టికి తీసుకెళ్ళవచ్చు. కానీ, స్పష్టత లేని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి వ్యాఖ్యల వల్ల అటు రాజకీయాల్లో ఇటు నియోజకవర్గంలో, తెలంగాణ రాష్ట్రంలో కూడా గందరగోళం ఏర్పడుతున్నది. ప్రభుత్వానికి, సీఎం కి కూడా చెడ్డ పేరు వస్తున్నది. వెంటనే సీఎం ఈ అంశంపై స్పందించాలి. తగు విచారణ చేపట్టాలి. ఇప్పటికైనా ఎమ్మెల్యే తన లేదా రైతుల సమస్యపై స్పష్టతనివ్వాలి. ఎమ్మెల్యేగా స్థానికం నుండి సీఎం దాకా తీసుకెళ్లి పరిష్కారం పొందవచ్చు. లేదంటే జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఈ సంచలనాలు మాని, బాధ్యత గల ప్రజా ప్రతినిధి కాబట్టి, తన ప్రాణాలు కాపాడుకుంటూనే, రైతులకు న్యాయం జరిగే విధంగా న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా పోరాడితే బెటరేమో!

