తెలంగాణలో విగ్రహాలు, ప్రాంతీయ అస్తిత్వం, ఆత్మగౌరవం, రాష్ట్ర ఏర్పాటు, ఆంధ్రా-తెలంగాణ భావోద్వేగాలు, రాజకీయ ప్రవేశాలు వంటి అంశాల చుట్టూ చర్చలు మళ్లీ వేడెక్కుతున్నాయి. అయితే రాష్ట్ర ప్రజల ముందున్న అసలు సమస్యలు ఏమిటి? రాజకీయ పార్టీలు వాటికి పరిష్కారాలు చూపుతున్నాయా? సెంటిమెంట్ను ఆయుధంగా మార్చుకుని ప్రజల దృష్టిని మరల్చే ప్రయత్నం చేస్తున్నాయా?
డా. మార్గం-అడుగు, ఎడిటోరియల్
సమాజంలో సెంటిమెంట్ బాగ పండుతుంది. అందుకే తెలంగాణలో మరోసారి సెంటిమెంట్ రాజకీయం తెర మీదకు వచ్చింది. విగ్రహాలు, ప్రాంతీయ అస్తిత్వం, ఆత్మగౌరవం, రాష్ట్ర ఏర్పాటు, ఆంధ్రా-తెలంగాణ భావోద్వేగాలు, రాజకీయ ప్రవేశాలు వంటి అంశాల చుట్టూ చర్చలు మళ్లీ వేడెక్కుతున్నాయి. అయితే రాష్ట్ర ప్రజల ముందున్న అసలు సమస్యలు ఏమిటి? రాజకీయ పార్టీలు వాటికి పరిష్కారాలు చూపుతున్నాయా? సెంటిమెంట్ను ఆయుధంగా మార్చుకుని ప్రజల దృష్టిని మరల్చే ప్రయత్నం చేస్తున్నాయా? అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి.
2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు ప్రజలు భారీ ఆశలు పెట్టుకున్నారు. స్వరాష్ట్రం వస్తే ఉద్యోగాలు పెరుగుతాయని, సాగునీటి సమస్యలు తీరుతాయని, రైతుల జీవితం మెరుగుపడుతుందని, స్థానిక వనరులు స్థానిక ప్రజల అభివృద్ధికి ఉపయోగపడతాయని భావించారు. కానీ పన్నెండేళ్ల తర్వాత పరిస్థితులను పరిశీలిస్తే అభివృద్ధితో పాటు అనేక ప్రశ్నలు కూడా మిగిలిపోయాయి.
మిగులు రాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణ ప్రస్తుత అప్పులు రూ.7 లక్షల కోట్లు దాటాయి. రాష్ట్ర స్థూల ఆర్థికోత్పత్తి పెరిగినప్పటికీ అప్పుల భారం కూడా అదే స్థాయిలో పెరగడం ఆందోళన కలిగించే అంశం. ప్రజలపై పన్నుల భారం, భవిష్యత్ ఆర్థికాంశాలపై ఇది ప్రభావం చూపే అవకాశం ఉంది.
ఉద్యోగాల విషయంలో కూడా యువతలో అసంతృప్తి కొనసాగుతోంది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియల్లో ఆలస్యం, పరీక్షల నిర్వహణలో వివాదాలు, నియామకాలపై వచ్చిన ఆరోపణలు యువతను నిరాశకు గురి చేశాయి. లక్షలాది మంది యువకులు ఉద్యోగాల కోసం పోటీ పడుతున్నప్పటికీ అందుబాటులో ఉన్న అవకాశాలు పరిమితంగానే ఉన్నాయి.
రైతుల పరిస్థితి కూడా పూర్తిగా మెరుగుపడిందని చెప్పలేం. వరి, మక్కజొన్న, పత్తి, మిర్చి రైతులు ప్రతి ఏడాది ధరల సమస్యలు, కొనుగోలు కేంద్రాల నిర్వహణలో లోపాలు, ప్రకృతి విపత్తుల కారణంగా నష్టాలు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం రైతు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నప్పటికీ, మార్కెట్ వ్యవస్థలోని సమస్యలు మాత్రం ఇంకా కొనసాగుతున్నాయి. కాళేశ్వరం వంటి భారీ ప్రాజెక్టులు నిర్మించినప్పటికీ వాటి వ్యయాలు, నిర్వహణ, సాంకేతిక లోపాలపై ఇప్పటికీ ప్రశ్నలు తలెత్తుతూనే ఉన్నాయి.
ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయ చర్చలు అభివృద్ధి, ఉద్యోగాలు, వ్యవసాయం, పెట్టుబడులు, విద్య, ఆరోగ్య రంగాలపై కేంద్రీకృతం కావాల్సి ఉండగా, మళ్లీ సెంటిమెంట్ రాజకీయాలు ప్రాధాన్యం పొందుతున్నాయి. ముఖ్యంగా ఇతర రాష్ట్రాలకు చెందిన నాయకులు తెలంగాణలో రాజకీయ కార్యకలాపాలు ప్రారంభిస్తే, దానిని తెలంగాణ అస్తిత్వంపై దాడిగా చిత్రీకరించే ప్రయత్నాలు కనిపిస్తున్నాయి.
ప్రజాస్వామ్యంలో ఏ రాజకీయ పార్టీ అయినా దేశంలోని ఏ రాష్ట్రంలోనైనా రాజకీయాలు చేసే హక్కు కలిగి ఉంటుంది. భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం లేదా ఇతర పార్టీలు తెలంగాణలో తమ రాజకీయ విస్తరణ కోసం ప్రయత్నించడం సహజ రాజకీయ ప్రక్రియలో భాగమే. గతంలో ప్రాంతీయ పార్టీలు కూడా జాతీయ రాజకీయాల్లో తమ ప్రభావాన్ని విస్తరించేందుకు ప్రయత్నించాయి. తెలంగాణకు చెందిన నాయకులు ఇతర రాష్ట్రాల్లో పర్యటించిన సందర్భాలు కూడా ఉన్నాయి.
అయితే, రాజకీయ పోటీని ఎదుర్కొనే బదులు ప్రాంతీయ భావోద్వేగాలను రెచ్చగొట్టడం ద్వారా మద్దతు కూడగట్టే ప్రయత్నం చేయడం ప్రజాస్వామ్యానికి ఆరోగ్యకరమైన ధోరణి కాదు. తెలంగాణ ప్రజలు ఇప్పుడు 2014 నాటి పరిస్థితుల్లో లేరు. వారు గత పదేళ్ల పాలనను, ప్రస్తుత పాలనను కూడా పరిశీలిస్తూ నిర్ణయాలు తీసుకునే స్థితికి చేరుకున్నారు. కేవలం సెంటిమెంట్ ఆధారంగా ఓట్లు పొందే కాలం క్రమంగా అంతరిస్తోంది.
గత ప్రభుత్వాలపై వచ్చిన భూకబ్జాలు, ప్రాజెక్టుల వ్యయాల పెరుగుదల, ఫోన్ ట్యాపింగ్, భూ రికార్డుల వ్యవహారాలు వంటి వివాదాలు ఇప్పటికీ రాజకీయ చర్చల్లో కొనసాగుతున్నాయి. అదే సమయంలో ప్రస్తుత ప్రభుత్వంపై కూడా భూ వ్యవహారాలు, కాంట్రాక్టుల కేటాయింపులు, పాలనాపరమైన నిర్ణయాలపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ అంశాలపై పారదర్శక విచారణలు జరగడం ప్రజాస్వామ్య వ్యవస్థపై నమ్మకాన్ని పెంచుతుంది.
తెలంగాణ అస్తిత్వం అంటే కేవలం రాజకీయ నినాదం కాదు. ఈ నేలపై జీవిస్తూ, ఇక్కడే భవిష్యత్తు నిర్మించుకుంటున్న ప్రతి వ్యక్తి తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామే. తెలంగాణ ప్రజల అసలు అవసరాలు మెరుగైన విద్య, నాణ్యమైన వైద్యం, ఉద్యోగావకాశాలు, రైతులకు గిట్టుబాటు ధరలు, పెట్టుబడులు, పారిశ్రామిక అభివృద్ధి, పారదర్శక, అవినీతి రహిత పాలన. ఈ అంశాలపై సమాధానాలు చెప్పలేని రాజకీయాలు చివరికి సెంటిమెంట్ను ఆశ్రయిస్తున్నాయి.
రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు, జీహెచ్ఎంసీ ఎన్నికలు, తదుపరి అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు ఎవరి మాటలను నమ్ముతారన్నది చూడాలి. అయితే ఒక విషయం మాత్రం స్పష్టం. తెలంగాణను నిజంగా బలోపేతం చేసేది భావోద్వేగ రాజకీయాలు కాదు. పారదర్శక పాలన, ఆర్థిక క్రమశిక్షణ, ఉపాధి అవకాశాలు, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే అభివృద్ధి కార్యక్రమాలే.

