సాహితీ మూర్తి లింగంపల్లి రామచంద్ర ఎనబై వసంతాల పండుగ
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో అభినందన సభ
డాక్టర్ లింగంపల్లి రామచంద్ర గారు నా మనసుకు ఒక చల్లని భావోద్వేగం, నా గుండెకు ఒక వెచ్చని అనుకంపనం! ఫార్మసిస్ట్ గ వైద్యవృత్తిలో ఉన్న నాకు మా పాలకుర్తి “సోమనాథ కళా పీఠం” సాహిత్య సాంస్కృతిక వేదిక వలన, 1994లో తెలుగు విశ్వవిద్యాలయం నిర్వహించిన పాల్కురికి సోమనాథుని అష్ట శత జయంతి ఉత్సవాల వలన డాక్టర్ లింగంపల్లి రామచంద్ర వంటి సాహితీ వేత్తల పరిచయ భాగ్యం కలిగింది. మా పరిచయాన్ని పెంచి పోషించి ప్రగాఢ అనుబంధంగ మలచినది వారే! వయసులో నాకన్న సుమారు ఇరువది ఏండ్లు పెద్ద వారైనా ఎప్పుడూ పెద్దరికం ప్రదర్శించ లేదు.
మొదట్లో వారిని పేర్వారం జగన్నాథం గారి శిష్యుడు, ఆలేరు చెంత నున్న గుండ్ల గూడెం సి ఎస్ ఐ పాఠశాలలో తెలుగు పండితుడు, ఖిలా షాహ్ పురం పక్క వెల్ది వారి స్వగ్రామం – అంత మాత్రమే అనుకొన్న. ఆ తరువాత క్రమంగా అర్థమైంది. ఆయన ఆరితేరిన కవి, గాటీలు తిన్న పరిశోధకుడు, చేయి తిరిగిన చారిత్రకుడు, కాకలు తీరిన విమర్శకుడు, వాగ్ధాటి కలిగిన వక్త. ఎందరో విశ్వవిద్యాలయ పరిశోధకులకు అనధికారిక మార్గదర్శి. కాకతీయ విశ్వవిద్యాలయం సెనేట్ మెంబర్ పదవి చేపట్టిన వాడు. అయినా అవి ఏవీ ఆయన ప్రదర్శించడు. అభిజాత్యాలు, భేషజాలు లేని పసి ప్రసన్న చిత్తం ఆయనది. ఆయన ప్రేమతో ఇచ్చిన పుస్తకాలు చదివి ఆశ్చర్య పోవటం నా వంతు అయింది. ఇంత అవగాహన, ఇంత భావుకత, ఇంత పరిజ్ఞానం, ఇంత వైదుష్యం ఉన్న కవి పండితుడు అంత సరళంగ, అంత సాధారణంగ, అంత నిసర్గంగ, అంత నిరాడంబరంగ ఎట్ల ఉండ గలరో?! బుష్ షర్ట్, పాంట్స్ ధరించి, దగ్గరి చూపు కండ్లద్దాలు పెట్టుకొని బక్క పలుచగ సాదా సీదాగ కనిపించే ఆయన చిరురూపంలో విశ్వరూపం దాగి ఉందని తెలిసింది.
వారి పరిశోధక హృదయం సమగ్రతకై తపిస్తది. గ్రంథ పఠనానికే పరిమితం కాకుండ వ్యక్తులతో సంభాషణ, క్షేత్ర పర్యటన ఆధారాలతో దానిని పరిపుష్టం చేస్తరు. అందులో నేను కూడ కొంత పాలు పంచుకున్నందుకు ఆనందంగ ఉంది. ముందస్తు సమాచారం ఇచ్చి నా వద్దకు వచ్చే వారు. పిమ్మట వారిని నా ద్విచక్ర వాహనంపై తీసుకొని చుట్టు పక్కల గ్రామాల విశేషాలు సేకరించటానికి పోయేది. మాదపురం పాటిమీద శివాలయం పరిశీలిస్తూ ఈ ఊరి పూర్వ నామం మహాదేవపురం అన్నరు. సముద్రాల, ఇప్పగూడెం గ్రామాలలో బౌద్ధ జైన ప్రముఖులు పర్యటించి నారని అభిప్రాయ పడ్డరు. పాలకుర్తి సోమన్న గుట్ట పాండవుల బోడు మధ్య పాటి మీద వీరగల్లులు చూపించిండ్రు. ప్రస్తుత ఆర్యవైశ్య సత్రం ప్రవేశ ద్వారం వద్ద అవి ఉండేవి. చారిత్రక ఆనవాల్లు భూ వ్యాపారానికి ఆటంకం అని వాటిని ధ్వంసం చేసినట్లు తెలిసింది. విస్నూర్ గుడి, శాసనం పరిశీలించి పద్మనాయక పాలనలో ప్రసిద్ధి గాంచిన గ్రామం అని ఊహించిండ్రు. గ్రామ పూర్వ సర్పంచ్ వెన్నమనేని మధుసూదన్ రావుతో సంభాషించి లఘు గ్రంథ మొకటి వ్రాసిండ్రు.
పరిశోధన వారికి ప్రాణప్రదం. మైలారు దేవుండ్ల గురించి పరిశోధనకు దేశమంతటా తిరిగిండ్రు. సోమనాథ కళా పీఠం ఆ పరిశోధనకు 2004లో వి చలపతి రావు సాహిత్య పురస్కారం ప్రదానం చేసింది. ఆ ఏడు వారితో పాటు రవ్వ శ్రీహరి, ఏ సూర్యనారాయణ మూర్తి, సామల సదాశివ, జిలుకర శ్రీనివాస్ లకు కూడా పురస్కార ప్రదానం జరిగింది. తదనంతర కాలం నుంచి పీఠం పురస్కార నిర్ణాయక మండలిలో రామచంద్ర గారు సభ్యులుగ ఉండి పురస్కారాలకు మరింత గౌరవాన్ని పెంచుతున్నరు. వారు పొందిన అవార్డ్ లు, సన్మానించిన సంస్థలు, ప్రముఖుల పరిచయాలు అనేకం. అయినా సోమనాథ కళా పీఠం పట్ల, నా పట్ల వారికి ప్రత్యేక అభిమానం. మా పీఠం కార్యాలకు డాక్టర్ రామచంద్ర ఆస్థాన అతిథులు. వారు ఉంటె మాకు అదో మనోధైర్యం. సమయ పాలన, క్రమశిక్షణ, నమ్రత, సర్దుబాటు గుణం, సమన్వయ ధోరణి వారి ఆభరణాలు. అవి మాకు అనుకూల అంశాలు. కవిత్వమే వక్తృత్వమై, హోరు గలగలలతో జలపాత ధార వలె కమనీయంగ సాగే వారి ప్రసంగం మాకు అస్తి. జ్ఞానపీఠ పురస్కార గ్రహీత డాక్టర్ సినారె అంటె రామచంద్ర గారికి అమితమైన అభిమానం. సినారె మెచ్చిన వక్త మన రామచంద్ర.
ఆలేరు తేజ ఆర్ట్స్ క్రియేషన్స్ నుంచి రామచంద్ర గారు జీవన సాఫల్య పురస్కారం పొందగా, నన్ను విశిష్ట పురస్కారం వరించింది. అది నాకు గర్వకారణం.
బంధాలు, మానవ సంబంధాలు పచ్చగ కొనసాగిస్తుంటరు రామచంద్ర గారు. పరిచయస్తులు, బంధు మిత్రులతో పాటు శిష్య ప్రశిష్యులు అందరినీ ఒక్క రీతిగ అభిమానిస్తరు. వారి విద్యార్థినులు కె లీల, బి సంపూర్ణ, బి వనజ కుమారి నా సహోద్యోగులు. రామచంద్ర గారి స్నేహం వల్ల వారి వద్ద నాకు మర్యాద పెరిగింది. పోరెడ్డి రంగయ్య వంటి సాహితీ వేత్తల మైత్రి లభించింది.
రామచంద్ర గారు నిరంతర విద్యార్థి, సతత సాధకులు. వారు వచన కవితా విశారదులై నప్పటికి గతంలో పద్యం ఎందుకో వ్రాయలేదు. పద్యానికి ఆయు ప్రమాణం ఎక్కువ అని నా అభిప్రాయం. వారు పద్యం కూడ వ్రాస్తే బాగుండునని నాకు అనిపించింది. వారి వచన కవిత్వంలో ఛందో బద్ధమైన పంక్తులు చాలా చోట్ల ఉన్నయి. ఇదే మాట వారికి చెప్పితె పద్యం మొదలు పెట్టిండ్రు. “జన హితోక్తి రామచంద్ర సూక్తి” మకుటంతో సుమారు నాలుగు వందల పద్యాలు వ్రాసిండ్రు.
నేను సాహిత్య రంగంలో చిన్న కార్యకర్తను మాత్రమే. అయినా, వారు తమ గ్రంథాలు కొన్నింటికి ఆదరంతో ముందు మాట వ్రాయించు కొన్నరు. వారి అభిమానంతో నా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. తెలంగాణ సాహిత్య అకాడెమి కోసం వారు వ్రాసిన “జనగామ జిల్లా సాహిత్య చరిత్ర” గ్రంథాన్ని పాలకుర్తిలో సోమనాథ కళా పీఠం పక్షాన 2023 డిసెంబర్ 10న ఆవిష్కరించు కోవటం మాకు వారిచ్చిన సదవకాశం. ఆ గ్రంథంలో సోమనాథ కళా పీఠం కార్య కలాపాల గురించి, నా రచనల గురించి చరిత్రలో నిలిచిపోయే విధంగ ప్రస్తావన చేసిండ్రు. మా పాలకుర్తి ప్రాంత మిత్రుల సాహిత్య కృషికి కూడా సముచిత స్థానాన్ని కల్పించిండ్రు.
డాక్టర్ లింగంపల్లి రామచంద్ర స్థానికతను విశ్వవ్యాప్తం చేసే రచయిత. తన ప్రాంతం పట్ల, తన ప్రాంత సాహిత్యం పట్ల అంతులేని మమకారం ఆయనకు. 1970 లలోనే జనగామ తాలూకా కవులు కళాకారులను పరిచయం చేస్తూ జనధర్మ పత్రికలో ధారావాహిక వ్రాసిండు. జనగామ సాహిత్య సభలను నాటి నుంచి నేటి వరకు గ్రంథస్థం చేసిండు. జనగామ జిల్లా సాహిత్య చరిత్ర గ్రంథానికి పాల్కురికి సోమనాథుడు, బమ్మెర పోతనామాత్యుడు, గూడూరు శాసనంను ముఖ చిత్రంగ వేసిండు. ఔత్సాహిక రచయితలకు కూడా చోటు కల్పించి దానిని సాధ్యమైనంత సమగ్రంగ కూర్చిండు. స్వగ్రామం వెల్ది చరిత్ర ను ఆది మానవులు మొదలు ఆధునిక కాలం దాక సవిస్తరంగ వ్రాసిండు. నాకు కూడ ఏమి వ్రాయ వలెనో తరచూ దిశా నిర్దేశం చేస్తుంటరు. ఈ ప్రాంత గొప్పతనాన్ని రికార్డ్ చేయాలన్నదే ఆయన తపన. రచనలు తేవాలన్న ఆశయం తప్ప రాణింపు కోసం ఆశలు లేవు. గుర్తింపు కోసం ప్రాకులాడకుండ తన పని తాను చేసుకుంటూ పోతరు. కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు ఎప్పుడో రావలసిన ప్రతిభా వంతుడు. తెలుగు విశ్వవిద్యాలయం తానుగా ఎంపిక చేసి 2023 మార్చ్ 31 నాడు “ప్రతిభా పురస్కారం” ఇచ్చి సత్కరించింది.
రామచంద్ర గారు అత్యున్నత సంస్కారవంతుడు. ఆయన నాతో కలిసిన, మాట్లాడిన ప్రతిసారీ ఆద్యంతాలలో ఆయనే ప్రేమపూర్వకంగ నమస్కారం చేస్తరు, చెప్పుతరు. సిగ్గుతో ముడుచుకొని పోవుడో, మరోసారి నేనే ముందు చెప్పాలని పోటీ పడుడో తప్పని నిస్సహాయత. వారి భార్య సుజాత గారు కూడా ఈ విషయంలో సహధర్మచారిణియే. వారి నుంచి ఈ తరం, తరువాతి తరాలు నేర్చుకొన వలసినది ఎంతో ఉంది.
రామచంద్ర గారు అగ్రశ్రేణి సాహితీ స్రష్ట. మనం వారి సమకాలికులం అయినందుకు ఎంతో అదృష్టవంతులం. అది మన మహద్భాగ్యం. ఈ అశీతి వేళ వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. వారు నిండు నూరేండ్లు పూర్ణ ఆయుష్కులై సంపూర్ణ ఆరోగ్యంతో జీవించి, మనకు పెద్ద దిక్కుగా ఉండి పథ నిర్దేశనం చేయాలని సర్వేశ్వరునికి సదా నా ప్రార్థన.

డాక్టర్ రాపోలు సత్యనారాయణ
అధ్యక్షుడు, సోమనాథ కళా పీఠం
పాలకుర్తి – 506146
ఫోన్: 9440163211

