దళ సభ్యుడిగా ప్రారంభమైన ప్రస్థానం!
CENTRAL COMMITTEE MEMBER| కేంద్ర కమిటీ సభ్యుడిగా ముగిసిన ‘మహాప్రస్థానం’!!
జోహార్ గాజర్ల రవన్న అంటూ… నినాదం
విప్లవ కళాశాల VELISHALA| వెలిశాలకు వెల్లువెత్తిన జన సంద్రం
తరలివచ్చిన ప్రజల్లో వెల్లువెత్తిన విప్లవాభిమానం
రాష్ట్ర నలుమూలలా నుండి తరలివచ్చిన మహాజనం
ఉద్యమ పాటలతో మార్మోగిన ఓ విప్లవ వీరుడి FUNERALS| అంత్యక్రియల కార్యక్రమం
ఉద్యమ కళాశాల వెలిశాలలో ఉద్భవించిన ఓ విప్లవ ‘రవి’ అస్తమయమైంది. విప్లవోద్యమానికి ఒకరా ఇద్దరా అంతా త్యాగం చేసిన ఆ కుటుంబానికి జగమంతా కుటుంబమైంది. మారుమూల వెలిశాలకు జన సంద్రమై వెల్లువెత్తింది. నలుమూలల నుండి తరలివచ్చిన జనం తమ విప్లవాభిమానాన్ని ఎలుగెత్తి చాటింది. జోహార్ గాజర్ల రవన్న అంటూ దిక్కులు పిక్కటిల్లేలా, ఆకాశం అదిరేలా, భూమి బద్ధలయ్యేలా నినదించింది. కదం తొక్కిన జనం కాలి ధూలి ఎర్రబారి ఎగిరి ఆకసాన్ని తాకింది. ఉద్యమ పాటలతో మార్మోగిన ఓ విప్లవ వీరుడి అంత్యక్రియల కార్యక్రమం మావో‘యిస్టుల’ మార్చ్ ఫాస్ట్ లా సాగింది. దళ సభ్యుడిగా ప్రారంభమైన ఓ వీరుడి ప్రస్థానం! కేంద్ర కమిటీ సభ్యుడిగా ముగిసిన ‘మహాప్రస్థానం’!!
వెలిశాల/భూపాలపల్లి, జూన్ 20(అడుగు ప్రత్యేక ప్రతినిధి):
జూన్ 18న అల్లూరి సీతారామరాజు జిల్లా, రంపచోడవరం మండలం, మారేడుమిల్లి అడవుల్లో పోలీసుల ఎన్కౌంటర్లో మరణించిన మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుడు, 2004 శాంతి చర్చల కమిటీ సభ్యుడు గాజర్ల రవి అలియాస్ ఉదయ్ అలియాస్ గణేష్ అంత్యక్రియలు జయశంకర్ భూపాలపల్లి జిల్లా, టేకుమట్ల మండలం, వెలిశాల గ్రామంలో ముగిశాయి. రంపచోడవరం ప్రభుత్వ దవాఖానలో పోస్టుమార్టం జరిపిన వెంటనే ఆయన సోదరుడు గాజర్ల అశోక్ తదితరులు అంబులెన్స్ ద్వారా తెల్లవారుజామున 12 గంటలకు ఆయన స్వగ్రామం వెలిశాలకు చేరగా, గ్రామ పొలిమేర నుండి ఆయన ఇంటివరకు గ్రామస్థులు విప్లవ పాటలతో, డీజే చప్పుళ్ళతో కన్నీటితో, విషణ్ణవదనాలతో ఆయన ఇంటికి చేర్చారు. అక్కడ ఏర్పాటు చేసిన వేదికపై ప్రజల సందర్శనార్థం ఉంచగా సుమారు పదివేల మంది సందర్శించారు. మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో ప్రారంభమైన ఎర్ర జెండాలతో, గాజర్ల రవన్న అమర్ రహే, విప్లవ జోహార్లు అంటూ, అంతిమ యాత్ర, గ్రామ చౌరస్తాలో సంతాప సభ నిర్వహించి, సాయంత్రం ఐదు గంటలకి వెలిశాల గ్రామ వైకుంఠధామం లో అంత్యక్రియలు ముగిశాయి.


తరలివచ్చిన ప్రముఖులు
శాసనమండలి ప్రతిపక్ష నాయకుడు మధుసూదనాచారి, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, ఎమ్మెల్యే గండ్ర సత్యానారాయణ, ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మెన్ అయిత ప్రకాష్ రెడ్డి, బిఆర్ఎస్ నాయకులు చెరుకు సుధాకర్, 2004 మావోయిస్ట్ శాంతి చర్చల కమిటీ సభ్యుడు అమర్, ప్రజా గాయకురాలు విమలక్క, గాదె ఇన్నయ్య దంపతులు, ఎమ్మెల్యే వీరేశం సతీమణి వేముల పుష్ప, గద్దర్ కుమారుడు సూర్యం, ప్రజా గాయకులు పికెఎం కోటి, సుధాగని హరిశంకర్ గౌడ్, పౌర హక్కుల సంఘం నాయకులు భాను, ప్రొఫెసర్ కూరపాటి వెంటనారాయణ, వీసీకే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ జిలకర శ్రీనివాస్, జిడబ్ల్యూఎంసి కార్పొరేటర్లు దిడ్డి కుమారస్వామి, సౌధ కిరణ్, బోడ డిన్నా, భారతి, మంజుల, అమరవీరుల బందు మిత్రుల సంఘం అధ్యక్షురాలు పద్మ కుమారి, పౌర హక్కుల సంఘం అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్, నారాయణరావు, శాంతక్క, విప్లవ రచయితల సంఘం కేంద్ర కమిటీ సభ్యుడు పాణి, తెలంగాణ ప్రజా ఫ్రంట్ నాయకులు రవి చందర్, బి రమాదేవి, చైతన్య మహిళా సంఘం నాయకురాలు అనురాధ, కళ, మొగిలిచర్ల భారతక్క, ఉస్మానియా విద్యార్థి నాయకులు స్టాలిన్, డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ నాయకులు సుదర్శన్, మా భూమి సంధ్య, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య పల్స నిర్మల, ప్రజా కళామండలి నుండి రాజ నర్సింహ, గద్దర్ సాంబయ్య, కటకం సతీష్, సింగరేణి కార్మిక సంఘం నాయకుడు హుస్సేన్, తెలంగాణ ఉద్యమకారుడు సిఎల్ యాదగిరి, బంధుమిత్రుల సంఘం రాష్ట్ర నాయకులు వీరస్వామి, గుమ్మడిరాజుల సాంబయ్య, అడుగు డిజిటల్ మీడియా తరుపున మార్గం సాయి సందీప్ తేజ, నలమాస రమేష్, పెద్దూరి సోమన్న తదితరులు ఘన నివాళులు అర్పించారు.

ప్రభుత్వ దమనకాండ వివరించిన గాజర్ల అశోక్
అంతిమ యాత్రలో వెలిశాల చౌరస్తా వద్ద నిర్వహించిన సంతాప సభలో గాజర్ల రవి సోదరుడు గాజర్ల అశోక్ అలియాస్ ఐతు మాట్లాడుతూ, వెలిశాల మావోయిస్టుల కళాశాలగా చరిత్రలో నిలిచింది అన్నారు. మా అమ్మ కనకమ్మ ఎంతో పుణ్యం చేసుకుందని, ఆమెకు ఋణపడి ఉన్నామని అన్నారు. అలాగే ఈ విప్లవ ఉద్యమానికి మా అన్నలు సారయ్య అలియాస్ అజాద్, రమేష్ అలియాస్ రమేష్, గాజర్ల రవి అలియాస్ గణేష్, ఉదయ్ లను, నన్ను ఇచ్చిందన్నారు. కొన్ని కారణాల వల్ల తాను బయటికి వచ్చి జన జీవన స్రవంతిలో కలిశానని, ముగ్గురు అన్నలు పేద ప్రజల విముక్తి కోసం తమ ప్రాణాలను త్యాగం చేశారని చెప్పారు. గాజర్ల రవన్న బీటెక్ చదివి, విప్లవ ఉద్యమంలో దళ సభ్యుడిగా చేరి కేంద్ర కమిటీ సభ్యుడిగా తన ప్రాణాన్ని త్యాగం చేసి వెలిశాలకి వచ్చాడని తెలిపారు. వెలిశాల తల్లికి మేము ఎప్పుడు రుణపడి ఉంటామన్నారు. సుమారు 45 ఏళ్ల పాటు విప్లవ ఉద్యమంలో ఉండి పేద ప్రజల విముక్తి కోసం పోరాడారు అన్నారు. ఈ ఎన్కౌంటర్ బూటకమన్నారు. వీళ్లను అడవుల్లో పట్టుకొని, చిత్ర హింసలు పెట్టి, చంపి ఎన్కౌంటర్ అని కేంద్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్రామాలు ఆడుతుందన్నారు. బీజేపీ పార్టీ ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తుందన్నారు. చంపిన డెడ్ బాడీలను ఇవ్వకుండా పైశాచిక ఆనందం పొందే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. తమను గత మూడు రోజులుగా రవి అన్న డెడ్ బాడీ ఇవ్వకుండా చేసినప్పుడు, తాము ఏమి చేశామో, తమను ఇబ్బంది పెట్టిన విధానాన్ని కళ్ళకు కట్టినట్లు వివరించారు. చంద్రబాబు బీజేపీ కూటమిలో ఉండి మోడీ మెప్పు కోసం ఇలాంటి కుట్రలు చేస్తూ, ఇబ్బంది పెడుతున్నారన్నారు. అలాగే తమ అన్నలకు తగట్టు విప్లవ ఉద్యమంలో వారికి భార్యలు దొరికారని, వారు కూడా ప్రాణాలను త్యాగం చేశారన్నారు.


కుటుంబం అంతా విప్లవ ఉద్యమంలోనే..
వెలిశాల గ్రామానికి చెందిన కనకమ్మ కు నలుగురు కుమారులు కాగా అందులో ఒక్కరు మాత్రమే ఉద్యోగంలో స్థిర పడగా, మిగతా ముగ్గురు గాజర్ల సారయ్య అలియాస్ అజాద్, భాస్కర్ – భార్య రమ అలియాస్ అరుణక్క, ఇప్పుడు ప్రాణ త్యాగం చేసిన గాజర్ల రవి అలియాస్ గణేష్, ఉదయ్ – భార్య ప్రమీల అలియాస్ మీనా, గాజర్ల అశోక్ అలియాస్ ఐతు లు, అదే కుటుంబానికి చెందిన గాజర్ల రమేష్ అలియాస్ నవీన్ – భార్య మహమ్మద్ అంకుశాబి అలియాస్ జ్యోతి లు ఉన్నారు. అందులో గాజర్ల అశోక్ అలియాస్ ఐతు మాత్రమే జనజీవన స్రవంతిలో కలువగా, మిగతా వాళ్ళు విప్లవ ఉద్యమంలో ప్రాణ త్యాగం చేశారు.
అంతిమయాత్రలో ప్రజా సంఘాల ప్రశ్నలు
బీజేపీ ప్రభుత్వం హింసకు ఆజ్యం పోస్తున్నది. హిందూ పేరు వాడుతూ, జై శ్రీరామ్ లాంటి దైవ నినాదాలతో మానవత్వం లేని, అమానవీయ మతోన్మాదాన్ని పెంచుతుంది. కొన్ని ఏళ్లుగా సాగుతున్న ప్రజా ఉద్యమాలను అర్థం చేసుకోకుండా, నిరంకుశత్వంతో, అణచివేతకు, విప్లవకారులను అంతం చేసే ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ ఆపరేషన్ కగార్ పేరిట నర బలిని ప్రోత్సహిస్తున్నది. ఇదే పరిస్థితి ఇలాగే కొనసాగితే, భవిష్యత్తులో ప్రశ్నించే గొంతుకలు మిగలవు.

