వీహెచ్ కు సలహా పదవి..|V.HANUMANTHA RAO|ADVISOR
బీసీలకు సానుకూల సంకేతమా?|BC
సీనియర్ల అనుభవానికి గుర్తింపా?|SENIOR LEADERS
పార్టీకి, ప్రభుత్వానికి మేలు చేసేనా?|PARTY|GOVERNMENT
సీఎం పదవి మరింత పదిలమయ్యేనా?|CM
కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావుకు సలహాదారుగా పదవివ్వడం పార్టీలో సీనియార్టీని గౌరవించడమా? బీసీలకు ప్రోత్సహించడమా? టీ జీవన్ రెడ్డి లాంటి సీనియర్ నేత బయటకు వెళ్ళాక ఇచ్చిన ఈ ప్రాధాన్యం పార్టీకి, సీఎం రేవంత్ రెడ్డికి, ప్రభుత్వానికి, చివరకు బీసీలకు ఏవిధంగా ఉపయోగపడుతుంది?
-డాక్టర్ మార్గం లక్ష్మీనారాయణ
కష్ట, సుఖ అన్న కాలాల్లోనూ తన జీవితమంతా కాంగ్రెస్ లోనే ఉంటూ పార్టీకి, బీసీల అండదండగా నిలిచిన 77 ఏళ్ళ సీనియర్ నేత, వీహెచ్ కు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. టీపీసీసీ చీఫ్ గా ఉన్నప్పటి నుండి చీఫ్ మినిస్టర్ గా మూడేళ్ళ పదవీ కాలం పూర్తవుతున్న నేటి దాకా, రేవంత్ రెడ్డి సీనియర్లకు వ్యతిరేకమనే ముద్ర పడింది. 2023 ఎన్నికలకు ముంగిట మాజీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య, నిన్నటి జగిత్యాల మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ టీ జీవన్ రెడ్డి వరకు సీనియర్లను రేవంత్ నిర్లక్ష్యం చేశారన్న విమర్శలూ ఉన్నాయి. అంతేకాదు అలాంటి వాళ్ళు బయటకు వెళ్ళడానికి పార్టీలో వాళ్ళపై మరికొందరిని ఉసిగొల్పారని కూడా స్వయంగా వాళ్ళే చెప్పుకున్నారు. అన్ని దశల్లోనూ పెద్దలు జానారెడ్డి ని గౌరవించినా, కొందరికి రేవంత్ నుండి వ్యతిరేకతే వచ్చింది. బహుషా ఆ నేతల వ్యవహర శైలిలు కూడా కారణం కావచ్చు. ఈదశలో కాంగ్రెస్ లో అత్యంత సీనియర్, బీసీ నేత వీహెచ్ కు సలహాదారు పదవి ఇవ్వడం, పార్టీ బాహ్య, అంతర్గత సమీకరణల్లో ఏమైనా మార్పులకు నాందీ అవుతుందా? సామాజిక సందేశాన్ని ఇస్తోందా? సీనియార్టీకి గౌరవమా? లేక బీసీ వర్గాలకు పెద్దపీట వేయడమా? అనే ప్రశ్నలు సహజంగానే ఉత్పన్నమవుతున్నాయి. జీవన్ రెడ్డి వంటి నేత పార్టీని వీడిన తర్వాత వచ్చిన ఈ మార్పు, పార్టీకీ, ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి నాయకత్వానికి, చివరకు బీసీలకు ఏ మేరకు ఉపయోగపడుతుంది?
దశాబ్దాలుగా కాంగ్రెస్కు సేవలందింస్తున్న వీహెచ్ లాంటి నాయకుడిని సలహాదారుగా గౌరవించడం పార్టీలో అంతర్గతంగా సీనియర్లకు భరోసానిస్తుంది. “సేవలకు గుర్తింపు” అనే భావనను బలపరుస్తుంది. అయితే, ఆయన అనుభవాన్ని పాలనలో వినియోగించుకోవడం కీలకం.
వీహెచ్ బీసీ వర్గానికి చెందిన నాయకుడు. ఆయనకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా బీసీలకు, బీసీల ఓటు బ్యాంకుకు సానుకూల సంకేతం. ఈ నియామకం ద్వారా ప్రభుత్వం “సామాజిక న్యాయం” పట్ల తన నిబద్ధతను ప్రదర్శించినట్లైంది.
జీవన్ రెడ్డి ప్రభావాన్ని పక్కన పెడితే, అలాంటి సీనియర్ పార్టీని వీడటం ప్రతికూలమే. మరో సీనియర్ ను గౌరవించడం ద్వారా వారి అనుభవాన్ని వినియోగించుకోవడానికి పూనుకోవడం రేవంత్ వ్యూహాత్మక నిర్ణయం. సీనియర్ల అంతర్గత అసంతృప్తిని తగ్గించవచ్చు.
ఇప్పటిదాకా పార్టీలో, పాలనలో రేవంత్ రెడ్డి నాయకత్వానికి సీనియర్ల మద్దతు లేదనే అభిప్రాయం ఉంది.
రేవంత్ రెడ్డి యువ నాయకుడు కావడం, సీనియర్లే అన్ని పదవులు కావాలని పట్టుపట్టడం, అనేక అడ్డంకులు కలిగించడం ఇందుకు కారణాలు. అయితే, ఆచితూచి వేసిన ఈ అడుగు సీఎంకు సీనియర్ల సహకారానికి దారి తీస్తుంది. హనుమంతరావు వంటి వ్యక్తి సలహాదారుగా ఉండటం వల్ల పార్టీలో, పాలనలో నిర్ణయాల్లో స్థిరత్వం పెరిగే అవకాశం ఉంది. ఇది యువ నాయకత్వానికి అనుభవం తోడైనట్లు ఉంటుంది.
కాంగ్రెస్లో వర్గపోరాటాలు సహజం. ఒకటి లేదా రెండు, మూడు సామాజిక వర్గాలకే పార్టీలో, పాలనలో అధిక ప్రాధాన్యత లభిస్తోంది. వాటికి భిన్నంగా ఓ సీనియర్ బీసీకిచ్చిన ఈ సలహా అవకాశం కచ్చితంగా ఆ వర్గాలకు కళ్లెం వేయడానికేగాక, బీసీ వర్గాలకు అవకాశాలుంటాయన్న సంకేతాలిచ్చినట్లు అయింది. పైగా వీహెచ్ లాంటి నేతతో పార్టీలో, పాలనలో సమన్వయం సాధించడం సులువు.
ప్రభుత్వ పనితీరుపై ప్రభావం చూపే ఈ సలహాదారు పదవి కేవలం అలంకారపూరితంగా ఉంటే ఆశించిన ప్రయోజనం మాత్రం ఉండదు. హనుమంతరావు అనుభవాన్ని, నిజంగా విధానాల రూపకల్పనలో, సామాజిక సమస్యల పరిష్కారంలో వాడుకుంటే పార్టీకి, ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డికి, బీసీలకు కూడా మంచిది. ప్రభుత్వం పనితీరు మెరుగుపడుతుంది. గ్రామీణ సమస్యలు, బీసీ వర్గాల అభివృద్ధి వంటి అంశాల్లో ఆయన అనుభవం అపారం.
రాజకీయాల్లో నిర్ణయాలు సహజంగానే రాజకీయ ప్రయోజనాల సమీకరణాల మీదే జరుగుతాయి. ఈ నిర్ణయం నిజంగా ప్రయోజనకరమని నిరూపించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై సీఎం రేవంత్ రెడ్డిపై ఉంది. అప్పుడే రేవంత్ రెడ్డి నాయకత్వానికి అటు పార్టీలో, ఇటు ప్రభుత్వంలో, ప్రజల్లో కూడా పట్టు మరింత పెరుగుతుంది.
హనుమంతరావు రాజకీయ జీవితం
ఉత్పల హనుమంతరావు ఓ సాధారణ డ్రైవర్ గా జీవితాన్ని మొదలుపెట్టి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించి, రెండుసార్లు ఎమ్మెల్యే, మూడుసార్లు ఎంపీగా, పీసీసీ అధ్యక్షుడిగా, ఎఐసీసీ కార్యర్శిగా అనేక పదవులు నిర్వహించారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల, జాతీయ రాజకీయాలలో 50ఏళ్ళుగా క్రియాశీలకంగా ఉంటున్నారు. వరుసగా 3 సార్లు ఆంధ్రప్రదేశ్ నుండి రాజ్యసభకి ఎన్నికైన ఐదవ నేత. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ నుండి కాంగ్రెస్ తరపున నాలుగు సార్లు రాజ్యసభకి ఎన్నికకాబడిన ప్రకాశం జిల్లాకి చెందిన వి.సి.కేశవరావు అందరికన్నా ముందున్నారు.
1978-83 మధ్య వీహెచ్ అంబర్పేట్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1979-83 మధ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు. 1985-88 ఏపీసీసీ సంయుక్త కార్యదర్శి,1988-98 ఏపీసీసీ అధ్యక్షుడు. 1989-92లో అంబర్ పేట నుండి మరోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు, 2010-16, 2004-10, 1992-98 రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు.
గాంధీల కుటుంబానికి అత్యంత సన్నిహితుడు. రాజీవ్ గాంధీకి, ఆ తర్వాత సోనియాకి అనుచరుడు. అందువల్లే ఆయనకు అన్ని పదవులు లభించాయంటారు. అయితే అదురు, బెదురు మొహమాటం లేకుండా నిక్కచ్చిగా మాట్లాడటం. నిజాయితీగా వ్యవహరించడం, బీసీల పక్షపాతిగా ఉండటం, ఎవ్వరినైనా ఎదిరించడం.. ఇలాంటి వ్యక్తిత్వంతో రాజకీయాల్లో రాణించడం వీహెచ్ కే చెల్లింది. అయితే, ఆయన హైదరాబాదీ తెలంగాణ యాస ఆయనకు ప్రత్యేకంగా నిలిపింది.

