ఫలితాలు వెలువడడానికి ముందు రోజు ఢిల్లీ నుండి పదిన్నరేళ్ళు నేనే సీఎం అనడం రెట్టింపైన ఆయన ఆత్మవిశ్వాసానికి నిదర్శనం. ఒక నాయకుడు వరుస విజయాలు సాధిస్తే అది ఆయనలోనేగాక, శ్రేణుల్లోనూ విశ్వాసాన్ని పెంచుతుంది. అదే ఇప్పుడు కాంగ్రెస్లో కనిపిస్తున్నది. అయితే విజయం ఎప్పటికీ శాశ్వతం కాదు. ప్రజల అంచనాలు పెరుగుతాయి. వాటిని నెరవేర్చడంలో సఫలమైనంత వరకే విజయాలు వరిస్తూ ఉంటాయి. పరిపాలన సాఫల్యాలే ఎన్నికల విజయాలు. స్థిరమైన పరిపాలన, పురోగతి మాత్రమే అధికారాన్ని సుస్థిరం చేస్తుంది.
డా. మార్గం-అడుగు, ఎడిటోరియల్
తెలంగాణ రాజకీయాల్లో పట్టణ ఎన్నికల ఫలితాలు కొత్త సమీకరణాలను తెరమీదకు తెస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఏర్పడిన రాజకీయ వాతావరణం కేవలం తాత్కాలికమా? లేక శాశ్వత మార్పులకు అంకురార్పణా? అన్న ప్రశ్నకు ఈ ఫలితాలు స్పష్టమైన సంకేతాలు ఇస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో గ్రామీణుల్లో పట్టు బిగించిన కాంగ్రెస్, పట్టణ ఓటర్లలో తన పట్టు నిలబెట్టుకోవడం రాజకీయంగా కీలక పరిణామం.
2023 అసెంబ్లీ ఎన్నికల విజయంతో ప్రారంభమైన కాంగ్రెస్ విజయ పరంపర, లోక్సభ ఎన్నికలు, ఉపఎన్నికలు, పంచాయితీ ఎన్నికలు దాటి ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల వరకు విస్తరించడం యాదృచ్ఛికమేమీ కాదు. ఇది ఓటర్లలో చోటుచేసుకుంటున్న మానసిక మార్పునకు సూచిక. పట్టణ ఓటరు సాధారణంగా అభివృద్ధి, మౌలిక వసతులు, పారదర్శక పాలన వంటి అంశాల ఆధారంగా నిర్ణయం తీసుకుంటాడు. ఈ భావనను సరిగ్గా అర్థం చేసుకున్న కాంగ్రెస్, ప్రచారంలో అభివృద్ధి అజెండాను ముందుకు తెచ్చింది. “అధికార పార్టీకి పట్టం కడితేనే అభివృద్ధి సాధ్యం” అన్న సందేశాన్ని బలంగా నాటడంలో విజయం సాధించింది.
ఇక బీఆర్ఎస్ ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన సమయమిది. దాదాపు పదేళ్ల పాలన తర్వాత ఎదురైన ఓటమి నుంచి పరాజయాల పరంపర కొనసాగుతూనే ఉంది. తొడకొడుతూ, రొమ్ము విరుస్తూ, విర్రవీగుతూ, బస్తీమే సవాల్! అంటూన్న ఆ పార్టీ కారు బస్తీల్లోనూ బోల్తా కొట్టింది. కాలుదువ్వుతున్న కారు పార్టీ ఇంకా కోలుకోలేదనేది స్పష్టమవుతోంది. మాజీ సీఎం చంద్రశేఖర్ రావు ప్రత్యక్షంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనకపోవడం, కేటీఆర్, హరీశ్ రావుల పర్యటనలు పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపినా, ఫలితాలు రాకపోవడం ఆలోచించాల్సిందే. ఆ పార్టీని నడిపిన కుటుంబంపై అవినీతి ఆరోపణలు, అప్పుల భారం, నేతల ఆస్తుల పెరుగుదల వంటి మచ్చలు మాసిపోలేదు. చర్చలు ఆగిపోలేదు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ రెండో స్థానానికి పరిమితమవడం ఆశ్చర్యమేమీ కాదు. రాజకీయాల్లో ఇమేజ్ కీలకం. ఒకసారి దెబ్బతింటే దాన్ని తిరిగి పొందడం కష్టం.
బీజేపీ కొన్ని కార్పొరేషన్లలో ఆధిక్యం ప్రదర్శించినా అది రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగిందని చెప్పడానికి సరిపోదు. కరీంనగర్, నిజామాబాద్ ల్లో కనిపించిన ప్రభావం స్థానిక నేతల వ్యక్తిగత బలమే. బండి సంజయ్, ధర్మపురి అర్వింద్ వంటి నేతల కృషి అక్కడ ప్రతిఫలించినట్లు కనిపిస్తోంది. అయితే రాష్ట్రవ్యాప్తంగా బలమైన పునాదులు వేయాలంటే కేవలం విమర్శలకే పరిమితమవకుండా, అభివృద్ధి కార్యాచరణపై స్పష్టమైన దృష్టి, ప్రణాళిక అవసరం. కేంద్ర సహకారంతో రాష్ట్రానికి కనీస నిధులు తెచ్చి, మౌలిక వసతుల అభివృద్ధి చేయగలిగితేనే పార్టీకి దీర్ఘకాలంలోనైనా మనుగుడ ఉంటుంది.
ఈ ఎన్నికలలో మరో ఆసక్తికర పరిణామం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రాజకీయ అడుగులు. కుటుంబ రాజకీయాలనుంచి దూరమవుతూ ఫార్వర్డ్ బ్లాక్ గుర్తుతో పోటీ చేసి గద్వాల జిల్లా వడ్డేపల్లిలో విజయం సాధించడం ఆమెకు రాజకీయంగా ఊతమిచ్చే పరిణామం. కొత్త రాజకీయ వేదిక కోసం ప్రయత్నిస్తున్న ఆమెకు ఇది ప్రాథమిక విజయమే. అయితే ఈ విజయంపై వివాదాలు వచ్చాయి. ఈ విజయాన్ని విస్తృత స్థాయికి తీసుకెళ్ళడంపైనే ఆమె రాజకీయ భవితవ్యం ఆదారపడి ఉంది.
పట్టణ ఓటర్ల ఆలోచన గ్రామీణ ఓటర్లకన్నా భిన్నంగా ఉంటుంది. డ్రైనేజీ, రోడ్లు, తాగునీరు, పారిశుద్ధ్యం వంటి స్థానిక సమస్యలను కాంగ్రెస్ ప్రచారం చేయడం కలిసివచ్చింది. మంత్రులకు ప్రాంతాల వారీగా బాధ్యతలు అప్పగించడం, ఎన్నికల యంత్రాంగాన్ని క్రమబద్ధంగా నడపడం, నిరంతర పర్యవేక్షణ చేయడం వంటి వ్యూహాలు ఫలితాలపై ప్రభావం చూపాయి.
ఈ ఫలితాలు రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని మరింత బలపరుస్తున్నాయి. పార్టీలో అంతర్గతంగా ఆయన ఆధిపత్యం పెరుగుతుంది. అందుకే ఆయన ఫలితాలు వెలువడడానికి ముందు రోజు ఢిల్లీ నుండి పదిన్నరేళ్ళు నేనే సీఎం అనడం రెట్టింపైన ఆయన ఆత్మవిశ్వాసానికి నిదర్శనం. ఒక నాయకుడు వరుస విజయాలు సాధిస్తే అది ఆయనలోనేగాక, శ్రేణుల్లోనూ విశ్వాసాన్ని పెంచుతుంది. అదే ఇప్పుడు కాంగ్రెస్లో కనిపిస్తున్నది. అయితే విజయం ఎప్పటికీ శాశ్వతం కాదు. ప్రజల అంచనాలు పెరుగుతాయి. వాటిని నెరవేర్చడంలో సఫలమైనంత వరకే విజయాలు వరిస్తూ ఉంటాయి. పరిపాలన సాఫల్యాలే ఎన్నికల విజయాలు. స్థిరమైన పరిపాలన, పురోగతి మాత్రమే అధికారాన్ని సుస్థిరం చేస్తుంది.

