డాక్టర్ లింగంపల్లి రామచంద్ర మన కాలపు మహా కవి. మంచి మనీషి. మంత్ర ముగ్ధులను చేసే మధురమైన వక్త. అశీతి దాటినా అలుపెరుగని నిత్య సాహిత్య కృషీవలుడు. పాలకుర్తి సోమనాథ కళా పీఠం పురస్కార గ్రహీత. పురస్కార నిర్ణాయక మండలి సభ్యుడు. తెలుగు విశ్వవిద్యాలయం ప్రతిభా పురస్కార గ్రహీత. రామచంద్ర గారికి సినారె సాహితీ పీఠం 2025 ఆగస్ట్ 3 ఆదివారం నాడు హైదరాబాద్ లో జీవన సాఫల్య పురస్కారం అంద చేస్తున్నది. ఈ సందర్భంగా పాలడుగు రత్నాకర్ రావు వ్రాసిన అభినందన వ్యాసం
నిత్య వసంతుడు! డాక్టర్ లింగంపల్లి రామచంద్ర
ప్రేమాస్పదులు డాక్టర్ లింగంపల్లి రామచంద్ర గారు సినారె జీవన సాఫల్య పురస్కారాన్ని స్వీకరిస్తున్న సమయంలో మీరు ఈ వ్యాసాన్ని చదువుతుంటారు. ఆశీతి వసంతాలని ఆస్వాదించి, ఎనుబది ఒకటిలోకి ఆడిగిడిన లింగంపల్లి గారు సాహిత్య పొదల్లో నిత్య వసంతుడే.
2010 సంవత్సరంలో తన పూర్వ విద్యార్థి డాక్టర్ పోరెడ్డి రంగయ్య సంపాదకత్వంలో వెలువరించిన “నిత్య చైతన్య శీలి సినారె” (సినారె 80వ జన్మదినోత్సవ అభినందన కవితా సంకలనం) పుస్తకపు ముందు మాట ప్రారంభంలో డాక్టర్ లింగంపల్లి రామచంద్ర తీసుకున్న సినారె పలుకులు ఎనమిది పంక్తులు గుర్తుకు తెచ్చుకుంటే, అందులోని
“ఏదైనా రాయందే
ఈ క్షణాన్ని పోనీయను
కలాన్ని పిండేయందే
కాలాన్ని కదలనీయను”
అనే ఈ నాలుగు పంక్తులు.. లింగంపల్లి గారికి కూడ వర్తిస్తాయి. ఎనమిదవ దశకంలోను లింగంపల్లి గారు చేస్తున్న పని అదే.
విద్యాభ్యాసం నుండే వీరికి సాహిత్యంపై ఆసక్తి కలిగించిన వారిగా కోవెల సంపత్కుమారాచార్యులు, చలమచర్ల రంగాచార్యులు, అమరేశం రాజేశ్వర శర్మ, కోవెల సుప్రసన్నాచార్యులు, ఎం. కులశేఖర రావు, మాదిరాజు రంగారావు, పేర్వారం జగన్నాథం బోధనలేనని చెప్పుకుంటారు రామచంద్ర. ఇక జనగామ ప్రాంతీయులలో తనకు సాహిత్యాభిలాషను కలిగించిన వారిలో అమరులైన రాగి నర్సింహులు, పెద్ది నారాయణ, చందా యాదగిరి, శ్రీభాష్యం శ్రీనివాసాచార్యులు, గుండాల నరసింహా రావు, చీలా రాజయ్య, నాగబండి సుదర్శనం, జి వై గిరి, చిట్టిమల్లె శంకరయ్య గారలే అని జ్ఞాపకం చేసుకుంటారు. ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నప్పుడే డా. తిరునగరి గారి ప్రోత్సాహంతో 1972 నుండి సాహిత్య క్షేత్రంలోకి అడుగిడి గేయాలు, కవితలు రాస్తున్నారు.
నిరంతర అధ్యయనంతో వివిధ ప్రక్రియలతో లింగంపల్లి ఇప్పటి వరకు 17 గ్రంథాలను వెలువరించారు. మొదటిదిగా 1993లో “ఆత్మ అక్షరమైన వేళ” ప్రచురించగా, 19వ శతాబ్ధం కవి శ్రీ రంగరాజు కేశవరావు గారి వివిధ పక్రియలైన ప్రబంధం, శతకం, యక్షగానం, కీర్తనం వంటి రచనలపై సమగ్ర పరిశోధన చేసి, “శ్రీ రంగరాజు కేశవ రావు సాహిత్యం – పరిశీలన” సిద్ధాంత గ్రంథంగా ప్రచురించారు 1994 లో.
“ఎప్పడూ వసంతానివే” (కవితా సంపుటి) 1995, “అమ్మ పిలుస్తోంది” (కవితా సంపుటి) 1997, “గదిలో నక్షత్రం” (కవితా సంపుటి) 1999, “ఆకాశం నా సంతకమే” (కవితా సంపుటి) 2000, “ఆమనిలో వెన్నెల కోయిల” (కవితా సంపుటి) 2001, “మరో ఉదయాన్ని పిలుస్తా” (కవితా సంపుటి), “సినారె కవితాలోకనం” (వ్యాసాలు) 2002, “సరళ రేఖలు” (వ్యాసం) 2003,
“తూర్పు తీరం” (కవిత) 2008, “నడుస్తున్న అక్షరం డా౹౹ పల్లేరు వీరస్వామి” (జీవన సాహితీ రేఖలు) 2010, “కొమురవల్లి మల్లన్న క్షేత్ర మహత్యం” 2011, “సినారె వాక్కుకు వయస్సు లేదు” (తత్వ విశ్లేషణ) 2014, “వాల్మీకి ఆశ్రమస్థలి వెల్ది” (వెల్ది గ్రామ చరిత్ర) 2017, “సమీక్షణం” (సాహిత్య వ్యాస సంపుటి) 2018, “జనగామ జిల్లా సాహిత్య చరిత్ర” 2021. వీటితో తెలుగు సాహిత్యంలో మూలాలను వెతికి అందించిన తీరు జనగామ జిల్లా ఘనతను చాటిచెపుతుంది.
సాహితీ పెద్దలైన డాక్టర్ శేషేంద్ర ఒక వ్యాఖ్యలో ప్రకటించినట్లు “లింగంపల్లి అన్నది ఒక వ్యక్తి పేరు మాత్రమే కాక, ఒక మహాకవి పేరు కూడా! అందుచేత పాఠకలోకం జ్ఞాపకం ఉంచుకోవలసిన నామధేయం. ఖబద్దార్, ఈయన పేరు చరిత్రలో నిలుస్తుంది!”. ఆనాడు వారు అన్నట్లుగానే లింగంపల్లి పేరు తెలుగు సాహిత్య చరిత్రలో దాగి వుంది నేడు. కవిగా, విమర్శకుడిగా, సంపాదకులుగా ఏది రాసినా మనసు పెట్టి రాస్తారు. పాఠక లోకానికి సాహిత్యంలో విశేషమైన సేవలందిస్తారు.
వారు ఇప్పటి వరకు వెలువరించిన పుస్తకాలతో పాటు మరిన్ని ముద్రణలో ఉన్నవి. ఆముద్రితాలు కోకొల్లలు. వివిధ పత్రికల్లో ప్రచురితమైనవి వ్యాసాలు, విశ్లేషణలు, రాసిన ముందుమాటలు లెక్కకు దొరుకనివి. పొందిన బిరుదులు, అందుకున్న అవార్డులు, సన్మానాలు ఇవ్వన్ని లెక్క తీయాలంటే, వీరి సాహిత్యం గురించి పరిశోధన చేసే వారికే సాధ్యమేమోగాని, ఒక విశ్లేషకుడి నుండి మాత్రం సాధ్యం కానిపని. మొక్కగా వికసించి మహా వృక్షంగా ఎదిగిన వ్యక్తి, నాకు తెలిసిన మహా మనిషి డాక్టర్ లింగంపల్లి రామచంద్ర.
సినారె, దాశరథి గారల అభిమాన పాత్రులైన లింగంపల్లి రామచంద్ర గారికి “సినారె జీవన సాఫల్య పురస్కారం” అందజేయడం సముచితం. డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి 94వ జయంతి సందర్భంగా తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో పురస్కార ప్రదానం చేస్తున్న మహాకవి సినారె సాహితీ పీఠం, హైదరాబాద్ వారు అభినందనీయులు.

✍పాలడుగు రత్నాకర్ రావు
ఫోన్: 83676 57586
(డాక్టర్ లింగంపల్లి రామచంద్ర సినారె జీవన సాఫల్య పురస్కారం స్వీకరిస్తున్న సందర్భంగా)

