గెలిస్తే కేసీఆర్ క్రెడిట్|CREDIT
ఓడితే ప్రజలదే పొరపాటు|PEOPLE
గులాబీ బాస్ వింత శోధన|PINK BOSS
కేసీఆర్ వితండ వాదన
వెయ్యేళ్ళైనా బీఆర్ఎస్ కు బుద్ధి రాదా?
ఇక కేసీఆర్, ఆయన ఫ్యామిలీ మారదా?
‘అప్పుడు ఓట్లేసి తప్పు చేశారు… ఇప్పడు ప్రజలు బాధపడుతున్నారు’ అని తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ మోన్నామధ్య జగిత్యాల సభలో మరోసారి అన్నారు. అంతకుముందు వరంగల్ సభలో, ఇంకా అంతకుముందు అనేక వేదికల్లో అదే అదే పదేపదే అంటూనే ఉన్నారు. ఆ విధంగా తమ తప్పులను కూడా ఇంకోసారి ప్రజల మీదకే నెట్టేశారు. ‘తప్పులెన్ను వారు తమ తప్పులెరగరని..’ తమ తప్పులేవీ లేనట్లుగానే నిందను మరోసారి ప్రజలమేదేసేశారు. కేసీఆర్ మాటల్లో ‘ఆత్మ పరిశీలన’ కంటే ‘ఆత్మ న్యూన’తే ఎక్కువగా కనిపిస్తోంది. ‘ఆత్మస్తుతి పరనిందే’ అగుపిస్తోంది. ఆత్మగౌరవం కంటే ఆత్మ వంచనే ప్రస్ఫుటిస్తోంది.
మరి ఆయన పార్టీ ఎందుకు ఓడిపోయింది? ఆ పార్టీని జనం ఎందుకు ఓడగొట్టారు? ఆయన అన్నట్లుగానే ‘తప్పు’ గానైనా సరే, కాంగ్రెస్ కు ఓటెందుకు వేశారు? ఆ పరిస్థితిని తెచ్చెందవరు? తెంచుకుందెవరు? ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకోవాలంటారు. మరి బీఆర్ఎస్ కు గానీ, ఆ పార్టీని నడుతపుతున్న కేసీఆర్ కుటుంబానికి గానీ ఇంకా ఆ జ్నానోదయం కానట్లేనా? 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన ఎంపీ, ఎమ్మెల్సీ, ఉప ఎన్నికలు, గ్రామ పంచాయతీల ఎన్నికల ఫలితాలు కూడా వారికి కనువిప్పు కలిగించలేదా? ఇలాగైతే మరి వచ్చే ఎన్నికల్లో తామే గెలవగలరా? కాంగ్రెస్ ను ఓడించగలరా? ప్రత్యామ్నాయంగా ఎదగగలరా? బీఆర్ఎస్ లో అంతర్మథనం, ఆత్మశోధనం, అంతరించినట్లేనా? మరైతే ఆ పార్టీ భవిష్యత్తేంటి?
డాక్టర్ మార్గం లక్ష్మీనారాయణ
అంతర్మథనం, స్వీయ సమీక్షకు బదులు ప్రజలే తప్పు చేశారని పదే పదే అనడం కేసీఆర్ అతి విశ్వాసానికి నిదర్శనం. గెలిస్తే ఆక్రెడిట్ నాది.. ఓడితే ప్రజలదనే భావన కేసీఆర్ కు అలవాటే. 2008 ఉప ఎన్నికల్లోనూ ఇలాగే మాట్లాడారు. ఉద్యమ అవసరాల రీత్యా ప్రజలు నాడు కేసీఆర్ ను భరించారు. రాష్ట్రావతరణానంతర, ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు.
కేసీఆర్ తాజా వ్యాఖ్యలు ఆయన సొంత పార్టీలోనే దుమారం రేపుతున్నాయి. ఒక రకంగా ఇది ప్రజాస్వామ్యంలో ఓటరు విచక్షణను ప్రశ్నించడమే! పైగా 2023 అసెంబ్లీ ఎన్నికల నుంచి నేటి దాకా మునిగి తేలుతున్న బీఆర్ఎస్ ఓటములన్నింటికీ ప్రజలదే తప్పా? అలాగైతే కేసీఆర్, బీఆర్ఎస్, పదే పదే అదే పనిగా ప్రజల్ని అవమానిస్తున్నట్లే!
సంఖ్యలేవీ సాక్షాత్కరించట్లేదా?
ఎన్నికలేవైనా అవి స్పష్టమైన ప్రజా తీర్పే. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ది సాధారణ ఓటమేమీ కాదు. మొత్తం 119 స్థానాలకు ఎన్నికలు జరగగా, కాంగ్రెస్ 64 స్థానాలు, బీఆర్ఎస్ 39 స్థానాలు గెలిచాయి. కాంగ్రెస్ కు 39% ఓట్లు పడగా, బీఆర్ఎస్ కు 37% ఓట్లు పడ్డాయి. కేవలం 2% ఓటు తేడా, 25 సీట్ల వ్యత్యాసానికి కారణమైంది. అంటే, చిన్న మార్పులు కూడా రాజకీయ ఫలితాలను భారీగా ప్రభావితం చేస్తాయి. ఇది బీఆర్ఎస్కు మాత్రమే కాదు కాంగ్రెస్ కు కూడా ఓ హెచ్చరిక. ప్రజల భావోద్వేగాల్లో స్వల్ప తేడాలు, భారీ మూల్యంగా మారి, అధికారం అటుఇటు అయ్యే ప్రమాదం ఉంది.
అందులో10 మంది ఫిరాయింపు
తెలంగాణలో 2023 ఎన్నికల ఫలితాల తర్వాత పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరారు. దానం నాగేందర్ (ఖైరతాబాద్), కడియం శ్రీహరి (స్టేషన్ ఘన్పూర్), పోచారం శ్రీనివాస్రెడ్డి (బాన్సువాడ), తెల్లం వెంకట్రావు (భద్రాచలం), అరికెపూడి గాంధీ (శేరిలింగంపల్లి), కాలె యాదయ్య (చేవేళ్ల), బండ్ల కృష్ణమోహన్రెడ్డి (గద్వాల్), గూడెం మహిపాల్రెడ్డి (పటాన్చెరు), సంజయ్ (జగిత్యాల), ప్రకాష్ గౌడ్ (రాజేంద్రనగర్)లపై సుప్రీం కోర్టు తీర్పుల తర్వాత, స్పీకర్ రూలింగ్ ఇచ్చినప్పటికీ, ఇంకా న్యాయపోరాటం జరుగుతోంది.
పార్లమెంట్ ఎన్నికల్లో ‘సున్నా’లే
2024 పార్లమెంట్ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ కు ఎదురు దెబ్బే తగిలింది. తెలంగాణ తెచ్చామని చెప్పుకుంటున్న బీఆర్ఎస్ ఒక్క సీటుని కూడా గెలుచుకోలేదు. పార్టీ చరిత్రలోనే తొలిసారిగా 14 స్థానాల్లో మూడో స్థానానికే పరిమితమైంది. మిగతా స్థానాల్లో డిపాజిట్లు దక్కలేదు.
ఉప ఎన్నికల్లోనూ విపరిణామాలే
2024 సికింద్రాబాద్ కంటోన్మెంట్ సిట్టింగ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత అకాల మరణంతో జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలిచింది. జూబ్లీహిల్స్ సిటింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీ నాథ్ మరణంతో నవంబర్ 2025 లో జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెసే విజయం సాధించింది.
పంచాయతీల్లోనూ పరాభవాలే
2025 డిసెంబర్లో పార్టీల గుర్తులు లేకుండా జరిగిన తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. 12,700పై చిలుకు గ్రామ పంచాయతీల్లో 56శాతానికిపైగా కాంగ్రెస్ 26శాతానికి పైగా బీఆర్ఎస్ గెలుచుకుంది.
మున్సిపోల్స్ లోనూ మునుపటే
2026 తెలంగాణ మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ ఆధిక్యాన్ని ప్రదర్శించింది. కాంగ్రెస్ 51.3% ఓటు షేర్ తో అత్యధిక స్థానాలను గెలుచుకుని, పట్టణ ప్రాంతాల్లో తన పట్టును నిరూపించుకుంది. బీఆర్ఎస్ 26.1% ఓటు షేర్ తో రెండో స్థానానికి పరిమితమైంది.
ఆయన తప్పులెన్నున్నా, ప్రజలే తప్పు చేస్తున్నారా?
కేసీఆర్ వ్యాఖ్యలను బట్టి, పదే పదే ప్రజలే తప్పులు చేస్తున్నారు. ఆయన అసెంబ్లీకి రాకపోయినా, ఫాం హౌస్ నుంచి బయటకు రాకపోయినా, ప్రజా సమస్యలపై స్పందించకపోయినా, అవినీతికి పాల్పడినట్లుగా ఎన్ని ఆరోపణలు వచ్చినా, ఆయన సీఎంగా ఉండగానే కాళేశ్వరం కూలిపోయినా, న్యాయపరమైన సాంకేతిక లోపాలతో కోర్టుల్లో బెయిల మీద బెయిల్లు తెచ్చుకుంటున్నా, విచారణలు ఎదుర్కొంటున్నా, వాటిని ప్రజలు ఒప్పులుగా భావించకుండా, ప్రతి ఎన్నికలోనూ బీఆర్ఎస్ ను తిరస్కరిస్తుండటం నిజంగా ప్రజల తప్పే? నేమో? ప్రతీ ఎన్నికనీ ప్రజా పాలనకు రెఫరెండమే అంటారు. ప్రజల తీర్పు వెలువడ్డాక అది తప్పంటారు? మీకనుకూలంగా ఉంటేనే ఒప్పా? మీరేం చేసినా ప్రజలు భరించాలి. మీ పల్లకీని మోసి తరించాలి. అంతేనా? కేసీఆర్ గారూ…
అసలు కారణాలివే?
2023 ఎన్నికల్లో కాంగ్రెస్కు ప్రజలు ఓటేశారంటే, అది కేవలం “పొరపాటో, గ్రహపాటో” కాదు. బీఆర్ఎస్ పాలనపై ఉన్న వ్యతిరేకత. మార్పు కోరుకున్న ప్రజల ఆకాంక్ష. అధికార, అవినీతి కేంద్రీకరణ, పరిపాలన నిర్ణయాలు, చివరికి అవినీతి కూడా ఆ కుటుంబానికే పరిమితమైందే భావన ప్రజల్లో బలపడింది. రాష్ట్రం మొత్తం కేసీఆర్ కుటుంబ కబంధ హస్తాల్లో కూరుకుపోయింది. అధినాయకత్వంలో అహంకారం పెచ్చుమీరింది. సీఎం దగ్గర మంత్రులకు, మంత్రుల దగ్గర ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్యేల దగ్గర మిగతా కేడర్ కు అపాయింట్ మెంట్ కూడా దొరకని దురవస్థ ఏర్పడింది.
పాలనపరంగా, లక్షల కోట్ల అప్పుల పట్ల ప్రజల్లో విస్మయం, నిరుద్యోగ యువతలో అసంతృప్తి, గ్రామీణ అభివృద్ధిలో విపరీత అసమానలు “మార్పు అవసరం” అనే అనివార్య భావనలోకి ప్రజల్ని నెట్టాయి.
కాంగ్రెస్కు పాజిటివ్ కంటే నెగటివ్ మాండేట్
కాంగ్రెస్ గెలుపు పూర్తిగా తమ బలంతోనే రాలేదనే వాస్తవాన్ని ఆ పార్టీ నాయకత్వం, కేడర్ మొత్తం అంగీకరిస్తోంది. బీఆర్ఎస్పై ఉన్న వ్యతిరేకత కారణంగా వచ్చిందనేదే వాస్తవం. ఆరు గ్యారెంటీలు, ఇతర సంక్షేమ హామీలు, సుదీర్ఘంగా అధికారానికి దూరమైన కేడర్ కు బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవమానాలు, వారిలో మార్పు కోరికను, చురుకుదనాన్ని, కసిని పెంచాయి. దీనికి ప్రజా స్పందన తోడైంది.
పైగా వరుస ఓటములు ఎప్పటికప్పుడు హెచ్చరికలు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా గెలవలేకపోవడం, అనేక చోట్ల డిపాజిట్లు కోల్పోవడం ఆ పార్టీకి అతిపెద్ద హెచ్చరిక. మున్సిపల్, గ్రామ పంచాయతీ స్థాయిల్లో కూడా పార్టీ పట్టు కోల్పోతుండటం కేడర్లో నైరాశ్యాన్ని నింపుతోంది.
కేసీఆర్ కుటుంబానికీ ఇప్పటికీ “తాము చేసిన అభివృద్ధిని ప్రజలు గుర్తించలేదు” అనే ధోరణే కనిపిస్తోంది తప్ప, “ప్రజలు మా నుండి ఇంకేం కోరుకుంటున్నారు?” అనే కోణంలో ఆలోచిస్తున్నట్లు లేదు.
ప్రత్యామ్నాయంగా ఎదగగలరా?
ప్రస్తుతానికి తెలంగాణలో ప్రధాన పోటీ కాంగ్రెస్ బీజేపీ మధ్య అన్నట్లుగా మారుతోంది. బీఆర్ఎస్ తన ఉనికిని కాపాడుకోవడం అంత ఈజీ ఏమీ కాదు. ప్రజా తీర్పును గౌరవిస్తూ, తమ వైఫల్యాలను అంగీకరించడం ద్వారా మళ్లీ విశ్వసనీయతను పొందవచ్చు. కేవలం ప్రెస్ మీట్లకు, ప్రెస్ నోట్లకు. సోషల్ మీడియా ట్వీట్లకు, మీడియా లాబీయింగ్ కే పరిమితం కాకుండా, క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలపై పోరాడాలి. పార్టీని వీడుతున్న నేతలను ఆపి, కార్యకర్తల్లో ధైర్యం నింపడం ఇప్పుడు అత్యవసరం.
“ప్రజలు తప్పు చేశారు” అనడం కంటే, “ప్రజల మనసు గెలవడంలో విఫలమయ్యాం?” అని బీఆర్ఎస్ ప్రశ్నించుకున్నప్పుడే వారికి మళ్లీ పూర్వవైభవం వచ్చే అవకాశం ఉంటుంది. లేదంటే, మీరు అన్నట్లుగా ‘అంతర్మథనం’ లేని పార్టీలు కాలక్రమేణా అంతరించిపోక తప్పదు. వచ్చే ఎన్నికల నాటికి కాంగ్రెస్ను ఓడించాలంటే, కేవలం యతి, ప్రాసలు, సెటైర్లు, విమర్శలు సరిపోవు. ప్రజలు ఆశించి, నమ్మే బలమైన మార్పును అధికార పార్టీకి ప్రత్యామ్నాయంగా బీఆర్ఎస్ చూపించాల్సి ఉంటుంది. లేదంటే కేసీఆర్ తనయ చెబుతున్నట్లు వెయ్యేళ్ళైనా ఆ పార్టీ మారదా? కేసీఆర్, ఆయన వందిమాగధులు కూడా మారరా?
అయితే ఇవేవీ అనుభవం నిండిన కేసీఆర్ కు అర్థం కానివీ, తెలియనివీ అంతకన్నా కావు. అధికారం, ఉద్యమం, తిరిగి అధికారం.. సహజంగానే నిరపేక్షమైన అప్రతిహత అహంకారాన్ని తెచ్చిపెడతాయి. పైగా తమ తప్పులని కూడా, ప్రజల మీదే నెట్టేస్తే తాము ఒప్పైపోతారు. పదే పదే అదే పనిగా అబద్ధాలని కూడా ప్రచారం చేస్తే అవే నిజమై ఊరేగుతాయని ఆయన, ఆయన కుటుంబం బలంగా నమ్మడం వల్లే ఇదంతా. అయితే జనం ప్రలోభాలకు పడిపోతున్నప్పటికీ, అంత అమాయకంగా ఉన్నారనుకోవడం భ్రమే.


