అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వలస విధానాలపై, హెచ్-1బీ వీసాలపై విధించిన లక్ష డాలర్ల ఫీజును బోస్టన్ ఫెడరల్ కోర్టు చట్టవిరుద్ధమని ప్రకటించింది. ఆ తీర్పు భారతీయ వృత్తి నిపుణులకు తక్షణ ఊరటనిచ్చినా, అంతిమ పరిష్కారం మాత్రం కాదు. అప్పీల్ ప్రక్రియ, భవిష్యత్ విధాన నిర్ణయాలు, అమెరికా రాజకీయ పరిస్థితులు కలిసి హెచ్-1బీ వీసాల భవిష్యత్తును నిర్ణయించనున్నాయి. ప్రస్తుతానికి మాత్రం ట్రంప్ వలస విధానాలకు ఇది గట్టి ఎదురుదెబ్బగా, భారతీయ ప్రతిభకు ఆశాకిరణంగా నిలిచింది.
డా. మార్గం-అడుగు, ఎడిటోరియల్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వలస విధానాలపై మరోసారి న్యాయవ్యవస్థ గట్టి సందేశమే ఇచ్చింది. విదేశీ నిపుణుల నియామకాలకు కీలకమైన హెచ్-1బీ వీసాలపై ట్రంప్ ప్రభుత్వం విధించిన లక్ష డాలర్ల ఫీజును బోస్టన్ ఫెడరల్ కోర్టు చట్టవిరుద్ధమని ప్రకటించింది. అమెరికాలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఐటీ, సాంకేతిక రంగాల్లో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా హెచ్-1బీ వీసాల లబ్ధిదారుల్లో అత్యధిక శాతం భారతీయులే కావడంతో ఈ తీర్పు భారతీయ వృత్తి నిపుణులకు కొంత ఉపశమనాన్ని కలిగించనుంది.
అమెరికా ఆర్థిక వ్యవస్థలో విదేశీ ప్రతిభ పాత్ర అనివార్యమైంది. సాంకేతిక, ఆరోగ్య సంరక్షణ, కృత్రిమ మేధస్సు, అధునాతన తయారీ రంగాల్లో నైపుణ్యం కలిగిన ఉద్యోగుల కొరతను భర్తీ చేయడంలో హెచ్-1బీ వీసా వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తోంది. ప్రతి సంవత్సరం అమెరికా ప్రభుత్వం 65 వేల సాధారణ హెచ్-1బీ వీసాలు జారీ చేస్తోంది. అదనంగా అమెరికాలో మాస్టర్స్ లేదా అంతకంటే ఉన్నత విద్యను అభ్యసించిన విదేశీయులకు మరో 20 వేల వీసాలు కేటాయిస్తుంది. మొత్తంగా ఏటా 85 వేల వీసాలు అందుబాటులో ఉంటాయి.
ఈ వీసాల లబ్ధిదారుల్లో దాదాపు 70 శాతం మంది భారతీయులే. చైనా రెండో స్థానంలో ఉండగా, మిగతా దేశాల వాటా పరిమితంగానే ఉంటుంది. భారత ఐటీ రంగ దిగ్గజాలు, అమెరికాలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న అంతర్జాతీయ సాంకేతిక సంస్థలు ఈ వీసాలపై ఎక్కువగా ఆధారపడుతున్నాయి.
అయితే, అమెరికా ఉద్యోగాలు అమెరికన్లకే అన్న నినాదంతో ట్రంప్ ప్రభుత్వం గత ఏడాది హెచ్-1బీ వీసా ఫీజును భారీగా పెంచింది. ఇంతకు ముందు రెండు వేల నుంచి ఐదు వేల డాలర్ల మధ్య ఉన్న వ్యయాన్ని ఏకంగా లక్ష డాలర్లకు పెంచడం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ నిర్ణయం వెనుక ఉద్దేశం విదేశీ ఉద్యోగుల నియామకాలను తగ్గించడం, స్థానికులకు అవకాశాలు పెంచడం. కానీ వాస్తవంలో ఈ నిర్ణయం అనేక కంపెనీలపై తీవ్ర ఆర్థిక భారాన్ని మోపింది.
ఒక సంస్థ 50 మంది విదేశీ నిపుణులను నియమించుకోవాలంటే కేవలం ఫీజులకే 50 లక్షల డాలర్లు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా అనేక కంపెనీలు హెచ్-1బీ నియామకాలను తగ్గించగా, మరికొన్ని ప్రాజెక్టులను వాయిదా వేశాయి. ఇప్పటికే కృత్రిమ మేధస్సు, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ భద్రత వంటి రంగాల్లో నైపుణ్యాల కొరతను ఎదుర్కొంటున్న అమెరికా సంస్థలు మరింత ఇబ్బందులు ఎదుర్కొన్నాయి.
ఈ నేపథ్యంలో వ్యాపార సంస్థలు, పలు రాష్ట్ర ప్రభుత్వాలు, వలస హక్కుల సంఘాలు కోర్టును ఆశ్రయించాయి. విచారణ అనంతరం బోస్టన్ ఫెడరల్ కోర్టు కీలక తీర్పు వెలువరించింది. కాంగ్రెస్ అనుమతి లేకుండా అధ్యక్షుడు ఏకపక్షంగా ఇలాంటి భారీ రుసుమును విధించలేరని స్పష్టం చేసింది. ఈ ఫీజు వాస్తవానికి పన్ను స్వరూపంలో ఉందని, పన్నులు విధించే అధికారం అమెరికా కాంగ్రెస్కే ఉందని పేర్కొంది.
ఈ తీర్పు తక్షణ ప్రభావంగా అమెరికా కంపెనీలకు భారీ ఆర్థిక ఉపశమనం కలిగించనుంది. విదేశీ నైపుణ్యాన్ని నియమించుకోవాలనుకునే సంస్థలు మళ్లీ హెచ్-1బీ మార్గాన్ని పరిశీలించే అవకాశం ఉంది. ముఖ్యంగా సాంకేతిక రంగంలో ఉద్యోగ అవకాశాలు కొంతమేర పెరగవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.
అయితే, ఈ తీర్పును పూర్తిస్థాయి విజయంగా భావించడం తొందరపాటు అవుతుంది. ట్రంప్ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ఉన్నత న్యాయస్థానంలో సవాల్ చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గతంలో కూడా వలస విధానాలకు సంబంధించిన అనేక కేసుల్లో ట్రంప్ యంత్రాంగం అప్పీల్ ద్వారా అనుకూల తీర్పులు సాధించింది. కాబట్టి ఈ వ్యవహారం మరికొన్ని నెలలు లేదా సంవత్సరాల పాటు న్యాయపోరాటంలో కొనసాగవచ్చు.
మరోవైపు ఈ తీర్పు హెచ్-1బీ కోటాను పెంచదు. అలాగే వీసా పొందే అవకాశాలను నేరుగా ప్రభావితం చేయదు. ఎంపిక విధానం, లాటరీ వ్యవస్థ, అర్హత ప్రమాణాలు యథాతథంగానే కొనసాగుతాయి. అయితే కంపెనీలు దరఖాస్తులు దాఖలు చేయడంలో వెనుకంజ వేయకుండా ఉండటం వల్ల భారతీయ నిపుణులకు అవకాశాలు కొంత మెరుగుపడే అవకాశం ఉంది.
ప్రపంచంలోని అత్యుత్తమ ప్రతిభను ఆకర్షించడం ద్వారా అమెరికా సాంకేతిక రంగం ప్రపంచ నాయకత్వాన్ని సాధించింది. అలాంటి సమయంలో విదేశీ నైపుణ్యాన్ని నిరుగార్చే చర్యలు అమెరికా పోటీ సామర్థ్యానికే హాని కలిగించే ప్రమాదం ఉంది. మరోవైపు స్థానిక ఉద్యోగ అవకాశాల పరిరక్షణ కూడా ప్రభుత్వ బాధ్యతే. ఈ రెండు లక్ష్యాల మధ్య సమన్వయం సాధించడమే అసలు సవాల్.
బోస్టన్ కోర్టు తీర్పు భారతీయ వృత్తి నిపుణులకు తక్షణ ఊరటనిచ్చినా, అంతిమ పరిష్కారం మాత్రం కాదు. అప్పీల్ ప్రక్రియ, భవిష్యత్ విధాన నిర్ణయాలు, అమెరికా రాజకీయ పరిస్థితులు కలిసి హెచ్-1బీ వీసాల భవిష్యత్తును నిర్ణయించనున్నాయి. అయితే ప్రస్తుతానికి మాత్రం ట్రంప్ వలస విధానాలకు ఇది గట్టి ఎదురుదెబ్బగా, భారతీయ ప్రతిభకు ఆశాకిరణంగా నిలిచింది.

