మణికట్టు ‘మంత్రి’కుడు!
పాలిటిక్స్ లోనూ చురుకైన ‘ఫీల్డర్’!
మచ్చలున్నా ఆటలో చంద్రుడే!
ఈ రోజు మధ్యాహ్నం 12.15గంటలకు
తెలంగాణ మంత్రిగా ప్రమాణం
మైనార్టీ సంక్షేమశాఖ ఇచ్చే ఛాన్స్
నేటి నుంచే అజహర్ కొత్త ఇన్నింగ్స్
హైదరాబాద్, అక్టోబర్ 30 (అడుగు ప్రత్యేక ప్రతినిధి):
మహ్మద్ అజహరుద్దీన్ @ అజ్జూ భాయ్! క్రికెట్ అభిమానులకు పరిచయం అక్కరలేని పేరు. ప్రపంచ స్థాయి బ్యాట్స్ మన్. మణికట్టు మాంత్రికుడు. అత్యంత చురుకైన ఫీల్డర్. ఒకప్పుడు టీమిండియా కెప్టెన్. మూడు ప్రపంచ కప్ లకు ఇండియన్ కెప్టెన్. ఎన్నో మలుపులు, గెలుపులు, ఓటములు, అవార్డులు, రివార్డులు, వాల్డ్ రికార్డులు కలగలిస్తే అజహర్ జీవితం.
వ్యక్తిగత జీవితం
అజారుద్దీన్ 1963 ఫిబ్రవరి 8 న మహమ్మద్ అజీజుద్దీన్, యూసఫ్ సుల్తానా దంపతులకు, హైదరాబాదులో జన్మించాడు. ఆల్ సెయింట్స్ హైస్కూల్, సికింద్రాబాద్ లోని మహబూబ్ కాలేజీలో ఇంటర్, నిజాం కాలేజీలో బి.కాం డిగ్రీ చదివాడు.
కాగా, అజహర్ తన మొదటి భార్య నౌరీన్ కు విడాకులిచ్చి, నటి సంగీతా బిజలానీని వివాహం చేసుకున్నాడు. మొదటి భార్య సంతానం ఇద్దరు కొడుకులు అయాజుద్దీన్, అసదుద్దీన్. అయాజుద్దీన్ 2011 సెప్టెంబరు 11 న ఔటర్ రింగ్ రోడ్డులో పుప్పాలగూడ వద్ద బైక్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చనిపోయాడు. అసదుద్దీన్ భారతీయ క్రికెట్ ఆటగాడు.
క్రికెట్ జీవితం
కుడి చేతి బ్యాట్స్ మన్ అయిన అజ్జూ, మణికట్టు మాయాజాలానికి పెట్టింది పేరు. మొట్ట మొదటిసారిగా 1984 డిసెంబరు 31న కలకత్తాలో భారత్ ఇంగ్లాండ్ ల మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్ తో అంతర్జాతీయ కెరీర్ ప్రారంభించాడు. మొదటి ఇన్నింగ్స్ లోనే 322 బంతులు ఎదుర్కొని 110 పరుగులు చేశాడు. ఈ ఆట డ్రాగా ముగిసింది. తర్వాత ఆడిన రెండు టెస్టు మ్యాచుల్లోనూ అజర్ రెండు శతకాలు సాధించాడు. ఆడిన మొదటి మూడు టెస్టుల్లో మూడు సెంచరీలు చేసిన రికార్డు ఇప్పటికీ అజహర్ పేరు మీదే ఉంది.
1989 లో కృష్ణమాచారి శ్రీకాంత్ తర్వాత భారత క్రికెట్ జట్టు కెప్టెన్సీ చేపట్టాడు. మొత్తం 47 టెస్ట్ మ్యాచులు, 174 వన్డే మ్యాచులకు కెప్టెన్ గా వ్యవహరించాడు.
మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు
అజహర్ క్రికెట్ కెరీర్ లో ఇదో చీకటి అధ్యాయం. కెరీర్ పీక్స్ లో ఉండగానే, 2000లో అజహర్ మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొన్నాడు. సీబీఐ నివేదిక ప్రకారం దక్షిణాఫ్రికా కెప్టెన్ హ్యాన్సీ క్రోనేకి బుకీలకు పరిచయం చేసింది అజహరుద్దీనే. సీబీఐ తరఫున కె.మాధవన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఐసీసీ, బీసీసీఐ అజహర్ పై జీవితకాలం నిషేధించారు.
2012 నవంబరు 8న హైదరాబాదులోని డివిజనల్ కోర్టులోని న్యాయమూర్తులు అశుతోష్ మొహంతా, కృష్ణమోహన్ రెడ్డి కోర్టుకు సమర్పించిన ఆధారాల మేరకు ఆయనపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేశారు. అతనిపై నిషేధం అక్రమమని తీర్పు చెప్పింది. అయితే ఆరోపణలు ఎదుర్కొన్నప్పటి నుంచి అజహర్ మైదానంలోకి రాలేదు. ఈ తీర్పు వెలువడే నాటికి అజహర్ వయసు 49 సంవత్సరాలు.
రాజకీయ జీవితం
కాంగ్రెస్ పార్టీ తరఫున ఉత్తర్ ప్రదేశ్ లోని మురాదాబాద్ నియోజకవర్గం నుండి 49,107 మెజారిటీతో ఎంపీగా గెలుపొందాడు. 2014లో రాజస్థాన్లోని టోంక్ సవాయీ మాధోపూర్ నుండి పోటీ చేసి 1,35,000 ఓట్లతో ఓడిపోయాడు. అజహరుద్దీన్ 2019 ఎన్నికలలో పోటీకి దూరంగా ఉన్నారు.
2023 తెలంగాణ శాసన సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రకటించిన రెండో జాబితాలో ఆయనను జూబ్లీ హిల్స్ అభ్యర్థిగా ప్రకటించింది. అయితే, ఆ ఎన్నికల్లోనూ ఓడిపోయారు. తాజాగా జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో ఏర్పడిన ఖాళీ స్థానానికి మళ్ళీ పోటీకి సిద్ధపడ్డారు. పార్టీ ఆదేశంతో ఊరకున్నారు. ఎమ్మెల్సీగా కోదండరామ్ తోపాటు అజహర్ పేరును కేబినెట్ ప్రతిపాదించింది. అయితే, అది ఇంకా గవర్నర్ ఆమోదం పొందలేదు.
మారిన సమీకరణాల్లో జూబ్లీ ఎన్నికల ముంగిట అజర్ హర్ కి అనుకోకుండా జాక్ పాట్ తగిలింది. మైనార్టీ కోటాలో ఎమ్మెల్యేలెవరూ గెలవకపోవడం, ఇప్పటిదాకా మైనార్టీ కోటా మంత్రి పదవి ఎవరికీ ఇవ్వకపోవడం, ఇప్పటికిప్పుడు జూబ్లీ ఉప ఎన్నిక ముంగిట మైనార్టీకి మంత్రి పదవి ఇవ్వాల్సి రావడం, ఎంఐఎం అభ్యంతర పెట్టినా, సీఎం సహా అధిష్టానం అజ్జూకే సై అనడం అంతా అజ్జూ భాయ్ కి కలిసి వచ్చింది. అజ్జూ భాయ్ ని మంత్రి పదవి ఎదురొచ్చి వరించింది.

