మేడారంలో కొలువైన వన దేవతలు
చిలుకలగట్టు నుంచి గద్దెపైకి సమ్మక్క
నలుగురు దేవతల రాకతో జాతర జోరు
భక్తిపారవశ్యంతో పోటెత్తిన భక్తజన హోరు
ఆసియాలోనే అతి పెద్ద జాతరైన మేడారంలో వరుసగా కీలక ఘట్టాలు చోటు చేసుకుంటున్నాయి. సారలమ్మ బుధవారం గద్దెపైకి చేరుకోగా.. సమ్మక్క గద్దెనెక్కనున్నారు. ఇందుకోసం చిలకలగుట్ట నుంచి సమ్మక్క గద్దెపైకి రానున్నారు. ఈ నేపథ్యంలో భక్తజనం పులకించనుంది. సమ్మక్క రాకతో ఈ జాతర పరిపూర్ణం కానుంది. గురువారం అర్ధరాత్రి నుంచి వనదేవతలకు భక్తులు మొక్కులు చెల్లించుకోనున్నారు. మరోవైపు ఇప్పటికే ఈ జాతర సందర్భంగా మేడారం భక్తులతో కిక్కిరిసిపోయింది.
మేడారం జాతరలో భక్తులందరూ ఎదురుచూసిన కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. భక్తులు ఎంతో ఆసక్తిగా చూసే అమ్మవారు సమ్మక్క గద్దెలపై కొలువుదీరారు. అనంతరం దేవాదాయశాఖ ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. అంతకుముందు వనం (చిలకలగుట్ట) వీడి జనంలోకి సమ్మక్క ఆగమనం ప్రారంభమవడంతో సమ్మక్క తల్లికి గౌరవసూచకంగా గాల్లోకి ములుగు జిల్లా ఎస్పీ రాంనాథ్ కేకన్ తుపాకీతో గాల్లోకి కాల్పులు జరిపారు. పోలీసులు సమ్మక్క తల్లికి గౌరవ వందనం సమర్పించారు. సమ్మక్క రాక సందర్భంగా శివసత్తుల పూనకాలు వచ్చాయి. సమ్మక్కను తీసుకువస్తుండగా ఎదురుకోళ్లతో భక్తుల సాదర స్వాగతం పలికారు. చిలకలగుట్ట నుంచి బయలుదేరిన సమ్మక్క తల్లికి మంత్రులు సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ ఘనస్వాగతం పలికారు. భక్తులు సమ్మక్కకు జై అంటూ నినాదాలు చేశారు. భక్తుల జయజయధ్వానాలతో సమ్మక్క గద్దెలపైన కొలువుదీరింది. గద్దెలపై వనదేవతలు కొలువుదీరడంతో ప్రధాన ఘట్టం పూర్తి అయ్యింది. వనదేవతల దర్శనానికి భక్తజనం లక్షలాదిగా తరలివచ్చారు. నిలువెత్తు బంగారం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. శనివారం వనదేవతల వన ప్రవేశంతో మేడారం జాతర పూర్తికానుంది. బుధవారమే సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెలపై కొలువుదీరిన సంగతి తెలిసిందే. రేపు అమ్మవార్లను దర్శించుకోవడానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉంది. మేడారం మహాజాతర నేపథ్యంలో భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. జంపన్న వాగు వద్ద పుణ్య స్నానాలు చేసి వనదేవతలకు బెల్లం సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. రెస్క్యూ టీం నిరంతరం వాగులో గస్తీ నిర్వహిస్తున్నారు. సాధారణంగా ఏర్పాటు చేసిన హుండీలతో పాటు డిజిటల్ విధానంలోనూ భక్తులు తమ కానుకలను సమర్పించుకుంటున్నారు. మరోవైపు మేడారంలో వన దేవతలను దర్శించుకోవడానికి ముందు గట్టమ్మ గుట్ట ఆలయానికి భక్తులు వెళ్తారు. జాతరకు వెళ్లే భక్తులతో గట్టమ్మ ఆలయం అత్యంత రద్దీగా మారింది. భక్త జనంతో మేడారంలో విపరీతమైన రద్దీ నెలకొంది. ఇసుక వేస్తే రాలనంత జనం మాటల్లోనే వింటుంటాం కానీ అక్కడ పరిస్థితి మాత్రం అచ్చం అలానే ఉంది.


