ట్రంప్ టెంపరితనం, దుందుడుకు దూకుడు, అగ్రరాజ్య ఆధిపత్యపు పైత్యం మొత్తం భూమండలాన్నే ఆర్థిక సంక్షోభంలోకి నెట్టాయి. ప్రపంచాన్ని నడిపే చమురే ఇప్పుడా ప్రపంచ చమురును తీస్తున్నది. అన్ని రంగాలపై పడిన ప్రభావం అందరి ఉసురు తీస్తున్నది. మధ్య, దిగువ తరగతి ప్రజలే అధికంగా ఈ ప్రభావం బారిన పడుతున్నారు. ఐటీ రంగం కుదేలైంది. కొత్త ఉద్యోగాల సంగతి దేవుడెరుగు? ఉన్న ఉద్యోగాలే ఊడుతున్నాయి. ధరలు పెరిగి, ధరణి సంక్షోభంలో కూరుకుపోయింది.
డా. మార్గం-అడుగు, ఎడిటోరియల్
మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మళ్లీ ప్రపంచాన్ని ఆందోళనలోకి నెట్టాయి. అమెరికా–ఇరాన్ ఘర్షణలు కేవలం యుద్ధానికే పరిమితం కాలేదు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కూడా తీవ్ర సంక్షోభంలోకి నెట్టాయి. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ దూకుడు నిర్ణయాలు అంతర్జాతీయ చమురు మార్కెట్ను అస్థిరం చేశాయి. ఇరాన్పై దాడులు, ప్రతిదాడుల హెచ్చరికలు, హార్ముజ్ జలసంధి చుట్టూ నెలకొన్న ఉద్రిక్తతలతో ముడి చమురు ధరలు ఎగసిపడుతున్నాయి. ప్రపంచ చమురు రవాణాలో 20 శాతం హార్ముజ్ జలసంధి ద్వారానే జరుగుతుండటంతో అక్కడి పరిస్థితులు మారితే దాని ప్రభావం నేరుగా భారత్ సహా అన్ని ప్రపంచ దేశాలపైనా పడుతోంది.
భారత్ తనకు అవసరమైన ముడి చమురులో 85 శాతం దిగుమతులపైనే ఆధారపడుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ ముడి చమురు ధర 10 డాలర్లు పెరిగితే భారత దిగుమతి వ్యయం వేల కోట్ల రూపాయల మేర పెరుగుతుంది. ఫలితంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయి. ఇంధన ధరల పెరుగుదల కేవలం వాహనదారుల సమస్య మాత్రమే కాదు. రవాణా ఖర్చులు పెరగడం ద్వారా నిత్యావసర వస్తువుల ధరలు కూడా ఆకాశాన్ని అంటుతాయి. నిత్యావసరాల నుంచి నిర్మాణ సామగ్రి వరకు అన్నింటిపై దాని ప్రభావం పడుతుంది. ఇప్పటికే విమానయాన రంగం అధిక ఇంధన వ్యయంతో సంక్షోభంలో ఉంది.
రానున్న రోజుల్లో విమాన టికెట్ల ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఈ పరిస్థితుల్లో దేశీయంగా ఇంధన వినియోగాన్ని తగ్గించే మార్గాలపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరం ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే ప్రధాని నరేంద్ర మోదీ ప్రోత్సహిస్తున్న “వర్క్ ఫ్రమ్ హోమ్” విధానం మళ్లీ చర్చకు వచ్చింది. ముఖ్యంగా హైదరాబాద్, బెంగళూరు, పుణే వంటి ఐటీ నగరాల్లో దీని ప్రభావం గణనీయంగా ఉండొచ్చని ఆర్థిక విశ్లేషకులు భావిస్తున్నారు.
హైదరాబాద్లో ప్రస్తుతం 9 లక్షల మంది ఐటీ ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరిలో చాలామంది ప్రతిరోజూ సగటున 40 నుంచి 50 కిలోమీటర్ల మేర ప్రయాణిస్తున్నారు. ట్రాఫిక్ రద్దీ, ఇంధన వినియోగం, కాలుష్యం కలిసి నగర జీవనాన్ని భారంగా మారుస్తున్నాయి. నిపుణుల అంచనాల ప్రకారం, ఈ ఉద్యోగుల్లో కనీసం 50 శాతం మంది వారానికి మూడు రోజులు ఇంటి నుంచే పని చేసినా నెలకు రూ.140 కోట్ల విలువైన ఇంధనం ఆదా కావచ్చు. దేశవ్యాప్తంగా ఐటీ హబ్లను కలిపి చూస్తే ఈ ఆదా వేల కోట్ల రూపాయలకు చేరుకునే అవకాశం ఉంది.
కరోనా కాలంలో వర్క్ ఫ్రమ్ హోమ్ విధానం విజయవంతంగా అమలైంది. ఉద్యోగులు ఇంటి నుంచే పని చేసి కంపెనీల కార్యకలాపాలను కొనసాగించారు. అయితే ప్రస్తుతం చాలా ఐటీ సంస్థలు పూర్తిస్థాయి వర్క్ ఫ్రమ్ హోమ్కు ఆసక్తి చూపడం లేదు. కార్యాలయ సంస్కృతి, జట్టు సమన్వయం, డేటా భద్రత, ఉత్పాదకత వంటి అంశాలను కంపెనీలు కారణాలుగా చెబుతున్నాయి. కొన్ని సంస్థలు హైబ్రిడ్ విధానానికే పరిమితమవుతున్నాయి. అయినప్పటికీ దేశ ఆర్థిక ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించాల్సిన అవసరం ఉంది.
ఇంధన సంక్షోభం మధ్య మరో పెద్ద దెబ్బ ఐటీ రంగానికే తగులుతోంది. ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ కంపెనీలు ఉద్యోగాల కోతల దిశగా అడుగులు వేస్తున్నాయి. ఓరాకిల్ ఇటీవల ప్రపంచవ్యాప్తంగా వేలాది ఉద్యోగులను తొలగించడమే కాకుండా, భారత ప్రముఖ ఇంజనీరింగ్ కళాశాలల్లో ఇచ్చిన కొన్ని క్యాంపస్ ఆఫర్లను కూడా వెనక్కి తీసుకుంది. ఐఐటీ విద్యార్థులు ఈ నిర్ణయంతో తీవ్ర అనిశ్చితిలో పడ్డారు. ఎందుకంటే చాలా కళాశాలల్లో “ఒక విద్యార్థికి ఒకే ఉద్యోగం” విధానం అమల్లో ఉంది. ఒక కంపెనీ ఆఫర్ పొందిన విద్యార్థి ఇతర అవకాశాలను వదులుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఆ ఆఫర్లు రద్దవడంతో వారు మళ్లీ ఉద్యోగాల కోసం తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఇక సిస్కో, లింక్డ్ ఇన వంటి సంస్థలు కూడా భారీ స్థాయిలో ఉద్యోగుల సంఖ్యను తగ్గించే ప్రయత్నాల్లో ఉన్నాయి. కంపెనీలు ఇప్పుడు సంప్రదాయ ఉద్యోగాల కంటే కృత్రిమ మేధస్సు, ఆటోమేషన్, క్లౌడ్ టెక్నాలజీలపై పెట్టుబడులను మళ్లిస్తున్నాయి. ఫలితంగా సాధారణ సాఫ్ట్వేర్ ఉద్యోగాల భవిష్యత్తుపై ఆందోళనలు పెరుగుతున్నాయి.
ఇలాంటి సమయంలో ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలి. వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని సమర్థవంతంగా అమలు చేయడం, ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించడం, ప్రజా రవాణాను బలోపేతం చేయడం, చమురు దిగుమతులపై ఆధారాన్ని తగ్గించడం అత్యవసరం. అదే సమయంలో ప్రజాప్రతినిధుల వ్యయ నియంత్రణ, ప్రభుత్వ దుబారా తగ్గింపు వంటి అంశాలపై పొదుపు నిర్ణయాలు జరగాలి.
ప్రపంచ రాజకీయాల్లో ఏర్పడుతున్న ప్రతి ఉద్రిక్తత భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. అంతర్జాతీయ సంక్షోభాలను పూర్తిగా అడ్డుకోవడం మన చేతుల్లో లేకపోయినా, వాటి ప్రభావాన్ని తగ్గించే దిశగా ముందస్తు చర్యలు తీసుకోవడం మాత్రం ప్రభుత్వ బాధ్యత. లేదంటే ట్రంప్ రగిలించిన ఈ కుంపటి ప్రపంచ ఆర్థిక వ్యవస్థనే కాకుండా, భారత సామాన్యుడి జీవితాన్నీ మరింత భారంగా మార్చే ప్రమాదం ఉంది.

