గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీలు, పట్టణాల్లో వార్డు కార్యాలయాలు, మీ సేవ వంటి పౌర సేవా కేంద్రాలను ఈ ప్రక్రియలో భాగస్వామ్యం చేస్తే ప్రజలకు సౌలభ్యం పెరుగుతుంది. బీఎల్వోలపై పూర్తిగా ఆధారపడకుండా బహుళస్థాయి ధ్రువీకరణ వ్యవస్థను తీసుకొస్తే పారదర్శకత కూడా పెరుగుతుంది. సాంకేతికత, స్థానిక పరిపాలన, పౌర సేవా కేంద్రాలను సమన్వయం చేస్తూ ఆధునిక ఓటరు నిర్వహణ వ్యవస్థను రూపొందించడం కాలానుగుణ అవసరం.
డా. మార్గం-అడుగు, ఎడిటోరియల్
ఓటు అత్యంత విలువైన రాజ్యాంగ హక్కు. ఆ హక్కును పరిరక్షించే బాధ్యత ఎన్నికల సంఘంపై ఉంది. అయితే ప్రస్తుతం కొనసాగుతున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియ తీరు చూస్తుంటే, ఓటరు నమోదును సులభతరం చేయడం కంటే మరింత సంక్లిష్టంగా మార్చిందనే అభిప్రాయాలు కలుగుతున్నాయి. ఆధార్, పాన్, బ్యాంకు ఖాతాలు, గ్యాస్ కనెక్షన్లు వంటి గుర్తింపు వ్యవస్థలు డిజిటల్ సాంకేతికతతో సమర్థంగా నిర్వహించబడుతున్న ఈ రోజుల్లో, ఓటరు జాబితా నిర్వహణ మాత్రం ఇంకా క్షేత్రస్థాయి సిబ్బంది పనితీరుపైనే ఆధారపడటం ఆశ్చర్యకరం.
రాష్ట్ర ఎన్నికల కార్యాలయం విడుదల చేసిన గణాంకాల ప్రకారం, రాష్ట్రవ్యాప్తంగా 99.98 శాతం ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ పూర్తయిందని, అలాగే 26 జిల్లాల్లో వంద శాతం పంపిణీ లక్ష్యం సాధించామని ప్రకటించింది. అధికారిక లెక్కలు చూస్తే ప్రక్రియ ఆదర్శంగా సాగుతున్నట్లే కనిపిస్తుంది. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉంది. హైదరాబాద్తో పాటు అనేక పట్టణాలు, శివారు కాలనీలు, గేటెడ్ కమ్యూనిటీల్లో బూత్ లెవల్ అధికారులు (బీఎల్వోలు) ఇళ్లకు రాలేదని, ఎన్యుమరేషన్ ఫారాలు అందలేదని పెద్ద సంఖ్యలో ఓటర్లు చెబుతున్నారు. కొందరైతే తమ ప్రాంత బీఎల్వోను ఇప్పటివరకు చూసిన సందర్భమే లేదని పేర్కొంటున్నారు. కాగితాలపై వంద శాతం పంపిణీ, వాస్తవంలో మాత్రం ఫారాలు అందని ఓటర్లు. ఈ వైరుధ్యమే మొత్తం ప్రక్రియ విశ్వసనీయతపై విస్మయం కలిగిస్తోంది.
ఎస్ఐఆర్ నిబంధనల ప్రకారం బీఎల్వోలు ప్రతి ఓటరు ఇంటికి కనీసం మూడుసార్లు వెళ్లాలి. వివరాలు సేకరించాలి. అవసరమైతే పత్రాలను పరిశీలించాలి. కానీ అనేక ప్రాంతాల్లో ఈ నిబంధనలు అమలైన దాఖలాలు కనిపించడం లేదు. నిర్ణీత గడువులోపు లక్ష్యాలు పూర్తి చేయాలనే పరిపాలనా ఒత్తిడితో క్షేత్రస్థాయి సిబ్బంది కార్యాలయాల్లోనే ఫారాల పంపిణీ పూర్తయినట్లు నమోదు చేసేశారు. బీఎల్వోలు ఒకేచోట కూర్చొని ఫారాలు పంపిణీ చేస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. అనేక చోట్ల పూర్తి చేసిన ఫారాలను కూడా ఓటర్లే బీఎల్వోల వద్దకు వెళ్లి సమర్పించుకోవాల్సి వస్తోంది. ఇది ఇంటింటికీ వెళ్లి నమోదు చేయాలనే అసలు ఉద్దేశాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తోంది.
దేశంలో డిజిటల్ పరిపాలన వేగంగా విస్తరిస్తున్నప్పుడు ఓటరు నమోదు మాత్రం ఎందుకు ఇంత క్లిష్టంగా ఉండాలి? ఆధార్లో చిరునామా మారితే ఆన్లైన్లో మార్చుకోవచ్చు. పాన్ వివరాలు మార్చుకోవచ్చు. బ్యాంకు ఖాతాలు, పాస్పోర్ట్ సేవలు కూడా డిజిటల్ వేదికలపై అందుబాటులో ఉన్నాయి. కానీ ఓటరు జాబితా విషయంలో మాత్రం ప్రతి సారి కొత్త ప్రక్రియ, కొత్త ధ్రువీకరణ, కొత్త సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. శాశ్వత ఓటరు గుర్తింపు సంఖ్య విధానాన్ని బలోపేతం చేసి, చిరునామా మారినప్పుడు వివరాలను మాత్రమే మార్చుకునే వ్యవస్థను ఏర్పాటు చేస్తే ఇలాంటి గందరగోళాలే ఉండవు.
ఆధార్ను ఓటరు నమోదుకు ఏకైక ప్రామాణిక పత్రంగా గుర్తించబోమని ఎన్నికల సంఘం ఇప్పటికే స్పష్టం చేసింది. దీనికి చట్టపరమైన కారణాలు ఉన్నప్పటికీ, ఆధార్ ద్వారా వ్యక్తి గుర్తింపును ధ్రువీకరించే సాంకేతిక సామర్థ్యాన్ని పూర్తిగా విస్మరించడం కూడా సమంజసం కాదు. ఆధార్ను ఓటు హక్కుకు ప్రత్యామ్నాయంగా కాకుండా, గుర్తింపు నిర్ధారణకు అనుబంధ సాధనంగా ఉపయోగించే అవకాశాలపై ఎన్నికల సంఘం మరింత స్పష్టమైన విధానాన్ని రూపొందించాలి. అదే సమయంలో అక్రమంగా దేశంలోకి ప్రవేశించి గుర్తింపు పత్రాలు పొందిన వారిని గుర్తించి తొలగించడం ప్రభుత్వ యంత్రాంగం బాధ్యత. ఆ కారణంతో అసలైన ఓటర్లపై అనవసర భారాన్ని మోపడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం.
మరణించిన వారి పేర్లు జాబితాల్లో కొనసాగడం, ఒకే వ్యక్తికి రెండు చోట్ల ఓటు నమోదవడం వంటి లోపాలు ఇప్పటికీ కనిపిస్తూనే ఉన్నాయి. ఇవి ఓటర్ల తప్పిదాలు కావు. ఓటు హక్కు కల్పన, జాబితా నిర్వహణలోని వ్యవస్థాపక లోపాలే. సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపకుండా ప్రతి ఎన్నికకు ముందు విస్తృత సవరణ కార్యక్రమాలు చేపట్టడం కంటే, నిరంతర డిజిటల్ మార్పుల వ్యవస్థను అభివృద్ధి చేయడం ఎంతో సమర్థవంతం. దేశంలో ఉన్న అత్యాధునిక సమాచార సాంకేతిక నైపుణ్యాన్ని వినియోగించి కృత్రిమ మేధ, డేటా సమన్వయం, డూప్లికేట్ గుర్తింపు వంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తే ఓటరు జాబితాలను మరింత ఖచ్చితంగా నిర్వహించడం సాధ్యమే.
గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీలు, పట్టణాల్లో వార్డు కార్యాలయాలు, మీ సేవ వంటి పౌర సేవా కేంద్రాలను ఈ ప్రక్రియలో భాగస్వామ్యం చేస్తే ప్రజలకు సౌలభ్యం పెరుగుతుంది. బీఎల్వోలపై పూర్తిగా ఆధారపడకుండా బహుళస్థాయి ధ్రువీకరణ వ్యవస్థను తీసుకొస్తే పారదర్శకత కూడా పెరుగుతుంది. సాంకేతికత, స్థానిక పరిపాలన, పౌర సేవా కేంద్రాలను సమన్వయం చేస్తూ ఆధునిక ఓటరు నిర్వహణ వ్యవస్థను రూపొందించడం కాలానుగుణ అవసరం.
ఓటు హక్కు వినియోగించుకోవడానికి ప్రజలు పదేపదే తమ ఉనికిని నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడకూడదు. లక్షలాది మంది ఓటర్లు వివిధ పత్రాలతో కార్యాలయాల చుట్టూ తిరగాల్సిరావడం మంచిదేనా? ఎన్నికల సంఘం తన గణాంకాల కంటే ప్రజల అనుభవాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. కాగితాలపై వంద శాతం విజయాన్ని ప్రకటించడం కంటే, ప్రతి అర్హుడి ఓటు సురక్షితంగా జాబితాలో ఉండేలా పారదర్శకమైన, సాంకేతిక ఆధారిత, శాశ్వత వ్యవస్థను ఏర్పాటు చేయడమే అసలైన సంస్కరణ.

