డాక్టర్ బీఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రూపొందించారు. సామాజిక న్యాయం, అట్టడుగు వర్గాల హక్కుల కోసం పోరాడారు. సమాజంలో వివక్ష, అసమానతలు తొలగిపోవాలని పరితపించారు. అందరికీ విద్య, ఆర్థిక స్వేచ్ఛ, ఓటు హక్కు ఉండాలని భావించారు. అంటరానివారికి రిజర్వేషన్లు మాత్రమేగాక, మహిళలకూ రిజర్వేషన్లు ఉండితీరాలని ఆనాడే బిల్లు తెచ్చారు. ఆ బిల్లు పార్లమెంటులో వీగిపోతే, తన పదవికే రాజీనామా చేశారు. అంతిమంగా రాజ్యాధికారం మాత్రమే పేదల అన్ని సమస్యలకు పరిష్కారం కాగలదని గట్టిగా చెప్పారు. మతాన్ని, కులాన్ని నిర్మూలించాలన్నారు. భారత సమాజాన్ని, రాజకీయాల్ని బహుషా అంబేద్కర్ అంతగా ప్రభావితం చేసిన వారెవ్వరూ లేరు. అంబేద్కర్ ని రాజ్యంగ నిర్మాతగా మాత్రమేగాక, సమాజ, రాజకీయ, ఆర్థిక, ప్రజాస్వామ్య దార్శనికుడిగా చూడాలి. అయితే, నాటి నుంచి నేటి దాకా, అంబేద్కర్ ను ఆరాధ్యుడిగా మార్చివేసిన పాలకులు, ఆయన ఆశయాలు, లక్ష్యాలను విస్మరించారు. అందరివాడైన అంబేద్కర్ ను కొందరి వాడిగా మార్చే ప్రయత్నమూ జరిగింది. జరుగుతూనే ఉంది. అంబేద్కర్ జయంతి, వర్ధంతిల సందర్భాల్లో ఆయన విగ్రహాలకు దండలు వేయడం, దండం పెట్టడం, ఆయన ఆశయాలకు నీళ్లొదలడం నేటి పాలకులకు అలవాటుగా, ఆనవాయితీగా మారిపోయింది.
ఏడున్నర దశాబ్దాల స్వాతంత్య్ర కాలంలో మన నాయకులంతా సమాజాన్ని విచ్ఛిన్నం చేసే దిశగానే పని చేస్తున్నారు. ఇప్పుడు రాజకీయ పార్టీలకు, నాయకులకు అంబేద్కర్ పేరును జపించడం ఓ ఫ్యాషన్ గా, స్టేటస్ సింబల్ గా మారిపోయింది. ఇదంతా కేవలం తమ ఓటు బ్యాంక్ ను పెంచుకోవడానికి, ఉన్నది కాపాడుకోవడానికి చేస్తున్న రాజకీయమే తప్ప మరోటి కాదు. నిజంగానే మనం అంబేద్కర్ ఆశయాలను అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నామా? లేదా? అన్నది నేతలతో పాటు దళితులు కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలి. రాజకీయ పార్టీలు, నాయకుల కుట్రలను దళితులు అర్థం చేసుకోవాలి. ఏటేటా అంబేద్కర్ జయంతి, వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం కొన్ని ప్రభుత్వ సంస్థలకు అంబేద్కర్ పేరు పెట్టడం, ఢిల్లీ నుండి గల్లీ దాకా ఆయన విగ్రహాలను పెట్టడం, దండలేయడం, దండం పెట్టడమే తప్ప, ప్రభుత్వాలు అంబేద్కర్ ఆశయాలపై చేస్తున్నదేంటో అవలోకనం చేసుకోవాలి. ప్రధాని మోడీ అయితే అంబేద్కర్ పేరు ఉచ్చరించ కుండా ఉండలేకపోతున్నారు. అంబేద్కర్ కు తామిచ్చిన గౌరవం మరెవరూ ఇవ్వలేదంటున్నారు. కానీ నిత్యం అంబేద్కర్ జపం చేస్తున్న వారంతా ఉన్నత కులాలు వారే. వారు ఏనాడు దళితులను ఉన్నతికి తీసకుని వచ్చేందుకు ప్రయత్నించడం లేదు. ఓ ఆదివాసీని రాష్ట్రపతిని చేయడం దళిత ఉద్ధరణగా ప్రచారం చేసుకుంటున్నారు. ఒకటి రెండు పదవులు వారి మొహాన పడేసి దళిత దీనజన ఉద్ధరణ జరిగిందన్న ఆ ప్రచారాన్ని మనం నమ్మితే, మనల్ని మనం మోసం చేసుకోవడమే అవుతుంది. దళిత ఉద్ధరణ గురించి గొప్పగా చెప్పుకునే కాంగ్రెస్, జగ్జీవన్ రామ్కు ప్రధాని అయ్యే ఛాన్స్ వస్తే అడ్డుకున్న చరిత్రను మరచిపోగలమా? దళితుడినే తెలంగాణ సిఎం చేస్తానన్న కెసిఆర్ సైతం వారిని ఓటు బ్యాంక్ కోసం మభ్యపెట్టారు. తొలి దళిత ముఖ్యమంత్రి అంటూ ఊదరగొట్టి తెలంగాణ సమాజాన్ని మోసం చేసి, పదేళ్ల పాటు ఆయనే సిఎంగా కొనసాగారు. దళితబంధు పథకం పేరుతో అక్రమాలకు తెరతీసారు. రాజకీయ నాయకులు ఎలాగూ మంచి చేయరు. కనీసం ప్రజలుగా మనమంతా అంబేద్కర్ కి నివాళి అర్పించేందుకు ఆయన చూపిన మార్గంలో నడిచే ప్రయత్నం చేయాలి. అంటరాని కులాలు ఆర్థికంగా బలపడనిదే, రాజకీయాధికారం పొందనిదే వారి సమస్యకు సమగ్రమైన పరిష్కారం దొరకదని అంబేద్కర్ ఆనాడే ప్రకటించారు. దళితులకు రాజ్యాధికారం వస్తే తప్ప ఈ అంటరానితనం, చిన్నచూపు చూడడం వేరుగా చూడడం వంటి సమస్యలు సమిసిపోవు.
ఆనాడు భారత జాతీయ కాంగ్రెస్ నడిపే జాతీయోద్యమంలో అంటరానితనం నిర్మూలన కోసం గాంధీ కృషి చేస్తూ ఉంటే ఆ కృషికి కాంగ్రెస్ సభ్యుల నుండి పూర్తిస్థాయిలో మద్దతు లభించనేలేదు. గాంధీజీ వర్ణ వ్యవస్థను భారత సమాజం ప్రత్యేక లక్షణమని, ఎవరి కుల వృత్తిని వారు అనుసరించడం వల్ల ఎటువంటి పోటీలేని ఆర్థిక వ్యవస్థ భారత సమాజంలో ఉన్నదని సమర్ధించాడు. అయితే, 1932లోనే అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం నుండి కమ్యూనల్ అవార్డును పొంది, “డిప్రెస్డ్ క్లాసెస్” కోసం ప్రత్యేక ఓటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటింపచేసిన ఘనాపాటి అంబేద్కర్.
ఇప్పటికైనా దళితులు తెలివిడిని, ఐక్యతను ప్రదర్శించాలి. అంబేద్కర్ పేరుతో చేసే రాజకీయాలను తిప్పి కొట్టాలి. ఉన్నత కులాలు, రాజకీయ పార్టీలు చేసే కుట్రలను ఎప్పటికప్పుడు భగ్నం చేయాలి. తమను రాజకీయంగా వాడుకుంటున్న నేతల నిజస్వారూపాలను గుర్తించాలి. అందరికీ సమాన అవకాశాల కోసం పాటుపడాలి. ముఖ్యంగా మహిళలకు సమాన అవకాశాలు కల్పించాలి. అప్పుడే అంబేద్కర్ ఆశయాలను సాధించగలం. అంబేద్కర్ దళితుడిగా అనుభవించిన అవమానాలు, ఉన్నత చదువులు చదివినప్పటికీ ఎదుర్కొన్న వివక్షలు, తన లక్ష్యాల సాధనలో నిర్లక్ష్యాలు, సమాజ, ఆర్థిక, రాజకీయ చైతన్యమున్నప్పటికీ, తనకు జరిగిన ఆటుపోట్ల నుండి రాటుదేలి, ప్రజలకు పోరాటదారులు చూపినాడు. ఇప్పటికీ, ఎప్పటికీ అంబేద్కర్ చూపిన బాటలే రేపటి సమాజానికి వెలుగు రేఖలు.

