దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే రూపుదిద్దుకుంటుంది. ఒక మంచి పాఠశాల కేవలం విద్యార్థిని మాత్రమే కాదు, కుటుంబాలని, గ్రామాలని, సమాజాన్ని మార్చగలదు. అందుకే విద్యను వ్యయంగా కాకుండా పెట్టుబడిగా చూడాలి. నీతి ఆయోగ్ వేదికపై సీఎం రేవంత్ రెడ్డి ద్వారా వ్యక్తమైన సంకల్పం కార్యరూపం దాల్చినప్పుడే సమాన అవకాశాల సమాజ నిర్మాణం సాధ్యమవుతుంది. సంకల్పం ఉంటే మార్పు సాధ్యమే. ఆ మార్పునకు పునాది మాత్రం అమ్మ ఒడి లాంటి బడే.
డా. మార్గం-అడుగు, ఎడిటోరియల్
విద్య వ్యక్తిగత అభివృద్ధికి మాత్రమే కాదు, సామాజిక సమానత్వానికి, ఆర్థిక పురోగతికి, ప్రజాస్వామ్య బలోపేతానికి కూడా మూలాధారం. పేదరిక నిర్మూలనకు, కుల వివక్షలేని సమాజ నిర్మాణానికి విద్య, వైద్యం ప్రధాన సాధనాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొన్న నీతి ఆయోగ్ సమావేశంలో చేసిన వ్యాఖ్యలు అక్షర సత్యాలు. అయితే ఈ లక్ష్యాలు ప్రసంగాలకే పరిమితం కాకుండా ఆచరణలో కనిపించాల్సిన అవసరం ఉంది. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్న ఈ సమయంలో ప్రభుత్వ పాఠశాలల పరిస్థితిపై సమగ్ర సమీక్ష అవసరం.
దేశంలో విద్యారంగం విస్తారంగా విస్తరిస్తున్నప్పటికీ ఇంకా అనేక సవాళ్లు కొనసాగుతున్నాయి. కేంద్ర విద్యాశాఖ విడుదల చేసిన యూడైస్ గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా 14 లక్షల పాఠశాలల్లో 25 కోట్లకు పైగా విద్యార్థులు చదువుతున్నారు. అయినప్పటికీ ప్రాథమిక స్థాయిలో చేరిన ప్రతి 100 మంది విద్యార్థుల్లో కొద్ది మంది మాత్రమే ఉన్నత విద్య వరకు చేరుతున్నారు. పేదరికం, కుటుంబ ఆర్థిక పరిస్థితులు, మౌలిక సదుపాయాల కొరత, నాణ్యమైన బోధన లేకపోవడం ఇందుకు ప్రధాన కారణాలు.
ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాల్లో బాలకార్మిక వ్యవస్థ ఇప్పటికీ ఆందోళన కలిగిస్తోంది. జనాభా లెక్కల ప్రకారం దేశంలో లక్షలాది మంది బాలలు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా శ్రమలో నిమగ్నమై ఉన్నారు. పుస్తకాల సంచీతో బడికి వెళ్లాల్సిన పిల్లలు పత్తి చేలల్లో, ఇటుక బట్టీల్లో, హోటళ్లలో, వర్క్ షాప్లలో కనిపించడం అభివృద్ధి చెందిన సమాజానికి తగిన దృశ్యం కాదు. విద్యార్థి బడిలో ఉండాల్సిన సమయంలో పనిలో ఉండటం అంటే భవిష్యత్తు అవకాశాలను కోల్పోవడమే.
ప్రభుత్వాలు బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ ఆశించిన ఫలితాలు కనిపించడం లేదు. కారణం సమస్య మూలాన్ని గుర్తించకపోవడమే. పేదరికంతో పోరాడుతున్న కుటుంబాలకు విద్య ఆర్థిక భారం కాకూడదు. పిల్లల చదువు వల్ల కుటుంబ ఆదాయం తగ్గుతుందనే భావనను తొలగించే విధానాలు అవసరం. ఇందుకోసం గ్రామస్థాయిలో ప్రత్యేక సర్వేలు నిర్వహించి బడి బయట ఉన్న ప్రతి చిన్నారిని గుర్తించాలి. సర్పంచ్లు, గ్రామ విద్యా కమిటీలు, స్వచ్ఛంద సంస్థలు, ఉపాధ్యాయులు కలిసి బాధ్యత వహించే వ్యవస్థను రూపొందించాలి.
మరోవైపు ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో నమ్మకం పెంచాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం అనేక రాష్ట్రాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గుతుండగా, ప్రైవేట్ పాఠశాలల వైపు తల్లిదండ్రులు మొగ్గు చూపుతున్నారు. దీనికి ప్రధాన కారణం మౌలిక సదుపాయాలు, ఆంగ్ల మాధ్యమం, బోధన నాణ్యతపై ఉన్న అభిప్రాయాలే. అందువల్ల కొత్త పేర్లతో కొత్త పాఠశాలలను ప్రారంభించడం కంటే ఇప్పటికే ఉన్న పాఠశాలలను బలోపేతం చేయడం మరింత ప్రయోజనకరం.
ప్రత్యేకించి వసతి గృహాల పరిస్థితిపై ప్రభుత్వం దృష్టి సారించాలి. అనేక హాస్టళ్లలో తాగునీరు, పోషకాహారం, పరిశుభ్రత, భద్రత, వంటి ప్రాథమిక సదుపాయాలే సరిగా లేవన్న విమర్శలున్నాయి. హాస్టళ్ల నిర్వహణకు ఖర్చు చేస్తున్న నిధులను సమర్థవంతంగా వినియోగించి పాఠశాలలు–వసతి గృహాల అనుసంధానాన్ని బలోపేతం చేయాలి. విద్యార్థులకు సురక్షితమైన, గౌరవప్రదమైన వాతావరణం కల్పించడం ప్రభుత్వ బాధ్యత.
పిల్లలకు ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు, మధ్యాహ్న భోజనం అందించడం మంచి కార్యక్రమమే. అయితే ఇవి మాత్రమే సరిపోవు. నాణ్యమైన బోధన, సృజనాత్మక అభ్యాసం, క్రీడలు, వ్యక్తిత్వ వికాసం, నైతిక విలువలు కూడా సమానంగా అవసరం. విద్య అంటే కేవలం పరీక్షల్లో మార్కులు సాధించడం కాదనే అవగాహనను విద్యా వ్యవస్థలో పెంపొందించాలి.
ఈ నేపథ్యంలో ఉపాధ్యాయుల పాత్ర మరింత కీలకం. బోధనేతర కార్యక్రమాల భారం నుంచి వారిని విముక్తి చేసి పూర్తిస్థాయిలో విద్యార్థుల అభ్యాసంపై దృష్టి పెట్టే అవకాశం కల్పించాలి. పాస్ శాతాల కోసం ఒత్తిడి తేవడం కంటే పిల్లల్లో ప్రశ్నించే స్వభావం, ఆలోచనా సామర్థ్యం, సృజనాత్మకత పెంపొందించే దిశగా విద్యా విధానాలు ఉండాలి. బట్టీ పద్ధతితో సాధించే ఫలితాలు తాత్కాలికం మాత్రమే. కానీ సృజనాత్మక విద్య జీవితాంతం ఉపయోగపడుతుంది.
అదేవిధంగా ప్రైవేట్ పాఠశాలల ఫీజుల నియంత్రణ కూడా అత్యవసరం. లక్షల రూపాయల ఫీజులు చెల్లించేందుకు మధ్యతరగతి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలలు నాణ్యతను పెంచుకుంటేనే ఈ భారం తగ్గుతుంది. ప్రభుత్వ విద్య బలోపేతమైతే సమాజంలో విద్యా సమానత్వం పెరుగుతుంది.
దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే రూపుదిద్దుకుంటుంది. ఒక మంచి పాఠశాల కేవలం విద్యార్థిని మాత్రమే కాదు, ఒక కుటుంబాన్ని, ఒక గ్రామాన్ని, ఒక సమాజాన్ని మార్చగలదు. అందుకే విద్యను వ్యయంగా కాకుండా పెట్టుబడిగా చూడాలి. నీతి ఆయోగ్ వేదికపై వ్యక్తమైన సంకల్పం కార్యరూపం దాల్చినప్పుడే కులరహిత, సమాన అవకాశాల సమాజ నిర్మాణం సాధ్యమవుతుంది. సంకల్పం ఉంటే మార్పు సాధ్యమే. ఆ మార్పునకు పునాది మాత్రం బడిలోనే పడాలి.

