ప్రజలకు కావాల్సింది రాజకీయ వాదోపవాదాలు కాదు. పరిష్కారం. లక్ష కోట్ల ప్రజాధనంతో నిర్మించిన ప్రాజెక్టును నిరుపయోగంగా వదిలేయడం ఎంత తప్పో, భద్రతా ప్రమాణాలు పట్టించుకోకుండా వినియోగించడం కూడా అంతే ప్రమాదకరం. అందువల్ల ప్రభుత్వం పారదర్శకంగా సాంకేతిక నివేదికలను ప్రజల ముందుంచాలి. పునరుద్ధరణ సాధ్యాసాధ్యాలపై నిపుణులతో చర్చించి, సమయబద్ధ కార్యాచరణ ప్రకటించాలి. అదే సమయంలో అవినీతిని చట్టపరంగా నిరూపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి.
కాళేశ్వరం ప్రాజెక్టును ప్రజల ప్రయోజనాల కోసం పునరుద్ధరించడం ప్రభుత్వాల బాధ్యత. ఆ బాధ్యతను ఎంత త్వరగా నిర్వర్తిస్తే అంత త్వరగా రాజకీయ ఆరోపణలకు కూడా తెరపడుతుంది. ఈ వివాదం వల్ల రాజకీయంగా ఆత్మరక్షణలో పడింది బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ ప్రభుత్వమే.!
డా. మార్గం-అడుగు, ఎడిటోరియల్
2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి కారణమైన ప్రధాన అంశాల్లో కాళేశ్వరం కుంగడం కూడా ఒకటి. నిర్మాణ లోపాలు, అవినీతి, ప్రజాధనం దుర్వినియోగం వంటి ఆరోపణలే ప్రధాన అస్త్రాలుగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అయితే, అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు దాటుతున్నా ఆరోపణలు నిరూపించడంలోనూ, ప్రాజెక్టు భవిష్యత్తుపై స్పష్టమైన విధానాన్ని ప్రకటించడంలోనూ కాంగ్రెస్ విఫలమైంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఆత్మరక్షణలో పడిందా?
కాళేశ్వరం ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల ప్రాజెక్టు. దీని వ్యయం లక్ష కోట్లకు పైమాటే. రోజుకు రెండు నుంచి మూడు టీఎంసీల వరకు నీటిని ఎత్తిపోసే సామర్థ్యంతో ఈ ప్రాజెక్టును రూపొందించారు. 20 లక్షల ఎకరాలకు సాగునీరు, హైదరాబాద్తో పాటు అనేక పట్టణాలకు మంచినీరు, పారిశ్రామిక అవసరాలకు నీటి సరఫరా లక్ష్యాలుగా ప్రకటించారు. ఇంత భారీ పెట్టుబడితో నిర్మించిన ప్రాజెక్టు ప్రస్తుతం నిరుపయోగంగా ఉండటం రాష్ట్రానికి ఆర్థికంగానూ, వ్యవసాయపరంగానూ నష్టమే.
2023 అక్టోబరులో మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజీలో పిల్లర్లు కుంగిపోవడం ప్రాజెక్టు విశ్వసనీయతపై తీవ్ర అనుమానాలకు దారితీసింది. అన్నారం, సుందిళ్ల బ్యారేజీల భద్రతపైనా సందేహాలు వ్యక్తమయ్యాయి. జాతీయ డ్యామ్ భద్రతా సంస్థ (ఎన్డీఎస్ఏ) ప్రాథమిక నివేదికలో నిర్మాణ నాణ్యత, రూపకల్పన, నిర్వహణ అంశాలపై పలు ప్రశ్నలు లేవనెత్తినట్లు ప్రభుత్వం పేర్కొంది. ఈ నివేదికను ఆధారంగా ప్రభుత్వం పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేయడం సురక్షితం కాదని వాదిస్తోంది. అయితే ఇదే సమయంలో ప్రాజెక్టును పునరుద్ధరించి వినియోగంలోకి తేవడానికి సమగ్ర కార్యాచరణపై స్పష్టమైన సమాధానం లేదు.
అప్పటి ఎన్నికల్లో కాళేశ్వరం అవినీతి, ధరణి పోర్టల్ అక్రమాలు, విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, ఫార్ములా-ఈ రేసు వంటి అంశాలను కాంగ్రెస్ ప్రధాన ప్రచార అస్త్రాలుగా వినియోగించింది. అధికారంలోకి వచ్చాక విచారణలు, కమిషన్లు, ప్రకటనలకే పరిమితమైంది. జస్టిస్ పి.సి. ఘోష్ కమిషన్ నివేదిక అమలుపై న్యాయపరమైన ప్రతిబంధకాలు ఎదురవగా, ఆరోపణలు చేసిన స్థాయిలో చట్టపరమైన చర్యలు మాత్రం కనిపించలేదు. ఒకప్పుడు కేసీఆర్, హరీశ్రావుల అరెస్టు వరకు ప్రచారం జరిగినా అది కార్యరూపం దాల్చలేదు. ఫలితంగా ప్రభుత్వం చేసిన ఆరోపణలు రాజకీయ విమర్శలుగానే మిగిలిపోయాయనే అభిప్రాయం బలపడుతోంది.
బీఆర్ఎస్ కూడా రక్షణాత్మక స్థితి నుంచి ఎదురుదాడి వ్యూహాన్ని అవలంబిస్తోంది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలలో పరిమిత స్థాయిలో నీటిని నిల్వ చేసి పంప్ హౌస్ల ద్వారా రిజర్వాయర్లను నింపవచ్చని వాదిస్తోంది. వర్షాభావ పరిస్థితుల్లో రైతులకు నీరు అందించకుండా ప్రభుత్వం రాజకీయ కక్షతో వ్యవహరిస్తోందని ఆరోపిస్తోంది. గోదావరి జలాలను దిగువ ప్రాంతాలకు వదిలేస్తూ తెలంగాణ ప్రయోజనాలను విస్మరిస్తోందని కూడా విమర్శిస్తోంది.
ప్రభుత్వం మాత్రం భద్రతకే ప్రాధాన్యమని, సాంకేతిక నిపుణుల సూచనలు విస్మరించలేమని చెబుతోంది. ఈ వాదనలో కొంత వాస్తవం ఉన్నప్పటికీ ప్రజల్లో ఉన్న సందేహాలను నివృత్తి చేయడంలో ప్రభుత్వం విఫలమవుతోంది. నిజంగానే ప్రాజెక్టు ప్రమాదకర స్థితిలో ఉంటే, ఆ విషయాన్ని ప్రజలకు పారదర్శకంగా వివరించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. రిటైర్డ్ ఇంజనీర్లు, జలవనరుల నిపుణులు, ప్రతిపక్ష నేతలు, రైతు సంఘాల ప్రతినిధులతో కలిసి అఖిలపక్ష సాంకేతిక కమిటీని ఏర్పాటు చేసి వాస్తవ పరిస్థితిని వెల్లడిస్తే ప్రజల్లో విశ్వాసం పెరుగుతుంది.
తాజాగా ధరణి అవకతవకలపై వేసిన ‘సెట్’ కూడా రాజకీయ విమర్శలకు దారితీసింది. ఆలస్యంగా వచ్చిన చర్యగా ప్రతిపక్షాలు అభివర్ణిస్తున్నాయి. హామీల అమలుకంటే గత ప్రభుత్వంపై ఆరోపణలకే ప్రభుత్వం పరిమితమవుతోందనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.
ఇదే సమయంలో కేటీఆర్, హరీశ్రావులు ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలను తీవ్రం చేస్తున్నారు. సింగరేణి, గనుల కేటాయింపులు, కాంట్రాక్టులు, కమీషన్ల వ్యవహారాలను ప్రస్తావిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. దీనివల్ల ఒకప్పుడు బీఆర్ఎస్ను ఇబ్బందుల్లోకి నెట్టిన కాళేశ్వరం అంశమే ఇప్పుడు తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వానికి రాజకీయంగా భారంగా మారుతున్న పరిస్థితి కనిపిస్తోంది.
ప్రజలకు కావాల్సింది రాజకీయ వాదోపవాదాలు కాదు. పరిష్కారం. లక్ష కోట్ల ప్రజాధనంతో నిర్మించిన ప్రాజెక్టును నిరుపయోగంగా వదిలేయడం ఎంత తప్పో, భద్రతా ప్రమాణాలు పట్టించుకోకుండా వినియోగించడం కూడా అంతే ప్రమాదకరం. అందువల్ల ప్రభుత్వం పారదర్శకంగా సాంకేతిక నివేదికలను ప్రజల ముందుంచాలి. పునరుద్ధరణ సాధ్యాసాధ్యాలపై నిపుణులతో చర్చించి, సమయబద్ధ కార్యాచరణ ప్రకటించాలి. అదే సమయంలో అవినీతిని చట్టపరంగా నిరూపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి.
కాళేశ్వరం ప్రాజెక్టును ప్రజల ప్రయోజనాల కోసం పునరుద్ధరించడం ప్రభుత్వాల బాధ్యత. ఆ బాధ్యతను ఎంత త్వరగా నిర్వర్తిస్తే అంత త్వరగా రాజకీయ ఆరోపణలకు కూడా తెరపడుతుంది. ఈ వివాదం వల్ల రాజకీయంగా ఆత్మరక్షణలో పడింది బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ ప్రభుత్వమే.!

