PARTIES|పార్టీలకీ, LEADERS|నేతలకీ ‘పరీక్షే’!
ప్రతి పార్టీకి ప్రతిష్టాత్మకమే?
CONGRESS|కాంగ్రెస్ ‘కట్టు’ గెలుస్తుందా?
BRS|బీఆర్ఎస్ ‘పట్టు’ నిలుస్తుందా?
BJP|బీజేపీ ‘బెట్టు’ బెడుస్తుందా?
సమీకరణాలేమంటున్నాయి?
GHMC|జీహెచ్ఎంసీ ఎన్నికల వాకిట
LOCAL BODY|స్థానిక ఎన్నికల ముంగిట
ఆసక్తిగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక
కాంగ్రెస్ ది గెలిచి తీరాల్సిన కసి. బీఆర్ఎస్ ది నిలుపుకోవాల్సిన తరుణం. బీజేపీది పరువు కోసం పోటీ. ఈ ఉప ఎన్నిక వెంటే స్థానిక సంస్థల ఎన్నికల ముంగిట, మరో ఐదారు నెలల్లో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల వాకిట జరుగుతున్న ఈ పోటీ అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. కచ్చితంగా ఈ ఉప ఎన్నిక ప్రభావం వచ్చే ఎన్నికలపై ఉంటుంది. అందుకే నేతలకు పరీక్షగా మారింది. మరి జూబ్లీ ‘హిల్స్’ ని ఎక్కేదెవరు?
హైదరాబాద్, అక్టోబర్ 24 (అడుగు ప్రత్యేక ప్రతినిధి – జూబ్లీ హిల్స్ నుంచి):
హైదరాబాద్ జిల్లాలోని 15 శాసనసభ నియోజకవర్గాలలో జూబ్లీహిల్స్ ఒకటి. ఎమ్మెల్యే మాగంటి మరణంతో వచ్చిన ఉప ఎన్నికలో బీఆర్ఎస్ నుంచి ఆయన భార్య సునీత, కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్, బీజేపీ నుంచి లంక దీపక్ రెడ్డిలు పోటీ పడుతున్నారు. ప్రధాన పోటీ మాత్రం కాంగ్రెస్, బీఆర్ఎస్ ల మధ్యే ఉంది. జూబ్లీ హిల్స్ అటు ఆంధ్రా, ఇటు తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చి స్థిరపడిన సెటిలర్ల నియోజకవర్గం. క్లాస్, మాస్ కలగలిసి, ఆకాశ హర్మ్యాలు, బస్తీల జూబ్లీలో బస్తీమే సవాల్ అంటున్నాయి పార్టీలు. అయితే బీఆర్ఎస్ పట్టు నిలుస్తుందా? కాంగ్రెస్ సంకల్పం గెలుస్తుందా? అన్నది ఆసక్తిగా మారింది. ఇంతకీ జూబ్లీ ‘హిల్స్’ని ఎక్కేదెవరు? ‘అడుగు’ అందిస్తోన్న విశ్లేషణాత్మక ప్రత్యేక కథనం.*
58మంది అభ్యర్థులు
జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక బరిలో 58మంది అభ్యర్థులు నిలిచారు. ప్రధాన పోటీ కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీల మధ్యే ఉంది. సిటింగ్ సీటు కోసం బీఆర్ఎస్, గెలిచి తీరాలని కాంగ్రెస్, సత్తా చాటాలని బీజేపీ పట్టుదలగా ఉన్నాయి. నవంబర్ 11న పోలింగ్ నిర్వహిస్తారు. 14న కౌంటింగ్ చేసి, ఫలితాలు విడుదల చేస్తారు.
2023 ఎన్నికల ఫలితాలు
బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన మాగంటి గోపీనాథ్ కి 80,549 (43.94%) ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన మహ్మద్ అజారుద్దీన్ కి 64,212 (35.03%)ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి 35,866 (14.11%) ఓట్లు వచ్చాయి. గోపీనాథ్ కి 16,337 (8.91%) మెజార్టీ మాత్రమే వచ్చింది.
2018 ఎన్నికల ఫలితాలు
టీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ కి 68,979 (44.8%) ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి పి.విష్ణువర్దన్ రెడ్డికి 52,975 (34.4%) ఓట్లు వచ్చాయి. స్వతంత్ర అభ్యర్థి నవీన్ కి 18,817 (12.2%) ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి రావుల శ్రీధర్ రెడ్డికి 8,517 (5.5%) ఓట్లు వచ్చాయి. మెజార్టీ 1604 (10.4%) మాత్రమే వచ్చింది.
కాగా, పోలింగ్ శాతం కేవలం 40% నుంచి 50% శాతానికి మించడం లేదు. మెజార్టీ 8% నుంచి 10% నికి మించడం లేదు. పైగా గెలిచిన, ఓడిన అభ్యర్థి మధ్య తేడా కూడా 8% నుంచి 10% నికి మించడం లేదు.
రసవత్తరంగా పోటీ
అందుకే జూబ్లీ హిల్స్ పోటీ రసవత్తరంగా మారుతోంది. 8శాతం నుంచి 10శాతం ఓట్లను ప్రభావితం చేయగలిగితే, కాంగ్రెస్ కు విజయావకాశాలు ఉన్నాయి. అదే బీఆర్ఎస్ గత ఓట్లను పదిలం చేసుకుని, మరికొన్ని ఓట్లను ప్రభావితం చేయగలిగితే గెలిచే అవకాశాలున్నాయి. బీజేపీ 5శాతం నుంచి 15శాతం లోపే ప్రభావితంగా కనిపిస్తోంది. బీజేపీ మరో 30శాతానికి మించి ఓట్లను కొల్లగొడితే గెలుపు ముంగిట నిలుస్తుంది.
ఆసక్తికరంగా నవీన్ యాదవ్
2018లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన నవీన్ యాదవ్ ఇప్పుడు రంగంలో కాంగ్రెస్ నుంచి ఉన్నారు. అప్పుడు 12.2% ఓట్లు సాధించి బీజేపీని నాల్గో స్థానానికి నెట్టేశాడు. ఇప్పుడు నవీన్ కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నందున, ఆ ఓట్లు అలాగే పదిలంగా ఉన్నాయని భావిస్తే, 34% నుంచి 44% ఓట్లు కలుస్తాయి. అప్పుడు నవీన్ యాదవ్ కి 46శాతం నుంచి 56శాతం ఓట్లు పోలయ్యే అవకాశం ఉంది.
నవీన్ యాదవ్ ఇంతకుముందు ఎన్నికలో పోటీ చేయనప్పటికీ, గతం కంటే ఎక్కువ, మిగతా అభ్యర్థలకు మించి ప్రజల్లోకి చొచ్చుకుపోయినట్లుగా ప్రచారం జరుగుతోంది. అదే నిజమైతే అతని గెలుపు ఖాయం కావచ్చు. కానీ ఇవన్నీ సంఖ్యాపరమైన సమీకరణలు మాత్రమే. వీటికి మించి, స్థానిక, స్థానికేతర అంశాలు, సమస్యలు, భావోద్వేగాలు, పార్టీలు, అవిచ్చే హామీలు, అవి చేసిన పురోగతి పనులు, ప్రజాభిప్రాయాలు, ఓటర్ మూడ్ వంటివేగాక, పోల్ మేనేజ్ మెంట్, డబ్బుల పందేరం వంటి వేరే అంశాలు కూడా కూడా గెలుపోటములను ప్రభావితం చేసే అంశాలు.
ప్రచారంలో పదనిసలు
2014లో టీడీపీ నుండి, 2018 టీఆర్ఎస్ నుంచి, 2023లో బీఆర్ఎస్ నుండి మాగంటి గెలిచారు. ఆయన తక్కువ మెజార్టీతోనే గెలుస్తూ వచ్చారు. ఇప్పుడు ఆయన లేరు. ఆయన భార్య సునీత రంగంలో నిలిచింది. నామినేషన్ల ముగింపు పర్వంలో చెలరేగిన వివాదం చర్చనీయాంశమైంది. సునీత మాగంటి రెండో భార్య, ‘లివింగ్ రిలేషన్’ లో ఉందని, మొదటి భార్య కొడుకు ప్రద్యుమ్న చేసిన ఆరోపణలు దుమారం లేపగా, నవీన్ నామినేషన్ సరిగా లేదని ఆరోపించారు.
భారమంతా బీఆర్ఎస్ దే
అయితే, సునీత వ్యక్తిగతంగా ప్రచారంలోగానీ, ప్రజల్లోకి చొచ్చుకపోవడంలోగానీ, వాగ్దాటిగా కానీ కనిపించడం లేదు. ఆమె తరపున బీఆర్ఎస్ ప్రధాన నేతలు కేసీఆర్ సమీక్ష చేయగా, కేటీఆర్, హరీశ్ రావులే అన్నీ తామై చూసుకుంటున్నారు. వారి ప్రచార డామినేషన్ తో సునీత ఓటర్లకు కనిపించకుండా పోతున్నారు. పైగా పవర్ లో లేకపోవడంతో, చేసేది కూడా చెప్పే పనిలేకుండా ప్రభుత్వంపై విమర్శలు, హామీల బాకీ కార్డుల పంపిణీ, ప్రభుత్వంలో అవినీతి వంటి అంశాలకు బీఆర్ఎస్ పరిమితమవుతోంది. పైగా రాష్ట్రంలోని సగం అంటే దాదాపు 60 నియోజకవర్గాల పార్టీ కేడర్ ను బీఆర్ఎస్ జూబ్లీ హిల్స్ లో మోహరించింది. తమకు అలవాటైన ఉద్యమం నాటి ఉప ఎన్నికల పద్ధతిలో ఈ ఎన్నికలో పని చేస్తోంది.
తనను తానే నమ్ముకున్న నవీన్
కాగా, కాంగ్రెస్ అభ్యర్థి తరపున ఆ పార్టీ అధినాయకత్వం పెద్దగా కనిపించడంలేదు. స్టార్ కాంపెయినర్లు కూడా రంగంలోకి దిగలేదు. సీఎం కూడా ఒకటి రెండు రోజుల రోడ్ షో నిర్వహించవచ్చు. వీళ్ళందరి మీద, పార్టీ మీద కంటే నవీన్, తనను తాను నమ్ముకుని ఓటర్ల వద్దకు పోతున్నారు. తనకు బాగా ఉన్న మాస్ ను, క్లాస్ ను కలుపుకుపోతున్నారు.
ఉప సెంటిమెంట్ కలిసి వచ్చేనా?
ఇక కాంగ్రెస్ నేతలు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అవినీతిపైనే ఎక్కువ విమర్శలు చేస్తోంది. అధికారంలో ఉన్న పార్టీ కావడం కాంగ్రెస్ కి కలిసి వచ్చే అంశం. గతంలోనూ ఒకటి రెండు చోట్ల మినహా, ఉప ఎన్నికల్లో అధికారంలో ఉన్న పార్టీ గెలవడం పరిపాటిగా మారింది.
తెలివైన ప్రచారం
అయితే నవీన్ భిన్నమైన ప్రచారం చేస్తున్నారు. నేరుగా ఓటర్లను కలుస్తున్నారు. ప్రచారంలో ఎక్కడా లోకల్, నాన్ లోకల్, తెలంగాణ, తెలంగాణేతర లేదా ఆంధ్రా అనే అంశాల ప్రస్థావన రాకుండా జాగ్రత్త పడుతున్నారు. నేను ఇక్కడే పుట్టి, ఇక్కడే పెరిగాను, నేను పక్కా లోకల్ అంటున్నారు.
ఆ ఓటర్ల ప్రభావమే అధికం
అయితే, జూబ్లీ హిల్స్ పక్కా ఆంధ్రా ఓటర్ల ప్రభావం కలిగిన నియోజకవర్గం ఈ నియోజకవర్గంలోని మధురానగర్ వంటి పలు ప్రాంతాల్లో అంతా ఆంధ్రావాళ్ళు సెటిలయ్యారు. పైగా పలువురు ఉన్నతాధికారులు, ఇతర అధికారులంతా ఇక్కడే నివాసం ఉంటున్నారు. దీంతో ఈ నియోజకవర్గంలో ఆంధ్రా ప్రభావం ఎక్కువ. పోలింగ్ శాతం తక్కువ. ఇది గెలుపోటములను ప్రభావితం చేసే అతి ముఖ్యమైన అంశం.
ఆ ఓట్లనే నమ్ముకున్న బీఆర్ఎస్
అయితే, బీఆర్ఎస్ ఈ ఆంధ్రా ఓట్లనే నమ్ముకుంది. 2023 ఎన్నికల్లో హైదరాబాద్ లో తమకు అనుకూలంగా వచ్చిన మెజార్టీ సీట్ల రీత్యా, గత మూడు సార్లు జూబ్లీ తమ ఖాతాలోనే ఉండటంతో ఈ సారి కూడా నిలబెట్టుకోవాలన్న తపనలో ఉంది. తమ వశం చేసుకోవాలని చూస్తోంది. గెలుస్తామన్న దీమాతోనూ ఉంది. ప్రభుత్వ వ్యతిరేకత, కాంగ్రెస్ లో సమన్వయం, పోల్ మేనేజ్ మెంట్ లోపాలు, కలిసి వచ్చే అంశాలుగా ఆశావాహంగా బీఆర్ఎస్ ఉంది.
బీజేపీకి మూడో స్థానమేనా?
ఇక బీజేపీకి ఒకవేళ ఓట్ల శాతం పెరిగినా, మూడో స్థానానికి పరిమితమవుతంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పార్లమెంటరీ నియోజకవర్గంలో భాగంగా ఉన్న జూబ్లీ హిల్స్ పై పట్టుకోసం ఆయన పరితపిస్తున్నారు. కానీ, గత అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చినన్ని ఓట్లు వస్తే ఆ పార్టీ, కిషన్ రెడ్డి పరువు నిలబడ్డట్లే.
జూబ్లీని నిలబెట్టుకోవాలన్న పట్టుదలతో బీఆర్ఎస్, గెలిచి తీరాలన్న సంకల్పంతో కాంగ్రెస్, ఎలాగోలా పట్టు సాధించాలని బీజేపీలు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నాయి. ఓటర్లు ఎవరిని గెలిపిస్తారో చూడాలి.

