దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావాలంటే ఖర్చులను తగ్గించుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన సూచన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇంధన వినియోగాన్ని తగ్గించుకోవాలి. బంగారం కొనుగోళ్లను నియంత్రించాలి. దేశీయ ఉత్పత్తుల వినియోగాన్ని పెంచుకోవాలని ఆయన ఇచ్చిన పిలుపు దేశహితం దృష్ట్యా సమంజసమే. అయితే ఖర్చుల తగ్గింపు ఎవరి నుంచి మొదలు కావాలి? సాధారణ ప్రజల నుంచా? లేక పాలక వర్గం, అధికార యంత్రాంగం నుంచా?
డా. మార్గం-అడుగు, ఎడిటోరియల్
దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావాలంటే ఖర్చులను తగ్గించుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన సూచన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇంధన వినియోగాన్ని తగ్గించుకోవాలి. బంగారం కొనుగోళ్లను నియంత్రించాలి. దేశీయ ఉత్పత్తుల వినియోగాన్ని పెంచుకోవాలని ఆయన ఇచ్చిన పిలుపు దేశహితం దృష్ట్యా సమంజసమే. అయితే ఖర్చుల తగ్గింపు ఎవరి నుంచి మొదలు కావాలి? సాధారణ ప్రజల నుంచా? లేక పాలక వర్గం, అధికార యంత్రాంగం నుంచా?
దేశ ఆర్థిక వ్యవస్థను బలపరచాలంటే ముందు రాజకీయ వ్యవస్థలోని దుబారా ఖర్చులను నియంత్రించాల్సిన అవసరం ఉంది. ప్రధాని నుంచి ఎమ్మెల్యే వరకు ప్రజాధనంతో నడిచే వ్యవస్థలో పారదర్శకత, మితవ్యయం అత్యవసరం. దేశ ప్రజలు ఇంధన వినియోగం, బంగారం కొనుగోళ్లు, వంటనూనెల వినియోగం తగ్గించుకోవాలని కోరే ముందు ప్రభుత్వాలు తమ ఖర్చులను తగ్గించుకోవాలి. ప్రజల కళ్లముందే జరుగుతున్న ఆడంబర రాజకీయాలు, భారీ కాన్వాయ్లు, విలాసవంతమైన విమాన ప్రయాణాలు, హెలికాప్టర్ టూర్లు, అట్టహాసపు సభలు ప్రజల్లో అసంతృప్తిని పెంచుతున్నాయి.
ప్రపంచంలో భారతదేశం ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని కేంద్ర ప్రభుత్వం గర్వంగా చెబుతోంది. కానీ అదే సమయంలో దేశ ప్రజల జీవన వ్యయం అంతకంతకూ అమాంతం పెరిగింది. పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్యుడి బడ్జెట్ను దెబ్బతీశాయి. విద్య, వైద్యం ఖరీదైన వస్తువులుగా మారాయి. ఆహార ధరలు పెరిగి మధ్యతరగతి కుటుంబాలపై భారం మోపుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రజలకు “ఖర్చులు తగ్గించుకోండి” అని చెప్పడం కంటే ముందు ప్రభుత్వ వ్యయ నియంత్రణపై స్పష్టమైన చర్యలు అవసరం.
ప్రధాని మోదీ ప్రస్తావించిన బంగారం అంశం కూడా ప్రాముఖ్యత కలిగిందే. భారతీయులు ప్రతి ఏడాది సగటున 700 నుంచి 900 టన్నుల వరకు బంగారం కొనుగోలు చేస్తున్నారని అంచనాలు చెబుతున్నాయి. దీని విలువ రూ.13 లక్షల కోట్లకు పైగా ఉంటుంది. ఇందులో 90 శాతానికి పైగా విదేశాల నుంచే దిగుమతి అవుతోంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో బంగారం దిగుమతులు 24 శాతం పెరిగినట్లు నివేదికలు సూచిస్తున్నాయి. దీని వల్ల భారీగా విదేశీ మారక ద్రవ్య నిల్వలు ఖర్చవుతున్నాయి. కాబట్టి బంగారం కొనుగోళ్లను నియంత్రించాలన్న సూచనలో ఆర్థిక పరమైన తర్కం ఉంది. అయితే ఇది ప్రధానంగా ఉన్నత వర్గాల వినియోగ సంస్కృతికి సంబంధించిన అంశమని గుర్తించాలి. సామాన్య ప్రజల కొనుగోళ్ల కంటే పెద్ద మొత్తంలో బంగారం కొనుగోలు చేసేది ధనిక వర్గాలే.
అదే విధంగా ఇంధన వినియోగం తగ్గించుకోవాలని ప్రజలకు సూచించే ప్రభుత్వాలు ముందుగా రాజకీయ నాయకుల కాన్వాయ్లను, ప్రత్యేక విమాన ప్రయాణాలను, హెలికాప్టర్ వినియోగాన్ని తగ్గించాలి. రాష్ట్రపతి, ప్రధాని నుంచి ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేల వరకు వారి పర్యటనకు కోట్ల రూపాయలు ఖర్చవుతున్నాయి. ప్రమాణ స్వీకార సభలు, రాజకీయ సమావేశాలు, భారీ ప్రకటనలు ప్రజాధనంతోనే జరుగుతున్నాయి. అసలు ప్రభుత్వం నడిచేదే ప్రజాధనంతో. ప్రభుత్వ యంత్రాంగాన్ని, ప్రజాధనాన్ని రాజకీయ ప్రచార వేదికగా ఉపయోగించడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధం.
ఉచిత పథకాల రాజకీయాలు. సంక్షేమం పేరుతో ప్రభుత్వాలు వేల కోట్ల రూపాయలను ఎన్నికల హామీల అమలుకు ఖర్చు చేస్తున్నాయి. నిజమైన పేదల కోసం అవసరమైన పథకాలు కొనసాగాలి. కానీ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజాధనాన్ని నిర్లక్ష్యంగా వినియోగించడం ఆర్థిక వ్యవస్థపై భారంగా మారుతోంది. దేశం, రాష్ట్రాలు అప్పుల ఊబిలోకి జారిపోతున్నాయి. దేశంలో అనేక రాష్ట్రాల అప్పులు లక్షల కోట్ల రూపాయలకు చేరుకోవడం ఆందోళన కలిగించే విషయం.
దేశ ఆర్థిక వ్యవస్థకు విదేశీ మారక నిల్వలు కీలక సూచిక. ఒక దేశం ఎంత సురక్షితంగా ఉందో చెప్పడంలో ఫారెక్స్ రిజర్వులు ముఖ్య పాత్ర పోషిస్తాయి. విదేశీ మారక నిల్వలు పెరగాలంటే దిగుమతులు తగ్గి, ఎగుమతులు పెరగాలి. ఇందుకు దేశీయ ఉత్పత్తుల వినియోగం పెరగాలి. భారత రైతులు పండిస్తున్న వ్యవసాయ ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్ కల్పించాలి. “లోకల్ ఫర్ వోకల్” వంటి నినాదాలు కేవలం ప్రచారంగా కాకుండా ఆచరణలోకి రావాలి.
మోదీ ఇచ్చిన ఖర్చుల తగ్గింపు పిలుపును ప్రజలు సానుకూలంగా స్వీకరించాలంటే ముందుగా రాజకీయ నాయకులే ఆదర్శంగా నిలవాలి. ప్రజలకు మితవ్యయం చెప్పే నాయకులు తమ జీతభత్యాలు, పెన్షన్లు, వాహనాలు, భద్రతా కాన్వాయ్లు, విదేశీ పర్యటనలపై నియంత్రణ విధించుకోవాలి. ప్రభుత్వ ఖర్చులపై ప్రతి సంవత్సరం పారదర్శక ఆడిట్ నిర్వహించాలి. ప్రజాప్రతినిధుల విలాస జీవనశైలికి ప్రజాధనాన్ని ఉపయోగించకుండా చట్టబద్ధమైన పరిమితులు విధించాలి.
“అచ్చే దిన్” పేరుతో ప్రజలకు చూపించిన ఆశలు ఇప్పటికీ సామాన్యుడి జీవితంలో పూర్తిగా ప్రతిఫలించలేదనే భావన సమాజంలో ఉంది. డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, ప్రపంచ ఆర్థిక శక్తిగా భారత్ ఎదుగుదల వంటి నినాదాలు వినిపిస్తున్నా, గ్రామీణ భారతం ఇంకా నిరుద్యోగం, ధరల భారంతో పోరాడుతోంది. అందుకే ఖర్చుల తగ్గింపు అనే సంస్కరణ ప్రజలతో కాకుండా పాలక వర్గంతో ప్రారంభమవ్వాలి. త్యాగం ప్రజల నుంచి కోరే ముందు నాయకులు తమ జీవనశైలిలో మార్పు చూపాలి. అప్పుడు మాత్రమే దేశ ఆర్థిక సంస్కరణలపై ప్రజల్లో విశ్వాసం పెరుగుతుంది.

