(క్రీ.పూ.320 నుండి క్రీ.పూ.180 వరకు)
భారతదేశ చరిత్రలో మహా సామ్రాజ్యంగా తొలుత మౌర్య సామ్రాజ్యము వెలిసింది. మౌర్యులు భారత ఉపఖండం(ప్రస్తుత భారతదేశం, పాకిస్థాన్, ఆఫ్ఘానిస్తాన్, బాంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక, టిబెట్) మొత్తాన్ని ఇక చక్రాధిపత్యంగా పాలించారు. మౌర్య సామ్రాజ్యాన్ని మగధ సామ్రాజ్యం అని కూడా అంటారు. మౌర్య అనేది వంశం పేరు.

కల్హణుడు రాసిన రాజతరంగిణి ప్రకారం మౌర్యులలో ముఖ్యుడైన అశోకుడు శ్రీనగర్ అనే పట్టణాన్ని నిర్మించాడని తెలుస్తుంది. కర్నూల్ జిల్లాలోని ఎర్రగుడి ప్రాంతం మరియు కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలలో అశోకుని శాసనాలు లభ్యమయ్యాయి. దక్షిణ భారతదేశంలోని కేరళ, తమిళనాడు రాజ్యాలు మినహా భారత ఉపఖండం అంతా మౌర్యుల ఆధీనంలో ఉండేది. ఆ సమయంలో కేరళ, తమిళనాడును చోళ, పాండ్య, చేర అనే వంశాలు పాలిస్తున్నాయని అశోకుని శాసనాలు తెలియజేస్తున్నాయి.
మౌర్యుల చరిత్రకు ఆధారాలు
మౌర్యుల చరిత్రను తెలియజేయడానికి స్వదేశీ సాహిత్యం, విదేశీ సాహిత్యం, అశోకుని శాసనాల మీద ఆధారపడవలసివస్తుంది.
స్వదేశీ సాహిత్యం
నాలుగవ శతాబ్దంలో కౌటిల్యుడు రాసిన అర్థశాస్త్రం మౌర్యుల పరిపాలన గురించి పూర్తి సమాచారాన్ని ఇస్తుంది. ఇతను చంద్రగుప్త మౌర్యుని కాలంలో ప్రధానమంత్రిగా పనిచేశాడని పండితుల అభిప్రాయం. కౌటిల్యుడి మరొక పేరు చాణక్యుడు. ఇతనిని “ఇండియన్ మాకియవెల్లి” అని పిలుస్తారు.
అయిదవ శతాబ్దంలో వికాసదత్తుడు రాసిన ముద్రారాక్షసంలో మౌర్య సామ్రాజ్యపు విస్తరణ గురించి, యుద్ధాల గురించి సమాచారం ఉంది.
ఏడవ శతాబ్దంలో భానుడు రాసిన హర్షచరిత ప్రకారం మౌర్య సామ్రాజ్యం యొక్క పతనం, అంతం గురించి తెలియజేస్తుంది.
విదేశీ సాహిత్యం
నిజానికి స్వదేశీ సాహిత్యం కంటే విదేశీయులు రాసిన సాహిత్యం ద్వారానే మౌర్యుల సమాచారం ఎక్కువగా లభిస్తుంది.
నాలుగవ శతాబ్దంలో మెగస్తనీస్ రాసిన ఇండికా గ్రంథంలో మౌర్యుల యొక్క సైనిక పాలన, ప్రజాపాలన గురించి వివరాలు లభిస్తున్నాయి. ఈ గ్రంథం గ్రీకు భాషలో రాయబడింది. ఈ కాలంలో భారతదేశంలో బానిస వ్యవస్థ లేదు కానీ, సమాజంలో కులాలున్నాయని, చాతుర్వర్ణ వ్యవస్థ కొనసాగిందని స్పష్టంగా సమాచారం ఉంది.
ఒకటవ శతాబ్దంలో ప్లిని రాసిన నాచురల్ హిస్టరీ అనే గ్రంథంలో మౌర్యుల యొక్క సైనిక బలం గురించి పూర్తి సమాచారం ఉంది. మౌర్యులకు ఆరు లక్షల సైనికులు, ముప్పైవేల అశ్వదళం, తొమ్మిదివేల గజబలం, ఎనిమిదివేల రథబలం ఉందని, వీటిని మౌర్యులు చతురంగ బలాలు అని పిలిచేవారు.
అశోకుని శాసనాలు
అశోకుడు మౌర్య చరిత్రలో, ప్రాచీన ప్రపంచ చరిత్రలో అశోకుడు గొప్ప చక్రవర్తి. ఇతను వేసిన శిలాశాసనాలు, స్తంభశాసనాలు, గుహాలయశాసనాల ద్వారా మౌర్య సామ్రాజ్య చరిత్ర అధ్యయనానికి అత్యంత కీలకం. భారతదేశంలో ప్రస్తుతం వరకు 180 శిలాశాసనాలు 47 ప్రాంతాల్లో లభ్యమయ్యాయి. ఈ శాసనాలన్నింటిలో అశోకుడు బ్రహ్మి లిపినే ఉపయోగించాడు.
మౌర్యుల రాజకీయ చరిత్ర
చంద్రగుప్త మౌర్యుడు (క్రీ.పూ.320 నుండి క్రీ.పూ.295 వరకు)
ఆనాటి చక్రవర్తుల్లో గొప్పవాడైన అలెగ్జాండర్ ప్రపంచాన్ని ఏకం చేసి పాలిస్తూ రాజ్యాలపై గవర్నర్ లను నియమించేవాడు. వాయువ్య భారతదేశంలో సెల్యుకస్ నికేటర్ తో చంద్రగుప్తమౌర్యుడికి ఘర్షణ ప్రారంభమైంది. తర్వాత కాలంలో వీరిద్దరి మధ్య దౌత్య సంబంధాలు, స్నేహ సంబంధాలు ప్రారంభమయ్యాయి. ఈ సంబంధాలు వీరి వారసుల కాలంలో కూడా కొనసాగాయి. చంద్రగుప్తుని కుమారుడైన బిందుసారుడికి సామ్రాజ్యాన్ని అప్పగించి శ్రావణబెళగొళకు వెళ్ళి సల్లేఖన వ్రతం (నిద్రాహారాలు మానేయడం) ఆచరించి మరణించాడు.
బిందుసారుడు (క్రీ.పూ.295 నుండి క్రీ.పూ.272 వరకు)
పదహారవ శతాబ్దంలో భారతదేశాన్ని సందర్శించిన బౌద్ధ గురువు తారనాథ్ రాసిన హిస్టరీ అఫ్ టిబెట్ అనే గ్రంథంలో బింబిసారుడు దక్షిణ భారతదేశాన్ని జయించాడని తెలుస్తుంది. ఇతను అజీవికమతాన్ని ఆదరించాడు. ఇతనికి అమిత్రఘాత అనే బిరుదు ఉంది. ఇతని ఆస్థానంలో డైమకస్, డయనోసియస్ అనే ఇద్దరు గ్రీకు రాయబారులుండేవారు. బౌద్ధ గ్రంథమైన దివ్యవదన ప్రకారం బిందుసారుడి కాలంలో జరిగిన తిరుగుబాటును అణచివేయడానికి ఉజ్జయినికి గవర్నర్ గా పనిచేస్తున్న తన కుమారుడు అశోకుడిని పంపించాడని ఈ గ్రంథం తెలియచేస్తుంది.
అశోకుడు (క్రీ.పూ.268 నుండి క్రీ.పూ.232 వరకు)
బిందుసారుడి మరణం తర్వాత సుమారు నాలుగు సంవత్సరాల పాటు వారసత్వ యుద్ధం కొనసాగింది. అశోకుడు తన సోదరులందరినీ అంతమొందించి రాజ్యానికి వచ్చాడని మహావంశ అనే గ్రంథం తెలియచేస్తుంది. అశోకుడి పాలనలో ఏకైక ప్రముఖ సంఘటన కళింగ యుద్ధం. ఈ యుద్ధం క్రీ.పూ. 261 నుండి 260 కాలంలో కళింగతో యుద్ధం చేసాడు. ఈ యుద్ధంలో లక్షమంది చనిపోయారు, లక్షాయాభైవేలమంది కళింగ రాజ్యానికి బానిసలుగా చిక్కారు. ఈ సంఘటనతో కలత చెందిన అశోకుడు యుద్ధాలను ఆపేసి ధర్మప్రచారాన్ని ప్రారంభించాడు.

-బానోత్ కళ్యాణ్

